మాలిక పత్రిక చైత్రమాస సంచికకు స్వాగతం

మాలిక పత్రిక చైత్రమాస సంచిక విడుదలైంది. అన్నివర్గాల పాఠకులకు నచ్చే అంశాలతో సరికొత్తగా రూపొందింది ఈ సంచిక.  ఈసారినుండి మాలికపత్రిక నుండి ప్రత్యేకమైన అంశాలతో మూడు సీరియళ్లు ప్రారంభమవుతున్నాయి. అడగగానే తమ రచనలను మాలికకు అందించిన యండమూరి వీరేంద్రనాధ్ గారికి, సూర్యదేవర రామ్మోహన్ గారికి, అడగకుండానే పారశీక ఛందస్సు గురించి సిరీస్ ఇస్తున్న J.K.Mohan Raoగారికి  , ఆలస్యమైనా మరచిపోకుండా తన రచనను పంపిన బ్నిం మూర్తిగారికి, మిగతా రచయితలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.

ఈ సంచికనుండి ప్రఖ్యాత టెక్నాలజీ ఔత్సాహికులు, కంప్యూటర్ ఎరా పత్రిక ఎడిటర్ అయిన నల్లమోతు శ్రీధర్ గారి వీడియో చానెల్ ఒకటి మొదలు పెడుతున్నాం. ఈ శీర్షిక క్రింద ఆయన అందించే ఉపయోగకరమైన వీడియోలు మీరు వీక్షించవచ్చు.

మరో ముఖ్య విషయం.  ప్రముఖ రచయిత్రి శ్రీమతి సువర్చల చింతలచెరువుగారు మాలిక టీమ్ లో చేరుతున్నారు. ఆవిడకు సాదర ఆహ్వానం పలుకుతూ ఈ సంచికలోని రచనలు:

 

1.  కవి మానాపురం రాజా చంద్రశేఖర్ తో ముఖాముఖీ – బులుసు సరోజినిదేవి

2.  సంస్కృత సాహిత్యంలో ప్రముఖ కవయిత్రులు – విశ్వనాధశర్మ కొరిడె

3. నిత్యజీవితంలో హస్యం – డా.అనిల్ మాడుగుల

4. పారశీక ఛందస్సు – 1 – జె.కె.మోహన రావు

5. అతడే ఆమె సైన్యం – యండమూరి

6. సంభవం – సూర్యదేవర

7. బుల్లి ‘ తెర  ‘ పెన్నుతో బ్నిం – బ్నిం  మూర్తి

8. ఏమి హాయిలే హలా! – నండూరి సుందరి నాగమణి

9. పద్మప్ప – మంధా భానుమతి

10. ప్రకృతి ఒడిలో బ్రతుకు పాఠం – మధురవాణి

11.  మాలిక పదచంద్రిక – 9  – సత్యసాయి కొవ్వలి

12. ‘ కవిసంగమం ‘ సమీక్ష – శైలజ మిత్రా

13. ‘రాముడుండాడు. రాజ్జిముండాది’ సమీక్ష – చక్రధర్ రావు

14. నల్లమోతు శ్రీధర్ చానెల్: ఆన్లైన్ డిస్కౌంట్లని ఉపయోగించుకోవటం ఎలా?

 

 

Print Friendly

ఓహో గులాబి బాలా – పారసీక ఛందస్సు – 1

రచన: జెజ్జాల కృష్ణమోహన రావు

 

 

 

 

 

 

 

 

ఈ వ్యాసము ప్రతివాది భయంకర శ్రీనివాస్ గారికి స్మృత్యంజలిగా వ్రాయబడినది.  వారికి గజలులు ఇష్టము కనుక అవి కూడ ఇందులో నున్నాయి. శ్రీనివాస్ గారు  సుప్రసిద్ధ నేపథ్య గాయకుడు, బహుభాషాకోవిదుడు, కవి, వాగ్గేయకారుడు, పరిశోధకుడు. వారు పాడిన ఓహో గులాబిబాలా అనే పాట శ్రోతలను ఆకట్టుకొన్న పాటలలో మఱువరానిది. ఈ పాట పల్లవి ఇలా సాగుతుంది -

 

ఓహో గులాబి బాలా – అందాల ప్రేమ మాలా

సొగసైన కనులదానా – సొంపైన మనసుదానా

నీవారెవరో తెలుసుకో తెలుసుకో తెలుసుకో

ఈ పాట రచయిత దాశరథికి ఉర్దూ పారసీక భాషలతో పరిచయము గలదు.  పై పాట పల్లవి ఛందస్సు ఒక పారసీక ఛందస్సును బోలినది.  దాశరథిగారు దానిని అనుసరించి వ్రాసారో లేక కాకతాళీయముగా ఈ గీతి ఆ ఛందస్సులో వ్రాయబడినదో అనే విషయము మనకు తెలియదు. ఈ ఛందస్సును ముజారీ ముసమ్మన్ అఖ్‌రబ్ అంటారు.

దీని అమరిక ఇలా వివరించబడినది: ==- / =-== // ==- / =-== . మన గురు లఘువుల చిహ్నాలతో ఇది ఇలాగుంటుంది: UUI UIUU – UUI UIUU. ప్రతి పాదములో పూర్వోత్తరభాగములు ఒకే విధముగ నుంటుంది. పాదము మధ్యలో సంస్కృతములోలా విరామయతి (ఆంగ్లములో caesura) ఉంటుంది, అనగా పదము దానికి ముందు విరగాలి.  ఈ ఛందస్సు సూత్రము – మఫఊల ఫాయలాతున / మఫఊల ఫాయలాతున.

సంస్కృత ఛందస్సులో UUI UIUU లేక త-ర-గ గణాలతో భీమార్జనము లేక తరంగ అని ఒక వృత్తము ఉన్నది. దానికి నా ఉదాహరణలు -

భీమార్జనం లేక తరంగ – త-ర-గ

7 ఉష్ణిక్ 21

కాయమ్ము నీకె యిత్తున్

శ్రీయంచు నిన్నె దల్తున్

ధ్యేయమ్ము జూపగా రా

నా యంతరంగమా రా

ప్రాణమ్ములోని శ్వాసై

గానమ్ములోని ప్రాసై

యానమ్ములోని ధ్యాసై

రా నమ్మియుంటి నిన్నే

రెండు తరంగ వృత్తాలను చేరిస్తే మనకు పై పారసీక ఛందస్సు (ముజారీ ముసమ్మన్ అఖ్‌రబ్) లభిస్తుంది. అటువంటి వృత్తము నావద్ద ఉండే 1000 వృత్తాలకు పైగా ఉండే పట్టికలో కనబడలేదు. ఈ నూతన వృత్తమును నేను తరంగమాల అని పిలువదలచాను.  ఈ తరంగమాలకు నా ఉదాహరణలను క్రింద ఇస్తున్నాను -

తరంగమాల – త ర మ జ గగ, యతి (1, 8)

14 శక్వరి 2581

నాముందు వేగ రావా – నాదమ్ము పాడ రావా

మోమోట మేల నీకున్ – మోదంపు పాత్ర తేవా

ఆమోద మాయె నాకున్ – ఆశాతరంగమాలా

ప్రేమాలయమ్ములోనన్ – వెల్గొందు యగ్నికీలా

రాధా ప్రమోదకారీ – రాగస్వరూప హారీ

నాదస్వరూప శౌరీ – నాసాగ్ర రత్నధారీ

శ్రీదేవి చిత్తహారీ – ప్రేమాశ్రయా మురారీ

నీ దీవ్య నామమేగా – నిత్యమ్ము స్వర్గమౌగా

నా యింటి వెల్గు నీవే – నా కంటిపాప నీవే

ప్రాయంపు కోర్కె నీవే – భావాంతరంగ మీవే

నా యెల్గు మాట నీవే – నా గుండె పాట నీవే

నా యిష్ట మూర్తి నీవే – నా మువ్వ నాల్క నీవే

పాటలలో ఈ తరంగమాల ఛందస్సు అలాగే ఉండదు, దాని లయతో మాత్రాగణాలతో పాటలను వ్రాస్తారు కవులు. మాత్ర లేక కళ అంటే ఒక లఘువును ఉచ్చరించు కాలావధి, ఒక గురువు రెండు మాత్రలను ఉచ్చరించు కాలపు అవధి.  పాటలలో చివరి లఘువును గురువుగా సాగించి పాడుట సర్వసామాన్యము.  పై ఛందస్సులో ఈ మాత్రాగణాలు సామాన్యముగా – పంచమాత్ర, త్రిమాత్ర, చతుర్మాత్ర, మళ్లీ పంచమాత్ర, త్రిమాత్ర, చతుర్మాత్ర.  అలాటి గజలు నొకదానిని మీర్జా గాలిబ్ వ్రాసాడు.  ఇది సుప్రసిద్ధమైన ఏ న థీ హమారీ కిస్మత్ అనే పాట.  దీనిని అదే అర్థములో అదే ఛందస్సులో (మాత్రాగణముల తరంగమాల) తెలుగులో అనువదించియున్నాను.  ఆ పాటను విని, దానికి అదే ఛందస్సులో  నా తెలుగు సేతను ఇక్కడ చదివి ఆనందించండి  (http://www.eemaata.com/em/issues/201201/1897.html/5/ ).

మళ్లీ ఓహో గులాబి బాలా పాటను పరిశీలిద్దామా? దాని మాత్రాగణాలు క్రింది విధముగా విరుగుతాయి -

ఓహో గు | లాబి | బాలా | – | అందాల | ప్రేమ | మాలా |

సొగసైన | కనుల | దానా | – | సొంపైన | మనసు | దానా |

నీవారె | వరో | తెలుసుకో

ఈ ఛందస్సులో మఱొక అద్భుతమైన సినిమా పాట – మిస్సమ్మ చిత్రములోని రాజా లీలలు పాడిన రావోయి చందమామా అనే పాట.

చరణాలలో కచ్చితముగా ఈ ఛందస్సు పాటించబడలేదు,  అవి యెక్కువగా చతుర్మాత్రలతో నడుస్తాయి.

రావోయి చందమామా – మా వింత గాథ వినుమా

సామంతముగల సతికీ – ధీమంతుడనగు పతినోయ్

సతిపతి పోరే బలమై – సతమత మాయెను బ్రదుకే

ఈ ఛందస్సులో నేను వ్రాసిన రెండు గజలులతో ఈ వ్యాసమును ముగిస్తాను -

1) నీ కురుల నీడలో నే – నిదురించి కలల గంటి

నీ కనుల జాడలో నే – నెనరుంచి నిలిచియుంటి

రా కవిత స్వీకరించుము – రమ్మెదురు జూచుచుంటి

రా కజ్జలమున నే బలు – రాత్రులను గాంచుచుంటి

ఇంపైన రాత్రి సమయ – మ్మిక నేను సైపనంటి

సొంపైన మత్తు నిండెను – సొలసిల్లి వేచుచుంటి

కంపిచ్చు పూలగందము – కరువలిని వలద నంటి

తెంపీయ తేలిరావా – తెలిమేఘ మనుచునుంటి

2) చాలించు కోకిలా నీ – సరసాల గీతి నింక

ఆలించలేను నే నా – హరుసాల ప్రీతి నింక

గాలించిచూడ నీ హృది – గాయంపు మందు లేదే

కాలాల పాటు నే నీ – గాలమ్ము తీయ నింక

ఎగసేను రక్తధారలు – హృది గుచ్చ నా గులాబి

ముగిసేను కథయు నాయది – పొగ మిగులు భూమి నింక

వగ చేదు వేమువలె నా – పగయాయె విధియు నేడు

జగమందు లేక నీవిట – జ్వలియించు హృదయ మింక

 

Print Friendly

మాలిక పదచంద్రిక – 9, Rs.1000 బహుమతి

మాలిక పదచంద్రిక కూర్పరి : సత్యసాయి కొవ్వలి

మీ సమాధానాలను పంపవలసిన ఆఖరుతేదీ:   జూన్ 10

సమాధానాలను  పంపవలసిన చిరునామా.. editor@maalika.org

ఆధారాలు

అడ్డం

 

1 పేరులో క్షీరం, రచనలో 14 అడ్డం ఈసోమేశ్వరుడి సొత్తు
2 దీనితోకని పట్టుకుని ఓ పద్యం లాగించచ్చు
4 ఘృష్ణేశ్వరనివాసం – కవితావాసం
6 మన రాజులగురించీ, రాజ్యాల గురించి కథలు తిరగేసి రాసినా సరే ఏముంది గర్వ కారణం
8 తడిపొడి …. తాళం
11 పేద్ద శివుడి వూరు.. వెళ్తే ఓ వీణ పట్టుకుని రా
14
  1. అడ్డంలోఉన్న ద్విపాదులవారు కనిపెట్టారట
15 ఈయనది కృష్ణపక్షమే.. లేకపోతే ఆ కృతికి సింహావలోకం రాస్తాడా పొడి అక్షరాలలో
18 సాహిత్యానికి రాణి .. ఈవిడకున్న ఇంకోపేరుతో ఒక పత్రిక కూడా ఉండేది
19 కుమారభారతైన ఈకవి .. ఈ కవిగా బాగా ప్రసిద్ధి
22 రెండక్షరాల కాబట్టి…వెనకవైపునుండి
24 ఎర్రంగాఉంటాడు .. పేరుకి శెట్టిగారే కానీ కేవలం హాస్య వ్యాపారి
25 పులకరింప చేస్తే కవితలు .. జలదరింపచేస్తే … ఏవైనా నావే
26 రామదీక్షితులు బి.ఏ.
27 సుమతి .. ఈకాయలు కోయద్దన్నాడు కానీ .. వెనకనుండి కోస్తే పోలా
28 భావకవులకి ఇది స్ఫూర్తినిస్తుంది .. మనీ ఉందనా
30 నాకేం తెలియదు .. అందరూ ఇదే మొదాటి తెలుగుపదం రా అంటే గబుక్కున నమ్మా
33 నా ఇంటిపేరు తొవ్వలై తే నువ్వు రాసింది కథని ఒప్పుకుంటా
35 అవును నీ కాదు
36 34 అడ్డం +36 అడ్డం +34 నిలువు వెరసి ఎంకిప్రియుడు .. గడి చావుకొచ్చాడే
37 పిసినారితనం అనగానే చటుక్కున గుర్తొచ్చే పెళ్ళికొడుకు
38 అవును వాడుక భాషా కోవిదుడే

 

 

నిలువు

 

1 చిన్న పూవైనా పెద్దకావ్యంలో రాయమన్నారు మన తిమ్మన్నగారు
2 మిస్, కరుణించు అని ఇంత జాలిగా పాటరాస్తే, లీలగా పాడితే, అమ్మ కరుణించకుండా ఉంటుందా
3 పరుషాలే ట..ఒక్కటి తప్ప
4 పేరులోనే ఎరుపు, పూర్తి చేసిన పురాణంలో లేదు
5 ఈయనే సాహిత్యపోషకుడు. పాలకుడు
6 ముగ్గురు, కవులైనా, వాగ్గేయకారులైనా సరే
7 చివర్లో రిషభం పడాల్సిందే. లేకపోతే మన భరధ్వాజ గారి ఆనవాలు కనిపించదు
9 దీనికి తాతట మనఅన్నమయ్య
10 విషవృక్షాన్ని ఖండించిన మోహనవంశి
12 ఇదీ తెలుగే.
13 ఎవరి సాహిత్యధోరణినైనా ఓసూత్రంలో బంధించగల శాస్త్రి… అనాధుడైపోయాడు
14 నిన్, నున్, లన్, గూర్చి, గురించి
16 5 నిలువు పక్కన చేరితే .. చివరికి మిగిలేది ఇంటిపేరే
17 విష్ణువాహనం .. త్యాగయ్యగారి పాటల్లో
20 మన గుంటూరి కవిగారి సైన్యమా   థాకరే గారిది లా వినిపిస్తేనూ
21 3 నిలువులో లేనిదిక్కడ, ఇక్కడ ఉన్నది అక్కడా
23 ఈ కథ స్వంతంగా రాసింది కాదట
25 పిలగాయలకి లెక్కలెలా నేరిపించాలో నేర్పిన మునికన్నడు.
29 ఈ భావులు ఎందరో .. లెక్కలేనందరు ..
31 ఈయన ఉమ్మేస్తే మటుక్కు నరసింహంగారు అంత ప్రహసనం చేసేయాలా
32 చిచ్చరపిడుగు .. తెలుగు వారి మనో రమణుడు
34 మరదలికి పన్నీరే కానీ అక్కకే కన్నీరు

 

 

Print Friendly

కవి మిత్రులు మానాపురం రాజా చంద్రశేఖర్‌తో ముఖాముఖి:

ముఖాముఖి నిర్వహణ: బులుసు సరోజినీదేవి

మాలిక అనే అంతర్జాల పత్రిక ఒక కవిని పరిచయం చెయ్యమని చెప్పినప్పుడు నాకు గుర్తుకొచ్చిన కవి శ్రీ మానాపురం రాజా చంద్రశేఖర్. కవిత్వం పట్ల అతనికుండే ఆరాధనాభావం నాకు బాగా నచ్చింది. అతనిది కూడా మా ఊరే! కలలకు పుట్టినిల్లైన విజయనగరంలో అతని పరిచయం జరిగింది.

“ఆర్ట్ ఆఫ్ లివింగ్’ సంస్థ తరవున గ్రూప్ డిస్కషన్‌లో అనుకోకుండా చంద్రశేఖర్‌గారు కవి అని తెలుసుకున్నాను. నేను తమాషాగా ‘నేను కూడా కవిత్వం రాయవచ్చునా?’ అని అడిగిన ప్రశ్నకు ‘అది అందరి సొత్తు అని బదులిచ్చారు. ఆ తర్వాత కవిత్వం పట్ల నాకుండే ఉత్సుకతతో అతనిని కలిసినప్పుడు కవిత్వాన్ని ఒక్కటొక్కటిగా నాకు వినిపించారు. ఈ ప్రయత్నంలో చిన్నతనం నుండే అతనికి కవిత్వం పట్ల గాఢమైన అభిరుచి, ఆసక్తి చంద్రశేఖర్ అవలీలగా చెప్పిన వాక్య నిర్మాణాలు నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి.

తన చుట్టూ ఉన్న సమాజాన్ని, ప్రపంచాన్ని, పరిసరాల్ని అతను అనుభవించి, పలవరించి, వ్యక్తీకరించే తీరు నన్ను అమితంగా ఆకట్టుకునేది. అతనితో మాట్లాడుతున్నప్పుడు ఎంత సరళంగా ఉంటాడో, రాసినవి చదివేటప్పుడు కలిగే ఆవేశం, ఆర్ద్రత, ఎలా వచ్చేవో ఒకపట్టాన అర్థమయ్యేవి కావు. అతని హావభావాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి.  ఒకరి దగ్గర మెప్పు పొందాలనో,   పైస్థాయికి ఎదగాలనో, అందరికంటే గొప్పవాడిగా చిత్రించబడాలనో, అర్థికంగా ఎదిగి గొప్పవాడిగా చలామణి అవ్వాలనో  చంద్రశేఖర్‌లో మచ్చుకైనా కనిపించదు. వీరు ‘ఎదిగే ప్రయత్నాలు ఎందుకు చెయ్యలేద’ని అడిగినప్పుడల్లా మౌనంగా చిరునవ్వుతోనే సమాధానం ఇచ్చేవారు. చాల నిరాడంబరుడు. శుభ్రతను పాటించడమే తప్ప, ఈ కాలపు ఆధునిక ఫ్యాషన్‌లను ఇష్టపడటానికి ఒప్పుకోరు.

కొంతమంది ఒక్కసారి చెప్పితే అందుకునే స్థాయిలో ఉంటారు. మరికొంతమంది రెండు మూడుసార్లు చెబితే అందుకోగలుగుతారు. చాల మంది మనకి, మన సమాజానికి ఎలా ఉపయోగపడాలో, మనని మనం ఎలా రూపుదిద్దుకోవాలో, ఏ దిశగా నడవాలో తెలియని వ్యక్తులకు దారి చూపేది కవిత్వమేనని తెలియ జెప్పినా సరే, దానికి రాజ చంద్రశేఖర్ విముఖతనే ప్రదర్శిస్తాడు. కవిత్వాన్ని వదిలి అందరిలోకి రమ్మని కోరినప్పుడు, నా కవితలు సమాజంలో ప్రయాణించాలే తప్ప నేను కాదు అని చెబుతాడు. చంద్రశెఖర్‌కి ఆలోచనను, సమాజం పట్ల అతనికుండే అభిప్రాయాల్ని, అతని బాధల్ని, సమాజంపై ఖచ్చితంగా ఉండే బాధ్యతల్ని నిబద్ధతతో రచనలరూపంలో చేసే ప్రయత్నాన్ని అతని మాటల్లోనే విందాం.

అతను నా దగ్గరికి ఒకసారి వచ్చి కలవమని పిలిచినప్పుడు, ఇంటర్వ్యూ చేస్తానని కోరినప్పుడు అతను చాల ఆశ్చర్యపోయాడు అతని భావాల్ని అప్పటికప్పుడు రాబట్టడమే ఇందులోని ముఖ్య ఉద్దేశ్యం!

*                                                             *                                                             *

ప్రశ్న    :-        మీకు కవిత్వం పట్ల ఆసక్తి ఎలా కలిగింది?

జవాబు :-        బాల్యంలో నామీద పడిన అనేక ప్రభావాల నుంచి కవిత్వం మీద మక్కువ ఏర్పడింది.

ప్రశ్న    :-        కవిత్వంలో మీ బాల్యం గురించి చెప్తారా?

జవాబు :-        మా నాన్నగారు నాటకాలు వేస్తుండేవారు. ఆ మూలాల పునాదుల్నుంచే నా కవిత్వం పుట్టిందనుకుంటాను.

ప్రశ్న    :-        మీ నాన్నగారి గురించి కూడా చెబుతారా? వారిలోనూ ఈ ప్రతిభ ఉందన్న   మాట.

జవాబు :-        మా నాన్నగారి పేరు పట్టభిరామయ్య. అతను స్వతహాగా రంగస్థల పౌరాణిక నటులు సాహిత్యకారుడు కాదు.

ప్రశ్న    :-        మరి కవిత్వం రాయాలని ఎందుకనిపించింది?

జవాబు :-        నాలో ఉన్న ఆసక్తి, అధ్యయనం, పరిశీలన కవిగా నన్ను మలిచింది.

ప్రశ్న    :-       మీ మొదటి కవిత ఏమిటి?

జవాబు :-        బామ్మ (చిరునవ్వు)

ప్రశ్న    :-       మీ బామ్మమీదే కవిత్వం ఎందుకు రాయాలనిపించింది?

జవాబు :-  మా నానమ్మ చేసిన అతిగారాబం వలన కావచ్చు, అదే చివరికి కవితగా రూపుదిద్దుకుంది.

ప్రశ్న    :-        ఆ కవితను ఒకసారి వినిపిస్తారా?

జవాబు :-        బామ్మ (కవిత) ******

ప్రశ్న    :-        చాల బాగుంది. మీ కవిత్వ మూలాలకి వేర్లు ఎక్కడున్నాయి?

జవాబు :-        నన్ను ప్రభావితం చేసిన దృశ్యాలు… పరిసరాలు… ప్రేరేపించిన వ్యక్తులు సందర్భాలు అనేకం.

ప్రశ్న    :-        మిమ్మల్ని ప్రోత్సహించిన వ్యక్తులు గురించి వివరిస్తారా?

జవాబు :- మా తాతగారు బగ్గం వెంకట రమణాజీరావుగారు, వెంకన్న-భాస్కర్‌లు, రచయిత శంకర్ తాతయ్య, సాహితీ మిత్రుడు సురేష్, మా గురువుగారు డా!!రామసూరి, ఇంకా అనేకమంది బంధు, సాహితీ మిత్ర ప్రముఖులు.

ప్రశ్న     :-       వాళ్ళ గురించి ప్రస్తావించండి!

జవాబు :-        నా విద్యాభ్యాసం మా తాతగారింట జరిగింది. ఇది నా రెండో దశ. నాకు ఐదేళ్ళ ప్రాయంలోనే రమణాజీగారు వేసే సాంఘిక నాటక పుస్తకాలు చదవడం మొదలు పెట్టేవాణ్ణి. ఆయన చదివే డైలాగ్స్‌ని వెనకుండి విని అనుకరించేవాణ్ణి. దీని వలన ఉచ్ఛారణలో ఉండే అక్షరదోషాల పలుకుబడిని గమనించేవాణ్ణి. అలాగే వెంకన్న-భాస్కర్‌లు నాకు లెక్కలు బోధించే మిత్ర అధ్యాపకులు. వాళ్ళు తమ మాటల్లో తరచుగా సాహిత్యాన్ని గురించి చర్చ చేస్తుండేవాళ్ళు. ఆ ప్రేరణ నాపై పరోక్షంగా పడింది. ఇక పెద్దింటి సూర్యనారాయణగారు అని మా తెలుగు మాస్టారు మరొకాయన ఉండేవారు. తెలుగు పద్యాన్ని అతను రాగయుక్తంగా భావప్రధానంగా చదివే తీరు నాకు బాగా నచ్చేది. నన్ను ప్రోత్సహించే మరో ఆత్మీయ వ్యక్తి మా శంకర తాతయ్య. ఇతను స్వతహాగా రచయిత కూడా. సాహిత్యాభిరుచి మెండుగా కలిగిన వ్యక్తి. ఇక మిగిలింది నా ప్రియ మిత్రుడు సురేష్. మా ఇంటి ముందు భాగంలో అతని గది ఉండేది. అందులో పెద్ద సాహిత్యం లైబ్రరీ ఉండేది. చలం, రవిశాస్త్రి, గోపీచంద్, అడవి బాపిరాజు, కారామాస్టారు, గోరాశాస్త్రి, బీనాదేవి, శ్రీ శ్రీ, తిలక్, శివారెడ్డి, అద్దేపల్లి, చినవీరభద్రుడు, వోల్గా, చెకోవ్, గోపీ, ఠాగూర్, షేక్స్‌పియర్, బెర్నాడ్‌షా వంటి ప్రముఖల రచనలు అందులో కనిపించేవి. నాకు తెలిసినంత మేరకు, అర్థమైనంత వరకూ చదివి అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించేవాణ్ణి. సురేష్ లైబ్రరీ మీద ‘మిత్రుని లైబ్రరీ’ అనే ఒక కవితను కూడా రాశాను. ఆ తర్వాత సాహిత్యవేత్తగా, లెక్చరర్‌గా డా!!రామసూరితో పరిచయం ఏర్పడింది. ‘యువస్పందన’  అనే సాహిత్య సంస్థను అతని అధ్యక్షతన నడుపుతుండేవాళ్ళం. నెలనెలా ఒకపుస్తక సమీక్ష, కవితాపఠనం జరిపేవాళ్లం. ఇలా ఇంట్లోనూ జిల్లా గురజాడ లైబ్రరీలోనూ ఆది, సోమవార అనుబంధ-దిన పత్రికలు విరివిగా చదువుతుండేవాణ్ణి. ఆ తర్వాత మద్యమధ్యలో మిత్రులతో సాహిత్య చర్చలు, సమావేశాలకు హాజరు కావడం, కవి సమ్మేళనాలలో పాల్గొనడం చేస్తుండేవాణ్ణి. ఈ క్రమంలోనే నన్ను నేను తీర్చి దిద్దుకుంటూ పత్రికల్లో కవిత్వరచన చేస్తుండేవాణ్ణి.

ప్రశ్న:- మూలాలు, ప్రేరణ సరే… కవిత్వం రాయడానికి కావల్సిన అనుభవం, నేర్పు ఎక్కణ్ణుంచి వచ్చింది ?

జవాబు :- నేను చూసిన జీవితం నుంచి. నేను గ్రహించిన వాస్తవాల లోతుల్నుంచి. నేర్చుకున్న అనుభవ పాఠాలనుంచి. సాధన చేస్తునప్పుడు కవిత్వరూపంలో ఇవన్నీ అంతర్లీనంగా నాలోంచి తొంగి చూస్తూనే ఉంటాయి. పైగా నేను డిగ్రీలో స్పెషల్ తెలుగు విద్యార్థిని. మా గురువుగారు డా!యు.ఏ.నరసింహమూర్తిగారు. ప్రముఖ సాహితీవేత్త. వ్యాసాలు రాయడంలో మంచి దిట్ట. రమణయ్య మాస్టారు. సి.వి.సాయినాధశాస్త్రిగార్లు నాకు తెలుగు సహ అధ్యాపకులు. వీళ్ళ కనుసన్నల్లో తిరుగాడిన నేను సాహిత్యకారుడిగా రూపుదిద్దుకోకుండా ఎలా ఉండగలను?

ప్రశ్న :- వ్యక్తిగత జీవితం నుంచి సామాజిక సంఘర్షణలోకి మీ కవిత్వం ఎలా తొంగి చూసింది?

జవాబు :-        కళ్ళముందు దృశ్యాల్ని చూసి, ఆవేదనలో రగిలి, ఆర్ద్రతతో ద్రవీభవించినప్పుడు ప్రసంచ పోకడలు అవగతమయ్యాయి. అందులోంచి నన్ను నేను తీర్చి దిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాను.

ప్రశ్న :- మీ బాల్యం గురించి చెప్పారు సరే.  కాని చాలా మంది ఈ జీవితంలో తమ అపురూపమైన బాల్యాన్ని అనుభవించలేక, సరైన పోషణ, విద్య కరువై పసువుల కాపరిగా గడపడంపై మీరు ‘గాయపడ్డ బాల్యం’ అనే కవితను అద్భుతంగా రాసారని అందరూ చెపుతుంటే విన్నాం. దాన్ని కొంచెం చెప్తారా?

జవాబు :-        ‘గాయపడ్డ బాల్యం’ కవిత *****

ప్రశ్న :- మీ చుట్టూ వున్న పరిస్థితులు, పరిసరాలతోపాటు మీరు నడిచే వారా? మీ స్నేహితుల కంటే భిన్నంగా ఉండాలని ఆలోచించేవారా?

జవాబు :-        మిత్రులతో కలిసిమెలిసి పెరిగినా, నా ఆలోచనలు మాత్రం చాలా చురుకుగా, సృజనాత్మకంగా, కళాత్మకంగా సాగుతుండేవి స్వతహాగా తొలిదశలో ఆయిల్ పెయింటింగ్స్ వేస్తుండేవాణ్ణి. అలా కొత్త వస్తువుని దర్శించడలోనూ, పరిశీలించడంలోనూ కొత్తదనాన్ని ప్రయత్నించేవాణ్ణి. అధ్యయన పూర్వకంగా అనుభపూర్వకంగా చాల విషయాలు బోధపడతాయని తెలుసుకున్నాను. అలాగని ‘బిన్నత్వంలోని ఏకత్వానికీ వ్యతిరేకిని కాదు.

ప్రశ్న :- మీరు చదివి రాసిన సాహిత్యానికి చదివిన చదువు ఏమైనా ఉపయోగపడిందా?

జవాబు :- ముమ్మాటికీ…! నేను ఎం.ఏ.లో రాజనీతిశాస్త్రాన్ని అభ్యసించాను. అలాగే పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకూ చదివిన తెలుగు, ఆంగ్ల పద్యాలు నన్ను బాగా ఆకట్టుకునేవి. వేమన, సుమతి, దాశరధి శతకాలతోపాటు ‘ఒజ్మాండియాస్’ అనే ఆంగ్లపద్యం, విలియం బ్లేక్ రాసిన ‘సింపథి ’ నాకు బాగా నచ్చిన రచనలు. షేక్స్‌పియర్ రాసిన ‘సానెట్స్’ వినడం నాకు చాలా ఇష్టం. తెలుగులోని పేదరాశి పెద్దమ్మ కథలు,  విచిత్ర కాశీమజిలీ కథలు, ఆవు-పులి కథ, నక్క-భూమి కథ,  ఓహెన్రీ కథలు, ఆలిస్  ఇన్ వండర్ లేండ్, ఎంకి, జానపద పాటలు, సంక్రాంతి , దసరా పాటలు, గురజాడ దేశభక్తి గీతం. ఇంకా ఇలాంటివి ఎన్నెన్నో చెప్పలేనంత ఇష్టం నాకు. విషయాన్ని విస్తృతపరుచుకుంటేగాని, సానబెట్టుకుంటేగానీ చదివిన చదువుకు సార్ధకత లభించదని నా అభిప్రాయం.

ప్రశ్న :- వర్తమాన పరిస్థితుల మీద మీ అభిప్రాయమేమిటి ?

జవాబు :-        ప్రపంచమంతా వ్యాపార మయమైపోయింది. ఆర్ధిక అవసరాలు సమాజాన్ని, దేశాల్ని పట్టి పీడిస్తూ శాసించే స్థాయికి ఎదిగాయి. చాప కింద నీరులా ప్రపంచాన్ని ఆక్రమిస్తున్న సామ్రాజ్యవాద సంస్కృతి నలుదిశలా వ్యాపిస్తూ విస్తరిస్తోంది. అంతా ఒక కుగ్రామమైపోయింది. ప్రపంచీకరణ ముసుగులో అన్ని మానవ సంబంధాలు ఆర్ధిక సంబంధాలుగా మారి ముడిసరుకులుగా వలసపోతున్నాయి. చివరికి మనిషి జీవితమే యాంత్రికమైపోయింది.

ప్రశ్న :- ప్రపంచీకరణ నేపథ్యం లో కవితలు రాశారా?

జవాబు :-        చాలా రాశాను ‘ముందు వెనుకల ప్రపంచంలోకి…” అనే కవితను ఇప్పుడు ఉదాహరిస్తాను.

“ముందు వెనుకల ప్రపంచంలోకి…” (కవిత) *****

ప్రశ్న :- ఈ ప్రపంచీకరణను దృష్టిలో పెట్టుకోని చూసినప్పుడు ఏఏ రంగాలపై వీటి ప్రభావం పడింది ?

జవాబు :-        అన్ని రంగాలపైనా వుంది. నిజానికి ఇది చేసే మేలుకన్నా, కలిగించే కీడే ఎక్కువ. పరాయీకరణ భావనని పెంపొందిస్తూ వస్తోంది. అభద్రత కొట్టొచ్చినట్టు కనబడుతోంది. వ్యవసాయ, పారిశ్రామిక పర్యావరణం, విద్య, వైద్య ఇలా అన్నిరంగాల్లోనూ దీనిదే పై చెయ్యి అవుతోంది. పర్యావరణంలో భాగంగా కాలంతోపాటు మారుతున్న ఈ సామాజిక స్థితిగతులు సాంకేతిక యుగంలో అతి చిన్న ప్రాణుల జీవితాలకు ఎలా ప్రాణసంకటంగా పరిణమించిందో ఈ కవితలో చదవండి ..

‘పిచ్చుకలేని ప్రపంచంలోకి…” (కవిత) ****

ప్రశ్న :- వర్తమాన వ్యవస్థలో గాయాలు మనుషులకే కాదు మనసులకీ తగులుతున్నాయి. ఈ కోణంలో ఈ విశ్లేషణ వినిపిస్తారా ?

జవాబు :-        తప్పకుండా.. కాలమంటేనే ఓ నడిచే గాయాల పుట్ట. ఇందులో ఎదురయ్యే కష్టసుఖాలు విలోమ ఫలితాలనిస్తాయి. సందర్భాలను బట్టి సంతోషపెట్టేవి, గాయపరిచేవి చలించే స్వభావాన్ని, కదిలించే సన్నివేశాన్ని, కాలవేగంలో మనం అందుకోవాలి. అప్పుడే కవిత్వానికి సహజత్వంతో పాటు సహజీవనం చేసే సాటి మనస్తత్త్వాల విశ్లేషణాత్మక ధోరణి లోలోపట దృశ్యంగా రూపుకడుతుంది.

ప్రశ్న :- ఇన్నేళ్ళ మానవ చరిత్రను బట్టి అనుబంధంతో  ముడిపెట్టి చెబితే ప్రధానంగా కనిపించే బలిపశువు ఈ రైతుబిడ్డే. ఈ  పార్శ్వంలో ఆలోచించినపుడు మీ ఆలోచనా సరళి ఏ విధంగా వుంటుంది ?

జవాబు :-        భూమి సమస్య అంటే ముందుగా గుర్తుకొచ్చేది ఆరుగాలం కాయకష్టం చేసి శ్రమించే వ్యక్తి రైతే! దేశం మొత్తానికి వెన్నెముకైన ఈ అన్నదాతకి ‘అన్నమో రామచంద్రా’ అనే దుస్థితి పట్టి, అప్పుల బాధలకి తాళలేక ఆకలి చావులను  పొందడం వెనక చాల విషాదరహస్యాలు దాగి వున్నాయి. దేశంలో అనుసరించిన ప్రపంచీకరణ పద్ధతులు, సరళీకృత ఆర్ధిక విధానాలు, ప్రత్యేక ఆర్త్ధిక మండళ్ళు, పాలకుల అవినీతి, రాజకీయ వ్యవస్థలోని లొసుగులు, ఉత్పత్తి సంబంధాల్లోని అసమానతలు, మితిమీరిన లంచగొండితనం వంటి అంశాలు దేశదేశాలను బ్రష్టుపట్టిస్తున్నాయి. అధోగతికి దిగ జార్చుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే భూమి పుత్రుల బతుకులు మాత్రం ఎప్పటికీ దీపం కింద చీకటే!

ప్రశ్న :- వీటికి సంబంధించిన కవితలు ఏమైన రాశారా ?

జవాబు :-        ఎక్కువే రాశాను. మచ్చుకు ఈ కవితను చదవండి.

‘నాగేటిచాలు కన్నీటిపాట” (కవిత) ****

ప్రశ్న :- గడిచిన కొన్ని దశాబ్దాలు ఉద్యమాలకు, వాదాలకూ నిలయమయ్యాయి వీటి ప్రభావం మీ రచనలపై ఏమేరకు పడింది ?

జవాబు :- భావ కవిత్వం అంతమైన తర్వాత అనేక ఉద్యమాలు, వాదాలు తెలుగు సాహిత్యరంగలో కాలుమోపాయి. వీటిలో అభ్యుదయ, విప్లవ, దిగంబర, స్త్రీవాద, దళిత, మైనారిటి వాదాలు చాల విసురుగా ప్రవేశించాయి. సామ్రాజ్యవాదంలో భాగంగా ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణలు, ఏకచత్రాధిపత్యాన్ని చలాయిస్తూ వస్తున్నాయి. ఇప్పుడు ఆ ఊపు తెలంగాణా ఉద్యమం రూపంలో ఉగ్రరూపం దాల్చింది. సాధారణంగా ఏవాదంలోనైనా ముందుగా ఆ వేగాన్ని ఒడిసిపట్టుకునేది ఒక్క కవితా ప్రక్రియకే ఉంది. ఎందుకంటే కవిత్వం ప్రధానంగా ఆవేశపూరితమైనది. ప్రతి ఐదు.పదేళ్ళకోసారి కవిత్వం తన రూపురేఖలని మార్చుకుంటోంది. శిల్పపరంగా నవ్యతను అందిపుచ్చుకోడానికి ప్రయత్నిస్తోంది. కాలంతోపాటు వచ్చే ఈ మార్పును ఎప్పటికప్పుడు మనం స్వాగతించాల్సిందే! ఈ దృష్టితో చూస్తే అందరి కవుల్లాగే ఆ ఉద్యమాల ప్రభావం నామీద, నా రచనల మీద పరోక్షంగా పడి, అంతర్లీన చైతన్యానికి ఊపిరి పోసిందనే చెప్పాలి. ఈ స్పృహే కనుక నాలో లేక పోయినట్టయితే కవిగా నేను ఎప్పుడో అదృశ్యమైపోయేవాణ్ణి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాహిత్యకారులు సైతం ఆ ఊపును ఒడిసి పట్టుకోవాలి. కొత్తదనాన్ని ఆస్వాదించాలి. అప్పుడే మనం మనగా నిలబడి మిగలగలుగుతాం.

ప్రశ్న :- సాధారణంగా కవిత్వం రాసేటప్పుడు మీరు ఎటువంటి భావోద్వేగాలకు లోనవుతారు ?

జవాబు :-        ఇది ఆ సందర్భాన్ని బట్టి, సన్నివేశాన్ని బట్టి, భావ తీవ్రతలను బట్టి, మానసిక ఉద్వేగాన్ని బట్టి  ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఒక కవి అన్ని సమయాల్లోనూ ఒకేలాగ ఆలోచించలేడు. తాను ఎంచుకున్న వస్తువుపట్ల కవి జాగరూకతతో వ్యవహరించి మెలకువగా  ఉండాలి.  కవిత్వంలోకి ఒకసారి అడుగు పెడితే తీవ్రమైన గాఢతలోంచి స్పష్టమైన ఆలోచన దిశగా కవిత్వ రచనను నడిపించాలి. శైలి, శిల్పపరంగా ఆధునికతను ప్రతిబింబించే విధంగా ఎప్పటికప్పుడు మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి. ఒక్కోసారి కవిత్వమే మనం అవ్వాలి. అప్పుడే దానికీ మనకి మధ్య బహిరంతర యుద్ధం జరిగి చివరికి రాజీపడతాం. సమన్వయం చేకూరుతుంది. అలాంటి మానసిక సంఘర్షణలకు, అనుభూతులకూ లోనై కవిత్వానికి చేరువై రాసినపుడే మన కవిత్వం బతికి బట్టకట్టడానికి అవకాశమేర్పడుతుంది.

ప్రశ్న :- ఇన్ని విషయాలు తెలిసిన మీరు వర్తమాన కవిత్వ తీరుతెన్నులను ఏ విధంగా అంచనా వేస్తారు ?

జవాబు :-        ఏదైనా కాలంతోపాటు పోటిపడి ప్రయాణించడం నేర్చుకోవాలి. లేదంటే మనం వెనకబడిపోయే ప్రమాదం వుంది. ఆధునిక వర్తమాన సాహిత్యం ఉద్యమ వేగంతో తీవ్ర ఉద్వేగంతో కొనసాగుతూ వస్తోంది. ఇందులో కొన్నిచోట్ల పాతకొత్తల మేలుకలయిక కనిపిస్తోంది. సందర్భాల సారంగా తొంగిచూసే సంఘటనలను సంఘర్షణాత్మకంగా చిత్రించి వర్తమాన కవిత్వంలో ప్రతిబింబించడం పరిపాటి అయింది. కొన్ని చోట్ల సంప్రదాయపు కవిత్వం కూడా వెలుగు చూస్తోంది. అన్ని రకాల ఆలోచనలకు దర్పణం పడుతూ సరళమైన సారవంతమైన సాంద్రతతో కూడిన కవిత్వానికి వేదికగా నిలుస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పటి కవిత్వాన్ని అంచనా వెయ్యడమంటే వర్తమాన కాలాన్ని నిలువుటద్దంలో చూపించడమే అవుతుంది. దీనికి నా కవిత్వం మినహాయింపు కాదు.

ప్రశ్న :- అట్టి ప్రతిష్టమైన ముందుతరానికి చెందిన కవుల సరసన పత్రికల్లో మీ రచనలు వెలుగు చూసినపుడు మీ భావోద్వేగాల స్థాయి ఏ రీతిలో ఉంటుంది ?

జవాబు :- ఇది మా మధ్య ఉండే స్థాయీ భేదాల ఆంతర్యాన్ని వ్యక్తపరుస్తుంది. కొన్ని సందర్భాల్లో నన్ను నేను అంచనా వేసుకోవడానికి దోహదపడుతుంది.  నాలో లోటుపాట్లను తెలుసుకొని సరిదిద్దుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. దీనికి కొంత వ్యవధి అవసరమవుతుంది.   భవిష్యత్తు కాల రచనలకు మార్గదర్శకంగా ఈ ప్రయత్నం నిలుస్తుంది.

ప్రశ్న :- కవిగా మీరు ఎలాంటి కవిత్వాన్ని ఇష్టపడతారు ? తెలుగు-ఆంగ్ల సాహిత్యాల మధ్య  ఉన్న కవిత్వ వ్యత్యాసాన్ని మీ మాటల్లో తెలియజేయండి.

జవాబు :-        ఆంగ్ల కవిత్వం నిర్మాణపరంగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ప్రక్రియ. దీనికి ఎల్లల్లేవు. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన కవుల రచనలు గొప్ప సృజనాత్మకతతో, భావుకతతో, లోతైన చూపుతో, ధ్వని ప్రధానంగా రాస్తారు. ఇందులో అనేక నిజాలు చోటుచేసుకున్నాయి. దీని స్థాయి వేరు. అభివ్యక్తి పద్ధతులు వేరు. కాల్పనిక జగత్తును తలదన్నే విధంగా రచనలు ఉంటాయి. అందుకే ఆంగ్ల కవిత్వ ప్రభావంతో తెలుగులో కవిత్వ రచన చేసేవాళ్ళు చాల మంది ఉన్నారు, అనుకరించేవాళ్ళూ ఉన్నారు. భావచిత్రాలతో, పదబంధాలతో, ధ్వని ప్రధానంగా, ఆవేశపూర్వకంగా, ఆలోచనాయుతంగా, అంత్యప్రాసలతో గేయ, పద్య ఛాయలతో, వచనంతో కూడిన కవితారచనలు చేసే వాళ్ళూ కోకొలల్లు. ఇందులో ఎవరిశైలి వారిది. ఎవరి ఆలోచనా సరళి వారిది.  ఎవరి ధోరణి వాళ్ళది. కానీ అనుకరణ చేసి రాసే కవిత్వం తామరాకు మీద నీటిబొట్టులా జారిపడుతుంది. ఇది ఎక్కువ కాలం నిలబడదు. చెప్పే విషయంలో కొత్తదనం, కొన్నిసార్లు సూటిదనం, కవిత్వాన్ని ఒడిసిపట్టుకునే పద వాక్య నిర్మాణం తెలుగు కవిత్వానికి అవసరం. అది కూడా సొంత గొంతుతో వాస్తవిక దృక్పథంతో ప్రతిబింబించే నేర్పు, కూర్పు కవికి అవసరం. వీటితోపాటు  ఆత్మాశ్రయ ధోరణిని,  వస్త్వాశ్రయ  కవిత్వానికి రూపకల్పన ఇందులో అంతర్భాగాలుగా నిలుస్తాయి. ఇంకా సౌందర్య తాత్త్వికులు చాల మంది మేధావి వర్గాల్లో కనిపిస్తారు మన అనుభూతుల్నీ, భావావేశాల్నీ చేతనా సౌకుమార్యంతో పలికించి అక్షరబద్ధం చేసేవాళ్ళూ ఉన్నారు. కవిత్వాన్ని   ఎలాగైనా రాయవచ్చు. తీవ్ర అనుభూతులు వాటంతటనే వెల్లులికి వచ్చుటే కవిత్వం (Poetry is the spontaneous new flow of powerful feelings) కవి ఎప్పుడూ ఒక పట్టాన స్థిరంగా కూర్చోలేడు. ఒక చోటు నుంచి మరోచోటుకు ఊహల కవిత్వ ప్రయాణం చేస్తుంటాడు. ఇలా ఊగిసలాడే క్రమంలో చుట్టూ ఉన్న పరిస్థితుల్ని, పరిసరాల్ని, సమస్యల్నీ గాఢంగా చిత్రించే నైజాన్ని సహజంగానే ఒంటపట్టించుకోవాలి ఇటువంటి కవిత్వాన్ని నేను ఇష్టపడతాను. సమూహంలో ఒకడిగా కలగలిసిపోయే తత్త్వాన్ని అలపర్చుకోవాలి కవి.

ప్రశ్న :- ప్రస్తుతం వస్తున్న కవిత్వంలో బాల్యాన్ని గురించిన ప్రస్తావనలు, సందర్భాలు చాలా వస్తున్నాయి. ఈ కోవలో మీ కవిత్వ ప్రయాణం ఎలా సాగింది?

జవాబు :-        నా వరకూ నేను బాల్యాన్నికి సంబంధించి చాల కవితలు రాశాను. అసలు బాల్య స్మృతులు లేకపోతే కవి బతకలేడు. కవిత్వమూ బతకదు. అలాగని పూర్తిగా “నాస్టాలజీ’కి కట్టుబడి కవితావస్తువుగా ఎంచుకున్నపుడు దాని నుంచి స్పూర్తిని పొంది, వర్తమాన కాలానికి అనువదించి, చైతన్యాన్ని ప్రసాదించడం దీనిలోని అంతర్లీన పరమార్ధం. ఇవాళ మనచుట్టూ అనేక బాల కార్మిక సమస్యలున్నాయి. వీటిని కవితాత్మకంగా వ్యక్తీకరించి  సామాజిక ప్రయోజనాన్ని పొందడం ప్రస్తుత కాలానికి అవసరం. ఇది అనివార్యం కూడా.

ప్రశ్న :- మరి అలాంటి కవితలు మీరు పత్రికల్లో ప్రచురించారా ?

జవాబు :- ‘బాల్యం ఒక ఖరీదైన స్వప్నం’ అనే కవిత ఈ కోవకే చెందుతుంది. దీనిని అక్షరాల రూపంలో మీ ముందు ఉంచుతున్నాను.

‘బాల్యం ఒక ఖరీదైన స్వప్నం’  (కవిత) *****

ప్రశ్న :- జానపద సాహిత్యానికి మన తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానముంది. దాన్ని మీ కవితల్లో ఎక్కడైనా ప్రతిబింబించే ప్రయత్నం చేశారా ?

జవాబు :-        ” చేశాను… కొమ్మదాసరి మీద, బుడబుక్కల వాళ్ళ మీద కవితలు రాశాను. నా దృష్టిలో కవిత్వపరంగా అన్నీ సమానమే. కాబట్టే జానపద సంస్కృతి నా రచనల్లో ఒక భాగమైంది.

“బుడబుక్కలోడు” (కవిత) ****

ప్రశ్న :- అనుభూతి ప్రధానమైన కవిత్వంలో ప్రకృతితో మమేకమైన సన్నివేశ దృశ్యాలలో మన మనసుకు హత్తుకునేవి అనేక దృశ్యాలుంటాయి. ఇలాంటి అంశానికి మీ కవిత్వంలో చోటు కల్పించారా ?

జవాబు :- నేను కూడా భావుకుడినే కదండి. ప్రకృతి ఆరాధకుడినే! మనసు అనిర్వచనీయమైన అనుభూతులకు లోనయినపుడు వాటిని అక్షరబద్ధం చెయ్యకుండా విడిచిపెట్టను. అలాంటి ప్రత్యేక సందర్భంలో రాసినదే ఈ ‘వాన కురిసినప్పుడు..!” అనే కవిత. వీలైతే ఆస్వాదించండి.

“వాన కురిసినప్పుడు…!” (కవిత) ****

ప్రశ్న :- జీవితంలో పాట అంతర్భాగమైపోయింది ఈ రోజుల్లో ప్రతి కవీ ఎప్పుడో ఒకప్పుడు ఈ గాన మాధుర్య ప్రవాహంలో తడిసి తరించినవాడే. అటువంటి కవితను ఒకటి రుచి చూపించండి.

జవాబు :-        పాటకి ఎల్లలు లేవు. అది ప్రవహించే జీవనది లాంటిది. దాని నడక హొయలు హొయలుగా సాగుతుంటే ఆ సంతోషమే వేరు. కాబట్టే ‘శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణి ” అన్నారు. ఆ నిజాన్ని కవితారూపంలో ఇప్పుడు విందాం’.

‘పాట ప్రవహించినంత సేపూ…” (కవిత) *****

ప్రశ్న :- ప్రతి కవికీ అంతరంగముంటుంది. దీనిని ఆత్మావిష్కరణ చేస్తే మీలో కవి బయట పడతాడు. అలాంటి జీవిత నేపథ్యంలోంచి మీ అనుభవాన్ని కవితగా పరిచయం చెయ్యండి.

జవాబు :-        అది మీరు ప్రత్యేకంగా అడగాలా ? మీరు కవితారంగం నుంచి వచ్చిన వర్ధమాన కవయిత్రే కదా… కవిగా పుట్టడమంటే మనలోపల పొరల్లో దాగివున్న కనీ కనిపించని గుండె చప్పుళ్ళ ఆవేదనని అక్షరస్పర్శతో పైకి తవ్వి వెలుపలకి తియ్యడమే! దీనికి సజీవ ప్రతిబింబం ఈ కవిత.

“కవిగా పుట్టడమంటే…! (కవిత) ****

ప్రశ్న :- ప్రస్తుత కాలం సమస్యల వలయం. ఇందులో వేలు పెట్టడమంటే చీమలపుట్టను అదిలించడమే! ఇలాంటి వాతావరణంలో మీ కవితాయానం ఎన్ని రూపాలుగా సాగింది ?

జవాబు :-        మీరడిగేది… (అనుమానం వ్యక్తపరుస్తూ)

ప్రశ్న :- ఇప్పటివరకూ స్పృశించిన మీ సాహిత్య ప్రక్రియలు గురించి అడుగుతున్నాను.

జవాబు :         కవిత్వంతో పాటు సుదీర్ఘ పుస్తక సమీక్షలు, రేడియో నాటికలు, కొన్ని కథలూ, మరికొన్ని వ్యాసాలూ రాశాను. ఏది రాసినా మనస్ఫూర్తిగా అధ్యయనం చేసే రాశాను.

ప్రశ్న :- మీ రచనలు ఏఏ పత్రికల్లో వచ్చాయి. వాటి వివరాలు కొంచెం చెబుతారా!

జవాబు :-        అన్ని దిన, వార, మాస, పక్ష పత్రికల్లోనూ నా కవితలు అచ్చయ్యాయి. మిసిమి, వాజ్ఞయి, ప్రస్థానం, తెలుగు (అకాడెమి పత్రిక), ఆంధ్రప్రదేశ్, నేటినిజం, స్థానిక పాలన  వంటి పత్రికల్లో నా వ్యాసాలు అచ్చయ్యాయి. అనేక (పదేళ్ళ కవిత్వం-2000-2009) నాన్న, కిరణం, స్పర్శ (రంజన-కుందుర్తి),  అక్షరవృక్షాలు (పర్యావరణ కవితలు), ఇంకా అనేక ఇతర కవితా సంకనాల ల్లో  నా కవితలు వచ్చాయి.

ప్రశ్న :- మీకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో అనేక కవితలకు అవార్డులు వచ్చాయని తెలుసుకున్నాం. వాటిని కొంచెం వివరంగా చెబుతారా ?

జవాబు :-        రంజని-కుందుర్తి కవితల పోటీలో అత్యుత్తమ కవితా అవార్డు (2009) ఉత్తమ అవార్డు (2000-2002), అజోవిభో-జి.వి.ఆర్.కల్చరల్ ఫౌండేషన్ కవితల పోటీలో మొదటి బహుమతి (2008), భిలాయివాణి- 2010 ఉత్తమ కవితా పురస్కారం, 2010 ఎక్స్‌రే ఉత్తమ కవితా పురస్కారం, శ్రీ తాండ్ర పాపారాయ ఫౌండేషన్ కవితల పోటీలో ద్వితీయ బహుమతి (2011-హైదరాబాద్), సాహితీ వేదిక-అనకాపల్లి (ప్రధమ బహుమతి-2002), సి.ఇ.టి.యు. శ్రామిక జనకవనంలో (ద్వితీయ బహుమతి – 2010), వేమన సాహితీ కళా వేదిక కవితల పోటీలో బహుమతి (2011), ప్రభుత్వ ఉగాది పురస్కారం (2006), యువజనుల సర్వీసుల శాఖ అవార్డు (2006) అభ్యుదయ ఫౌండేషన్ (కాకినాడ-2011 లో కవితా కధా రచన విమర్శనా విభాగంలో బహుమతులు), మానస – శ్రీ శ్రీ వ్యాసరచన పోటీలలో బహుమతి (2011) పొందాను. విశాలాక్షి కవితల పోటిలో-2011 ద్వితీయ బహుమతి పొందాను.

ప్రశ్న :- మీరు పాల్గొన్న ప్రముఖ సమావేశాలు గురించి వివరించండి!

జవాబు :- 1999 నవ రచయితల అధ్యయన శిబిరం-వచన కవిత (రాష్ట్ర సంస్కృతిక మండలి), సాహిత్య అకాడెమీ -(తెలుగు-హిందీ యువ రచయితల సదస్సు-2011-కవితా పఠనం), ఆంధ్ర సారస్వత పరిషత్తు (రాష్ట్ర స్థాయి తెలుగు భాషా సాహిత్య సమ్మేళనం -2010), ప్రపంచ తెలుగు మహాసభలు-2012 – తిరుపతి (ఉపవేదిక-కవి సమ్మేళనం), గురజాడ శతజయంతి ఉత్సవాలు-విజయనగరం (2011-కవి సమ్మేళనం) ‘యువస్పందనా సాహిత్య సంస్థలు ద్వారా అనేక కవి సమ్మేళనాలు నిర్వహణ చేపట్టాను.

నా కవిత ‘గాయపడ్డ బాల్యం’ ‘గాయల్‌బచ్‌పన్’ పేరుతో తెలుగు అకాడెమీ వాళ్ళు హిందీలోకి అనువాదం చేశారు.

ప్రశ్న :- ఇంతవరకూ మీ రచనలను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రోత్సహించి ఆదరించిన ప్రముఖ సాహితీ వేత్తలు, కవి మిత్రులు ఇంకా ఎంతమందిదాకా ఉంటారు?

జవాబు :-        చెబితే  చాలామంది ఉన్నారు. పూలదండలో పైకి కనిపించని దారంలా వీళ్ళంతా పరోక్షంగా నా ఎదుగుదలను కాంక్షిస్తూనే ఉన్నారు. ఇందులో కొందరు ప్రముఖుల గురించి ఇప్పుడు ప్రస్తావిస్తాను.

వీరిలో కె.శివారెడ్డి, డా!!అద్దేపల్లి రామమోహనరావు, ఎం.వి.ఆర్.శాస్త్రి, ఎన్.గోపి, సినారె, వాడ్రేవు చిన వీరభద్రుడు, సుదామ, జగన్నాధ శర్మ, గంటేడ గౌరునాయుడు, డా!!రామసూరి, డా!!యు.ఏ.శిఖామణి, నరసింహమూర్తి, డా!!అద్దంకి శ్రీనివాస్, డా!!చాగంటి తులసి, స్కైబాబా, సిధారెడ్డి, గుడిపాటి, యాకూబ్,  శిలాలోవిత, డా!!ఓలేటి పార్వతీశం, రాధేయ, చేతవోలు రామబ్రహ్మం, ద్వానాశాస్త్రి, బమ్మడి జగదీశ్వరరావు, కుప్పిలి పద్మ, సుధేరా, నిర్మలానంద్, దివికుమార్, చాయరాజ్,  ఆశారాజు, పెన్నా బి.వి.వి.ప్రసాద్, శివరామక్రిష్ణ, బైస దేవదాస్, వాడ్రేవు వీరలక్ష్మీ దేవి, రామతీర్థ, దేవిప్రియ, జగద్ధాత్రి, ఎల్.ఆర్.స్వామి, రామ చంద్రమౌళి, కేతు విశ్వనాధరెడ్డి, ఆకెళ్ళ, దర్భశయనం శ్రీనివాసాచార్య, పెనుగొండ లక్ష్మీనారాయణ, కె.కె.రఘునందన, జి.యస్.చలం, కె.కె.భాగ్యశ్రీ, వారణాసి ప్రసాదరావు, డా!!ఏ.గోపాల రావు తదితరులు ఇస్తున్న ప్రోత్సాహం ఎప్పటికీ మరువలేనిది.

ఇంకా సాహితీ మిత్రులలో, సి.వి.బి.శ్రీరామమూర్తి బులుసు-జీ-ప్రకాష్, అదసవిల్లి క్రిష్ణ, ఈతకోట సుబ్బారావు, జియోలక్షణ్, కె.విల్సన్‌రావు, భోజంకి వెంకటరవి, వరప్రసాద్, యెన్నం, ఉపేందర్, చీకోలు సుందరయ్య, మట్టిగుంట వెంకటరమణ, ఎండ్లూరి సుధాకర్, కె.రామారావు, చీకటి దివాకర్, చంద్రిక, మొయిద శ్రీనివాస్, పి.లక్ష్మణరావు, జక్కు రామక్రిష్ణ, రాపాక సన్ని విజయ క్రిష్ణ, బులుసు సరోజినీ దేవి, హెచ్.యం.టి.వి.లక్ష్మణ్, ఆర్.రామక్రిష్ణ, భళ్లమూడి నాగేంద్రప్రసాద్, పి.శ్రీనివాస్ గౌడ్, మౌనశ్రీ మల్లిక్, సాహిత్య ప్రకాష్, సి.హెచ్.వి.బృందావనరావు, డా!!బండి సత్యనారాయణ, మధు, జె.బి.తిరుమలాచార్య, సి.హెచ్.రాం,ఇ.సిహెచ్.సత్యనారాయణ, పాయల మురళీక్రిష్ణ, చింతా అప్పల్నాయుడు, సిరికి స్వామినాయిడు, ర్యావి ప్రసాద్, గుండాన జోగారావ్, మాధవీసనార, మోదు రాజేశ్వరరావు, ఆక. బాలక్రిష్ణ, బి.విజయేశ్వరరావు, వాధూలస, వెంకటయ్య, పి.ట్.యన్.శ్రీనివాస్, కిలపర్తి దాలినాయుడు, దార్ల వెంకటేశ్వర రావు, కె.క్యూబ్. వర్మ, అనంతరావు, చలపాక ప్రకాష్, చిత్తలూరి సత్యనారాయణ, శిఖ-ఆకాష్, సూర్య గరిమెళ్ళ, రెడ్డి రామక్రిష్ణ, తామరాపల్లి రామక్రిష్ణ, రొక్కం కామేశ్వరరావు, యం. విజయభాస్కర్, ఫణీంద్ర భార్గవ్, రెడ్డి శంకర్రావు, నిశితాసి, బగ్గం అప్పాజీరావు, చంద్రకళ, బగ్గాం సత్యవతమ్మ, రాబ చిన్న, విరసం వర్మ, చెళ్ళపిల్ల శ్యామల, ఇనగంట జానకి, లైబ్రరీ శ్రీనివాస్, రొంగలి పోతన్న, ఇల్ల ప్రసన్నలక్ష్మీదేవి.బాల సుధాకరమౌళి, రాజశేఖర్, సావేరి గంగాభవాని, సుధాకర్, సూరిబాబు, శివ, నాయుడు, గవిడి శ్రీనివాస్, చివుకుల శ్రీలక్ష్మి, ఆడిదం శారద, శారదాప్రసాద్, పి.వి.యల్.సుబ్బారావు, శ్రీరాములు, శివాజీ పట్నాయక్, బగ్గాం సురేష్, సరోజా ఆంటీ, జి.శిరీష, శేషన్నయ్య, రవి అన్నయ్య, ఈపు విజయకుమార్, యస్.యస్.యస్.యస్.వి.ఆర్.ఎం.రాజు, కీ.శే.ఆల, దుప్పల రవికుమార్, శేషగిరి, మృత్యుంజయరాం, బగ్గాం సన్యాసిరావు, రాజు అన్నయ్య, అశోక్ కుమార్ పాత్ర, యం.వి.వి.సత్యనారాయణ, పసుమర్తి సన్యాసిరావు, పి.శాంతమ్మ, ఎన్.కె.బాబు, రుద్రమూర్తి, పల్లరోహిణి కుమార్, మల్లిపురం జగదీశ్, అరుణ పప్పు, రవికుమార్ కోసూరి, మడగల రవిచంద్ర, మోకా రతన్‌రాజు, రమణమూర్తి, ఇఫ్లూ ప్రసాద్, జె.వి.యస్.ప్రసాద్, క్రీ.శే.బి.క్రిష్ణాజీరావు, కొల్లూరి పద్మజ, క్రిష్ణారావు, నరసింహస్వామి, నాగార్జున్, నాగరాజు సముద్రాల, మూర్తిబాబు, అన్నపురెడ్డి వెంకటేశ్వరు, శివ శంకర్ ప్రసాద్, పి.యస్.యస్.లక్ష్మి, లక్ష్మీ నరసింహం బద్రి కూర్మారావు, మంత్రి క్రిష్ణమోహన్, ఖాజా మొహిద్దీన్, రాచ పాళెం చంద్రశేఖర రెడ్డి, సడ్లపల్లె చిదంబర రెడ్డి,వాధూలస, కలిమిశ్రీ, జయధీర్ తిరుమలరావు, హృషీకేశం, హెచ్చార్కె, గురుప్రసాద్, గోపి (సత్య), గధాధర్, ద్వారం దుర్గాప్రసాదరావు, డా!!శ్రీకాంత్, బుచ్చి, బసుపోతన, దాకరపు బాబూరావు, అరుణ్ బవేరా, ఆంజనేయకుమార్, రేణుకా అమోల, దామరాజు విశాలాక్షి, కళ్ళు చిదంబరం, చాగంటి ఆనంద్, ఆదెయ్య, విశ్వనాధ సాయి శ్రీనివాస్, విజాదిత్య, యు.వి.ఏ.ఎన్.రాజు..ఇంకా ఎందరో ప్రియ మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

ప్రశ్న :- మీ గురించి చాల విషయాలు మాకు తెలియజేశారు. కృతజ్ఞతలు చంద్రశేఖర్ గారు.

జావాబు :-       మీకు కూడా మా శుభాభినందనలు.

ప్రశ్న :- మళ్ళీ కలుద్దామండి… నమస్కారం!

జవాబు :-        నమస్కారం మేడం!!

 

***

Print Friendly

సంభవం

 రచన: సూర్యదేవర రామ్మోహన్ రావు

suryadevaranovelist@gmail.com

http://www.suryadevararammohanrao.com/

 

 

మనిషి చనిపోగానే క్రయోనికల్‌గా అతని శవాన్ని సస్పెండ్ చేసి, అత్యంత జాగ్రత్తగా భద్రపరిచి, తిరిగి అతడ్ని బ్రతికించేందుకు చేస్తున్న అధ్బుత శాస్త్ర పరిశోధనలపై వెలుపడిన మొట్టమొధటి నవల-

సంభవం

మృత్యువుని జయించటానికి ప్రపంచవ్యాప్తంగా, అతి రహస్యంగా జరుగుతున్న శాస్త్ర పరిశోధనలపై వెలుపడిన తొలి నవల-

సంభవం

చనిపోయిన మనిషి శరీరాన్ని భద్రపరిచి ప్రాణం పోయగలిగే అవకాశం సైన్స్‌కి లభించినప్పుడు ఆ ప్రాణిలోకి పూర్వపు ఆత్మే ప్రవేశిస్తుందా? లేక కొత్త ఆత్మ ప్రవేశిస్తుందా?

ట్రిలియన్ డాలర్ల ప్రశ్న…

 

జాతస్యహి ధృవో మరణం…

పుట్టినవాడు గిట్టక మానడు

ధృవో జననం మృతస్యచ…

గిట్టినవాడు తిరిగి పుట్టక మానడు

అని చెప్పిన శ్రీ కృష్ణభగవానుడి గీతోపదేశానికి సైన్స్ విసురుతున్న సవాల్ ఎలాంటిది…? అది సవాలా? లేక సైన్స్ చేసే ప్రేలాపనా?

అద్యంతం ఉత్కంఠతో చదివించే అద్భుతమైన నవల-

 

సంభవం

 

THERE IS NO DEATH: THE STARS GO DOWN

TO RISE UPON SOME OTHER  SHORE.

AND BRIGHT IN HEAVEN’S JEWELED CROWN,

THEY SHINE FOR EVER MORE.

 

-JOHN L.Mc Creery.

 

అనంత దిగంత విశ్వగోళం ఎదుట, యుగ యుగాలుగా, సంశోధిత నేత్రంతో నిల్చున్న, చరాచరజీవి మదిలో మొదుల్తున్న ఏకైక ప్రశ్న మృత్యువు…

యుగాంతాల చీకటిలాంటి మృత్యువుకు మూలం, ఉషాంతాల వెలుగులాంటి జనన బీజం… నిశ్శబ్ద, నిర్లిప్త, నిరామయ, నిష్కామ, నిష్కర్మ, సృష్టిలో, నిరంత, చిరంతన జ్వాలాతోరణం మృత్యువు!

గుహలో దివ్వె మాయమై పోవడమేనా మృత్యువు?

తటాల్మని హృదయ కవాటలు మూసుకుపోవడమేనా మృత్యువు?

వెన్నముద్దలాంటి ఆత్మ, విభూతిపండులా మిగిలిపోవడమేనా మృత్యువు?

కదలిక, కలయిక స్తంభించి పోవడమేనా మృత్యువు?

ఏది మృత్యువుకు సిసలైన నిర్వచనం?

సుఖదుఃఖ సంకలిత జీవనపధంలో చివరి మజిలీయేనా మృత్యువు?

జాతస్య చధ్రువో మృత్యు అదేనా?

చరాచర జీవి భయపడే ఆ మృత్యువు తర్వాత… అంతా నిశ్శబ్ద శూన్యమేనా? ఆ శూన్యంలోంచి పుట్టే సృష్టి అంటే మృత్యువేనా?

సృష్టి ఉదయసంధ్యల్లాంటిది… ప్రభాత సంధ్య జననమైతే, ప్రాతస్సంధ్య మృత్యువని చెప్పే ఆర్షవాక్యంలో నిజమెంత?

ఒక మరణం వెనక మరొక జననం వుంటుందా?

యుగాంతం అంటే-ఏమిటి? జననమా? మరణమా? రెండు కలగలిసిన నీరవ నిశ్శబ్దమా?

ఆ నిశ్శబ్దంలోంచి జనించే జీవి, కోల్పోతున్నది ప్రాణాన్నా? ఆత్మనా?

ప్రాణం అంటే జలపాతం లాంటి చైతన్యం…

ఆత్మ అంటే ఆ చైతన్యాన్ని నిలకడగా నిలిపే అంతులేని వెలుగు!

అగాధంలాంటి చైతన్యంలోంచి, అంతులేని వెలుగులోంచి, అనంత ప్రయాణం చేస్తున్న మనిషికి పరమపదం మృత్యువేనా?

కాదు…

మృత్యువు, మనిషి మనుగడకు ఒక ముసుగు మాత్రమేనని ఉద్ఘోషించే భారతీయ తత్త్వధోరణి నమ్ముతున్న పునర్జన్మ ఉందా?

పునర్జన్మ ఒక నిజమా? ఒక నమ్మకమా? ఒక భ్రమా? ఆశావాదమా?

పునర్జన్మల పేరిట జరిగిన, జరుగుతున్న సంఘటనలు ఏ నిజాలకు బీజాలు?

ఆత్మ తనను తాను సృష్టించుకున్న పునఃసృష్టే పునర్జన్మ అయితే భౌతిక శరీరం మాటేమిటి?

మృత్యువు హరించేది ఆత్మనా? శరీరాన్నా?

పునర్జన్మ రూపంలో ఆత్మ బ్రతుకుతున్నప్పుడు, ఆత్మకు ఆవాహన కేంద్రమైన శరీరం ఎందుకు చిద్రమవుతోంది?

మృత్యువుంటే ఆత్మ, శరీరాలు మృగ్యమైపోవడమేనా?

యుగాదిగా ప్రాణజగతి ముందున్న జవాబుల్లేని ప్రశ్నలివి.

జనన మరణాలు, సృష్టి చక్రంలో కేంద్రబిందువులయినప్పుడు, ఆ రెంటిని నడిపే విశ్వశక్తి మూలం ఏది?

అదృశ్యశక్తా? విజ్ఞానశక్తా?

అనాదిగా అదృశ్య శక్తికి, శాస్త్రశక్తికి మధ్య ప్రచ్చన్న యుద్ధం జరుగుతూనే వుంది.

రైలు పట్టాలలాంటి రెండు శక్తుల్ని నమ్మే వ్యక్తుల మధ్య పోరాటం జరుగుతూనే వుంది.

మృత్యువును జయుంచడానికి జరిగే ఈ అనంతసమరంలో విజయం వరించేదెవరికి?

నిజానికి మనిషి మృత్యువును జయించే రోజొస్తుందా?

ఒక్కసారి శాస్త్రీయంగా, అధ్యాత్మికంగా జరుగుతున్న వాదవివాదాల్ని విశ్లేషిస్తే ఆశావాదాన్ని నమ్మి మృత్యువును జయించడానికి జరిగే క్షణాలు ఆసన్నమయితే…?!

నిలకడగా నిలిచిపోయే మానవ కంకాళం, చైతన్యంతో నిలిచి, నడిచే అద్భుత క్షణాల కోసం అనునిత్యం కృషి చేస్తున్న శాస్త్రజ్ఞుల కృషి ఫలిస్తే?

సంభవామి యుగే యుగేకి శాస్త్రీయ రూపకల్పన జరిగే క్షణాలు ఆసన్నమయితే

 

*                      *                      *                      *                                  *

            “శ్రుతులలోని కథాశ్రుతిలో మానవశరీరాన్ని ‘స్థూలశరీరంగా’ అభివర్ణించారు. ఇందులో గల మంత్రాల్లో ఒక మంత్రంలో ‘పురమేకాదశ ద్వారమ్’ అనే మంత్రంలో ఈ స్థూల మానవ శరీరం పదకొండు ద్వారాలు గల పట్టణంగా చెప్పబడింది. రెండు కళ్ళు, రెండు చెవులు, రెండు నాసికా రంధ్రాలు, ఒక నోరు, ఒక మూర్థస్థానము అనగా బ్రహ్మరంధ్రం, ఒక నాభిస్థానం, రెండు మలమూత్ర విసర్జన స్థానములు, కలిసి మొత్తం పదకొండు ద్వారాలు. ఈ ద్వారాల్లో అపాయుద్వారము (మల విసర్జన స్థానం) నుండి ప్రాణాలను కోల్పోయే జీవుడు నరకంలోకి వెళ్తాడు. ఉపస్థద్వారం (రేతో విసర్జన స్థానం) నుండి వెడలిన జీవుడు కామాతురములగు పిచ్చుకలు, పావురములు మున్నగు జన్మములను పొందుతాడు. నాభి ద్వారము ముండి వెడలిన జీవుడు ప్రేత శరీరమును, ముఖద్వారము నుండి వెడలిన జీవుడు… అన్నాసక్తులగు ప్రాణుల శరీరమును పొందుతాడు. శోత్ర ద్వారము నుండి వెడలిన జీవుడు గంధర్వ లోకాన్ని, కుడికంటి నుండి వెడలిన జీవుడు సూర్యలోకాన్ని, ఎడమ కంటి నుండి వెడలిన జీవుడు చంద్ర లోకాన్ని, మూర్ధ ద్వారమును వెడలిన జీవుడు సత్యబ్రహ్మ లోకాల్ని పొందుతాడు” చెప్పటం ఆపి యాభై అయిదేళ్ళ ప్రొఫెసర్ బ్రహ్మ కళ్ళద్దాల్ని సవరించుకుని తన ఎదురుగా కూర్చున్న నలుగురు స్టూడెంట్స్ వేపు చూశాడు. దాదాపు ముప్పై ఏళ్లపాటు రాష్ట్ర పురావస్తు ప్రదర్శనశాలలో వివిధ హోదాల్లో ఉద్యోగం చేసిన సత్యబ్రహ్మ, ఇంకో మూడేళ్ళలో రిటైరవబోతున్నాడు.

తెల్లటి పంచె, లాల్చీ, తెల్లటి శరీరపు చాయలో విలక్షణంగా కనిపిస్తున్న ప్రొఫెసర్ సత్యబ్రహ్మ కళ్ళల్లోకి చూస్తున్నారు ఆ స్టూడెంట్స్ నలుగురు.

వాళ్ళల్లో ఇద్దరు ఆర్కియాలజీ స్టూడెంట్స్, మరో ఇద్దరు ఫిలాసఫీ స్టూడెంట్స్… వాళ్ళు తమ డాక్టరేట్‌కి సంబంధించి సేకరిస్తున్న వివిధ అంశాలకు సంబంధించి సత్యబ్రహ్మను కలవడానికొచ్చారు.

“శరీరం మరణించినా, మృత్యువు మరణించదని అంటారు.. మిజమేనా?” ఆ ప్రశ్న వేసిన అమ్మాయి పేరు దిశ, నల్లగా, విశాలమైన నుదురుతో, అంతలేసి కళ్ళతో సన్నగా, పొడవుగా, ఆకర్షణీయమైన చూపులతో కనిపించే దిశను కళ్ళద్దాలలోంచి చూసి నవ్వాడు సత్యబ్రహ్మ.

“నీ ప్రశ్నలన్నీ జీవులకు, ఆత్మాలకు సంబంధించినవే ఉంటున్నాయి. ఆత్మలంటే నీకు అంత ఇష్టమా నీకు?” గంభీరంగా వుంది సత్యబ్రహ్మ స్వరం.

“ఆత్మలంటే నాకిష్టమో కాదో నేను చెప్పలేను సార్! కానీ మృత్యువంటే నాకిష్టం” నిశ్శబ్ధంగా వున్న ఆ గదిలో దిశ నోటిలోంచి వచ్చిన ఆ మాటకు మిగతా విద్యార్థులు ఉలిక్కిపడి ఆమెవైపు చూశారు.

సత్యబ్రహ్మ భ్రుకుటి ఎందుకో ఒక్క క్షణం ముడిపడింది. అతని పెదాల మీద చిన్న చిరునవ్వు కదలాడిందో క్షణం.

తిరిగి చెప్పడం ప్రారంభించాదు సత్యబ్రహ్మ.

“చూడు బేబీ! శ్వేతాశ్వతరోపనిషత్‌లో ‘జీవుడి’ని ఈ విధంగా నిర్వచించారు.

“వాలాగ్ర శత భాగస్య, శతధా కల్పితస్యచ

భాగోజీవస్య విజ్ఞయస్స చానన్త్యాయ కల్పతే”

“అంటే అర్ధం ఏమిటో తెలుసా? ఒక తల వెంట్రుక  చివరి భాగాన్ని నూరు భాగాలుగా చేసి అందులో ఒక భాగాన్ని నూరువంతులుగా చేసిన ఎడల, ఎంత సూక్ష్మమైన భాగం ఏర్పడుతుందో, ఆ మహా సూక్ష్మ పరిమాణం గలవాడే జీవుడు. అందువల్ల ఆ జీవుడికి మరణం లేదని వేదరుషులు నిర్వచించారు.

ఆ జీవమే ఆత్మ.. శరీరం మరణించినా ఆత్మ మరణించదు. అందుకే ఆత్మను తెలుసుకున్న జ్ణానికి మరణం వుండదు. మరణించేది శరీరమే తప్ప ఆత్మ కాదు.

అందువల్లనే కొంతమందికి పూర్వవాసనలుంటాయి. అది జ్ఞానానికి సంబంధించి ఉండొచ్చు. శరీరానికి సంబంధించి ఉండొచ్చు. నడవడికకు సంబంధించి వుండొచ్చు. ఉదాహరణలు చెప్పాలంటే ఇక్కడ ఇప్పుడు కుదరదు” నెమ్మదిగా అన్నాడాయన.

“ఒకే ఒక ప్రశ్న సార్! ఆత్మకు చావులేదని చెప్పారు కదా.. ఆ ఆత్మ ఇంకో శరీరంలోకి ప్రవేశించినప్పుడు పూర్వదేహానికి సంబంధించిన జ్ఞాపకశక్తి  వుంటుందంటారా?” దిశ వేసిన ప్రశ్నకు ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు సత్యబ్రహ్మ.

“ఆత్మకు జ్ఞాపకశక్తి వుంటుంది”  వెంటనే చెప్పాడాయన.

“లేదు సార్…. ఉండదు… ఉండదని పునర్జన్మ విభాగాన్ని రాసిన మా తాతగారు చెప్పారు” టక్కున చెప్పింది దిశం

“ఆయనిప్పుడు బ్రతికే వున్నారా?”

“లేరు”

“ఎన్నాళ్ళయ్యింది చనిపోయి” అడిగాడు సత్యబ్రహ్మ.

“అయిదేళ్ళు” చెప్పింది దిశం

గాఢంగా నిట్టూర్చాడు సత్యబ్రహ్మ. దిశ కళ్ళల్లోకి కన్నార్పకుండా చూశాడు.

కొంతమంది వ్యక్తులు ఆలస్యంగా పరిచయమవుతారు. వారిలోని అద్భుతమైన ఆలోచనలకు ఆశ్చర్యపోతాం. అలాంటి వ్యక్తుల పరిచయం కొంచెం ముందుగా జరిగితే బాగుండేదని మనం అనుకోవడం సహజం.

మరో పదినిమిషాల తర్వాత సత్యబ్రహ్మ సీట్లోంచి లేచాడు. దిశతో సహా మిగతా స్టూడెంట్స్ కూడా లేచి నిలబడ్డారు.

“మనం ఇప్పుడు రెండువేల అయిదువందల కాలంనాటి మమ్మీని చూడడానికి వెళుతున్నాం” తన చాంబర్‌లోంచి బయటికొచ్చి వరండా మీద నడుస్తూ చెప్పాడు సత్యబ్రహ్మ.

వాళ్ళు నలుగురూ ప్రధానంగా అక్కడికొచ్చింది ఆ మమ్మీని చూడడానికే.

హైదరాబాద్ పబ్ల్లిక్ గార్డెన్స్‌లోని రాష్ట్ర పురావస్తుశాలలో గత యాభై ఏళ్ళుగా ఒక ఈజిప్టు మమ్మీ భద్రపరచబడి వుందని చాలామందికి తెలీదు.

మనిషి మరణాంతరం శవాన్ని భద్రపరిస్తే దానినే మమ్మీ అంటారు. ఈ మమ్మీలను భద్రపరచడం ఈజిప్తులో ఒకప్పుడు ఒక సంప్రదాయం – ఆచారం.

పబ్లిక్ గార్డెన్స్‌లో ఒకపక్క మూలగా వున్న ఆ భవనంలోకి నడిచాడు సత్యబ్రహ్మ.

విశాలమైన హాలు-  ఆ హాలు మధ్యభాగంలో వెలుగు చేరని ప్రదేశములో పరదాల నడుమ, అద్దాల మధ్య మంచం మీద నిన్నో, మొన్నో మరణించిన మనిషిలా ముసుగులో శవం!

ఆ మమ్మీ వేపు ఆశ్చర్యంగా చూస్తోంది దిశ. ఆమె మనసులో ఎన్నో సందేహాలు.

మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు సత్యబ్రహ్మ…

“ప్రాచీన ఈజిప్టు ప్రజలకు మరణం తర్వాత మృతుని జీవుడు సమాధుల్లో నివశిస్తుందనే నమ్మకం ఉండేది. దాంతో వారు శవాలను భద్రపరచాలనే సంప్రదాయాన్ని పాటించేవారు. మమ్మీలను భద్రపరిచే శాస్త్ర విజ్ఞానం క్రీస్తు పూర్వం 2500 సంవత్సరంలో వెలసిన ఈజిప్టు రాజవంశీయుల కాలంలో అభివృద్ధి చెందింది. శవాల్ని మమ్మీలుగా తయారుచేసే ఈ శాస్త్రం సుమారు మూడువేల సంవత్సరాలపాటు కొనసాగిందని తెలుస్తోంది” చెప్పి ఆగాడు సత్యబ్రహ్మ.

“శవాల్ని మమ్మీలుగా ఎలా తయారుచేసేవారు?” ఉత్సాహంగా ప్రశ్నించింది దిశ.

“ఈ ప్రశ్న నీ నోటి వెంటే వస్తుందని నాకు తెలుసు” అని నవ్వి మళ్ళీ చెప్పడం ప్రారంభించాడాయన.

“శవాలను మమ్మీలుగా మార్చడానికి సుమారు డెబ్బై రోజుల వ్యవధి పట్టేది. తొలిరోజుల్లో శవాలను మైనం, తేనె, సుగంధ పరిమళ ద్రవ్యాలతో భద్రపరిచేవారు. కాలక్రమేణా రసాయన ద్రవ్యాల వాడకం జరిగింది. ఆ కాలంలో శవాలను మమ్మీలుగా తయారుచేయడం పెద్ద  వ్యాపారంగా చెలామణి అయ్యింది. మమ్మీ అనే పదం మూమియా అనే పారసీ పదం నుంచి వచ్చింది.”

“ఎక్కడో ఈజిప్టులోని మమ్మీ మన హైదరాబాద్‌కెలా వచ్చింది?” ఇంకో అమ్మాయి ప్రశ్నించింది. ఆ అమ్మాయి పేరు వసంత.

“మన దేశంలో కలకత్తా, లక్నో బరోడాల్లో మాత్రమే ఇలాంటి మమ్మీలు భధ్రపరచబడి వున్నాయి. మన హైద్రాబద్‌లో వున్న యీ అరుదయిన మమ్మీని నజీర్ నవాబ్ జంగ్ 1931వ సంవత్సరంలో వెయ్యిడాలర్లకు కొనుగోలు చేసి నిజాంకు బహుమతిగా యిచ్చారు. అప్పటినుంచి యీ మమ్మీని భధ్రపరచి ప్రదర్శిస్తున్నారు. ఈ మమ్మీని జాగ్రతగా చూస్తే ఈ శవానికున్న వస్త్రం మీద ప్రాచీన ఈజిప్షియన్ చిత్రాలలో దానికి సంబంధించిన వివరాలుంటాయి” చెప్పటం ఒక్కక్షణం ఆపారాయన.

నలుగురూ వంగి ఆ చిత్రాల్ని పరిశీలిస్తుండగా మళ్ళీ చెప్పాడు సత్యబ్రహ్మ…

“ఈ మమ్మీ ఈజిప్టును పరిపాలించిన ఆరో చక్రవర్తి కుమార్తెదనని, ఈమెకు అప్పటికి పన్నెండు సంవత్సరాల వయసుంటుందని చరిత్రకారుల అంచనా. అసలు ఈ మమ్మీ నిజమైనదా కాదా? అని అనుమానంతో కొన్ని ఏళ్ళ క్రితం కొంతమంది ఈ మమ్మీ కాలి భాగంలో వున్న వస్త్రాన్ని చింపి చూశారు. ఆ కాలి భాగాన్ని చూడండి- మీకు శవం వేలు కనిపిస్తుంది” ఆ భాగాన్ని వేలితో చూపిస్తూ అన్నాడు సత్యబ్రహ్మ.

“నల్లగా, కర్రముక్కలా కనిపిస్తున్నదేనా?” చూస్తూ అడిగింది దిశ.

“అవును. పూర్వకాలంలో మనుషులు శవాల్నే కాదు ఇష్టమైన జంతువులను కూడా అవి చనిపోయాక మమ్మీలుగా మార్చిన సందర్భాలు వున్నాయి.

ఆ మమ్మీ సంప్రదాయం ఆ తర్వాత కొన్నాళ్ళపాటు కొనసాగింది. జగద్విజేత అలెగ్జాండర్ చక్రవర్తి భౌతికకాయాన్ని తేనెలోనూ, లార్డ్ నెల్సన్ శరీరాన్ని బ్రాందీలోనూ, అలాగే లెనిన్, స్టాలిన్, మావో భౌతిక శరీరాలనుకూడా భద్రపరచి వుంచారు. 1980వ సంవత్సరంలో చైనాలో యాంగే రాష్ట్రంలో ఒక స్త్రీ భౌతికకాయం బయటపడింది. ఆ శవానికి కనుగుడ్లు లేవు. మిగతా శరీర భాగంలోని మాంసం చెక్కు చెదరకుండా వుంది. అది ప్రస్తుతం షాంఘై పట్టణంలోని మ్యూజియంలో వుంది.”

మరొక పావుగంట తర్వాత ఆ భవనలోంచి బయటికొచ్చాడు అందరూ. కేంటిన్ వేపు నడిచారు. కేంటిన్లో టీ తాగుతున్న సమయంలో సత్యబ్రహ్మను అడిగింది దిశ–

“ఆ శవాల్ని మమ్మీలుగా భద్రపరచడానికి కారణం ఎప్పటికయినా అవి బ్రతుకుతాయనే గదా? బ్రతికించవచ్చనే గదా?”

“అవును”

“అలా బ్రతికిన సందర్భాలున్నాయా?” మళ్ళీ ప్రశ్నించింది దిశ.

టీని సిప్ చేయబోయి ఆగిపోయాడాయన ఒక్కక్షణం.

“శవాలు బ్రతుకుతాయని నువ్వు అనుకుంటున్నవా?” ఎదురుప్రశ్న వేశాడాయన ఎక్కడో ఆలోచిస్తూ.

“నమ్మడం లేదని అంటానని మీరనుకుంటున్నారు కదూ?”

అలాంటి ప్రశ్నకు ప్రశ్న దిశలాంటి ఇరవై ఏళ్ళ అమ్మాయి వేస్తుందని వూహించని ఆయన సాలోచనగా ఆమెవేపు చూశాడు.

“అంటే?”

వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ మిగతావాళ్లకు ఇంటరెస్టింగ్‌గా వుంది.

“నేను ప్రాచీనతలోని నమ్మకాల్ని విశ్వసిస్తాను. ఏ దేశంలోనైనా నమ్మకం ఆ దేశపు ఫిలాసఫీలోంచే పుడుతుంది. చనిపోయిన మనుషులు బ్రతకడం మన హిందూ పురాణాల్లో వుంది. తమ మరణాన్ని గురించి తాము తెలుసుకొని మరణాన్ని శాసించే మహాభారతంలోని భీష్ముడులాంటి వ్యక్తులు కేవలం పాత్రలు అనుకుంటే పొరపాటు. మునులు చెప్పే శ్లోకాలను ఇవాల్టికి కూడా మనం వేదవాక్కులుగా నమ్ముతున్నాం. వారి శాపాలు మానవుల్ని సజీవంగా ఆకాశంలోకి పంపే వారి ప్రయత్నాల్ని కూడా నమ్ముతున్నాం. ఇందుకు మన పురణాల్లోని విశ్వామిత్రుడు ప్రత్యక్ష ఉదాహరణ. రామాయణంలో దశరధుడు లాంటి వ్యక్తులు పదివేల సంవత్సరాలపాటు రాజ్యాన్ని పాలించడం-ఇవన్నీ తేలికగా కొట్టి వేయగలిగే విషయాలు కావు.”

అల్ట్రా మోడ్రన్‌గా కనిపించే దిశలో ప్రాచీనత పట్ల అంత నమ్మకం పెరగడానికి గల కారణాల్ని వూహించడానికి ప్రయత్నం చేస్తున్నాడు సత్యబ్రహ్మ.

“నువ్వు పురాణాల్ని నమ్ముతావా? సైన్సుని నమ్ముతావా?” సీరియస్‌గా అడిగాడాయన.

“పురాణాల్ని, ఇతిహాసాల్ని కేవలం పుక్కిటి కల్లబొట్టి కబుర్లుగా తీసి పారెయ్యకూడదని నా అభిప్రాయం. అలాగే సైన్సు శాస్రీయ పరిణామాలు సృష్ట్యాది నుంచీ వున్నాయి. కానీ వాటిని మానవజాతి కనుగొన్నాకే ఆ శాస్త్రానికి సైన్సు అని పేరు పెట్టడం జరిగింది. కాదంటారా?”

సత్యబ్రహ్మ అవుననలేకపోయాడు – కాదనలేకపోయాడు.

“ఇంతకీ నువ్వు మమ్మీల గురించి ఏమనుకుంటున్నావ్?” అడిగాడాయన.

“ఆ మమ్మీల విషయంలో మనకు తెలియని ప్రయోగాలు జరిగే వుంటాయి సార్! ఆ శవాలు మళ్ళీ లేచి వుంటాయి – కదలాడే వుంటాయి – మాట్లాడే వుంటాయి” నెమ్మదిగా చెప్పింది దిశ.

“ఆశావాదం మంచిదే కానీ సైన్సుకి ఆధారం కావాలి.”

“మనిషి మృత్యువుని జయించాలని శతాబ్దాలుగా చేసే ప్రయత్నాలే నా ఆధారాలు సార్! పూర్వపు మునులు తపస్సు చేసి మృత్యుంజయులు కాలేదా? హిమాలయాల్లో సంచరిస్తున్నాడని చెబుతున్న యతి మాటేమిటి? కొన్ని వందల సంవత్సరాల మనిషి కాదా? ఆ యతిని, ఆ యతి పాదముద్రలను కొంతమంది చూసినవాళ్ళు యిచ్చిన ప్రెస్ కటింగ్స్ ఒక్కసారి చూడండి. చరిత్ర మొత్తం వాస్తవం కాదు- అలాగే సైన్స్ కూడా- అలాగే భారతీయ ఫిలాసఫీ కూడా.”

పెద్ద పెద్ద మేధవులు తలలు బద్దలు కొట్టుకుంటున్న విషయాన్ని చాల సింపుల్‌గా దిశ చెప్పడంతో విస్తుపోయాడాయన.

సాయంత్రం అయిదు గంటలు దాటింది.

అరగంట్ర క్రితం వరకూ వున్న వెచ్చటి వాతావరణం చల్లగా మారుతోంది.

క్యాంటిన్లోంచి అందరూ బయటికొచ్చారు.

దూరంగా ఆకాశంలోని సూర్యుడు మబ్బుల్లో దాగి తీక్షణతను తగ్గించు కోవడానికి ప్రయత్నిస్తున్నాడు.

“క్రయోనిక్స్ గురించి నీకు తెలుసా?” పక్కనే వున్న చెట్టుకి చేరబడి అడిగాడు సత్యబ్రహ్మ వున్నట్టుండి.

వెంటనే జవాబు చెప్పలేదు దిశ… ఆయనకేసి ఆశ్చర్యంగా చూసింది.

రెండు నిమిషాలు గడిచాక మెల్లగా చెప్పింది…

“తెలుసు! రాబోయే జన్మల కోసం, శవాలని భద్రపరచడమే, క్రయోనిక్స్  అంటే.. కదా సార్?”

“అవును. ఆ శవాల గురించి ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తున్న సంస్ధ ఒకటి ఉంది తెలుసా?”

“ఎక్కడో, ఎప్పుడో చదివాను. అమెరికాలోని, కాలిఫోర్నియాలో” ఏదో చెప్పబొయింది దిశ.

“అలాంటి సంస్థ అమెరికాలోనే కాదు. ఇండియాలోనూ వుంది.”

“ఇండియాలోనా!?” ఆశ్చర్యంతో ఆమె నేత్రలు విశాలమయ్యాయి.

“అవును బేబీ! అలాంటి సంస్థ మన ఆంధ్రప్రదేశ్‌లో ఉందంటే, నువ్వు షాక్ తింటావు.”

అంతవరకూ మబ్బులవైపు చూస్తున్న దిశ, ఆ మాటలకు నిజంగా షాక్ తింది.

“ఈజిట్ ట్రూ సార్?!” కలలోని సంఘటన, ఇలలో ఎదురైనప్పుడు మనిషి పొందే అనుభూతిలాంటి ఫీలింగ్ అది.

“ఎస్! ఇట్స్ హాండ్రెడ్ పర్సంట్ ట్రూ… మైడియర్ బేబీ! ఆ సంస్థను స్థాపించి అయిదేళ్ళయింది.”

“ఫైవ్ ఇయర్స్! ఎక్కడుంది ఆ సంస్థ… వేరీజిట్ సార్?” దిశ మెదడులో షాక్ మీద షాక్! అలాంటి సంస్థ గురించి తెల్సుకోవడమేకాదు, అందులో పని చెయ్యాలనే కోరిక ఆమెకు చాలా కాలంగా వుంది.

“అవును! ఆ సంస్థ గురించి నువ్వు నిజంగా తెల్సుకుని ఏం చేస్తావ్?” సత్యబ్రహ్మ నోటినుంచి అలాంటి ప్రశ్న వస్తుందని ఊహించలేదు దిశ.

“ప్రాణాలు కోల్పోయిన శవాలు, ప్రాణాలు పోసుకుని నిలిచి కదలాడే రోజు… అరుదైన ఆ క్షణం… సృష్టి పరిణామంలో అద్భుతమైన ఆ సంఘటన ఈ శతాబ్దంలోనే జరుగుతుందని నా నమ్మకం.”

ఆమె మాటలకు అడ్డొచాడు సత్యబ్రహ్మ.

“ఆ సంఘటన ఈ శతాబ్దంలోనే ఎలా జరుగుతుందనుకుంటున్నావ్?”

సత్యబ్రహ్మ గొంతులోంచి వచ్చిన అ ప్రశ్నకి వెంటనే జావాబు చెప్పలేక పోయింది దిశ.

“ఎలా జరుగుతుందనుకుంటున్నావ్? ఫిలాసఫీని నమ్మే నువ్వు భారతీయతలోని కాల్పనికతను మనసా, వాచా విశ్వసించే నువ్వు, సైన్సు పరిశోధనల గురించి జోస్యం చెప్పడం చిత్రంగా వుంది” చిన్నగా నవ్వాడాయన. ఆ నవ్వుకు కోపం వచ్చింది. అసహనంగా ఆయనకేసి చూసిందో క్షణం.

వాళ్ళకు కొంచెం దూరంలో నిలబడి పూలమొక్కల్ని చూస్తున్న విద్యార్ధులు సత్యబ్రహ్మతో, దిశ ఏ విషయం గురించి అంతసేపు వాదిస్తుందో అర్థం కావడంలేదు. సత్యబ్రహ్మ దగ్గరున్న దిశను, తనతోపాటు తీసుకెళ్ళ డానికి ఆమె స్నేహితురాలు వసంత ముందుకి ఒక అడుగువేసింది.

దిశ నిలబడిన ప్రదేశానికి, వసంత ఇరవై అడుగుల దూరంలో వంది.

“తత్త్వశాస్త్రాన్ని ఇష్టపడే నేను,  సైన్స్ ద్వారా జరిగే మార్పుల్ని అంచనా వెయ్యగలను…” నెమ్మదిగా అంది దిశ.

“అంటే… ఇంతకీ నీ వయస్సు… ఇరవై ఏళ్ళుకూడా దాటలేదు-నీ మాటలు నాకు చాలా విచిత్రంగా వున్నాయి బేబీ!” నిజంగా ఆయనకు దిశ వాగ్దోరణి చాలా విచిత్రంగా వుంది.

ఆ అమ్మాయి మేథస్సును, ఆయన అంచనా వెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడు.

“నీ ఇష్టాన్ని నేను కాదనడంలేదు బేబీ! నిజంగా నీకు క్రయోనిక్స్ మీద నమ్మకం వుంటే… నా రెసిడెన్స్‌కు రా… వస్తావా?” షర్టు జేబులోంచి తన విజిటింగ్ కార్డ్‌ను తీసి ఆమె చేతిలో వుంచాడాయన.

ఆ కార్డువైపు ఒకసారి చూసి, తన హేండ్‌బ్యగ్‌లో ఆ కార్డుని వుంచుకొని తనవైపే వస్తున్న వసంతవైపు ఆందోళనగా చూసి, అప్రయత్నంగా “వసంతా!” అని పరిగెత్తుకుంటూ వెళ్ళిన దిశ, వసంతను పక్కకు తోసేసింది

సరిగ్గా అదే క్షణంలో…

పైనుంచి ఎండిపోయిన చెట్టుకొమ్మ ఒకటి ఫెళఫెళమంటూ పెద్ద శబ్దం చేస్తూ విరిగి కింద పడింది.

ఆ ప్రమాదం నుంచి వసంత తప్పిపోయింది… కానీ ఆ చెట్టుకొమ్మకింద పడిపోయిన దిశ గొంతులోంచి వచ్చిన ఆర్తనాదంతో, ఆ పరిసరాలన్నీ ప్రతిధ్వనించాయి.

అయోమయంగా సత్యబ్రహ్మ ముందుకు పరిగెత్తాడు.

మానవ మనుగడ మాత్రమే కాదు. ఆత్మల మనుగడకు కూడా నమ్మకమే పునాది. అనాదిగా విశ్వగోళమ్మీద జీవించే ప్రతి ప్రాణీ మృత్యువుకు దూరంగా జరగడానికి ప్రయత్నించింది. దిక్కులను పూజించడం, సూర్యుణ్ని ఆరాధించడం, తమ నమ్మకాలకు అనుగుణంగా దైవరూపాల్ని తయారుచేసుకోవడం ఇందులో ఒక భాగమే.

అలాగే చావు తర్వాత వచ్చే కొత్త రూపం, కొత్త జన్మలకు సంబంధించిన చర్చలు, అందుకోసం ముక్తి, సాధన, తపస్సులు, అన్వేషణలు ఇవి ఈనాటి సంఘటనలు కావు.

ఆత్మ శాశ్వతం అని విశ్వసించే మానవజాతి, కొత్త జన్మల కోసం, తమ శవాలని పదిలంగా భద్రపరచుకోవడం జరిగింది. ఈజిప్టులోని మమ్మీలు ఆ ప్రయత్నంలోని ఒక భాగమే. ప్రపంచవ్యాప్తంగా జీవాత్మల కోసం, మానవజాతి ఎంతగా ప్రాకులాడిందో అట్టడుగు చరిత్రలు తిరగేస్తే ప్రతి వారికీ తెలుస్తాయి.

ఆధునిక కాలంలో, సైన్స్ అభివృద్ధి చెందిన ప్రస్తుత దశలో శాస్త్రీయంగా మానవ భౌతికకాయాన్ని, భవిష్యత్తు జన్మలకోసం పదిలంగా భద్రపరచే పద్ధతినే క్రయోనిక్స్ అంటారు. ఒక రకంగా విడమరిచి చెప్పాలంటే ప్రాణంలేని శరీరాన్ని మళ్ళీ మళ్ళీ వాడుకోవడమే!

ఇది నిజమా?

ఇది సాధ్యమా? చైతన్య రహితమయ్యే శవం చైతన్యవంతమవుతుందా? అవుతుందనే శాస్త్రజ్ఞులు నిరంతరం కృషి చేస్తునారు.

క్రయోనిక్స్ గురించి సీరియస్‌గా కృషి చేస్తున్న వ్యక్తి గారెట్ స్మిత్….

బ్రిటన్‌లోని, పుట్నీ నగరానికి చెందిన గారెట్‌స్మిత్, 1979లో రాబోయే జన్మలకు శరీరాల్ని దాచే క్రయోనిక్స్ పద్ధతి గురించి తెలిపే అరుదైన డాక్యుమెంటరీని చూసి, క్రయోనిక్స్ పట్ల ఆకర్షణను పెంచుకున్నాడు.

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈ క్రయోనిక్స్‌కు చెందిన ఒక సంస్థ వుందని తెలిసి అక్కడకు వెళ్ళాడు.

ఆ సంస్థ పేరు ‘ఆల్కోర్’

అక్కడకు వెళ్ళి అక్కడ సైంటిస్టులను సంప్రదించాడు. తన శరీరాన్ని భవిష్యత్ జన్మలకు రిజర్వ్ చేయించుకోవడానికి లక్ష పౌండ్లు ఖర్చవుతుందని (అంటే సుమారు 50 లక్షల రూపాయలు) తెలుసుకుని, అంత డబ్బు ఆయన దగ్గర లేకపోవడంతో, కేవలం నలభై వేల పౌండ్లు మాత్రమే యిచ్చి తల ఒక్కదాన్నే బుక్ చేసుకున్నాడాయన. క్రయోనిక్స్ సంస్థలో సభ్యత్వం పొందిన వ్యక్తులు బ్రిటన్లో చాలమంది వున్నారు. వీరందరూ నెలకొక్కసారి సమావేశం జరుపుకుంటారు.

గారెట్‌స్మిత్ కూడా ఈస్ట్‌బౌర్న్ సిటీలో ‘ఆల్కోర్ యుకె’ అనే సంస్థను స్థాపించాడు. ఈ సంఘ సభ్యులు ఒక చిన్న షెడ్లో కలుసుకుంటారు. అక్కడకు వెళ్తే అన్ని వయసులవాళ్ళూ, అన్ని వృత్తుల వాళ్ళూ మనకు కన్పిస్తారు-ఆల్కోర్ సంఘ సభులు మరణిస్తే వారి శరీరాల్ని అమెరికాలోని ఆల్కోర్ సంస్థకు పంపుతారు. అక్కడ ఆ శవాన్ని భద్రంగా దాని పెడతారు.

ఈస్ట్‌బౌర్న్‌లోని ఆల్కోర్ యుకె సంఘ భవనలోకి వెళితే చాల విషయాలు తెలుస్తాయి. పోర్టబుల్ ఐస్‌బాక్స్, ప్రయింగ్ రాడ్స్ పైన స్టీల్ లాంప్స్, ఆపరేటింగ్ టేబుల్, దాని క్రింద డ్రెయిన్ హోల్, వీటితోపాటు హార్ట్‌లంగ్ మెషిన్, కార్డియాక్ పుల్మోనరీ రిసస్కిట్‌టర్, బ్లడ్‌గాన్ ఎనలైజర్, ఊండ్ కాటెరైజర్, బ్లడ్ కూలింగ్ సిస్టమ్ అన్నీ వుంటాయి.

అసలు మా అయిడియా అంతా ఒకటే! మెదడుకు ఆక్సిజన్ సరఫరా కొనసాగిస్తూనే శరీరాన్ని అతివేగంగా చల్లబరచడం. ఒక విధంగా చూస్తే, ఇదో రకం హార్ట్‌సర్జరీ లాంటిదే… ఇది చేయడం చాలా తేలిక అని అంటాడు గారెడ్.

శవాలను ఒక చోటనుంచి యుంకో చోటికి పంపించడానికి ముందు చాలా తతంగం వుంటుంది.

ప్రాణం పోయాక శరీరం క్రమంగా చల్లబడుతున్నప్పుడు, శరీరంలోని రక్తాన్ని తొలగిస్తూ, దాని స్థానంలోకి క్రియోప్రొటెక్టెంట్‌ను ఎక్కిస్తారు. ఇదో రకం యాంటీ ఫ్రిజింగ్ అన్నమాట. దీనివల్ల మెదడులోని టిష్యూకు ఐస్‌క్రిస్టల్స్ వల్ల నష్టం జరగదు. తర్వాత శరీరాన్ని పొడిఐస్‌లో, నీట్‌గా ప్యాక్ చేస్తారు. అన్నివైపుల నుంచి గాలి చోరని విధంగా వెల్డింగ్ చేస్తారు. దీన్ని ఒక గ్లాస్ ఫైబర్ పెట్టెలో పెట్టి, విమానం ద్వారా కాలిఫోర్నియాకు పంపించేందుకు సిద్దంగా వుంచుతారు. ఇలాంటి పెట్టెల్ని సిద్ధంచేసే నిపుణుడు అలాస్ సింక్లియార్ అనే వ్యక్తి.

నార్వే, ఆస్ట్రెలియా, అమెరికా తదితర ఎన్నెనో దేశాల్లో ప్రయాణించి, అక్కడ విమానాశ్రయాల్లో భ్యాగేజీని హేండిల్ చేసే వారిని పరిశీలించి, ఈ పటిష్టమైన పద్ధతిని ఆయన రూపొందించాడు.

శవాల్ని క్రయోనిక్స్ మార్చే పద్ధతి వుంటుంది…

మానవ శరీరాన్ని మైనస్ 190 డీగ్రీలు సెంటిగ్రేడ్ దగ్గర శీతలీకరించినప్పుడు, మానవ శరీరంలోని టిష్యులేమీ పాడవవని శాస్త్రజ్ఞులు అంచనా, క్రయోనిక్స్‌లో ఈ ఉష్ణోగ్రతకు చాల ప్రాధాన్యం వుంది. శరీరాన్ని నిలవ వుంచే ఉష్ణోగ్రత యిదే – నిలవ వుంచుతున్న ప్రాణం లేని శరీరాన్ని నిలవ వుంచుతున్న ప్రాణం లేని శరీరాన్ని శాస్త్రజ్ఞులు క్రయోనాట్స్ అంటున్నారు. యాస్ట్రోనాట్స్, ఆర్గోనాట్స్‌లాగ అన్నమాట. ఒకవేళ ఆ ఉష్ణోగ్రత ఏమాత్రం తగ్గినా కూడా శరీరంలోని టిష్యూలు పాడైపోతాయి. కణాలు డిహైడ్రెట్ అవుతాయి – కణాల గోడలు వంపులు తిరిగి, పగిలిపోతాయి. అలాంటి నష్టం వాటిల్లితే దాన్ని సరిచేయడం అసాధ్యం అంటారు శాస్త్రజ్ఞులు. అందుకే అసలు నష్టం సంభవించకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలని ప్రయత్నిస్తుంటారు.

ప్రస్తుతం టిష్యూ కణాలను సరిచేసుకోవడం కష్టం అవుతోంది గాని మరో రెండు శతాబ్ధాల కాలం ఆగి చూడండి-అప్పటికి నానో టెక్నాలజీ ఎంతో అద్భుతంగా అభివృద్ధి చెంది వుంటుంది. కణాల స్థాయిలో వుండే మానవ టిష్యూలను ఎప్పటికప్పుడు మరమ్మత్తులు చేయడం, అవసరమైన వాటిని పునర్మించడం శాస్త్రజ్ఞులకు చిటికెలమీద అవుతుందని అంటున్నాడు గారెట్ స్మిత్.

గారెట్ ఊహాలోకంలోకి మనమూ తొంగిచూస్తే, అక్కడ నిజంగా అద్భుతాలే కనిపిస్తాయి. వేలాడుతున్న శరీరాలు-వాటి చుట్టూ ఎందరెందరో శాస్త్రజ్ఞులు. ఆ శరీరాల్లో పాడయిన టిష్యూలకు చకచకా మరమ్మతులు చేస్తూ వుండటమే కాదు, ఆ శాస్త్రజ్ఞులు క్రయోనాట్ శరీరాన్ని యవ్వనవంతం చేస్తుంటారు. అప్పటికే పాడయిన శరీర భాగాలను యిట్టే తొలగించి, వాటి స్థానంలో కొత్తవి అమరుస్తుంటారు. అయినా అదంతా వూహాలోకం-నిజంగా అలా జరుగుతుందా అని అనుమానంగా చూసినా, అమాయకంగా ప్రశ్నించినా గారెట్ నవ్వేస్తాడు.

ఎవరు చెప్పగలరు చెప్పండి? అదే తెలిస్తే యిక మనిషి సాధించలేనిది ఏముంటుంది? అని అంటాడాయన.

మనిషి మృత్యువును జయించగలడా?

ఆత్మలను ఆవాహాన చేసుకోగలడా?

ఇదీ ఈనాటి ప్రశ్న కాదు- సైన్సు రూపంలో ఆలోచన మొదలైన క్షణం నుంచి ప్రతి శాస్త్రవేత్త మదిలో కదులుతున్న ప్రశ్న. గత ముపై సంవత్సరాల కాలాన్ని పరిశీలించి చూడండి. శాస్త్రలోకం సాధిస్తున్న విజయలు మనకు అవగతం అవుతాయి. ఒక్కో గదంత సైజులో వుండే కంప్యూటర్లు క్రమంగా చిన్నదవుతూ, ఇప్పుడు కేవలం అగ్గిపెట్టె సైజులోకి చేరుకున్నాయి. ఇక వైద్యరంగలో చూసినా సరే – డి.ఎన్.ఏ.డబుల్ హెలిక్స్‌ను గుర్తించి, 30 సంవత్సరాలు కాకుండానే శాస్త్రజ్ఞులు, కాన్సర్ కణాలకు టీకాల రూపకల్పనలో వున్నారు – మరి రాబోయే కాలం గురించి బాగా వూహించుకోవడంలో ఆశ్చర్యం ఏముంది?

క్రయోనిక్స్ పేరిట మానవ శరీరాన్ని భద్రపరచడం ఎందుకు? కొత్త ఆత్మలు వాటిలో ప్రవేశిస్తాయని-

నిజంగా ప్రవేశిస్తాయా! మనిషికి ఏడు జన్మలున్నాయని, ఆ ఏడు జన్మల్లో మళ్ళీ మానవ జన్మ ఒకటని మన హిందూతత్వం బోధిస్తోంది. చనిపోయిన మనిషి ఆత్మ మరో శరీరంలోకి ప్రవేశిస్తుందని పునర్జన్మ శాస్త్రం చెబుతోంది.

‘ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలకు సంబంధించిన శాస్త్రవేత్తలను ఈ ప్రశ్న వేస్తే మరణాన్ని జయించడమంటే ఆత్మలను ఆహ్వానించడం మాత్రం కాదు. పోయిన శరీరంలోని ప్రాణాన్ని నిలపడం. ఒకప్పుడు భూగోళమంతా దేవుని సృష్టి. కానీ ప్రస్తుతం ఎన్నెన్నో రసాయనిక చర్యల సమ్మిళితం. మాకు ఈ విషయంలో యాభైశాతం వరకూ విశ్వాసం వుంది. ఇంకొదరికి పదిశాతం కూడా నమ్మకం లేదు’ అని అంటారు.

గారెట్‌స్మిత్ మాటల్లో చెప్పాలంటే – మీరే చెప్పండి ఇప్పుడు చనిపొయిన వ్యక్తి ముందున్న మార్గాలేమిటి? ఖననం, దహనం అంతేకదా! ఈ రెండిటి వల్ల ఏం జరుగుతోంది? అలాంటిదే శవాల్ని భద్రపరచి కూడా ఫ్రీజింగ్ పద్ధతిలో శవాల్ని భద్రపరచడంలో మా ఆశ, మనిషి మృత్యువును జయించగలడనే నమ్మకం.

ఈ నమ్మకం ఇవాళ నిజం కాకపోవచ్చు… ఇంకో వందేళ్ళనాటికయినా నిజం కావచ్చు.

ఇదొక కాంప్లికేటెడ్ ఫెయిత్. చనిపోయిన మనుషులు బ్రతికితే ప్రపంచం పూర్తిగా జనాభా మాయమైపోదూ?

ఇదొక చాలా సందేహాల్లాంటి సందేహామా?

వారం రోజులు గడిచాయి.

ఒరిస్సా అడవుల్లో అరుదైన దేవాలయం బయల్పడితే ఆ విశేషాల కోసం వెళ్ళాడు సత్యబ్రహ్మ.

ఈ వారం రోజుల్లో అతను దిశ కోసం ఎదురుచూశాడు. ఆమె రాలేదు.

అంత ఉత్సాహం చూపిన వ్యక్తి మళ్ళీ తననెందుకు కలుసుకోలేదు?

ప్రయాణం నుంచి రాగానే తనే దిశను కలవాలి అని అనుకున్నాడు  ఆయన.

 

*                      *                      *                      *                      *

 

భువనేశ్వర్‌లోని త్రీస్టార్ హోటల్….

రాత్రి 12-05 నిమిషాలైంది.

దిశతో ఆ రోజు హైద్రాబాద్‌లో తన ఆఫీసులో చర్చించిన దగ్గరి నుంచీ సత్యబ్రహ్మ ఆమె గురించే ఆలోచిస్తున్నాడు.

దిశలో అసాధారణ తెలివితేటలు, మేధస్సు, చురుకుదనం ఆయన్ని ప్రధానంగా ఆకర్షించిన గుణాలు, కానీ ఆమె ఆలోచనలే ఆయనకు కొరుకుడు పడడం లేదు.

ఇరవై ఏళ్ళ అమ్మాయి తత్వశాస్త్రం గురించి జీవాత్మలు, నమ్మకాల గురించి వాదించడమే అతనికి విచిత్రంగా వుంది.

అదే కాకుండా ఆరోజు పబ్లిక్ గార్డెన్స్‌లో తనతోపాటు  మాట్లాడుతూ స్నేహితురాలిని చూసి ముందుకెళ్ళిన దిశ-

ఎండిపోయిన కొమ్మ కిందపడడం ముందుగా చూసి స్నేహితురాలిని హెచ్చరించిందా?

ఆ చప్పుడుని ముందుగా పసికట్టి హెచ్చరించిందా?

ఆ చెట్టుకి వెనకగా నిలబడడం వల్ల ఆ కొమ్మ కిందపడడాన్ని దిశ గమనించడానికి వీల్లేదు.

మరి… ఆ చప్పుడికి ఆమె బ్రెయిన్ ఎలర్ట్ అయిందంటే…

ఆ కొమ్మ కిందపడినా దిశ నుదుట మీద చిన్న గాయం తప్ప మరే ప్రమాదం జరగనందుకు మొదట సంతోషించిన వ్యక్తి సత్యబ్రహ్మ. పజిలయిన వ్యక్తి కూడా ఆయనే.

చేతిలోని బుక్‌ని టీపాయ్ మీద వుంచి నిద్రకుపక్రమించాడాయన.

అప్పటికి రాత్రి ఒంటిగంట దాటింది.

*                      *                      *                      *                      *

సరిగ్గా అదే సమయంలో -

హైదరాబాద్‌లో పంజాగుట్టలోని ఓ లేడీస్ హాస్టల్ రూమ్‌లో గాఢనిద్రలో వుంది దిశ.

ఆమె అప్పటికి నిద్రలోకి జారుకుని అరవై ఎనిమిది నిమిషాలైంది.

లైట్ బ్లూకర్ బల్బులో రూమ్ వింతగా మెరుస్తోంది.

ఎక్కడో ఆకాశంలో ఉరుములు… వరసగా ట్యూబ్‌లైట్లు పగిలి పోతున్నట్టు మెరుపులు… వంటిని పాముల్లా చుట్టేస్తున్న వెలుతురు తీగలు.

పెనువర్షం… సుడిగాలి… గునపాలు కిందకు రయ్ రయ్‌మని దిగుతున్నట్టుగా వర్షపు ధారలు…

ఆకాశంలో….

ఏదో తెల్లటి పక్షి వర్షపు ధారల్ని చీల్చుకుంటూ.. రాక్షసపు రెక్కలను ఆడించుకుంటూ…

సుడిగాలిని తప్పించుకుంటూ పెను విహాంగం… ఆ విహాంగం కళ్ళు తెల్లగా, తెలతెల్లగా భీకరంగా మెరుస్తున్నాయి.

పెను రెక్కల్తో చెట్లను రాసుకుంటూ, క్రీచ్ క్రీచ్‌మని అరుస్తూ పరుగులు తీస్తొంది ఆ ధవళ విహాంగం.

కాటుక చీకటి… మెరుపుల వెలుతురు. ఆ వెలుతుర్లో ఆ విహాంగం రెక్కలు ఒక్కటొక్కటీ వూడి పడిపోతున్నాయి. కొబ్బరాకుల్లా వున్న ఆ రెక్కలు సుడిగాలిలో గింగుర్లు కొడుతున్నాయి.

దూరంగా నల్లటి కొండలు.. అంతెత్తున ఆకశంలోకి చొచ్చుకు పోయిన కొండలు…

మరో క్షణంలో…

ఆ ధవళ విహాంగం ఆ కొండల్లో ఒక కొండకు బలంగా ఢీకొని క్రీచ్ క్రీచ్‌మని అరిచింది.

కొండను బలంగా డీకొనడం వల్ల ఆ పెనుపక్షి మెడమీద బలంగా గాయం తగిలింది.

నల్లటి చీకట్లో ఎర్రటి నెత్తురు… చివ్వున చిమ్మిన నెత్తురు… వర్షపు ధారల్లో కలగలసి పోయిన నెత్తురు.

చివ్వున చిమ్మిన ఆ నెత్తురు బిందువులు తన మొహంమీద పడినట్టు అవడంతో…

కెవ్వుమని కేకవేసి కళ్ళిప్పింది దిశ.

ఒక్కక్షణం తనెక్కడుందో ఆమెకు అర్థంకాలేదు.

దట్టమైన నీలపు వెలుతురు కళ్ళముందు ప్రత్యక్షం కావడంతో ఆమె యదార్ధస్థితికి వచ్చింది.

గబుక్కున లేచి కూర్చుంది.

అలసటతోనూ, ఆయాసంతోనూ, భయంతోనూ ఆమె శరీరం కంపించడం ఆమెకు తెలుస్తూనే వుంది.

గబుక్కున టేబుల్ లైటు వేసి గోడ గడియారం వేపు చూసింది,

సరిగ్గా ఒకటి ముప్పై నిమిషాలు.

తనను తాను కుదుటపరచుకోడానికి ఆమెకు పదిహేను నిమిషాలు పట్టింది.

ఆ తర్వాత..

నెమ్మదిగా తనకొచ్చిన కలను జ్ఞాపకం చేసుకోడానికి ప్రయత్నించిందామె.

తెల్లటి పెద్ద పక్షి…

ఉరుములు… మెరుపులు… ఒక్కొక్క రెక్క వూడి కిందపడిపోతున్న భయానక దృశ్యం.

ఎప్పుడు ఎలాంటి కలవచ్చినా డైరీలో నోట్ చెయడం దిశ అలవాటు.

వెంటనే టేబుల్ మీదున్న డైరీని అందుకుని రాయడం ప్రారంభించింది.

పదినిమిషాలు గడిచాయి.

రాస్తూ రాస్తూ పక్కకు చూసిన ఆమెకు పక్క పేజీలో ఉదయాన్నే రాసుకున్న ఎడ్రస్ కనిపించింది.

ఏవో పనుల వత్తిడిలో వారం రోజులపాటు సత్యబ్రహ్మను కలవలేకపోయిన దిశ ఆయన్ని కలవడం కోసం ఉదయాన్నే సత్యబ్రహ్మ ఇంటికి ఫోన్ చేసింది.

ఒరిస్సా వెళ్ళారని జవాబు రావడంతో ఆయనతో ఫోన్లో అయినా మాట్లాడుదామని అక్కడి అడ్రస్ తీసుకుంది.

సత్యబ్రహ్మ— హోటల్ ఉత్కళ్-భువనేశ్వర్!

ఆ పక్కన హోటల్ ఫోను నెంబరు.

ఆ ఫోను నెంబరు వైపు తదేకంగా చూస్తున్న దిశకు హఠత్తుగా మెదడులో ఏదో మెరుపు మెరిసినట్టయింది.

తనకొచ్చిన కలను విశ్లేషించడం ప్రారంభించింది.

ధవళ విహంగం… ఉరుములు… మెరుపు…

ఉదయాన్నే సత్యబ్రహ్మ ఇంటికి ఫోను చేసిన తర్వాత తను చేసిన పనులు… కలసిన వ్యక్తుల్ని గుర్తుకు తెచ్చుకుంది.

ప్రతి కలకూ ఒక కారణం వుంటుంది. ఆ కారణం కోసమే ఆమె అన్వేషిస్తోంది.

తనకీ కల రావడానికి కారణం?

సరిగ్గా ఆ సమయంలో ఆమెకు జ్ఞాపకం వచ్చింది సత్యబ్రహ్మ ఇంట్లో వ్యక్తి చెప్పిన జవాబు.

“ఇవాళ లేట్ నైట్ ప్లైట్‌లో ఆయన బయలుదేరి రావచ్చు…”

లేట్ నైట్ ప్లైట్!

అంటే భునేశ్వర్‌లో ఆ ప్లైట్ ఎన్ని గంటలకు బయలుదేరుతంది?

ఆ ప్రశ్న తలెత్తగానే దిశ ఒక్క ఉదుటున బెడ్‌మీంచి కిందకు దూకి రూంలోంచి బయటికొచ్చి-

ఆఫీసు రూలోకి పరుగెత్తింది.

వెంటనే ఫోన్ అందుకుని హైదరాబాద్‌లోని ఎయిర్‌పోర్ట్‌కి ఫోను చేసింది.

“భువనేశ్వర్ నుంచి హైదరాబద్ వచ్చే ప్లయిట్ భువనేశ్వర్‌లో ఎన్ని గంటలకు బయలుదేరుతుందో చెప్పగలరా?”

దిశలో ఏదో టెన్షన్!

“టూ థర్టీ…? రిసీవర్‌లోంచి జవాబు వినిపించగానే ఆమె చూపులు చట్టుక్కున గోడ గడియారంవైపు తిరిగాయి.

అప్పుడు సమయం సరిగ్గా ఒంటిగంట యాభై నిమిషాలు.

“కరెక్టు టైంకి ప్లయిట్ హైదరాబాద్ వస్తుందంటారా?”

ఆ ప్రశ్నకు ఎయిర్‌పోర్ట్‌లోని ఆపరేటరు చిన్న నవ్వు నవ్వింది.

“చెప్పలేం మేడమ్… ప్రస్తుతం భువనేశ్వర్లో వెదర్ బాగులేదు..”

“వెదర్ బాగాలేదా? అంటే.. తుఫానా? ఉరుములు.. మెరుపులు.”

దిశ ఏం మాట్లాడుతోందో ఆమెకు తెలీదు. ఆమె మాటల్ని విచిత్రంగా వింటోంది ఆపరేటరు.

మరో ప్రశ్న వేయకుండానే ఫోనుకట్ చేసి టెలిఫోన్ ఎక్సేంజ్‌కి ఫోను చేసింది. లేడీ ఆపరేటరు లైన్లోకొచ్చింది.

“అర్జంట్ కాల్ టు భువనేశ్వర్…. హోటల్ ఉత్కళ్” ఆందోళనగా చెప్పింది దిస.

నిమిషాలు గడుస్తున్నాయి.

దిశ ఉచ్చ్వాస, నిశ్వాసలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

ఆమె మనసులో ఏదో భయం… పాము తనను తాను చుట్టుకుంటున్నట్టుగా .. సత్యబ్రహ్మకు ఏదో ఆపద వాటిల్లబోతోంది.

ఆ ఆపదనుంచి ఆయనను రక్షించాలి… ఎస్.ఐ… మస్ట్ సేవ్ హిమ్…

ఒకటి… రెండు… మూడు.. నాలుగు…

నరాల్లో పెరుగుతున్న రక్తచలనం….

అంతలోనే ఆమెకో సందేహం. తనకొచ్చిన కలకూ, సత్యబ్రహ్మకు వాటిల్లబోయే ఆపదకు ఏమిటి సంబంధం?

తను తొందరపడుతోందా?

లేదు.. లేదు.. తనకొచ్చిన కల నిజంకాక తప్పదు.  అందుకు… అందుకు.. ఏకైక సాక్ష్యం…

ఆ సమయంలో భువనేశ్వర్‌లో కూడా వర్షం. వెదర్ బాగోలేదు.

అది కాకతాళీయం కావచ్చు. ఆమెలో ఉదయించిన మరో ప్రశ్న…

ఆమె ఆలోచనలను పక్కకు నెట్టేస్తూ…

అంతలో గణగణమంటూ ఫోన్ మోగడంతో రిసీవరు అందుకుంది దిశ.

“హోటల్ ఉత్కళ… మాట్లాడండి” ఆపరేటరు లైన్ యివ్వడానికి పూర్తిగా ఒక్కక్షణం సమయం కూడా పట్టదు.

*                      *                      *                      *                      *

సత్యబ్రహ్మ టై సర్దుకుంటూ నిలివెత్తు మిర్రర్‌లో చూసుకున్నాడు.

ఆ సమయంలో అతను-

అకస్మాత్తుగా వచ్చిన ఉధృతమైన వర్షం గురించే ఆలోచిస్తున్నాడు. క్షణక్షణానికి పెరిగిపోతున్న వర్షం.

మరో సమయలో అయితే అతను ఆ ప్రయాణాన్ని వాయిదే వేసుకునేవాడు కానీ…

మర్నాడు మార్నింగ్ పదిగంటలకు హైదరాబాద్‌లో ఒక ఇంపార్టెంట్ మీటింగ్‌కి హాజరవ్వాల్సిన అవసరం వుంది.

అప్పటికే రెండుసార్లు ఎయిర్‌పోర్ట్‌కి ఫోను చేశాడు. ప్లయిట్ బయలుదేరుతుందో లేదోనని తెలుసుకోవడం కోసం.

“ప్లయిట్ ఎట్టి పరిస్థితుల్లోనూ బయలుదేరుతుంది సార్! ఎందుకంటే ఆంధప్రదేశ్ కు చెందిన హోంమినిస్టరు ఆ ప్లయిట్‌లోనే వెళుతున్నారు.”

వర్షంలోనే ప్రయాణం చెయ్యడమంటే సత్యబ్రహ్మకు చికాకు.

రిస్ట్ వాచీవైపు చూసుకుని సూట్‌కేస్ అందుకుని రూమ్‌లోంచి బయటకు వెళ్ళబోతూ-

అప్పుడే నిశ్శబ్ధాన్ని చీలుస్తూ వినిపించిన ఫోనువైపు ఒకసారి చూసి టీపాయ్ వైపు అడుగులు వేసి రిసీవరు అందుకున్నాడు.

“ఎస్” ఆయన గొంతు గంభీరంగా వుంది.

“సర్.. నేను.. దిశ.. ఫ్రమ్ హైదరాబాద్…” దిశ పేరు వినగానే ఉలిక్కిపడ్డాడు సత్యబ్రహ్మ.

ఈ సమయంలో దిశ నుంచి ఫోను. అందునా హైదరాబాద్ నుంచి తన్నిక్కడునట్టు ఆమెకెలా తెలిసింది?

“సార్! మీరు రెండు నిమిషాలు మాట్లాడకండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి.. ఓ.కె! మీరీ ప్లయిట్‌కి భువనేస్వర్ నుంచి బయలుదేరి హైదరాబాద్ వస్తున్నారా?”

“అవును!”

“నో ప్లీజ్ డోంట్ కమ్.”

“వై… వై… మిస్ దిశ.. వాట్ హేపెండ్? ఆయన గొంతులో ఏదో తెలియని అశ్చర్యం.. ఉద్వేగం.

“ఆ ప్లయిట్‌కి ప్రమాదం జరగబోతోంది. ఆ ప్లయిట్ వర్షంలో చిక్కుకుని… ప్లీజ్ సార్! నా మాట వినండి. ప్లీజ్ కేన్సిల్ యువర్ జర్నీ, కమ్ టుమారో మార్నింగ్ సార్!”

సత్యబ్రహ్మకు దిశ ఏం చెప్తొందో ఒక్క మాట కూడా అర్ధం కాలేదు.

“నో మోర్ డిస్కషన్స్ సర్… ప్లీజ్ ట్రస్ట్ మీ.. డొంట్ గో ఇన్ టు డేంజర్… ఐ విల్ టెల్ యూ… ఎవ్విరిథింగ్… ఓ.కె! సార్!” టక్‌మని ఫోను కట్ అయ్యింది.

ఒక్కసారి సత్యబ్రహ్మ బ్రెయిన్ మొద్దుబారి పోయింది.

తను ప్రమాదంలో ఇరుక్కుంటున్నాడా? ఎక్కడో హైదరాబాద్‌లో వున్న దిశకు ఆ విషయం ఎలా తెలిసింది?

తనసలు ఎలాంటి ప్రమాదంలో ఇరుక్కుంటున్నాడు?

రెండే రెండు క్షణాలు ఆలోచించాడు సత్యబ్రహ్మ.

తను హైదరాబాద్‌లో జరిగే మీటింగ్‌కి ఎటెండ్ కావాలి, తప్పదు. ఒక పక్క దిశ హెచ్చరిక గురించి ఆశ్చర్యపోతూనే రూమ్‌లోంచి బయటికొచ్చి.

పోర్టికోలో టాక్సీ ఎక్కాడు.

వర్షం.. పెనుతుఫానుగా మారిన వర్షం…

రోడ్లమీద వరదలై పారుతున్న మారిన వర్షం… రోడ్డుకు అడ్డంగా పడిపోయిన చెట్లు…

అంతా చీకటి… కటిక చీకటి

అంతటి పెనుతుఫానుని సత్యబ్రహ్మ కూడా జీవితంలో చూడలేదు.

పది నిమిషాల్లో వెళ్ళాల్సిన టాక్సీ ఎయిర్‌పోర్టుకి చేరడానికి ముప్పై నిమిషాలు పట్టింది.

టాక్సీలోంచి సూట్‌కేస్‌తో దిగి ఎయిర్‌పోర్టులోకి అడుగుపెట్టాడు సత్యబ్రహ్మ.

 

*                      *                      *                      *                      *

            హైదరాబాద్…

రాత్రి మూడు గంటలైంది… నాలుగు గంటలైంది.

తన రూమ్‌లో వంటరిగా కిటికీలోంచి చీకట్లో బ్లాక్ పెయింటింగ్‌లా కనిపిస్తున్న చెట్లవైపు కూర్చుంది దిశ.

ఆమెకు ఎప్పుడు నిద్రపట్టిందో తెలీదు.

రూమ్‌లో ఏదో చప్పుడు కావడంతో గబుక్కున కళ్ళిప్పి చూసిందామె…

ఎదురుగా టేబుల్‌మీద, పుస్తకాల వెనక ఏదో ఒక వస్తువు కదులుతున్న వింత చప్పుడు.

ఆ చప్పుడు టేబుల్‌కి ఒక పక్కనున్న తెల్లటి గ్లాస్ చిన్నగా శబ్దం చేస్తోంది.

ఆ చప్పుడుకి ఉలిక్కిపడింది దిశ.

కూర్చున్న కుర్చీలోంచి చికాగ్గా లేచి నిలబడింది. ముందుకడుగు వేసింది.

*                      *                      *                      *                      *

 

“ఏం దిశా… అర్ధరాత్రి ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావ్?” పీలగొంతుతో పాటు భారీ ఆకారం రూమ్‌లోకి రావడంతో డోరువైపు చూసి పెదవుల మీద నవ్వును పులుముకుంది దిశ.

వచ్చిన ఆమె భ్రమరాంబ- హాస్టల్ వార్డెన్.

“ఇంపార్టెంట్ మెసేజ్ మేడం! భువనేశ్వర్ ఫోను చెయ్యాల్సి వచ్చింది…” ఆ మాట చెపుతూనే సడన్‌గా సత్యబ్రహ్మ జ్ఞాపకం రావడముతో గబుక్కున ఆఫీస్ రూమ్‌లోకి పరుగెత్తి అక్కడ టేబుల్ మీద పడి వున్న డైలీ పేపర్ని అందుకుని గబగబా తిరగేసింది.

పేపర్లో తనకు కావల్సిన వార్త కనిపించకపోవడంతో ఆమె ముఖం వివర్ణమయి పోయింది.

“వాట్ దిశా? ఏంటి అంత సీరియస్‌గా పేపర్‌ని చూస్తున్నావ్?” ఆమె వెనకే వచ్చి ఆమె ముఖంలోకి సీరియస్‌గా చూస్తున్న వార్డెన్ భ్రమరాంబ వైపు చికాగ్గా చూసింది దిశ.

“భువనేశ్వర్ నుంచి వచ్చే ప్లయిట్ యాక్సిడెంట్ న్యూస్ కోసం”

అలా చెపుతున్న దిశను విచిత్రంగా చూసిందామె.

“ఏక్సిడెంట్ న్యూస్ కోసమా? యాక్సిడెంట్ జరిగిందా? జరుగుతుందా?” జోక్‌గా అడిగిందామె. దిశ తనకొచ్చిన ఒకటి రెండు కలల గురించి కొన్నిసార్లు ఆమెక్కూడా చెప్పడం జరిగింది.

“చూడు దిశా! సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్ళమని నీకు ఎప్పుడో చెప్పాను. వెళ్ళావా?” టాపిక్ మారుస్తూ అందామె.

పేపర్లో ప్లయిట్ యాక్సిడెంటు న్యూస్ ఎందుకు లేదో దిశకు అర్థం కాలేదు.

ప్లయిట్ యాక్సిడెంటుకు గుర్తుకాలేదా?

లేదు… తనకొచ్చే కలలు అవాస్తవాలు కావు.

పేపర్‌కి ఆ న్యూస్ అందలేదేమో.

ఆ ఆలోచన రావడంతోనే టెలిఫోను వైపు అడుగులు వేసి రిసీవర్ అందుకోబోతూ అప్పుడే పేపరులో లోనికొస్తున్న పేపర్ బోయ్‌ని చూసి ఆగి పోయింది.

“పేపర్ లేట్ మేడం” వార్డెన్ చేతిలో పేపరు పెట్టి వెనుదిరిగి వెళ్ళిపోయాడు పేపర్ బోయ్.

దిశ చేతిలోని క్రితం రోజు పేపరు కిందకు జారిపోయింది.

వెంటనే వార్డెన్ చేతిలోని పేపరుని తీసుకుని మడతలు విప్పింది. ఫస్ట్ పేజీలో క్రింద-

‘నిట్టనిలువున కూలిన విమానం

హోంమంత్రితో పాటు అరవైమంది మృతి’

ఆ వార్తను చూడగానే దిశ చూపులు ఆ అక్షరాల వెంబడి పరుగులు తీశాయి.

అరవైమంది మృతుల్లో ఇరవైమంది శవాల్నే అధికారులు గుర్తుపట్టారట వాళ్ళ పేర్లే ప్రచురించారు.

మిగతా వ్యక్తులు శవాలను పోలికబట్టే ప్రయత్నంలో వున్నారట అధికారులు.

అంటే…

సత్యబ్రహ్మ తను చేసిన వార్నింగును నమ్మలేదా? అంటే సత్యబ్రహ్మ…

మరింక ఆలోచించలేకపోయింది దిశ.

ఆమె కళ్ళంట చివ్వున కన్నీళ్ళు చిమ్మాయి.

దిశ పరిస్థితి ఏం అర్థంకాని భ్రమరాంబ ఆమెవైపు అయోమయంగా చూస్తోంది.

“ఏంటమ్మాయ్… ఏం జరిగింది?” ప్రశ్నించింది భ్రమరాంబ.

జవాబు చెప్పలేకపొయింది దిశ. టెలిఫోను వైపు నడవబోయి అక్కడ టెలిఫోను పక్కన కన్పించిన ఒక జంతువును ఆశ్చర్యంగా చూసింది.

పిల్లి! తెల్లటి శరీరం మీద బూడిదరంగు గీతల పిల్లి!

ఆ పిల్లిని దిశ చూడడం అదే మొదటిసారి.

ఆ పిల్లి పిల్లిలా లేదు- చిన్నసైజు చిరుతపులిలా పొడవుగా వుంది.

పదినిమిషాల క్రితం తన రూంలో టేబుల్ మీదున్నది ఈ పిల్లేనా?

దిశ ముందుకు నడవడంతో టేబుల్ మీదున్న పిల్లి చెంగున కిందకు దూకింది.

సరిగ్గా అదే సమయంలో-

ఫోను గణగణమని మోగడంతో వెంటనే అందుకుంది దిశ.

“హలో… ఈజిట్ లేడీస్ హాస్టల్?”

“ఎస్… ప్లీజ్!”

“కెన్ ఐ  స్పీక్ టు మిస్ దిశ…”

ఆ గొంతును గుర్తుపటడంతో కెవ్వుమని అరిచి- “సార్… హౌ ఆర్యూ సార్? ఎక్కడ్నించి?” దిశ గొంతునిండా నిండిపోయిన ఉద్వేగం.

డోన్ట్‌వర్రీ! నువ్వు కంగారు పడుతుంటావనే ఫోను చేశాను. అయాం ఆల్‌రైట్!”

సత్యబ్రహ్మ గొంతులో కృతజ్ఞత.

“ఎక్కడ్నుంచి మాట్లాడుతున్నారు సార్?” అడిగిందామె.

“భువనేశ్వర్ నుంచి. నీకీ విషయం చెప్పాలనీ, నీతో మాట్లాడాలని పావుగంట నుంచి ట్రై చేస్తున్నాను” చెప్పాడాయన.

“పావుగంట నుంచి ట్రై చేస్తున్నారా?” ఆశ్చర్యంగా భ్రమరాంబ వైపు చూస్తూ అడిగింది దిశ.

“ఎస్ బేబీ! మధ్యాహ్నం ప్లయిట్‌కి వస్తున్నాను. ఓ.కే?” ఫోను కట్టయ్యింది.

రిసీవర్ని క్రెడిల్ మీద వుంచుతూ అడిగింది దిశ..

“మన ఫోను ఉదయం నుంచీ ఖాళీగానే వుంది కదూ?”

“ఎస్ బేబీ!”

“మరి పావుగంట నుంచీ మన ఫోను అస్సలు మోగలేదట?”

“ఫోను మోగలేదా? మా డాలీ రిసీవర్ని డిస్ట్రబ్ చేసిందేమో”

డాలీ అంటే?”

“అదే దిశా! మా పిల్లి… ఆస్ట్రేలియా నుంచి మా కజిన్ వచ్చాడన్నాను కదూ! వాడు తెచ్చిందే అది. ఆస్ట్రేలియన్ రేర్ బ్రీడ్. చాలా అందంగా వుంది కదూ?” కిందనున్న డాలీని ఎత్తుకుని చేతితో రాస్తూ అంది భ్రమరాంబ.

తను పేపరు చూస్తున్నప్పుడు డాలీ ఫోను పక్కనే వుండడం తను స్పష్టంగా చూసింది.

డాలీ.. ది రేర్ బ్రీడ్… ఆస్ట్రేలియన్ క్యాట్!

డాలీ కళ్ళవైపు తేరిపార చూసింది దిశ-దిశను చూసిన డాలీ మ్యావ్ మ్యావ్‌మని అరిచింది.

ఆ అరుపు మామూలు పిల్లులు అరిచే అరుపులా లేదు. గుడ్లగూబ అరుపులా వింతగా, విచిత్రంగా వుంది.

కొన్ని క్షణాలయ్యాక-

చేతిలోని డాలీతో ముందుకు అడుగేసింది భ్రమరాంబ.

డాలీ కళ్ళలోకి సూటిగా, అయోమయంగా, అనుమానంగా చూసింది దిశ.

*                      *                      *                      *                      *

తిరుపతి…

ఇంకా పూర్తిగా చంద్రోదయం కాలేదు. ఏడుకొండల మీద విద్యుత్ దీపాల వెల్లువ, వెలుతురు ప్రవాహంలా వుంది.

కొండమీద నుంచి స్పీకరులోంచి వినిపిస్తున్న తిరుమలేశుని సుప్రభాత గీతికలు కొండ లోయల్లో ప్రతిధ్వనిస్తున్నాయి.

ఆ తిరుమల కొండలకు-

అయిదుకిలోమీటర్ల దూరంలోని పాపనాశనం తీర్ధం ఆ సమయంలో నిర్జనంగా వుంది.

ఆ పక్కన-

కొండమీద నుంచి దూకుతున్న జలపాతపు హోరు మృదంగ ధ్వనులను మరపింప చేస్తున్నాయి.

ఆ ప్రవాహ ధారల జలపాతం కింద-

ఒక యువకుడు కఠోర తపస్సు చేస్తున్న మునిలా మఠం వేసుకుని కూర్చున్నాడు.

పటిష్టమైన శరీరం, బలమైన కండలు, తెల్లటి దేహఛాయ.

అతడు ఏకాగ్రతతో ఒక మంత్రాన్ని ఉచ్ఛరిస్తున్నాడు. ఆ మంత్రోచ్ఛారణ ఆ జలపాతవు హోరులో కలసిపోతుంది.

 

“క్షీణేంద్రి యస్య జీర్ణస్య, సంప్రాప్తోత్ర్కమణస్యచ

ఆస్తి జీవితు మేవా శాస్వాత్మా ప్రియతమో యతః”

 

(ఇంద్రియశక్తి క్షీణించినను, కరచరణాదుల శక్తి తగ్గిపోయినను, పండు ముసలి అయినను, మరణోన్ముఖుడై వున్నను ప్రతి వ్యక్తీ యింకా జీవించాలని కోరుతున్నాడు. కావున ప్రతి ప్రాణికి ఆత్మయే ముఖ్యం.)

ఆత్మకు సంబంధించిన ఆదిశంకరాచార్యుల ఉక్తిని మంత్రంగా పఠిస్తున్న ఆ యువకుని గొంతు గంభీరంగా వుంది.

పావుగంట గడిచింది.

చెట్ల ఆకుల్లొంచి దూసుకొస్తున్న వెన్నెల అతని శరీరం మీద పడి వింతగా మెరుస్తోంది.

కళ్ళిప్పి పరిసరాల వైపు చుట్టూ చూసి స్నానం ముగించుకొని వడ్డుకొచ్చాడు.

చీకటి పోదల్లోకి నడిచాడు.

ఆ పొదల మాటున జిప్సీ జీపు – ఆ జీపు ఫ్రంట్ సీట్లో వున్న టర్కీ టవల్‌ని తీసుకొని-

వల్లంతా తుడుచుకుని, వంటి మీద పంచెను తీసి వెనక సీట్లోంచి విసిరేసి-

బ్రీఫ్‌కేస్‌ని ఓపెన్‌చేసి, లైట్ బ్లూ కలర్ సూటును అందుకున్నాడు.

మరో అయిదు నిమిషాలు గడిచాయి.

డ్రస్ వేసుకున్నాక నాలుగువైపులా ఒకసారి చూసి జీపెక్కాడు.

ఇగ్నీషన్ కీ తిప్పాడు…

మరోక్షణంలో జీపు ఆ ప్రాంతం నుంచి బయటపడి, కొండలోదిగి, గంట తర్వాత ఒకచోట మలుపు తిరిగి తలకోన ఆడవులకేసి దూసుకుపోసాగింది.

ఆ యువకుడు అప్పుడప్పుడు ఆ జలపాతం దగ్గరికి వస్తాడు…. వెళతాడు.

ఆ యువకుని పేరు సవ్యసాచి…

రోడ్డు పాయింట్‌కు దాదాపు అరవై కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవి మార్గంలో పరుగులు తీస్తోంది జీపు.

సరిగ్గా నలభై నిమిషాలు గడిచాయి.

జీపు హెడ్‌లైట్ల కాంతిలో దూరంగా ఓ పురాతన భవనం మసక మసకగా కనిపిస్తోంది.  దానిముందు అప్రమత్తంగా పహరా కాస్తున్న గార్డ్స్.

ఆ భవనంలోకి సవ్యసాచి జీపు ప్రవేశించిన మరుక్షణం ఆ భవనపు గేట్లు మూసుకుపోయాయి.

 

*                      *                      *                      *                      *

 

మూడువైపుల, కొండలమధ్య రహస్య ప్రాంతంలో వున్న ఆ విశాల భవనం, ఒకప్పుడు కార్వేటి నగరం రాజుల విలాస మందిరం.

కానీ ప్రస్తుతం మృత్యువుతో సవాల్ చేయడానికి పూనుకున్న యువ మేధావుల పోరాట సీమ….

బిల్డింగ్ మొత్తం సెంట్రల్లీ ఎయిర్ కండిషన్ చేయబడి వుంది. హాలు దాటి లోపలకు వెళితే విశాలమైన గ్లాస్ రూమ్. ఆ గ్లాస్ రూమ్‌లో తెల్లటి యూనిఫార్మ్స్‌లో యువ సైంటిస్టులు తమ పనుల్లో మునిగి వున్నారు.

సవ్యసాచి సారధ్యంలో వెలిసిన అదొక మరో ప్రపంచం…

కొన్ని యుగాలుగా మనిషికి, ప్రకృతికి జరుగుతున్న యుద్ధంలో, మానవ జీవితం పరిధిని పెంచడానికి శాస్త్రీయంగా కృషి జరుగుతున్న ప్రదేశం అది. ఆత్మలను ఆహ్వానించడానికి, శవాలను భద్రపరిచే క్రయోనిక్స్ సంస్థ ఆ తిరుపతి ప్రాంతలో వుందనే విషయం దేశంలోని శాస్త్రజ్ఞలకే కాదు, ప్రభుత్వానికి కూడా తెలీదు.

బయట ప్రపంచానికి వనమూలికల పరిశోధన కోసం అడవిలో వెలిసిన సంస్థ అది.

ఆ సంస్థ పేరు ‘మృత సంజీవని’

వనమూలికలతో ఆ సంస్థ ఎలాంటి ప్రయోగాలు చేస్తోందో తెల్సుకోవడానికి కొంతమంది పత్రికా విలేఖరులు తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటి తమ అసలైన పరిశోధనల విషయం పత్రికలకు తెలియకుండా సవ్యసచి వేయి కళ్ళతో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

ప్రాచీన సంస్కృత సాహిత్యంలో అపారమైన పరిచయమున్న సవ్యసాచి పెద్ద డాక్టరని, అక్కడ పనిచేస్తున్న సైంటిస్టులను తప్ప మరెవ్వరికీ తెలీదు. బయో కెమిస్ట్రీలో కూడా అతను గొప్ప నిపుణుడు. అమెరికా, ఇంగ్లాండ్ లోని అతి పెద్ద హాస్పిటల్స్‌లో కొన్ని సంవత్సరాలు పనిచేసి, అపారమైన అనుభవాన్ని గడించిన మేధావని కూడా చాలా తక్కువమందికే తెలుసు. మృత్యువుకి సమీపంగా వెళ్ళబోయిన ఎందరో రోగగ్రస్తుల్ని తన మేథస్సుతో బ్రతికించిన అతి గొప్ప అంకిత భావమున్న మానవతావాది అతను. అయిదేళ్ళ క్రితం మృతసంజీవని సంస్థ ప్రారంభ సమయంలో సవ్యసాచి ఒక్కడే! ప్రస్తుతం అతనితోపాటు అపారమైన అనుభవమున్న అయిదుగురు డాక్టర్లు, బయాలజిస్టులు, పేథాలజిస్టులు, సర్జికల్ ఆపరేటర్స్- మెడికల్ ఇంజనీర్స్- కంప్యూటర్ ఆపరేటర్స్- లెదర్ కంట్రోల్ టెక్నీషియన్స్- ఎలక్ట్రీషియన్స్- కెమికల్ ఇంజనీర్స్- వంటవాళ్ళు- డ్రైవర్స్- పనివాళ్ళు- ఆటోమోబైల్ మెకానిక్స్ – ఫైనాన్షియల్ కన్సల్‌టెంట్స్- సిస్టర్స్- కాంపౌండర్స్- ఫీల్డ్ వర్కర్స్ వున్నారు.

అందరూ కలిసి సుమారు 120 మంది దాక వుంటారు.

ఆ అందరి ధ్యేయమూ, పట్టుదలా ఒక్కటే… చనిపోయిన మనిషిని ఎప్పటికైనా తిరిగి బతికించే శాస్త్రానికి ఊపిరి పోయటం.

ఆ 120 మంది తమ వ్యక్తిగత సుఖాల్ని, ఆశల్ని, ఆశయాల్ని, ఆ సంస్థలో చేరేముందే త్రికరణశుద్ధిగా త్యాగం చేశారు. బయటి ప్రపంచంతో సంబంధాలను త్రుంచేసుకున్నారు.

చనిపోతే వారు కూడా అక్కడే క్రయోనిక్స్‌గా మారిపోతారు. మార్చబడతారు తప్ప- వేరే అలోచనే వారి మదిలోకి రాదు.

వారందరూ క్రమశిక్షణ గల సైనికుల్లా- తమ కమాండర్ డాక్టర్ సవ్యసాచి కనుసన్నలలో మెదులుతుంటారు. ఆయన మాటంటేనే వారికి వేదవాక్కు.

ప్రాణం వదులుకోవటానికైనా సిద్ధపడతారు తప్ప, తాము ఏపనిమీద నిమగ్నమై వున్నది చెప్పరు.

అదంతా మృతసంజీవని సైన్యం..

అదంతా ఏకవ్యక్తి సైన్యం..

అదంతా సవ్యసాచి సైన్యం..

సవ్యసాచి కోసం- ఆ సంస్థ కోసం వాళ్ళు ఏదైనా, ఎప్పుడైనా చేయటానికి సంసిద్ధంగా వుంటారు. ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కోటానికి అప్రమత్తంగా వుంటారు. బయటి ప్రపంచానికి మాత్రం వాళ్ళు ఆయుర్వేదం పై రీసెర్చ్ చేస్తూ దాని తాలూకు వనమూలికల్ని సేకరించే బృందంగా కనిపిస్తారు.

విశాలమైన గ్లాస్ రూమ్ తెరుచుకుని లోపలకి అడుగుపెట్టాడు సవ్యసాచి. లోపల ఎడం ప్రక్కన వరసగా గ్లాస్ క్యూబిక్స్‌లో ఒకచోట ఒక యువ సైంటిస్టు కంప్యూటర్ ముందు కూర్చుని తన పరిశోధన వివరాలను కంప్యూటరులోకి ఫీడ్ చెస్తున్నాడు.

మరొక క్యూబ్‌లో రకరకాల అడవి పక్షుల మృత దేహాలను ఇంకొక సైంటిస్తు పరిశీలిస్తున్నాడు.

అదొక నిశ్శబ్ద వాతావరణం…

సవ్యసాచి ముందుకు నడిచి ఓ గ్లాస్‌క్యూబ్, గ్లాస్ డోరుని మునివేళ్ళతో తట్టాడు. లోపల -

తన పనిలో నిమగ్నమై వున్న డా!!విజేత తల తిప్పి చూసింది. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే విజేత ముఖం సీరియస్‌గా వుండడంతో సవ్యసాచి డోర్ తెరుచుకుని లోపలకు అడుగువేశాడు.

“వాట్ హేపెండ్ డా!! విజేతా! ఎనీథింగ్ ప్రాబ్లం…?” సవ్యసాచి గొంతులోంచి వచ్చిన ఆ మాటకు వెంటనే జవాబు చెప్పలేకపోయింది డా!!విజేత

దీర్ఘంగా నిట్టూర్చిందామె. ఏ.సి. రూమ్‌లో వున్నా, ఆమె నుదుట మీద చెమట ట్యూబ్‌లైట్ వెలుగులో మిలమిలా మెరుస్తోంది.

డా!!విజేత ముందున్న విశాలమైన టేబుల్‌వైపు దృష్టి సారించాడు సవ్యసాచి.

*                      *                      *                      *                      *

రూమ్ మధ్యలో పొడవాటి టేబుల్ మీద రకరకాల గాజు వస్తువులున్నాయి.

డా!! విజేత ఒక పక్కనున్న కిడ్నీ మిషన్‌పై కనిపిస్తున్న ఆర్టిఫిషియల్ లిక్విడ్ క్రిస్టల్స్‌ను సరిచేస్తోంది.

టెబుల్ మీద ఒక పక్కన రెండురోజుల క్రితం అడవి నుంచి తెచ్చిన తెల్లటి కుందేలు పిల్ల- ప్రస్తుతం ఆ కుందేలు మృతజీవి.

ఆ కుందేలుని బెడ్‌మీద పడుకోబెట్టింది డా!! విజేత.

దాని కడుపు, చాతీ నీట్‌గా షేవ్ చేయబడ్డాయి. ఆ భాగమంతా తెల్లటి బ్యాండేజీలతో కట్టబడి వుంది. ఆర్టిఫిషియల్ లంగ్ రెస్పిరేటర్‌తో ఆ కుందేలు ఊపిరితిత్తులు మెల్లగా పనిచేస్తున్నాయి.

రెండు మూడు టెస్ట్లు చేశాక..

“పల్మొనరీ ఎడెమా లేదు” అని చెప్పింది విజేత తల పక్కకు తిప్పకుండానే.

మెడికల్ టెర్నినాలజీలో పల్నొనరీ ఎడెమా అంటే శరీరంలో టెంపరేచర్‌ని పెంచేకొద్దీ, లంగ్స్ లో చేరే ద్రవాలు…

“ప్రాంకియాస్ లో డామేజ్, బ్లడ్ గ్రూకోజ్ పెరుగుతోంది. ఎలక్ట్రోలైట్స్ కూడా వింతగా ప్రవర్తిస్తున్నాయి” డా!! విజేత అంది తిరిగి.

“అంటే…” మరిన్ని వివరాల కోసం ప్రశ్న వేశాడు సవ్యసాచి.

“ఎలక్ట్రోలైట్స్ సరిచేశాను. గ్లూకోజ్ కూడా తిరిగి తగ్గుతోంది- ప్రాంకియాస్ విషయమై వర్రీగా వుంది” ఆమె మాట్లాడుతున్నా, ఆమె చేతివ్రేళ్ళు చకచకా కదులుతున్నాయి కొన్ని గంటలుగా ఆమె ఆ అపరేషన్‌ను నిర్వహిస్తోంది.

క్రితంరోజు ఫ్రిజ్‌లోంచి తీసిన కుందేలు బాడీ అది.

డాక్టర్ విజేత జంతువుల ఆపరేషన్లలో ఎక్స్‌పర్ట్. ఆమె స్పేషల్ సబ్జెక్టు కుక్కలు,పిల్లులు, కుందేళ్ళు, తదితర చిన్న జంతువులు.

 

*                      *                      *                      *                      *

మూడేళ్ళక్రితం హైద్రాబాద్‌లో వరల్డ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన కాన్ఫరెన్స్‌లో సవ్యసాచికి పరిచయమైంది డాక్టర్ విజేత.

ఏ కాన్ఫరెన్స్‌కి వెళ్ళినా, సవ్యసాచి సబ్జెక్టు ఒకటే.

‘క్రయోనిక్స్’

మనిషి మృత్యువును జయించగలిగే రోజు అతి త్వరలో వుందనేది అతని వాదన.

ఎలా? ఆ ప్రశ్నకు అతను జవాబు చెప్పలేకపోతున్నాడు ఒక డాక్టర్‌గా అతను. కొన్ని నెలల కాలంలో సాధించిన విజయాలు వైద్య రంగానికి తెలుసు. ఒక పరిశోధకుడిగా, మానవ జీవశాస్త్రాన్ని విశ్లేషిస్తున్న అతని ధీరీ పట్ల చాలామందికి సందేహాలున్నా, ఎవరూ అతనితో వాదించలేక పోవడానికి కారణం-

“హీ ఈజ్ ఎ డ్రీమర్… మాడ్  మాన్… బట్ క్వాలిఫైడ్ అండ్ ఇంటిలిజెంట్.”

ఆ కామెంట్‌ను విని నవ్వుకుంటాడు సవ్యసాచి.

ఆ రోజు కాన్ఫరెన్స్‌లో మనిషి శరీరంలోని టిష్యూలను చనిపోకుండా చేసే రోజు వస్తుంది. అని తన వాదనను బలంగా, సోదాహరణంగా వివరించాడు.

చాలమంది మనసులోనే నవ్వుకున్నారు. నిజంగా ఆ క్షణంలో సవ్యసాచి చాల బాధపడ్డాడు.

మేదావి ఎప్పుడూ వంటరివాడే!

క్యాంటిన్లో కాఫీ తాగుతున్న సమయంలో “హల్లో”

అన్న పిలుపుకి తలతిప్పి చూశాడు సవ్యసాచి.

ఎదురుగా సన్నగా, పొడవుగా ఒక అమ్మాయి.

“డాక్టర్ విజేత” తనను తను పరిచయం చేసుకుందామె.

“మీరు చెప్పిన క్రయోనిక్స్ థీరీకి నేను బలంగా ఆకర్షితురాలినయ్యాను” ఇంగ్లీషులో చెప్పింది విజేత

మెల్లగా నవ్వాడు డా!! సవ్యసాచి.

“మీకు అభ్యంతరం లేకపోతే మీతో కలిసి పనిచెయ్యడానికి నేను సిద్ధంగా వున్నాను” మళ్ళీ అందామె- ఎవరో ఒకరు, ఎప్పుడో ఒకప్పుడు తనతో కలిసి పనిచెయ్యడానికి వస్తారని నమ్మకంతో కృషి చేస్తున్న సవ్యసాచి మనసులో ఏదో తెలియని సంతృప్తి.

“నాతో మీరు పని చెయ్యాలంటే, జీవితంలో చాల కోల్పోవాల్సి వుంటుంది” నెమ్మదిగా అన్నాడతను.

ఆ మాటకు ఆమె మాట్లాడని కనులే సమాధానం చెప్పాయి.

 

*                      *                      *                      *                      *

 

రెండు రోజుల క్రితం కుందేలు వెనుక కాళ్ళను ఈడ్చడం గమనించింది విజేత. అందుకు కారణం ఎంజియోగ్రామ్, ఎక్సరేలని  తెలియడానికి ఆమెకు క్షణకాలం కూడా పట్టలేదు.

కుందేలు వంట్లో బ్లడ్ ట్యూమర్, వెన్నెముకపై ఒత్తిడి తెస్తోంది దానివల్ల దాని కలికలు మొదటి రెండు రోజుల పరిశోధనల్లో తగ్గిపోయినట్టుగా తెల్సుకుంది ఆమె.

అంతవరకూ తమ లేబోరేటరీలో జరుగుతున్న పరిశోధనలు వేరు. ఆ కుందేలు పిల్ల పరిశోధన వేరు.

“కుందేలు బాడీని మైనస్ ఇరవై డిగ్రీల దగ్గర ఫ్రీజ్ చేశాను. యాంటీఫ్రిజింగ్ కోసం నాన్ సెల్యూలార్ బ్లడ్ సబ్‌ట్యూట్స్ ఎక్కించాను… చెప్పుతూ లేసర్‌బీమ్‌తో కుందేలు బ్లడ్‌లో వున్న ట్యూమర్ టిష్యూల్ని నాశనం చెయ్యడానికి ప్రయత్నిస్తోంది డా!!విజేత.

కార్లు తదితర వాహనలను రిపేరు చేసేవారు ఇంజన్‌ని ఆఫ్ చేసి పని చేస్తారు. కానీ సర్జరీలో- శరీరం లోపలి భాగాలన్నీ పనిచేస్తున్నప్పుడే ఆపరేషన్ చేయడం, అదీ ఓ శరీరంలో ప్రాణం వుండగా, సర్జరీకి మించిన గొప్ప అనుభవం ఏదీలేదు. పేషెంట్లతో పాటు డాక్టర్లకూ అదొక చెప్పలేని టెన్షన్.

మనిషికైనా, జంతువుకైనా, ఒకటే ఆపరేషన్ ప్రక్రియ, సునిశితంగా, అప్రమత్తంగా ఆ ఆపరేషన్‌ని చేస్తోంది డా!! విజేత.

నిశ్శబ్దంగా ఆ ప్రక్రియను చూస్తున్నాడు సవ్యసాచి.

ఈ ప్రక్రియలో ప్రధానమైన అంశం బ్రతికున్న కుందేలుని నిర్జీవంగా చెయ్యడం. నిర్జీవంగా చేసిన కుందేలును మళ్ళీ బ్రతికించడం!

కొన్ని నెలల తర్వాత మనిషి శవం మీద జరిగే ప్రయోగానికి అది ఒక నాంది మాత్రమే.

మృత్యువును ఎదుర్కోడానికి మనిషి పూర్తిచేస్తున్న విజ్ఞాన శంఖారావం అది!

అయిదు నిమిషాలు గడిచాయి-

కుందేలు బ్రెయిన్ వేవ్స్ ఆగిపోయాయి. అలాగే గుండె కూడా – మెడికల్ టర్మ్‌నాలజీలో దానినే మరణం అంటారు.

వెంటనే విజేత రివార్మింగ్ ప్రోసెస్‌ని మొదలెట్టింది ముందుగా మెంబ్రెయిన్ ఇంజెక్షన్ ఇవ్వడంతో ఆ ప్రోసెస్ మొదలైంది.

క్షణంలో కణాలన్నీ అనుసంధించబడ్డాయి. రేడియో ఫ్రీక్వెన్సీ రివార్మింగ్ ద్వారా బాడీని ఇస్‌లోంచి తియ్యడం, యాంటీఫ్రీజింగ్ ప్రొటెక్షన్ కల్పించిన గ్లిసరాల్స్‌ని వెన్నకి తియ్యడం, చకచకా పనుల్ని చేస్తోంది విజేత.

కుందేలు బాడీని కంప్యూటర్ మానిటర్ మీద స్క్రీన్‌ని రెప్ప వేయకుండా చూస్తోంది ఆమె.

“టెంపరేచరు ట్వంటీ సెవన్ పాయింట్ సెవన్” చెప్పింది ఆమె.

కుందేలుపిల్ల తలకు కనెక్ట్ చేయబడిన ఎలక్ట్రోడ్స్ స్క్రీన్ వైపు చూశాడు సవ్యసాచి.

సవ్యసచికి బయోకెమిస్ట్రీ గురించి తెలుసు. అందుకే అతని నరాల్లో రక్తచలనం హెచ్చింది.

కొన్నివందల ప్రయోగాలు ఇప్పటివరకూ విఫలమయ్యాయి. పరాజయం ఎప్పుడూ ప్రయోగానికి ఒక ఒడ్డు మాత్రమే. సముద్రంలో ఈదులాడుతునప్పుడు డీకొన్న ఒక అల పరాజయం.  అవతలి తీరానికి చేర్చడానికి మరో అల ఎప్పుడూ సిద్ధంగానే వుంటుంది!

సవ్యసాచి, అతనితో పాటు పనిచేసే వ్యక్తులు నమ్మే ఆశావహ సిద్ధాంతం అది.

ఎలక్ట్రోడ్ స్క్రీన్ మీద గీతలు మెల్లగా కదలడం ప్రారంభించడంతో సంతోషంతో చిన్నగా ఈల వేశాడు సవ్యసాచి ఒక్కసారి.

విజేత ముఖంలో ఆనందం పెల్లుబికింది.

ఆశ్చర్యంగా, ఆనందంగా సవ్యసాచి కళ్ళల్లోకి చూసి, తలతిప్పి మానిటర్ వైపు చూసిన ఆమె ముఖం చిన్నబోయింది.

మానిటర్ బ్లాంక్‌గా అయిపోయింది సడన్‌గా.

ఎలక్ట్రోడ్ స్క్రీన్ మీద గీతలు మాయమైపోయాయి….

రివార్మింగ్ సిస్టమ్ వైపు చూసిన విజేతకు ఏం జరిగిందో అర్ధం కావడానికి కొన్ని సెకన్ల సమయం పట్టింది.

అంతలోనే ఉత్సాహం…

అంతలోనే అంతులేని నిరాశ…

విజేతతోపాటు, సవ్యసాచి చూపులు కుందేలు గుండెమీదున్నాయి.

ఆ గుండె కొట్టుకోవడం మానేసింది.

అంటే.. కుందేలు… శాశ్వతంగా… దీర్ఘంగా చనిపోయింది.

తల పట్టుకుని విసురుగా కుర్చీలో కూలబడిపోయింది. డా!!విజేత.

ఈ ప్రయోగం మీద హాండ్రెడ్ పర్సంట్ నమ్మకం పెంచుకున్న విజేత తనను తానే అవమానించుకున్నట్లుగా బాధపడుతోంది.

సవ్యసాచి గాఢంగా నిట్టూర్చాడు. అతను కూడా కాస్తంత డిప్రెషన్ కి  లోనయ్యాడు.

కొన్ని నిమిషాలవరకు అతను మాటాడలేకపోయాడు.

తర్వాత…

విజేత భుజంమీద చెయ్యి వేసి-

“డోంట్ వర్రీ విజేత… నెక్స్ట్ టైమ్ బెటర్ లక్” నెమ్మదిగా అన్నాడు నెమ్మదిగా తలతిప్పి, సవ్యసాచి వైపు చూసింది విజేత.

అప్పటికే ఆ రూమ్‌లోంచి బయటకు రావడానికి వెనుదిరిగాడు సవ్యసాచి.

 

*                      *                      *                      *                      *

లేడీస్ హాస్టల్ విజిటర్స్ రూమ్‌లో కూర్చున్నారు సత్యబ్రహ్మ, దిశ.

తనవైపే ఆశ్చర్యంగా చూస్తున్న సత్యబ్రహ్మ మనోభావాలను అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తోంది దిశ.

తనను వెతుక్కుంటూ సత్యబ్రహ్మ వస్తాడని ఊహించలేదు దిశ. ఆ సంభ్రమంలోంచి తేరుకోడానికి ప్రయత్నిస్తోందామె.

ఆయన ఎవరో పూర్తిగా ఆమెకు తెలీదు.

“నీకు టెలీపతి తెలుసా?” ఆయన వేసిన ప్రశ్నకు తలెత్తి చూసిందామె.

“తెలీదు” వెంటనే జవాబు చెప్పింది దిశ.

“ప్లయిట్ సంఘటన గురించి అంత కరెక్టుగా ఎలా చెప్పగలిగావ్?”

“తెల్సింది … చెప్పాను.”

“తెల్సిందా? ఎలా?!”

“జస్ట్ ఇన్ ఎ  డ్రీమ్… ఐకెన్ సీ ఎవ్విరిథింగ్” దిశ గొంతులో కాన్ఫిడెన్స్.

ఆ ప్లయిట్లో ప్రయాణం చేసే ఏ ఒక్కరికీ చెప్పకుండా నాకే ఎందుకు చెప్పావ్?”

“ఆ ప్లయిట్లో ప్రయాణం చేసే వ్యక్తుల్లో మీరే నాకు తెల్సు గనుక. అంతేకాదు! నాకు కలలో కనిపించే దృశ్యం నిజమవుతుంది గనుక. మీ ప్లైట్ షెడ్యూల్ మార్చమంటే ఇండియన్ ఎయిర్‌లైన్స్‌వారు నమ్ముతారా? వింటారా? నష్టపోతారు. నన్నుపిచ్చిదానిక్రింద జమకడతారు. కాదంటారా?”

ఇద్దరి మధ్యా అగాధంలాంటి నిశ్శబ్దం.

“నీకు కలల ద్వారా తెలిసేది చెడేనా… మంచి కూడానా?”

“చెప్పలేను. మీకు జరిగింది మంచా, చెడా?” తిరిగి పశ్నించింది దిశ.

“మంచే జరిగింది. కానీ…నీ మాటల్ని నేను నమ్మలేదు. అప్పటికే ప్లయిట్ బయల్దేరడం వల్ల నేను బ్రతికిపోయాను.”

అంతవరకూ తను ఫోనుచేసి చెప్పడంవల్ల సత్యబ్రహ్మ జర్నీ వాయిదా వేసుకున్నాడని అనుకుంది. దిశ మదిలో అసంతృప్తి.

అయినా ఆమెలో రేగిన ఆ చిన్న అసంతృప్తి ముందు ఓడిపోవటానికి ఆమె సిద్ధంగా లేదు.

ఆయన ఆమెకేసి పరిశీలనగా చూస్తున్నాడు.

ఆమె మెదడులో ఆలోచనల వేగం అంతకంతకూ పెరుగుతూ పోతోంది.

ఉన్నట్లుండి ఆమె మెదడులో ఒక చురుకైన చిన్న కదలిక…

ఆ వెన్వెంటనే ఆమె ముఖంలో మెరుపు ప్రత్యక్షమయింది.

“నా ఫోన్ కాల్‌ని మీరు రిసీవ్ చేసుకున్న సమయంలో మీరేం చేస్తున్నారు?” దిశ ఎంతో ధీమాగా ప్రశ్నించింది.

ఆయన ఒక్కక్షణం ఆలోచించి-

“అప్పటికే బ్యాగేజీ సర్దుకొని రూమ్‌లోంచి బయటకు వెళ్ళబోతున్నాను” అన్నాడాయన. ఆ ప్రశ్న ఆమె ఎందుకేసిందో అర్థంకాక.

“ఆ తరువాత?”

” ఆ తరువాతేముంది? నీతో ఫోన్లో మాట్లాడి బయలుల్దేరాను.”

“ఫోన్లో నాతో ఎన్ని నిమిషాలు మాట్లాడి వుంటారు?”

“సుమారు ఇదు నిమిషాలు కావొచ్చు… అంతేనా?”

“కాదు.. ఏడు నిమిషాలు” అంది ఆమె స్థిరంగా.

“అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవ్?” అడిగారాయన.

ఆమె వెంటనే తన వ్యానిటీ బ్యాగ్‌లోంచి చిన్న స్లిప్‌ని తీసి ఆయనకు చూపించింది.

అందులో ఏరోజు, ఎన్నింటికి, ఎన్ని నిమిషాలు, ఎక్కడికి మాట్లాడింది స్పష్టంగా అంకెల రూపంలో ప్రింటయి వుంది.

ఆయనొక్కసారి ఆమెకేసి సంభ్రమంగా చూసి అవునన్నట్లుగా తలూపారు.

“ఆ తరువాత ఏం చేశారు?” అడిగింది ఆమె.

“ఫోను పెట్టేసి క్రిందకెళ్ళి బిల్ పే చేసి టాక్సీ కోసం చూశాను”

“టాక్సీ రెడీగా వుందా?”

“లేదు”

ఆమె కళ్ళు ఒక్కసారి మెరిశాయి.

“ఎందుకు లేదు? హోటల్ నుంచి ఎయిర్‌పోర్టుకి వెళ్ళటానికి మీరు టాక్సీని కుదుర్చుకోలేదా?

“కుదుర్చుకున్నాను. అయినా నీ ఫోను మూలంగా ఏడు నిమిషాలు ఎక్కువసేపు రూమ్‌లోనే వుండిపోయాను. క్రిందకి వచ్చేసరికి పదినిమిషాలై వుంటుంది.  ఆ టాక్సీ డ్రైవరు ఆ పదినిమిషాల ఆలస్యాన్నే భరించలేక వెళ్ళిపోయాడు” అసంతృప్తిని దాచుకుంటూ అన్నాడాయన.

ఆమె మౌనంగా పెదాలు విడివడకుండా నవ్వింది.

“తరువాత?” తిరిగి ప్రశ్నించింది దిశ.

“ఆ తరువాతేముంది? ఆ విషయం రిసెప్షన్‌లో చెబితే వాళ్ళు ఫోన్ చేసి మరో టాక్సిని రప్పించారు. దానిలోనే ఎయిర్‌పోర్టు కెళ్ళాను.”

మరో టాక్సీ రావటానికి ఎన్ని నిమిషాలు పట్టింది?”

“సుమారు 20 నిమిషాలు… అంతా నీ మూలంగానే… లేదంటే… ఈ రోజు హైదరాబాద్‌లో జరిగిన కాన్ఫరెన్స్‌కి అటెండ్ అయ్యేవాడ్నే? అన్నారాయన ఒకింత నిష్టూరంగా.

ఆమె పైకే నవ్వేసింది.

ఆమె ఎందుకలా నవ్విందో సత్యబ్రహ్మకి ఇంకా అర్థం కాలేదు.

“నా మూలంగానే మీకు అలా జరిగిందా?” అడిగింది ఆమె.

“ఎస్! ముమ్మాటికీ నీ మూలంగానే జరిగింది.”

“ఆర్యూ ష్యూర్ సార్!” రెట్టించి అడిగింది దిశ.

“ఎస్… ఇయామ్ ష్యూర్.”

“టోటల్‌గా ఎంతాలస్యం జరిగింది?”

“మొత్తం ముప్పై నిమిషాలు…”

“అంటే .. నా పోన్ కాల్ మూలంగా మీరు అరగంట టైమ్ వృధా అయిపోయింది. అంతేనా సార్?”

“డోంట్ బీ సిల్లీ… ఇసే” ఒకింత అసహనంగా అన్నారాయన.

“ప్లైట్ డిపార్చర్ అయ్యాక ఎంతసేపటికి మీరు ఎయిర్‌పోర్టుకి చేరుకున్నారు?”

“అరగంట… సరిగ్గా ముప్పై నిమిషాలు… అదీ నీ మూలంగానే” అని అంటూనే ఆయనకేదో స్ఫురించగా ఒక్కసారి ఆయన ముఖంలో రంగులు మారిపోయాయి.

“ఎలా సేవ్ అయ్యారో…ఎందుకు సేవ్ అయ్యారో మీకిప్పటికైనా తట్టిందా సార్?” నవ్వుతూ కూల్‌గా అడుగుతున్న దిశకేసి దిగ్భ్రాంతిగా చూస్తుండి పోయాడు సత్యబ్రహ్మ.

ఆర్గ్యుమెంట్ ఎక్కడ మొదలెట్టి ఎక్కడికి తీసుకెళ్ళింది? ఏ వైపుకి తనని డ్రైవ్ చేసింది!

“అందుకే సార్ మీరు సేవ్ అయ్యారు. నా కల మూలంగానే, నా ఫోన్ కాల్ మూలంగానే సార్ మీరు సేవ్ అయ్యారు. కాదంటారా?” చిన్నపిల్లలా కనిపిస్తున్న దిశ మోములో ఏవో దివ్య తేజస్సు కనిపించినట్లయింది సత్య బ్రహ్మకు.

కొద్ది క్షణాలు ఆయన చేష్టలుదక్కి ఆమెకేసి అలా చూస్తుండిపోయారు.

ఆ షాక్ నుంచి తేరుకోటానికి ఆయనకి చాలాసేపు పట్టింది.

తేరుకుంటూనే ఆమెకేసి కృతజ్ఞతగా చూశాడు. అప్పుడాయన చూపులు ఒక సాధారణ యువతిని చూస్తున్నట్టుగా లేవు. ఒక అద్భుతాన్ని, ఒక ప్రపంచ వింతని చూస్తున్నట్లుగా వున్నాయి.

నిజమే… తనకా సమయంలో దిశ ఫోనుచేయకుండా వుంటే… ఎంగేజ్ చేసుకున్న టాక్సీ వెళ్ళిపోయేది కాదు. వెళ్ళిపోకపోతే ఆ టాక్సీలోనే తను ఏయిర్‌పోర్టుకి వెళ్ళుండేవాడు-

వెళ్ళుంటే? వెళ్ళుంటే ప్లయిట్ మిస్ అయ్యేది కాదు. మిస్‌కాకపోతే?

“ఓ మైగాడ్! ఇట్స్ ఏ మిరాక్యులస్ ఎస్కేప్” పైకే పెద్దగా అన్నారాయన.

దిశ అప్పుడు సంతృప్తిగా, సంతోషంగా చూసింది ఆయనకేసి.

ఆ సంఘటన ఆయన మీద చాలా పెద్ద ప్రభావాన్నే చూపించిదా క్షణాన.

ఎందుకో దిశ ఎదురుగా మరికొంతసేపు కూర్చోలేకపోయారాయన. లేచి నిలబడ్డాడు ఆయన.

ఆయన ఒక నిరంతర ప్రయోగశీలి, తాత్విక దృక్పధానికి, సైన్సుకీ మధ్యన ఆయన వంతెన.

ఆయన చేస్తున్న ప్రయోగాలు ఈ ప్రపంచం తెల్సుకోడానికి ఇంకొన్ని సంవత్సరాలు పడుతుంది. అంతటి మేధావే జీవితంలో తొలిసారి ఒక తీవ్రమైన ప్రకంపనకి లోనయ్యాడు.

“ఈ విశ్వంలో ఎక్కడ ఏ సమయంలో ఎలాటి సంఘటన జరిగినా నీకు ముందుగా తెలుస్తుందా?” ఆ ప్రశ్న అయనెందుకు వెశాడో ఆయనికే తెలిఈదు.

కొన్ని ప్రశ్నలు అలాగే అప్రయత్నంగా వస్తాయి.

“మంచికి సంబంధించా? చెడుకి సంబంధించా?”

“రెంటికీ” జవాబు చెప్పడు సత్యబ్రహ్మ.

“చెప్పలేను ప్రొఫెసర్! ఒక విషయం మీద నా మనస్సు పూర్తిగా లగ్నమైనప్పుడు, ఆ పర్టిక్యులర్ పాయింట్ నన్ను మానసికంగా వెంటాడినప్పుడు ఆ సంఘటనకు సంబంధించిన వివరాలు సింబాలిక్‌గా నాకు తెలుస్తాయి. ఆ పాయింట్లను నేను ఎనలైజ్ చేసుకుంటాను.”

“ఎన్నాళ్ళ నుంచి యిలా జరుగుతోంది?”

“నాకు తెలిసి పన్నెండేళ్ళ వయస్సు నుంచి డ్రీమ్స్ గుర్తుపట్టడం నేర్చుకున్నాను. అంతేకాదు ప్రొఫెసర్! ఇలా జరగొచ్చేమో అని నేను స్థిరంగా అనుకున్న సందర్బాలు, పర్‌ఫెక్టుగా నిజమైన ఉదాహరణలు కూడా వున్నాయి” నెమ్మదిగా చెప్పింది దిశ.

“ని…జ…o…గా?” సత్యబ్రహ్మ గొంతు తొట్రుపడింది.

“అందుకో ఉదాహరణ చెప్పగలవా… జ్ఞాపకం వుంటే” తిరిగి అడిగాడాయన.

“చెప్పగలను. నాకప్పుడు పదేళ్ళు. స్కూలు నుంచి ఇంటికొస్తున్నాను. సాయంత్రం అయిదు గంటల సమయం. రోడ్ క్రాస్ చేస్తున్న సమయంలో కొంతమంది వ్యక్తులు ఒక శవాన్ని మోసుకొస్తున్నారు. మగవ్యక్తి శవం. ఆ శవాన్ని చూడగానే మా నాన్నకు ఇలా జరిగితే అన్న ఆలోచన… అసహజమైన ఆలోచన వచ్చింది. మరో పదినిమిషాల తర్వాత నేను ఇంటికెళ్ళి బావి దగ్గర కాళ్ళు కడుక్కుంటున్న సమయంలో మా పాలేరు వచ్చి చెప్పాడు… పది నిమిషాల క్రితం మీ నాన్న అకస్మాత్తుగా హార్టెటాక్‌తో చనిపోయాడని. నేనా విషయం ఇప్పటికీ ఎవరికీ చెప్పలేదు. నాలో నేను కుమిలిపోవడం తప్ప. ఆరోజు నేను మా నాన్న శవాన్ని చూడలేదు కూడా” చెప్పి భారంగా వూపిరి పీల్చుకుంది దిశ.

“ఇలాంటి ఆలోచన మంచికి సంబంధించి ఎప్పుడయినా వచ్చిందా?”

“లేదు. ఆ తర్వాత నేను అలాంటి ఆలోచనలను బలవంతంగా అణచుకోడానికి చాల శ్రమపడాల్సి వచ్చింది.”

దిశ కళ్లలోకి సూటిగా చూశాడు సత్యబ్రహ్మ అతని మనసులో ఏదో అనుమానం.

ఆమె చెబుతున్న మాటల్ని ఎంతవరకు విశ్వసించాలో అతనికి తెలీడము లేదు.

“ఎప్పుడయినా సైకాలజిస్ట్ దగ్గరకుగానీ, సైక్రియాస్టిక్ దగ్గరకు గానీ వెళ్ళావా?” సాలోచనగా అడిగాడాయన.

ఆ మాటకు దిశకు కోపం వచ్చింది. అయినా తమాయించుకుని- “లేదు… అయాం నాట్ సఫరింగ్ ఫ్రమ్ ఎనీ డిసీజ్ మిస్టర్ సత్యబ్రహ్మ!”

బేబీ! నేను నిన్ను అనుమానించడం లేదు. నీలోని శక్తిని విశ్లేషించడానికి ప్రయత్నిస్తున్నాను” అని అనునయంగా అంటూ ఆ క్షణంలోనే సత్యబ్రహ్మ ఒక నిర్ణయాని కొచ్చాడు

వెంటనే ఆయన టాపిక్ మార్చాడు.

“నీకు క్రయోనిక్స్ సంస్థ అంటే ఇష్టమా?”

“ఎస్ ప్రొఫెసర్” వెంటనే జవాబిచ్చిందామె.

“ఆ సంస్థ గురించి తెల్సుకుని ఏం చేస్తావ్?”

“వాళ్ళలో నేనూ ఒక భాగస్వామిని అవుతాను”

“ఎందుకు?”

“క్రయోనిక్స్ సిద్ధాంతాన్ని నేను నమ్ముతున్నాను కనుక.”

“అంటే?”

“ఆత్మ పూర్వ శరీరాన్ని వెతుక్కుని వస్తుంది. అందుకో నిజమైన ఉదాహరణ చెబుతున్నాను. 1969 ఆగస్టు 10వ తేదీ ఆంధ్రపత్రిక న్యూస్ పేపర్ చూడండి. బెంగళూరుకు చెందిన రెండేళ్ళ పసిబాలుడు రవికిరణ్ నూరు రాగాలను ఆలపించి ఏ రాగం ఏమిటో చెప్పాడు. ఆ రాగం పేరు చెప్పడమే కాదు ఏ రాగానికి ఏ స్వరాలు వుండాలో కూడా చెప్పాడు. ఈ బాలుని తండ్రి ఎస్. నరసింహం గోటు వాద్యంలో విద్వాంసుడు. అయితే ఆ పసికందుకు అంతటి జ్ఞానం ఎలా వచ్చిందో అయన చెప్పలేకపోయాడు. కానీ ఆ బాలుని తాత నారాయణ అయ్యంగర్ మహా విద్వాంసుడు. ఆ తాత యొక్క జీవాత్మ మనవడిలో ప్రవేశించింది. అది మీకు తెలుసనుకుంటాను. పిల్లలకు తమ తల్లిదండ్రుల పేర్లు వుంచడానికి కారణం ఇది ఒక కారణం కావచ్చేమో.”

నిజానికి అలాంటి సంఘటనలు సత్యబ్రహ్మకు చాల తెలుసు.

హాస్టల్ సర్వెంట్ రెండు కప్పులతో టీ తెచ్చి వాళ్ళిద్దరికీ యిచ్చి వెళ్ళిపోయింది.

సత్యబ్రహ్మ టీ సిప్ చేస్తున్నాడు.

సరిగ్గా అదే సమయంలో ఎక్కడ్నుంచి వచ్చిందో ఆ రూంలోకి తోకాడించుకుంటూ వచ్చింది వార్డెన్‌కు చెందిన ఆస్ట్రేలియన్ క్యాట్ డాలీ.

తాగిన టీ కప్పును పక్కన పెట్టి-

ఆ డాలీని అందుకుంది దిశ.

దానివైపు సీరియస్‌గా చూశాడు సత్యబ్రహ్మ.

“ఆస్ట్రేలియాలో పిల్లులకు పునర్జన్మలున్నాయని నమ్మకం ఎక్కువనుకుంటాను కదూ?” అన్నాడాయన అసంకల్పితంగానే.

“అవును… అక్కడ కొన్ని తెగల్లో పిల్లుల్ని పూజిస్తారు. పిల్లుల పెంపకం విషయం వారు ప్రత్యేక శ్రద్ద వహిస్తారు” చెప్పింది దిశ.

“క్రయోనిక్స్‌కి ఈ పిల్లి బాగా వుపయోగపడుతుందనుకుంటా…”

అప్రయత్నంగా అయన నోటి నుంచి వచ్చిందా మాట.

ఆయనలా ఎందుకన్నారో తెలీక విస్తుపోయి చూసింది ఆయనవైపు దిశ.

 

*                      *                      *                      *                      *

 

సరిగ్గా అదే సమయంలో-

తిరుపతికి దాదాపు 120 కిలోమీటర్ల దూరంలో వున్న తలకొన కొండల్లో-

క్రయోనిక్స్‌కి చెందిన ‘మృతసంజీవని సంస్థలో’-

ఒక ప్రత్యేక సమావేశం జరుగుతోంది.

మృతసంజీవని ఉద్యమ సారధి సవ్యసాచి ఒక విశాలమైన టేబుల్ ముందు కూర్చున్నాడు.

అతనికెదురుగా ఆ సంస్థలో పనిచేస్తున్న అయిదుగురు డాక్టర్లు కొంతమంది బయాలిజిస్టులు కూర్చున్నారు.

వారి చేతుల్లో అవసరమైన ఫైల్స్ వున్నాయి.

“రెండు గంటల క్రితం మన మరొక పరిశోధన ఫెయిలైంది. మీకు తెల్సనుకుంటాను” ఆ అయిదుగురిలో చివరగా కూర్చున్న డా!! విజేతను చూస్తూ అన్నాడు సవ్యసాచి.

ఆ మాటకు ఎవరూ ప్రతిస్పందించలేదు.

తన ముందున సిమెంటు కలరు ట్రేలోంచి ఒక బ్రౌన్ కలర్ కవర్ని తీసి-

“మైడియర్ ఫెండ్స్! ఎన్నాళ్ళనుంచో కంటున్న మన స్వప్నాలు నిజం కావడానికి పరిస్థితులు అనుకూలిస్తున్నాయి. అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ మెడికల్ రిసెర్చి సంస్థ ఆధ్వర్యంలోని సొసైటీ ఫర్ క్రయో బయాలజీ మన మృతసంజీవని సంస్థను అధికారికంగా గుర్తించింది. ఆ సంస్థకు చెందిన ప్రొఫెసర్ స్టీఫెన్ హారిస్ అతి త్వరలో మన సంస్థను విజిట్ చేయనున్నారు…” ఆగాడు సవ్యసాచి.

ఆ వెన్వెంటనే చప్పట్లతో ఆ హాలు మార్మోగిపోయింది.

ఆ బ్రౌన్ కవరు పక్కన పెట్టి సొసైటీ ఫర్ క్రయోబయాలజీ సంస్థ పంపిన ఆరు పేజీల లెటర్ని చదివాడు సవ్యసాచి.

లెటరు చదవడం పూర్తయ్యాక అందరి ముఖాల్లోకి చూశాడతను.

“అంటే మనం ఇకనుంచీ జంతువుల మీద, పక్షుల మీద చేసే రిసెర్చిలను పక్కన పెట్టెయ్యాలన్న మాట” డా!! నవనీత్ అన్నాడు.

“ఎస్ డాక్టర్స్! అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లోని క్రయోనిక్స్ సంస్థలు జంతువుల మీద చేసే పరిశోధనలను ఎప్పుడో పక్కకు పెట్టేశాయి. ఆ సంస్థలు తమ ఉద్యమ వ్యాప్తి కోసం రహస్యంగా క్రయోనాట్స్ కోసం ప్రయత్నిస్తున్నాయి.

ఒక వ్యక్తి చనిపోయాక ఆ వ్యక్తి శవాన్ని భవిష్యత్ జీవాత్మ ఆవహనం కోసం మనం భద్రపరచుకోవాలి. అందుకోసం యీ సిద్ధాంతాన్ని మనం మరింత విరివిగా ప్రచారం చెయ్యాలి” చెప్పాడు సవ్యసాచి.

“సైన్సు బాగా ఎదిగిన అమెరికాలాంటి దేశాల్లో తమ శవాల్ని భద్రపరచడానికి వప్పుకుంటారుగానీ మనదేశంలో అందులోనూ మన రాష్ట్రంలో ఎవరు ముందుకొస్తారు సార్? ప్రతి క్షణం మూఢనమ్మకాల్ని నమ్మే మన ప్రజలు… ఇంకా అంత స్థాయికి ఎదగలేదు డాక్టర్…!” డా!! విజేత చెప్పింది.

డా!! విజేత, డా!! నవనీత్ క్రయోనిక్స్ మృతసంజీవని సంస్థలో పార్ట్ టైమర్స్‌గా పనిచేస్తున్నారు.

వాళ్ళిద్దరూ తిరుపతి రూయా ఆస్పత్రిలో అఫీషియల్‌గా డాక్టర్స్, మిగతా ముగ్గురూ మెడిసిన్ చేశాక డైరెక్టుగా మృతసంజీవని సంస్థలో ఫుల్ టైమర్స్‌గా చేరారు. అలాగే బయాలజిస్ట్‌లు కూడా ఆ సంస్థలో టైమర్స్-

“ప్రయోగాలెప్పుడూ మూఢవిశ్వాసాలకు ఎదురుగానే వుంటాయి  డా!!విజేతా.. ఎవరో ఒకరు మన ప్రయోగాలకు సహకరించకపోరు.. సహకరించక పోయినా మనం తలచుకుంటే శవాలను సంపాదించడం పెద్ద కష్టం కాదు. ఏమంటారు?”

సవ్యసాచి మాటలు అక్కడి వాళ్ళకు పూర్తిగా అర్థం కాలేదు.

“ఎలా…?” డా!! వంశీ ప్రశ్నించాడు.

“శవాల్ని దొంగిలించుకుని తీసుకొస్తాం”  టక్‌మని జవాబు చెప్పాడు సవ్యసాచి.

“మిస్టర్ సవ్యసాచీ! మామూలు శవాల్ని తీసుకురావడానికి ఏం యిబ్బంది లేదు. ప్రాణం పోయిన శవాన్ని కొన్ని గంటల లోపుగానే మనం చిల్లర్‌గా మార్చి (క్రయోని పరిశోధనలకు అనువుగా శవాన్ని మార్చడాన్ని చిల్లర్ అని అంటారు. శరీరంలోని టిష్యూలు దెబ్బ తినకుండా చేయడం యిందులో ప్రధానమైన అంశం.) తీసుకురావాల్సి వుంటుంది. ఇదంతా రహస్యంగా జరగాలి. ఎక్కడ ఏ మాత్రం అప్రమత్తంగా లెక్కున్నా, పోలీసులకు మనం దొరికిపోతాం” డా!!సమీర్ అన్నాడు.

“ఎస్ యూ ఆర్ కరెక్ట్ డా!!సమీర్!  మానవజాతిని మృత్యువు నుంచి రక్షించడం కోసం అవసరమైతే మనం దొంగలుగా, క్రిమినల్స్‌గా మారాల్సి వుంటుందేమో… కానీ మిస్టర్ సమీర్ డోంట్‌వర్రీ.

మన సిద్ధంతాన్ని ప్రోపగండా చెయ్యడం కోసం మన ఉద్యమాన్ని మరింత విస్తృతం చెయ్యడం కోసం మనకు కొంతమంది స్టాఫ్ కావాలి. అందుకే మరికొంతమందిని మన సంస్థలోకి తీసుకోవాలని అనుకుంటున్నాను.”

“మన ఆశయంతో ఏకీభవించేవారు దొరుకుతారని నమ్మకం వుందా?” డా!!నవనీత్ ఆడిగాడు.

“మీరు నాకు దొరకలేదా…ఆలాగే…” నవ్వుతూ అన్నాడు సవ్యసాచి. అందరూ కొద్దినిమిషాలసేపు మౌనంగా ఆలోచిస్తూండిపోయారు.

రెండు నిమిషాల తర్వాత సవ్యసాచి అన్నాడు-

“డా!!వంశీ! ఏ హాస్పటల్‌లోనైనా అనాధ శవాలను ఏం చేస్తారు?”

“మున్సిపాలిటీకి అప్పగిస్తారు సార్!”

“ప్రస్తుతం మనం అనాధ శవాలను సంపాదించడానికి ప్రయత్నం చెయాలి. ఆ రెస్పాన్స్‌బిలిటీ మీది. ఏమంటారు?”

“ఎస్ మిస్టర్ సవ్యసాచీ!” సవ్యసాచి నోటినుంచి వచ్చిన మాటను ఆర్డర్‌గా స్వీకరించే క్రమశిక్షణ క్రయోనిక్స్ మృతసంజీవని సంస్థలో వుంది.

డాక్టర్లు అందరూ లేచి నిలబడ్డారు.

“ఇక నుంచీ మనం ఫండ్స్ గురించి భయపడాల్సిని పనిలేదు.. క్రయోబయాలజీ సంస్థ సెవెంటీ ఫైఫ్ పర్సంట్ ఫండ్స్ ని  అందించబోతోంది…” మీటింగ్ చివరలో కావాలనే అన్నాడు సవ్యసాచి ఆనందంగా.

సవ్యసాచిని కంగ్రాచ్యులేట్ చేసి డాక్టర్లు, బయాలజిస్టులు బయటి కొచ్చేశారు.

డ్యూటి అయిపోయాక వారిని తిరుపతికి పంపించడానికి అవసరమైన ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యం అక్కడుంది.

తనూ వెళ్ళడానికి నిలబడింది డా!!విజేత

“మిస్ విజేతా!”

తల తిప్పి చూసిందామె.

“మీకో ఇంపార్టెంట్ ఎసైన్‌మెంట్‌ను అప్పగించబోతున్నాను”  చెప్పి తన చేతిలోని ఫైల్‌ను ఆమెకు అందించాడు సవ్యసాచి.

ఆ ఫైల్లో మూడే మూడు బ్రౌన్ పేపర్లున్నాయి. వాటిమీద ఇంగ్లీషులో టైప్ చేసిన మేటర్ వుంది.

ఆ మేటర్‌ని గబగబా చదివింది విజేత.

“మిస్ విజేతా! దిసీజ్ వెరీ కాన్ఫిడెన్షియల్ మేటర్. సోసైటీ ఫర్ క్రయోబయాలజీ సంస్థ… రహస్యంగా ఆస్ట్రేలియన్ కేట్స్‌మీద ప్రయోగాలు చేస్తోంది.

అక్కడి ప్రయోగాలు సెవెన్టీ ఫైవ్ పర్సంట్ విజయవంతమయ్యాయి. మనమూ అలాగే ఆస్ట్రేలియన్ కేట్స్ మీద ప్రయోగం చేసి, విజయాన్ని సాధించాలి. శవాల్ని క్రయోనాట్స్‌గా మార్చి చేసే ప్రయోగానికి ముందు ఆస్ట్రేలియన్ కేట్స్‌మీద మన ప్రయోగం జరగాలి. ఆ ఎక్స్‌పరిమెంట్ ముందు భవిష్యత్ ఆశయానికి పునాది అవుతుందని నా నమ్మకం…”

“ఎస్ సర్! ఆస్ట్రేలియన్ కేట్‌ను మనం బ్రతికించగలిగితే… శవాన్ని కూడా మనం బ్రతికికించగలం. వాటి ప్రాసెస్ ఒకటే…” ఇంతవరకూ ఈ ఆలోచన తనకెందుకు రాలేదోనని ఒక్కక్షణం తనని తాను ప్రశ్నించుకుంది డా!విజేత.

“ఈ ఎక్స్‌పరిమెంట్ కోసం కొన్ని రోజులు మీరు ప్రత్యేక్షంగా కేటాయించగలగాలి.”

“ఎస్ డాక్టర్ మరి ఆస్ట్రేలియన్ బ్రీడ్?” ప్రశ్నించిందామె.

“ఇందుకు వారం రోజులుగా అన్వేషణ జరుగుతోంది మిస్ విజేత. నా ఫ్రెండ్ ఇదే పనిమీద హైదరాబాద్‌లో వున్నాడు. హైదరాబాద్‌లో ఒక నవాబు దగ్గర రెండు ఆస్ట్రేలియన్ కేట్స్ వున్నాయని తెల్సింది. ఇవాళో రేపో మన లేబరేటరీలో ఆ ఆస్ట్రెలీయన్ కేట్ వుండగలదని నమ్ముతున్నాను.”

“నేను నా ప్రయత్నంలో వుంటాను డా!!సవ్యసాచి…!” ఏ.సి.రూమ్‌లోంచి బయటికొస్తూ అంది విజేత.

సవ్యసాచి టెలిఫోను రిసీవరు అందుకున్నాడు.

ఆ ఫోను హైదరాబాద్‌లోని ఒక్ వ్యక్తి కోసం, ఆ వ్యక్తి పేరు రషీద్!

 

*                      *                      *                      *                      *

 

“క్రయోనిక్స్ సంస్థ ఎక్కడుంది ప్రొఫెసర్?”  అడిగింది దిశ ప్రొఫెసర్ సత్యబ్రహ్మ వెనక గేటు వరకూ వస్తూ.

“మిస్ దిశా! నువ్వెప్పుడు వెళ్ళాలనుకుంటావో ఒకరోజు ముందు చెప్పు. వారం రోజులపాటు నీ పి.హెచ్.డి. వర్కు వుందన్నావుగా” అన్నాడాయన.

“అవును. సరిగ్గా వారం రోజుల తర్వాత మిమ్మల్ని కలుస్తాను” తన చేతిలోని పిల్లిని వేళ్ళతో నిమురుతూ అంది దిశ.

“ఒకసారి నువ్వా సంస్థలోకి వెళ్ళావంటే కొన్నేళ్ళపాటు ఆ సంస్థ నుంచి బయటకు రాలేవు. వాళ్ళకు ఏవో రూల్సూ, రెగ్యులేషన్స్, కాంట్రాక్టులు వున్నాయి.”

“నేను క్రయోనిక్‌గా మారేవరకు రాను… సరేనా…” సీరియస్‌గా జోక్ వేసింది.

ఆయన చిన్నగా నవ్వాడు.

సత్యబ్రహ్మ గేటు ముందున్న జీపెక్కి స్టార్ట్ చేశాడు. జీపు ముందుకు కదిలింది. కానీ ఆయన ఆలోచనలు మాత్రం వింతగా కనిపిస్తున్న ఆస్ట్రేలియన్ కేట్ డాలీమీద వున్నాయి.

సరిగ్గా ఒక గంట తర్వాత దిశ ఊహించని సంఘటన ఒకటి అకస్మాత్తుగా జరిగింది.

ఒక అపరిచిత వ్యక్తి ఆ హాస్టల్‌కి వచ్చి-ఏదో అమ్మాయి పేరు చెప్పి, దిశను మాటల్లో పెట్టాడు.  దిశ మాటల్లో పడి డాలీని మర్చిపోయింది. ఆమె గమనించకుండా ఆ వ్యక్తి ఆమె చేతిలోని పిల్లిని నిమురుతున్నట్లు నటిస్తూ, గట్టిగా దాన్ని గిల్లాడు. అంతే సడెన్‌గా ఆమె చేతుల్లోని పిల్లి కిందకు దూకి రోడ్‌మీద అడ్డంగా పరుగెత్తడం ప్రారంభించింది.

రెండు వైపుల నుంచీ నలభై కిలోమీటర్ల వేగంతో వస్తున్న వాహనాలు…

“డాలీ! డాలీ!” అరుస్తూ ముందుకు పరుగెత్తింది దిశ.

వాహనాలవైపు చూడకుండా రోడ్డుకడ్డంగా వెళ్ళిపోతున్న దిశ చూసి సడన్‌గా బ్రేక్ వేసిన ఓ మారుతీకారు అదుపు తప్పి, పక్కనే వెళుతున్న సైకిల్‌ని ఢీకొంది…

ఆ సైకిల్ ఎదురుగా వస్తున్న లారీ ముందు చక్రానికి ఢీకొని అంతెత్తున ఎగిరింది. ఆ సైకిల్‌మీద వ్యక్తి అరుచుకుంటూ కిందపడిపోవడం… సర్ సర్ సర్‌మని ఒక్కొక్క వెహికల్ ఆగడానికి ప్రయత్నించడంతో ట్రాఫిక్ కన్‌ప్యూజన్….

ఆ గందరగోళానికి లారీ వెనుక స్పీడ్‌గా వస్తున్న మారుతీకారుని కంట్రోల్ చెయ్యడానికి డ్రైవింగ్ సీట్లోని వ్యక్తి ప్రయత్నించి సడన్‌బ్రేక్ వెయ్యబోయి…

ముందు చక్రాలవైపు ఎదురుగా వస్తున్న పిల్లిని చూసి స్టీరింగ్‌ను పక్కకు తిప్పబోయాడు.

కానీ అదే సమయంలో…

ఆ కారు చక్రాల కింద ఆ ఆస్ట్రేలీయన్ కేట్ డాలీ పడి ఆఖరిసారిగా అరిచింది. అంతా కొద్దిక్షణాల్లో ఒక మాయలా జరిగిపోయింది.

ఆ సమయంలో ఆ అరుపు ఏ ఒక్కరికీ వినిపించలేదు.. కారు డ్రైవర్‌కు తప్ప.

ఆ కారు డ్రైవర్ పేరు రషీద్. ఆ కారుకి ఓనర్ కూడా అతనే. గబుక్కున కారు దిగి ముందు చక్రాల దగ్గరకొచ్చాడు.

జువాలజిస్ట్ అయిన రషీద్‌కి ఆ పిల్లిని చూడగానే తెలిసిపోయింది.

అదెక్కడిదో.. ఏ జాతికి చెందిందో దాని ప్రాణం ఇంకా పూర్తిగా పోలేదు.

రెండు చేతులతో ఆ పిల్లిని తీసుకుని వెనక్కి నడిచి డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఇగ్నీషన్ కీ తిప్పాడు.

కారు స్టార్టయింది.

ట్రాఫిక్ మధ్యలోంచి రేస్ హార్స్‌లా ఆ మారుతి ముందుకు దూసుకు పోతోంది.

ఆ కారు ఆ ప్రాంతం నుంచి కదిలిన రెండు నిమిషాలకు అక్కడ కొచ్చింది దిశ.

రోడ్డు క్రాస్ చేసిన ఆ పిల్లి ఆ వైపు రావడం చూసింది. అంతలోనే పిల్లి ఎటు మాయమైందో ఆమెకు అర్థంకాలేదు. కంగారు నణచుకుంటూ నాలుగు వైపులా చూసింది. అప్రయత్నంగా ఆమె చూపులు నేలమీద పడ్డయి.

కింద నేలకంటుకున్న పిల్లి రక్తం. ఆ రక్తానికి అంటుకున్న గోధుమరంగు వెంట్రుకలు.

కంగారుగా కిందకు వంగిందామె.

 

*                      *                      *                      *                      *

 ఇంకా వుంది…….

 

Print Friendly

బుల్లి ‘తెర’పెన్నుతో బ్నిం

 

1981లో పత్రికల్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాలోకి టైటిల్స్ రాసిచ్చే పనితో ఎంటర్ అయ్యాను. కధేంటి? మెయిన్ క్యారెక్టర్స్ ఎవరు అంటూ… అడిగి, తగిన కార్టూన్ బొమ్మలు వేసి ఇచ్చిన అప్పటి టైటిల్స్ ఒక కొత్తదనంతో వుండేది. బ్లాక్ పేపర్ మీద తెల్లటి అక్షరాలు రాయడం చేతకాక తెల్లకాగితం మీద నల్లటి అక్షరాలు రాసిచ్చేవాణ్ని. మీర్ గారిలాంటి ఒకరిద్దరు మహానుభావులు దాన్ని వాళ్ళకి కావలస్నినట్టు టెక్నాలజీని వుపయోగించుకుని మార్చుకునే వాళ్ళు. మిగిలిన వారికోసం రంగులు, రంగుకాగితాలు, కలర్ స్కేల్, పెన్నులు, కటింగ్ పెస్టింగ్‌లతో మాయచేసి, మంచిగా వున్నాయి అనిపించుకునే వాణ్ని.

అంతకు ముందే కార్టూన్లు, కధలు రాయడం వచ్చిన నేను, ఓ కార్టూన్‌ని కామెడీ సింగిల్ ఎపిసోడ్‌లా దూరదర్శన్‌కి రాశాను. అప్పుడు C.V.L. నరసింహారావు, అశొక్‌కుమార్ అందులో నేను రాసిన కొన్ని డైలాగులు వాడుతూ స్పాంటేనియన్‌గా చెప్తూ… చక్కగా నటించారు. నాకు మంచి పేరు తెచ్చి పెట్టారు. నన్ను డైలాగులు రాయమని ప్రేరేపించి, ప్రేమించిన  C.V.L. నరసింహారావుగారికి ఆ తర్వాత కృతజ్ఞతా సూచకంగా చాలా చిన్నా చితక పెద్ద పనులు చేసి పెట్టాను.

నాకు TV ఇండస్త్రీలో బొల్డంత నచ్చిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి మీర్ గారు. ఆయన చాలా మంది డైరెక్టర్లని తయారు చేశాడు. ఇన్ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. ఆయన దగ్గరి కొచ్చే కొత్త డైరెక్టర్లు ఆయన దగ్గర షాట్ డివిజన్ నేర్చుకుని స్క్రిప్ట్ మధ్యలో గీతలు కొట్టడం, గ్రూపా..క్లోజా-? సజెషనా… అనే వాటికి స్పెల్లింగ్స్ నేర్చుకుని రెండు ఎపిసోడ్స్ అయ్యాక మధ్య మధ్యలో ట్రాలీరాయాలని Zoom in and Zoom Back కూడా రాయచ్చని వాటి అవసరం, సందర్భోచితం కాకపోయినా మధ్య మధ్యలో వాడాలని కొండ గుర్తులు పెట్టుకోవడం గమనించాను.

ఇలాంటి డైరెక్టర్స్ వల్ల నేను తెలివైన వాణ్ని అనే ధైర్యం నాకు ఎక్కువ అవుతూ వచ్చింది. నేను స్క్రిప్ట్ రాసేటప్పుడు కూడా నాకోసం యాక్షన్ పార్టు, డైలాగ్ వెర్షన్ రాయటం అలవాటు అయింది. అది కొంతమంది డైరక్టర్లకి చాలా ఉపయోగపడింది.

ఇహ ప్రొడ్యూసర్ల కధ మహత్తరం. రెమ్యునరేషన్ ఎంతివ్వాలో వాళ్ళకి తెలీదు. మనం ధైర్యం చేసి అంతకు ముందాయన ఇంతిచ్చాడంటే… ఎంత ఎగ్గొటచ్చో మాత్రం బాగా తెలుసు.

సో కాల్డ్ డైరెక్టర్ ఎవరో తెలియకుండా… కధ, మాటలు ‘స్క్రీన్ ప్లే’ రాయించుకున్న ప్రొడ్యూసర్లు నాకు చాలా మందే తగిలారు. ఆ తర్వాత డైరెక్టరు స్క్రిప్ట్ మీద షాట్ డివిజన్ గీతలు గీసుకుని దాన్ని స్క్రీన్ ప్లే అంటారు కాబోలు.

ఎపిసోడ్లు టెలికాస్టులు జరిగిపోయాయి. ప్రొడ్యూసర్ కధ చెప్తున్నప్పుడు వేలు పెట్టకపోయిన వేళ్ళు పెట్టిన సందర్భాలు నాకు చాల జోక్‌గా వుండేది.

ఒకానొక కాబోయే మెగాస్టార్ అనుకుంటున్న ఓ ప్రొడ్యూసరు నా దగ్గర కొచ్చారు. తన భార్య నగా, నట్రా తాకట్టు పెట్టి సింగిల్ ఎపిసోడ్ తీస్తున్నానని 22 నిమిషాల ఎపిసోడ్‌లో 20 నిమిషాలైనా తను కనిపించేలా కధ రాయమని 1000 రూ… అడ్వాన్స్ ఇవ్వబోయాడు. నాకు అతన్ని చూస్తే తల దువ్వుకునే పది సెకన్లు కూడా అద్దం ముందు నిలబడగలడా అనిపించింది. ఎవరి ముఖం వాళ్లకు ముద్దేమో… కానీ ప్రేక్షకులు అంతసేపు వారిని చూడగలరా అని నా బెంగ… అప్పుడో కధ చెప్పా…. వీధి మొదట్లో ఓ స్టాచ్యూ– దాని ముందు జరిగే సంభాషణ విని – నిగ్రహ ఆత్మఘోష.. (లిప్ మూవ్‌మెంట్ కూడా ఉండకుండా..) ఉంటుంది అని… నా అయిడియా ఆయనకి నచ్చక… వెళ్ళిపోయాడు-

ఇంకో డైరక్టర్ కమ్ ప్రొడ్యూసర్‌కి కధచెప్తున్నా ఆయనతో జరిగిన సంభాషణ… నాకిప్పటికీ గుర్తొస్తూ వుంటుంది!! డైరెక్టర్ పేరు -ఎ- నేను – బి – (ఎలాగా బ్నిం కదా)

బి..      ఒపెన్ చేసేటప్పటికి విమానం లాండ్ అవుతుంది – ఎయిర్ పోర్ట్‌లోవున్న తల్లితండ్రుల ఆనందం-

ఎ..      ఎయిర్‌పోర్ట్‌లో షూటింగ్ చాలా కాస్ట్లీ-

బి..      పోనీ బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి కారు వస్తుంది- దాన్ని ఫాలో అవుతాం! దాని మీద   వాయిస్ – లేదా కార్లో క్లోజులు -

ఎ…     ఔట్‌డోర్ వద్ధండీ – బైటకెళ్లే రెండుగంటలు మినిమమ్ వేస్టు- ఇలా బేంబేలెత్తి పోయి ఏడుమ్మొహాన్ని     కెమేరాముందు కాక పోవడంవల్ల సులువుగానే అభినయించాక…..

బి..      సర్లెండి! ఇంట్లో కాలింగ్ వెల్ మోగుతుంది- లోపలున్న వ్యక్తి (తండ్రి) ఇంకా మేకప్ పూర్తవకుండా లోపలున్న వ్యక్తితో (తల్లి) “ఇదిగో నీ చీరకట్టుడు ఇంకా కాలేదు గాని అమెరికా నుంచి అబ్బాయొచ్చేశాడు… బైటకిరా!”

అయ్యా! ఇలా… ప్రొడ్యూసర్‌కి సమస్త విధాల అని విభాగాలవాళ్లూ చీప్-చీపర్-చీపెస్టు టెక్నిక్కు వాడి ఒక కధారచయితని, మాటల గాణ్నీ- బాగాతీద్దామనుకున్న కెమెరాగార్లనీ ఇంక అసలైన శ్రీ స్క్రీన్ ప్లే ధర్శకత్వంగారినీ ఉల్లకల్లోం చేస్తారు- ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూచున్నాక.. ఎన్నిషాట్లకి కాంప్రమేజయ్యామో. సదరు దర్శకుడు కెమీర్లు అనుకుంటారు. రైటర్ కొడుకు సంగతి చెప్పక్కర్లే అసలా మూడు అదికాదు… అని లబలబా.. ప్రతీ టీవీ చూసేవాడింటికి వెళ్లి…”అంచేత నేననుకున్నది ఇలాక్కాదు… అసలు ఆ డైలగ్ ఆ మాడ్యులెషన్లోనే ఛమక్కువుంది- మట్టిలో.. కలిపేసాడు భీం” అని వీడిగోడుని– వివరించి చెప్పలేడుకదా! నిజంచెప్తున్నా కధ-మాటలు బ్నిం అని వేసిన చాలాసార్లు సిగ్గుపడి పేరు వచ్చినప్పుడు మిత్రుల్ని చూడకుండా మొహం తిప్పేలా నేనేసిన కొత్త బొమ్మో, బాపూ గారేసిన లేటెస్టు బొమ్మో వాళ్ల ముందుకు తోస్తుండేవాణ్ణి. ఇదో సెల్ఫ్ ప్రొటెక్షన్ టెక్నిక్. నాకు తెలిసి నా రచనలకే మొదటిసారి స్టార్ట్‌ కెమెరా అన్నవాళ్లు నలుగురు సినిమా డైరక్టర్లు అయ్యారు. శ్రీ వరాముళ్లపూడి, శ్రీ గాంధీ మనోహర్, శ్రీ ఫణిప్రకాశ్, శ్రీ వెంకీ, ఏవోయాడ్ ఫిలిమ్స్ (టీవీకే) చేశారు. నేను ఓ సింగిల్ ఎపిసోడ్‌కి డైరెక్టగా డైరెక్షన్ వెలగబెట్టాను. మా ఫ్రెండ్స్ చాల మంది చేసిన సీరియల్స్‌కి నేను షూటింగుల్లో పాల్గోనడం ముఖ్యంగా డబ్బింగ్ కార్యక్రమాలు (డైరెక్టరు గారు పర్మిషన్ ఇస్తే) దగ్గరుండి చేయించుకోడాలు నాకు సరదా. నేను డబ్బింగ్ చేయించగలనని నాకు నమ్మకం ఎక్కువే. బాపుగారు శ్రీ భాగవతం తీస్తున్నప్పుడు తరచుగా డబ్బింగ్ కెళ్లేవాణ్ని- నా అబ్జర్వేషన్ ఆయనకి నచ్చి… ‘మీరు డబ్బింగ్ చెప్పిస్తారా-రమణగారి భాషపై అవగాహన ఉందికదా’ అని అన్నారు. బ్రహ్మానంద పడిపోయాను. కానీ నిర్మాతలు ‘అన్ని పన్లూ మీరే స్వయంగా చేస్తారు కదా…’ అని నసిగారుట- బాపుగారు నాతో మొహమాటంగా చెప్పారు-కానీ నాకు అదో మంచి ప్రశంసగానే అనిపించింది- ఇంకో మహత్తరమైన మాట చెప్పి (అహం పెరగకుండా) ముగిస్తాను-

ముళ్లపూడి వెంకటరమణగారి కధల్ని ‘అనగనగా ఓకధ’ పేరుతో జెమినీకి సీరియల్ చేసాం! రమణగారి అబ్బాయి వరముళ్లపూడి డైరక్టర్- ‘ఆచేతి చేత’ బాపురమణలు స్క్రీన్ ప్లే డైలాగ్స్ రాసిచ్చారు- ‘భూషణం వైరాగ్యం’ – ‘వరలక్ష్మీవ్రతం’ నేను రాశాను–! అందులో భూషణం వైరాగ్యంలో నేను స్వామీజీ వేషం వేశాను వరగారి బలవంతంతో – అందులో మహప్రభో…మాటలు అల్లింది నేనే అయినా— ఒక్కోషాట్ అరడజనుకు తక్కువకాకుండా టేకులు తిన్నాను.

ఇంకా డబ్బింగ్ విషయానికి వస్తే 10 డైలాగ్స్‌కీ 4,5, గంటలు తిన్నాను- ఏతావాతా… చెప్పొచ్చే నీతేంటంటే… అందర్నీ వేళాకోలం చేస్తాం గానీ… మనం గురివింద గింజలమే- ఆ మాట చెప్పుకుంటే ఎలా…

 

————-బ్నిం/-

ఇంకా బోల్డు విషయాలు చెప్పాలిగానీ.. ఇప్పటికే జ్యోతిగార్ని నేను చాలా అబద్ధాలకోరునని నమ్మించాను. లేజీ ఫెలోని కాను బిజీ ఫెలోనని ఓవర్‌యాక్షన్ చేసాను. ఇంక రాసి-ఆపేద్దాం ఈ సారికి–

 

 

 

 

 

 

Print Friendly

‘ఏమి హాయిలే హలా!’

రచన: నండూరి సుందరీ నాగమణి

 

నవంబరు నెల మూడో  వారం. చలి పులిలా వణికిస్తోంది.

మా హైదరాబాద్ లో చలి మరింత ఎక్కువ. స్వెట్టర్ వేసుకొని, మఫ్లర్ కట్టుకొని, రగ్గు కప్పుకున్నా కూడా వణుకు ఆగటంలేదసలు. తెల్లవారిపోయినట్టుంది. మా వాళ్ళందరి మాటలు వినబడుతూనే ఉన్నాయి. రగ్గును మొహం మీదికి లాక్కుంటూ, బద్ధకంగా ప్రక్కకు తిరిగి మళ్ళీ పడుకున్నాను.

నా పేరు పరిమళ. కూకట్ పల్లి లోని ఒక బ్యాంక్ లో పని చేస్తున్నాను. మావారి ఆఫీస్ రామచంద్రపురంలో ఉండడంతో, కూకట్ పల్లి లోనే ఓ అపార్ట్ మెంట్ అద్దెకు తీసుకొని ఉంటున్నాం. మా అబ్బాయి శశాంక టెంత్ చదువుతున్నాడు.

పదిహేను రోజుల క్రితమే నాకు మేజర్ ఆపరేషనయి, ప్రస్తుతం సికింద్రాబాద్ లోని మా అత్తగారింట్లో బెడ్ రెస్ట్ తీసుకొంటున్నాను. నాకు తల్లిదండ్రులు లేకపోవటం వల్ల, ఉన్న తోబుట్టువులిద్దరూ దూర ప్రాంతాల్లో ఉండటం వల్ల ఈ సమయంలో నాకు మా అత్తగారిపై ఆధారపడక తప్పలేదు.

మా అత్తగారికి ముగ్గురే సంతానం. మా బావగారు రైల్వేలో పని చేస్తున్నారు. మా తోడికోడలు శ్రీవల్లి మంచి గృహిణి. ఆమె పిల్లలు మాన్య, అనన్య ఒకరు డిగ్రీ లోను, మరొకరు ఇంటర్ లోను ఉన్నారు. మా ఆడపడుచు సునీతకు ఇంకా పెళ్ళి కాలేదు. డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాల వేటలో ఉంది. ఐదు సంవత్సరాల క్రితమే మా మామగారు పోయారు. స్వంత ఇంట్లోనే వీళ్ళంతా కలిసి ఉంటున్నారు.

హాస్పిటల్లో ఉన్న పది రోజులూ పగటి పూట మా శ్రీవల్లక్కయ్య, సునీత రాత్రి పూట మా వారు ఈశ్వర్ నా దగ్గర ఉండేవారు.  నన్ను పసిపాపలా, కంటికి రెప్పలా చూసుకున్నారు. కుట్లు విప్పిన తర్వాత ఇంటికి తీసుకు వచ్చారు. ఇక్కడ ఇల్లు చిన్నది కాబట్టి వాళ్ళకు ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశ్యంతో మొదట మా ఇంటికే  వెళ్ళిపోవాలని అనుకున్నాను కాని, అక్కడ ఇంకా లిఫ్ట్ పెట్టకపొవడం వల్ల మెట్లు ఎక్కవలసి వస్తుందనే భయంతో  కొంతా, ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఫర్వాలేదని కొంతా, అత్తయ్య గారి దగ్గరకే వచ్చాను.  అదీ గాక, నేను నీరసం నుండి కోలుకొని శక్తి పుంజుకోవటానికి కొంత సమయం పడుతుంది కాబట్టి, నా శలవు పూర్తి అయేంతవరకూ ఇక్కడే ఉండమని అత్తయ్య గారు కూడా చెప్పటంతో ఇక కాదని అనలేకపోయాను.

చెబితే అతిశయోక్తిలా ఉంటుందేమో కాని, ఇది మా అమ్మగారిల్లులానే  అనిపిస్తుంది నాకు ఎప్పుడూ… వాళ్ళ అభిమానాలు అలాంటివి మరి. వచ్చింది మొదలు స్నానానికి, బాత్ రూంకి వెళ్ళటానికి తప్ప మంచం దిగనివ్వటం లేదెవ్వరూ. అన్నీ మంచం దగ్గరకే తీసుకువచ్చి తినేదాకా ప్రాణాలు తీస్తారు. ఉదయమే అల్పాహారం పెట్టటం, మందులు ఇవ్వటం మా సునీత పని. మధ్యాహ్నం ఆ డ్యూటీ అక్కయ్య తీసుకుంటే, రాత్రికి ఆ బాధ్యతను పిల్లలిద్దరూ పంచుకున్నారు. ఓవరాల్ గా అన్ని విషయాలూ అత్తయ్య గారు పర్యవేక్షిస్తూ ఉంటారు. వీళ్ళ ఆప్యాయతకు ఒక్కోసారి కళ్ళలొ నీళ్ళు తిరుగుతాయి. పుట్టింటినే మరపింపజేసే అత్తగారిల్లు ఉండటం ఎంత అరుదైన వరం మరి!

ఉదయం ఆరుగంటలకే  హడావుడి మొదలౌతుందీ ఇంట్లో. నేను పడుకున్న చిన్న బెడ్రూంకు ఎదురుగా ఉంది, ఇంటికంతటికీ ఒకే ఒక్క బాత్ రూం. దాన్ని ఆనుకొని లావెట్రీ. బెడ్రూంని ఆనుకొని కిచెన్ ఉంటుంది. ఉదయం నుంచీ ఒకరి తర్వాత మరొకరు లావెట్రీ లోకి, తర్వాత స్నానానికి బాత్ రూం లోకి వెడుతూ ఉంటారు. అక్కయ్య, బావగారు, పిల్లలు, సునీత, అత్తయ్య అందరూ వరసగా స్నానాలు చేసి రెడీ అయిపొతూ ఉంటారు. గబగబా టిఫిన్స్ తినేసి, బాక్సులు సర్దుకొని బావగారు ఆఫీసుకి, పిల్లలు కాలేజీకి వెళ్ళిపోతారు.

అప్పుడు పిలుస్తారు నన్ను వచ్చి స్నానం చేయమని. కొంచెం ఆగి చేస్తానంటే ఒప్పుకోరు. ఎందుకంటే, అందరి స్నానాలూ పూర్తి అయ్యాక, అదే బాత్ రూం లో బట్టలుతికే  కార్యక్రమం ఉంటుంది. అందరి విడిచిన బట్టల్నీ అక్కయ్య, సునీతా కలిసి ఉతికి, మేడ మీద ఆరేస్తూ ఉంటారు.

***

‘చిన్నొదినా, బాత్రూంలో నీళ్ళు పెట్టేసాను రా…’ అని సునీత పిలవటంతో మెల్లగా లేచాను. సునీత ఆసరాతో బాత్రూంలోకి వచ్చాను. అప్పటికే ఉతికిన టవల్, నైటీ వైర్ మీద వేసి రెడీ గా పెట్టింది నాకోసం. బకెట్ లోని వేడి నీళ్ళ పరిమాణం చూడగానే నా మనసు దిగులుగా మూల్గింది. ఎక్కడో అడుగున క్రిందనుంచి, మూడంగుళాల ఎత్తు వరకూ మాత్రమే వేడి నీళ్ళున్నాయి. కుళాయి తిప్పుకొని బకెట్ లొ సగం వరకూ చన్నీళ్ళు నింపేసరికి, ఆ వేణ్ణీళ్ళ ఉష్ణోగ్రతా స్థాయి, గోరువెచ్చనిదనం కన్నా తగ్గిపోయింది.

చాలా అసంతృప్తి గా స్నానం అయిందనిపించి, డ్రెస్ చేసుకొని బయటకు వచ్చాను.

అసలు విషయం ఏమిటంటే, నాకు చిన్నతనం నుంచీ వేడివేడిగా సెగలు గ్రక్కేలా నీళ్ళు పెట్టుకొని, అందులో తగు మాత్రంగా చన్నీళ్ళు కలుపుకొని ఒంటికి సేద దీరేలా, కాస్త వేడిగానే  ఉండే నీళ్ళతో స్నానం చెయటం అలవాటు.

నా చిన్నప్పుడు మా అమ్మ కట్టెల పొయ్యి మీద, సిల్వర్ తప్పేళా నిండా నీళ్ళు పెట్టి, మసిలేలా కాచి, పిల్లలందరికీ బకెట్లో పోసి ఇస్తూ ఉండేది. అందరికీ ఒక తప్పేళాడైతే, నాకు మాత్రం స్పెషల్ గా రెండు తప్పేళాల నీళ్ళు కాచి ఇచ్చేది. ఇప్పుడు మా ఇంట్లో ఐతే, ఉదయం ఐదున్నరకే గీజర్ ఆన్ చేసి ఉంచుతారు ఈశ్వర్. నిద్ర లేవగానే, బాత్ రూం లోకి వెళ్ళి, బ్రషింగ్ చేసుకొని, అలాగే  అరగంట సేపు వేడి వేడి నీళ్ళతో  జలకాలాడి వస్తూంటాను. ఆ తర్వాతే, కాఫీ టిఫిన్లైనా, వంటైనా… నడివేసవిలో కూడా వేడి నీళ్ళతో తప్ప చన్నీటి స్నానం చేయలేను నేను.  అలాంటిది, మా అత్త గారింటికి ఎప్పుడు వచ్చినా ఈ పాట్లు తప్పటం లేదు నాకు…

వీళ్ళింట్లో మరచెంబుకి, కూజాబిందెకి మధ్యస్థ పరిమాణంలో ఓ బుల్లి స్టీలు బిందె ఉంది. దాంట్లో ముచ్చటగా మూడే మూడు చెంబుల నీళ్ళు పడతాయి. కరెంటుతో పనిచేసే ఇమ్మర్షన్ హీటర్ ను ఆ బిందెలోని నీళ్ళలో పెట్టి, ఆన్ చేసి, కాగాక ఆ వేడి నీళ్ళతో స్నానం చేస్తారు వీళ్ళు. ఒక్కొక్కరికీ ఒక్కో బిందెడు నీళ్ళు… రేషన్ అన్న మాట. పొరపాటున కూడా  కొంచెం పెద్ద పాత్రతో  పెట్టటం కానీ, గ్యాస్ స్టవ్ మీద నీళ్ళు కాచటం కాని చేయనే చేయరు. అసలు ఈ వేణ్ణీళ్ళు కాచుకోవటం, వాటితో స్నానాలు చేయటం అంతా కేవలం శీతాకాలం లోనే. ఫిబ్రవరి నెల దాటిందా, ఇక ఇంటిల్లిపాదీ చన్నీటి స్నానాలే…

నేను అత్తయ్యతో, సునీత తో కూడా రెండు మూడు సార్లన్నాను. ‘నాకు చలి ఎక్కువ కాబట్టి, కొంచెం వేణ్ణీళ్ళు ఎక్కవగా కావాలని ‘ అప్పటికి ‘సరే’ అని అన్నా, మర్నాడు పని హడావుడిలో షరా మామూలే. నేనూ, మొహమాటం వల్ల గట్టిగా అడగలేకపోతున్నాను.

రోజులు గడిచే కొద్దీ ఇదే రొటీన్… స్నానం చేసినా, ఒళ్ళంతా చిరాగ్గా ఉంటోంది. చలి వల్ల చర్మం పొడి బారి, దురదలు మొదలయ్యాయి. అరకొర నీళ్ళతో, ఆదరా బాదరా స్నానం చేసి రావటం వల్ల మెడంతా నల్లగా తయారైంది. మోచేతులు, పాదాలు చెమట పట్టి, మట్టి సన్నని లేయర్ గా మాదిరి గా ఫార్మ్ అయి, లైట్ గా ఒళ్ళంతా అదో వాసన వేస్తున్న భావన కలుగుతోంది.  పరిమళ అన్న పేరు పెట్టుకున్నందుకు నాకే సిగ్గేస్తోంది.

ఒకరోజు అక్కయ్య పెట్టిన చపాతీలు తింటూ, క్యాజువల్ గా అన్నాను, “ఇంట్లో గీజర్ ఉంటే బావుంటుంది కదక్కయ్యా?…” అని.

“గీజరా? అంత ఖరీదైన వస్తువు మాకెందుకమ్మా? ఇంచక్కా హీటరుంది కదా?”

“చలికాలం కదక్కయ్యా? బకెట్ నిండా వేడి నీళ్ళతో స్నానం చేస్తె బావుంటుందిగా? గీజరుంటే, స్విచ్ వేసి ఉన్నంతసేపూ వేణ్ణీళ్ళు వస్తూనె ఉంటాయి ఎంచక్కా…”

“ఆ, అప్పుడు పిల్లలు, పెద్దాళ్ళు గంటల తరబడి బాత్ రూం లోనే తిష్ట వేసుకొని ఉండిపోతారు. పనులవద్దూ?” అని ఆవిడ తేలిగ్గా అనేయటంతో అప్పటికేమీ మాట్లాడలేకపోయాను.

మరొకరోజు సునీత తో చెప్పాను. నాకు నీళ్ళ వేడి ఏ మాత్రమూ సరిపోవటం లేదని…

“అబ్బ, అంత వేడి నీళ్ళు పోసుకోకూడదులే వదినా, గోరువెచ్చగా ఉంటే చాలు…” అంది సునీత.

అత్తయ్య కల్పించుకొంటూ, “చలికాలంలో బాగా వేడి నీళ్ళు పోసుకోవటం వల్ల చర్మం పాడైపోతుందమ్మా…” అని చెప్పటంతో నాకు నవ్వాలో, ఏడవాలో తెలియలేదు.

రోజు రోజుకీ నా పరిస్థితి మరీ దుర్భరమైపోతూ ఉండటంతో, మా అత్తయ్యను, అక్కయ్యనూ, బాబు మీద బెంగగా ఉందనీ, ఇంటికి వెళ్ళిపోతాననీ రోజుకోసారి  అడగసాగాను.

“ఆదివారం ఆదివారం ఈశ్వరూ, శశాంకూ వస్తూనే ఉన్నారు కదమ్మా, మరీ చోద్యం చెబుతావు… వెళ్దువు గాన్లే, నీకు కొంచెం ఓపిక రానివ్వు… సునీత నీకు సాయం గా వచ్చి, నీ లీవ్ అయిపోయేవరకూ నీకు తోడుంటుంది…” అని అత్తయ్యా, “వచ్చే వారం ఎలాగూ చెకప్ కి వెళ్ళాలి కదా, డాక్టర్ ని కలిసి, మందులవీ రాయించుకొని, వెళ్ళిపోదువు గాన్లే పరిమళా… కొంచెం ఓపిక పట్టు…” అని అక్కయ్యా అంటూ ఉంటే, మొండి పట్టు పట్టి బలవంతంగా వెళ్ళిపోవటానికి మనసు రాలేదు నాకు.

అదీగాక ఇంకా నీరసమూ తగ్గలేదు పూర్తిగా… ఇంటికి వెళ్ళి, వంట పనీ, ఇంటి పనీ చేసుకొనే శక్తి లేదు. పుట్టింట్లో కన్నా అపురూపమైన వైభవంగా ఉందిక్కడ నాకు.. దీన్ని వదులుకొని వెళ్ళాలంటే ఎంత కష్టం? కానీ నా బాధ ఎవరికి అర్థం అవుతుంది? బొత్తిగా స్నాన సుఖం లేదిక్కడ… పోనీ వేసవి కాలమైనా కాదాయె… ఎవరైనా వింటే ‘ఇదీ ఓ సమస్యేనా?’ అని నవ్వుకుంటారేమో నాకు తెలియదు కాని, అనుభవిస్తున్న నాకే తెలుసు ఇది ఎంత నరక సదృశ్యమో…

***

వావ్… ఎంత బావుందో… లేతాకుపచ్చ రంగు బాత్ టబ్ లో హాట్ వాటర్ నింపి, దాంట్లొ లిక్విడ్ సోప్ ఒంపి, తలకు షవర్ క్యాప్ బిగించి, నురగలు తేలే ఆ నీళ్ళలో మునిగి స్నానం చేస్తూ ఉంటే, ‘ఆహా, నా రాజా… స్వర్గమంటే ఇదే కదా…’ అనిపిస్తోంది.     అలా చేప పిల్లకు మల్లే ఈదుతూ… వేడి నీటిలో నానుతూ ఉంటే, ఎంత హాయిగా ఉందో చెప్పటానికి మాటలు రావటం లేదు…

ఎక్కడినుంచో ఫోను మ్రోగుతున్న ధ్వని… ‘అబ్బా… ఈ తీయని స్నానం అర్థాంతరంగా ముగించి, లేచి వెళ్ళి ఆ డొక్కు ఫోన్ కాల్ అటెండ్ అవాలా?’ అయిష్టంగానే లేచి, ఒళ్ళు తుడుచుకొని…బాత్రూం గడియ…

“పిన్నీ, నీ సెల్ ఆగకుండా మోగుతోంది… మీ ఆఫీస్ వాళ్ళెమో చూడు…” అంటూ లేపేసింది, అనన్య. మంచి కల కాస్తా హటాత్తుగా కరిగిపోయింది.  నా నిద్ర ఎగిరిపొయింది… ఈ లోగా ఫోన్ మోతా ఆగిపోయింది.

అబ్బ, ఎంత తీయని కల! టబ్ లో స్నానం భలే బావుంది… ‘స్వంత ఇల్లు కట్టుకుంటే, దాంట్లో పెద్ద బాత్ రూం, అందులో చక్కని బాత్ టబ్, మంచి గీజర్… తప్పకుందా అమర్చుకొవాలి…’ గట్టిగా నిశ్చయించుకున్నాను.

మొత్తానికి నాలుగు రోజుల తర్వాత, డాక్టర్ని కలిసిన వెంటనే మా  శ్రీవారు వచ్చి, కారులో నన్నూ, సునీతని మా ఇంటికి తీసుకువెళ్ళటానికి ఖరారైంది.

***

కారు మా అపార్ట్ మెంట్ లోనికి ప్రవేశిస్తూ   ఉంటే, కన్న తల్లి ఒడిలోనికి చేరుకున్న భావన… ఏదో తెలియని ఉద్వేగం, సంతోషం… ముందు సునీత నడుస్తూ ఉండగా, మెల్లగా శ్రీవారి చేయి పట్టుకొని మెట్లెక్కుతూ, ఫస్ట్ ఫ్లోర్ లోని మా ఫ్లాట్ కి వచ్చాను. అప్పటికే మా బాబు స్కూల్ కి వెళ్ళిపోయాడు. జాగ్రత్తలు చెప్పి ఈశ్వర్ కూడా ఆఫీసుకు వెళ్ళిపోయారు.

ఆయన బయలుదేరగానే, నేను చేసిన మొదటి పని… బాత్ రూం దగ్గరకు వెళ్ళి, గీజర్ స్విచ్ ఆన్ చేయటం…

ఇంట్లోనే తిఫిన్లు తినేసి, మధ్యహ్నానికి కూడా లంచ్ ప్యాక్ చేసుకొని వచ్చాం కాబట్టి మాకు వేరే పని ఏమీ లేదు. సునీత టీవీ ముందు సెటిల్  అయిపోయింది.

పావుగంట తర్వాత,

టవల్ తీసుకొని, నేను బాత్ రూం వైపు నడుస్తుంటే ఆశ్చర్యంతో నోరు తెరిచింది సునీత.

***

“ఉదయమే స్నానం చేసావుగా, మళ్ళీనా?” అంది వింతగా చూస్తూ… నేను నవ్వేసి, మెల్లగా నడచుకుంటూ బాత్ రూం లోకి ప్రవేశించాను. నాబ్ ని హాట్ వాటర్ ఔట్ లెట్ వైపు తిప్పి, టాప్ ఆన్ చేయగానే జల జల మంటూ పొగలు కక్కే వేడి నీళ్ళు జలతరంగిణీ నాదంతో బకెట్లో పడసాగాయి. బంగారం కరిగి నీరై ద్రవ రూపంలో పడుతున్నట్టు ఎంతో విలువైనవిగా, అపురూపమైనవిగా అనిపించాయి ఆ నీళ్ళు..

‘జలకాలాటలలో… కలకల పాటలలో….

ఏమి హాయిలే హలా! అహ ఏమి హాయిలే హలా!’

అప్రయత్నంగా నా పెదవుల మీదికి పాట వచ్చేసింది.

అరగంట సేపు తనివి తీరా స్నానం చేసాక నాకు కలిగిన ఆ తృప్తి, హాయి, సుఖం నిజంగా అనిర్వచనీయం…

***

ఆ ఏడాది  మా అక్కయ్య పుట్టినరోజుకు పెద్ద గిఫ్ట్ పాకెట్ తీసుకువెళ్ళి, చేతివ్వకుండా [బరువు కదా మరి!] ఆ పక్కనే ఉన్న టేబుల్ మీద పెడుతుంటే, ఆ వస్తువును చూసి మా వాళ్ళంతా విస్మయంతో నోళ్ళు తెరిచారు.

అది చీర కాదు…ఆభరణాలు కావు… స్టీలు పాత్రలూ కావు… ఔను… అది ‘గీజర్ ‘ …

ఎవ్వరూ ఇలాంటి బహుమతిని ఇవ్వరని తెలుసు నాకు… కానీ నేను అత్తయ్య గారింటికి వచ్చినప్పుడు సంతోషంగా వాళ్ళతో గడపాలంటే, ఈ వస్తువు ఇవ్వటం తప్పనిసరి అని నాకనిపించింది. ఇదంతా నా స్వార్థమే కావచ్చు, కానీ ఇకపై వాళ్ళింట్లో నేను  ఏ అగచాట్లూ పడనక్కరలేదుగా?

సునీతా, అక్కయ్యా ముఖ ముఖాలు చూసుకొని నవ్వు దాచుకొంటుంటే, ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు, నా ఇచ్చయే గాక నాకేటి వెరపు?’ అన్న దేవులపల్లి వారి పంక్తులు గుర్తుకు వచ్చాయి నాకు…

‘సుఖ స్నాన ప్రాప్తి రస్తు!’ అంటూ నాలోని ఉష్ణ జల ప్రియురాలు నన్ను విష్ చేస్తూ ఉంటే,  ఆపుకోలేనంత ఆనందం చిరునవ్వుగా మారి నా పెదవులపై విరిసింది.

 

***

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Print Friendly

సంస్కృత సాహిత్యములో ప్రముఖ కవయిత్రులు.

రచన: కొరిడె విశ్వనాథ శర్మ

మహోన్నతమైన ప్రాచీన భారతీయ సంస్కృతీ నాగరికతలకు దర్పణమువంటిది వైదిక వాఙ్మయము. అది మొదలుకొని నేటి వరకును సంస్కృతవాఙ్మయమునందు గణనీయముగా సారస్వతసేవయొనరించిన మహిళామణులెందరో మనకు కానవచ్చుచున్నారు. వైదిక వాఙ్మయముపరిశీలించిన ఆత్మజ్ఞాన సముత్తీర్ణులైన గార్గి,మైత్రేయి మున్నగు వారు  జగత్ప్రసిద్ధులైయ్యిరి. విశ్వవార, అపాల, లోపాముద్ర మొదలుగాగల గృహిణులుమంత్రదర్శినులుగా పేరొందియున్నారు. తనభర్తయైన మండనమిశ్రునకు జగద్గురు ఆదిశంకరులకును జరిగిన వాదమునకు న్యాయాధిపురాలుగా నుండిన ఊభయభారతి మిక్కిలి ప్రసిద్ధురాలైయ్యెను.

 

శ్లో. గోధా ఘోషా విశ్వవారా పాలేషా మ్మాతృకర్షికా,

బ్రాహుర్నామా అగస్త్యస్య స్వసాదితిః,

లోపాముద్రా చ నద్యశ్చ యమీ నారీ చ శశ్వతీ

శ్రీర్లాక్షా సార్పరాజ్ఞీ వాక్ శ్రద్ధా మేధా చ దక్షిణా

రాత్రీ సూర్యా చ సావిత్రీ బ్రహ్మవాదిన్య ఈరితాః.

 

అని అపాలోపనిషత్తునందు మంత్రదర్శినులపేర్లు పేర్కొనబడినవి. దీని వలన ఆనాడు స్త్రీవిద్య యే కాక వేదవిద్య కూడ స్త్రీసమాజమున ఎట్లు వ్యాపించి యున్నదోతెలిసికొనవచ్చును. ఇదేవిధముగ లౌకిక సాహిత్యమునందునూ ప్రశంసనీయములైన సేవలందించిన కవయిత్రులు ఎందరో ! వారిలో ప్రముఖమైన కవయిత్రుల పరిచయము దిఙ్మాత్రముగ ఉదహరించుటే ఈవ్యాసము ఉద్దేశము.

 

శ్లో. శీలావిజ్జా మరులా మోరికాహ్వాః,

కావ్యం కర్తుం సంతు విజ్ఞాః స్త్రియోఽపి.

విద్యాం వేత్తుం వాదనే నిర్విజేతుం,

దాతుం విద్యాం యః ప్రవీణః స వంద్యః.

 

అని ధనదేవుడు తెలిపి యున్నాడు. అనగా శీల, విజ్జ మారల, మోరిక, యనువారలు కావ్యమును వ్రాయగలుగుదురేమోగాని, విద్యనభ్యసించుటకు,విద్యనభ్యసింపజేయుటకు,  విద్వద్గోష్ఠివాదనలో జయించుటకు కూడ ప్రవీణుడైన పురుషుడే సమర్థుడని అభిప్రాయపడినాడు. ఇయ్యది ఆతని అసూయను తెలిపినప్పటికినీ, ఆయా కవయిత్రుల విశయములను పరిశీలించినచో వారు శాస్త్రచర్చాదులలో పురుషులతో సమానులని తెలియుచున్నది.

 

విజ్జిక/విజయ.

శ్లో. సరస్వతీవ కర్ణాటీ విజయాంకా జయత్యసౌ,

యా వైదర్భీ గిరాంవాసః కాలిదాసాదనంతరమ్.

అని రాజాశేఖరుడిచే కాలిదాసుని తరువాత స్థానాన్నే పొందిన కవయిత్రి విజయాంక. ఈమెయే విజయ. విద్య,

విజ్జిక అని కూడ ఈమె ప్రసిద్ధినొందినది. ధనదేవుని చే పేర్కొనబడిన విజ్జ కూడ ఈమెయే!

 

శ్లో. నీలోత్పలదలశ్యామాం విజ్జికాం మామజానతా,

వృథైవ దండినా ప్రోక్తా సర్వశుక్లా సరస్వతీ,

’దండికి తన గురించి తెలియకనే శ్వేతవర్ణురాలిగా సరస్వతీదేవిని వర్ణించినాడు.’ అని ఈ కవయిత్రి తానే సరస్వతినని గర్వంగా ప్రకటించుకొన్నది. ఈమె కర్ణాటక దేశస్థురాలని, రెండవ పులకేశి కుమారుడైన చంద్రాదిత్యుని భార్య యని క్రీ.శ.ఏడవశతాబ్దికి చెందినదని సాహిత్య విమర్శకుల అభిప్రాయము.

 

శ్లో.  ఏకో భూన్నలినాత్ తతశ్చ పులినాద్వల్మీకతశ్చాపరః,

తే సర్వే కవయో భవంతి గురవ స్తేభ్యో నమస్కుర్మహే।,

అర్వాంచో యది గద్యపద్య రచనై శ్చేతశ్చమత్కుర్వతే

తేషాం మూర్ధ్నిదదామి వామచరణం కర్ణాటరాజప్రియా॥

అని విజ్జికశ్లోకము గా లభించు ఈశ్లోకమునందు కవయిత్రి “బ్రహ్మ, వ్యాస, వాల్మీకులు మాత్రమే కవులు, గురువులు. అట్టివారికి మాత్రమే నమస్కరిస్తున్నాను. తదితరులు గద్యపద్యరచనా చమత్కారమును వినోదము  కొరకే కలుగ జేయువారు గాన అట్టివారి తలపైన కర్ణాట రాజప్రియయైన తాను వామపాదమునుంచెదనని ప్రకటించుకొన్నది. కాని  అజ్ఞాతకర్తృత్వకమై ’కౌముదీమహోత్సవము’ అను కావ్యమును ఈమెయే వ్రాసెనని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

 

సుభద్ర

శ్లో.పార్థస్య మనసి స్థానం లేభే ఖలు సుభద్రయా,

కవీనాం చ వచో వృత్తి చాతుర్యేణ సుభద్రయా.

పార్థుని మనస్సునందు అలనాటి సుభద్ర స్థానము నొందినట్ట్లు, కవయిత్రియగు సుభద్ర తన వాగ్వృత్తి చాతుర్యముచేత కవులమనస్సునందు స్థానము నొందినదని రాజశేఖరునిచే కొనియాడబడిన  కవయిత్రి ఈ సుభద్ర.  కావ్యమాలలో నుదహరించబడిన ఈమె శ్లోకమొక్కదానిని గమనించండి.

 

శ్లో. దుగ్ధం చ యత్ తదను యత్కథితం తతో ను

మాధుర్యమస్య హృతమున్మథితం చ వేగాత్,

జాతం పునర్ఘృతకృతే నవనీతవృత్తి

స్నేహో నిబంధన మనర్థపరంపరాణామ్.

ఈ శ్లోకమునందు పాలయొక్క దీనావస్థను  తెలుపుతూ స్నేహవృత్తి అనర్థపరంపరలనే కలికించునని అన్యాపదేశమున తెలిపెను. పదవశతాబ్దీయుడైన రాజశేఖరునిచే ప్రసిద్ధ కవయిత్రిగా కొనియాడబడిన ఈమె కాలము అంతకంటె పూర్వమని చెప్పవచ్చును . ప్రస్తుతము ఈమె గ్రంథములేవియును కానరాకున్నవి.

 

అవంతి సుందరి

రాజశేఖరుని ప్రశంసలందు కొన్న మరొక ముఖ్యమైన కవయిత్రి అవంతి సుందరి . ఈమె రాజశేఖరుని భార్య కావడము మరొక విశేషము .

శ్లో.  చాహుణకులమౌలిమాలికా రాజశేఖర కవీంద్ర గేహినీ ,

భర్తుః కృతిమవంతి సుందరీ సాప్రయోజితు మేతదిచ్ఛతి ||

అని తనకర్పూరమంజరిని ఆమె ప్రయోగింపనిచ్ఛగించుచున్నదని రాజశేఖరుడు తన నాటకమున తెలియజేసినాడు . ఇంకను ఆయన తన కావ్యమీమాంస యందు కొన్ని చర్చనీయాంశములందు ఈమె అభిప్రాయములనుతెలిపియున్నాడు . తద్ద్వారా ఈమె యొక్క సునిశితపరిశీలనజ్ఞానము వ్యక్తమగుచున్నది

 

గంగా దేవి    

కవయిత్రులలో ఉత్తమమైన రచన గావించిన కవయిత్రి గంగాదేవి . క్రీ. శ. 14 వ శతాబ్ది కాలమువాడై తనభర్త కంపరాయుని శౌర్యసాహసములను ‘వీరకంపరాయచరితమ్ ’ అను కావ్యముద్వారా తెలియజేసినది. వీరరస స్ఫొరకమైన ఈ కావ్యమునకు “మధురావిజయం “నామాంతరముకూడ కలదు . మనోహరమైన, సరళమైన శైలిలోనున్న ఈ కావ్యము కాళిదాసకవిత్వమును స్ఫురింపజేయును . ఈమె శ్లోకమోకదానిని గమనించండి.

శ్లో || ఘనమాన దలారరీపుటం నలిన మందిరమిందిరాస్పదమ్,

పరిపాలయతిస్మ నిక్వణన్ పరితో యామికవన్ మధువ్రతః .

 

తిరుమలాంబ

క్రీ.శ. 16వ శతాబ్ద ఉత్తరార్ధమునకు సంబంధించిన అచ్యుతరాయలభార్యలలో నొకతె యైన తిరుమలాంబ కూడ తన భర్తనే నాయకునిగా జేసికొని ‘వరదాంబికా చంపు’ అను చంపూకావ్యమును వ్రాసినది. ఈ కావ్యమున అచ్యుతరాయలు వరదాంబతో వివాహము మొదలుకొని, వెంకటాద్రి యౌవరాజ్యపట్టాభిషేకమువరకు వర్ణించినది. శబ్దచమత్కారములతోనూ,అర్థప్రౌఢిమతోనూ కావ్యము రసవత్తరముగానూ కొనసాగుతూ ఈ కావ్యము పాఠకుల మనస్సును రంజిల్లజేయును.

 

రామభద్రాంబ :

అధిక శ్రియమచ్యుతేంద్రసూనుం,

రఘునాథం రఘునాథమేవ సాక్షాత్ ,

హృదయే కలయన్తి యే మహాంతః ,

పరమానందభరాత్త ఏవ ధన్యాః .

అని 16 వ శతాబ్దమునకు సంబంధించిన తిర్యుమలాంబాకాలమునకు సంబంధించిన  “రామభద్రాంబ” కవయిత్రి కూడ తన భర్తయైన తంజావూరు ప్రభువైన రఘునాథనాయకుని నాయకునిగా జేసికొని ఆయన అనుజ్ఞతో చారిత్రికకావ్యశ్రేణిలో జేరు “రఘునాథాభ్యుదయ మహా కావ్యము”ను వ్రాసినది. 900 శ్లోకములకు పైగా వ్రాయబడిన ఈ కావ్యము 12 సర్గలతో నిబద్ధమైనది. “అష్టభాషాకల్పితచతుర్విధకవితాను ప్రణీత సాహిత్య సామ్రాజ్య భద్రపీఠారూఢ రామభద్రాంబా విరచితే… “అను గద్యమును బట్టి ఈమె పాండిత్యప్రకర్షత్వమును అర్థం చేసుకొనవచ్చు.

 

మధురవాణి

తంజావూరు ప్రభువైన రఘునాథనాయకు (1614-1633) ని చే వ్రాయబడిన రామాయణమును ఆయన కొలువులోనున్న మధురవాణి అనే కవయిత్రి సంస్కృతీకరించినది. ప్రస్తుతము ఈ కావ్యము 1500 శ్లోకములకుపైగా 14 సర్గలతో లభించుచున్నది. ఈమె రచన ఆమె పేరుకుతగినట్లుగా లలితమధురమైనట్టిది.

 

శీలభట్టారిక

ధనదేవునిచే పరిచయము  గావించబడిన మరొక కవయిత్రి శీలబట్టారిక. ఈమె గురించి రాజశేఖరుడు –

శ్లో. శబ్దార్థయో సమో గుంఫః పాంచలీరీతిరుచ్యతే,

శీలాభట్టారికావాచి బాణోక్తిషు చ సర్పతి .

అని బాణునితో సమముగా ప్రశంసించినాడు. ఈమె రచన యైన ప్రసిద్ధమైన ఈ శ్లోకము రసజ్ఞులైన సహృదయులగు మీ స్మృతిపథమున విరాజిల్లుచునేయుండును. అట్టి ఈ శ్లోకమును గమనించితిరా?..

 

శ్లో. యః కౌమారహరః స ఏవ వరః తా ఏవ చైత్రక్షపాః ,

తే చోన్మీలితమాలతీసురభయః ప్రడాః కదంబానిలాః,

సా చైవాస్మి తథాఽపి తత్ర సుతవ్యాపారలీలావిధౌ,

రేవారోధసి వేతసీతరుతలే చేతః సముత్కంఠతే .

ఈ శ్లోకమున నాయిక తన చెలికత్తెలతో తన వైవాహికజీవితమును వివరించుచూ, “ పూర్వమున తన మనోహరుడైన ప్రియుడినే పెండ్లియాడిననూ,రేవానదిలోని యిసుకతెన్నెలపై అట్టి ఆప్రియునితో గావించిన సురత వ్యాపారమే తన మనస్సునకూ ఇప్పటికినీ ఉత్కంఠమును కలిగించుచునేయున్నది.” అని తెలిపిన ఈ

శ్లోకము ఎంత హృద్యముగానున్నదో సహృదయులెరుగనది కాదు.

 

దేవకుమారిక

క్రీ. శ. 17 వశతాబ్ది ఉత్తరార్ధ, 18 వశతాబ్ది పూర్వార్ధములకు   సంబంధించిన ఉదయ్ పూర్ రాజవంశీయుడైన రాణా అమరసింహుని భార్య యైన దేవకుమారిక “బైద్యనాథప్రాసాదప్రశస్తిః ” అను కావ్యమును రచించినది. ఈ లఘుకావ్యమునందు రాణావంశీయులచరిత్రను పేర్కొన్నది. ముఖ్యముగా తనకుమారుడైన సంగ్రామసింహుని పట్టాభిషేకమును అద్భుతముగా వర్ణించినది. మచ్చునకు ఈమె శ్లోకమునొకదానిని పరిశీలించండి.

 

శ్లో. గుంజద్ భ్రమద్ భ్రమరరాజివిరాజితాస్యం,

స్తంబేరమాననమహం నితరాం నమామి |

యత్పాదపంకజపరాగపవిత్రితానాం,

ప్రత్యూహరాశయ ఇహ ప్రశమం ప్రయాంతి ||

 

వికటనితంబ

శ్లో. కే వైకటనితంబేన గిరాం గుంఫేన గుంఫితాః|

నిందంతి నిజకాంతానాం న మౌగ్ధ్యమధురం వచః ||

అని రాజశేఖరుడు తన సూక్తిముక్తావళియందు పేర్కొన్న మరొక కవయిత్రి వికటనితంబ. ‘వికటనితంబపదగుంభనములను గమనించినవారెవరు  తమ భార్యలమృదుమధుర వాక్యములనైననూ నిందించకమానరు?’ అని ఈమెను ప్రశంసించియున్నాడు. ఈమె కాశ్మీరదేశస్థురాలు. ఈమెను గురించి భోజమహారాజు కూడ తన శృంగారప్రకాశిక లో ప్రస్తావించినాడు. ఐనప్పటికినీ ఈమె కావ్యములేవియూ ప్రస్తుతము లభ్యములుకాకున్నవి.

 

ఫల్గుహస్తినీ

ఏనిమిదవ శతాబ్ది ఉత్తరార్ధమున ప్రసిద్ధినొందిన కవయిత్రి ఫల్గుహస్తిని. సుభాషితావళియందు ఈమె శ్లోకములు రెండు కానవచ్చుచున్నవి.

శ్లో. త్రినయనజటావల్లీపుష్పం నిశావదనస్మితం,

గ్రహకిసలయం సంధ్యానారీనితంబనఖక్షతమ్|

తిమిరభిదురం వ్యోమ్నః శృంగం మనోభవకార్ముకం

ప్రతిపదినవస్యేందోః బింబం సుఖోదయమస్తు నః ||

అను ఈ శ్లోకమునందు శుక్లపక్షప్రతిపదచంద్రునివర్ణన గావించబడినది. అలంకారశాస్త్రకర్తయైన వామనుడు కూడ ఈమె ప్రస్తావనగావించినాడు.

 

త్రివేణి

క్రీ. శ. 19వ శతాబ్దికి చెందిన త్రివేణి యను కవయిత్రి దక్షీణభారతమునకు చెందినట్టిది. శ్రీవైష్ణవీయురాలగు నీమె  దౌర్భాగ్యమువలన తనకు వైధవ్యము ప్రాప్తించగా,ఆధ్యాత్మికవ్యాసంగమొనరించుచూ,స్తోత్రములను, కావ్యములను రచించుటేకాక మేఘసందేశముననుసరించుచు రెండు కావ్యములను, రెండు వేదాంత నాటకములను కూడ రచించియుండెను.

 

బీనాబాయి

చాహువాక వంశీయుడు ఫాటలీపుత్రరాజైనహరిసింహుని భార్య బీనాభాయి. ఈ రచయిత్రి కాలము 15వ శతాబ్దమని తెలియవచ్చుచున్నది. మిక్కిలి పవిత్ర క్షేత్రమైన ద్వారకానగరము గురించి ద్వారకాపట్టల యను గ్రంథమును సంకలనమొనరించెను. ఈమె గొప్ప ప్రతిభావంతురాలు.ఈమె కాలమునకు సంబంధించినట్టిదే విశ్వాసదేవి. ఈమె గంగావాక్యావళీ యను గ్రంథమును సంకలనమొనర్చెనని చెప్పుదురు. అదే విధముగా 14 శతాబ్దానికి చెందిన లఖిమ ,16 వ శతాబ్దానికి చెందిన ఇందులేఖ ,17 వశతాబ్దానికి చెందిన వైజయింతిక అను కవయిత్రులు వ్రాసిన కావ్యములు  కూడ లభ్యములు కాకున్నవి. క్షమారావయను 20 వ శతాబ్దికి చెందిన కవయిత్రి సత్యాగ్రహగీత యను కావ్యమును వ్రాసినది. ఇట్లు ప్రాచీన సంస్కృతసాహిత్యమునకు సేవజెసిన మహిళామణులెందరో! నాటికాలముననే  “ముదితల్ నేర్వగరానివిద్యగలదే ముద్దార నెర్పింపగన్”అని విద్యా, సాహిత్యరచనా పాటవమున మగధీరులను కూడా తలదన్నువారమని చాటి చెప్పినట్టి మాతృమూర్తులకు వందనమర్పించుచూ..

 

Print Friendly

రాముడుండాడు…రాజ్జిముండాది. – కేశవరెడ్డి

రచన:చక్రధర్                                                                                                        

 

 

భూస్వాములో .. దొరలో.. జమీందారులో.. మోతుబరీ రైతులో.. కార్పొరేట్ మేధావులో .. ఎవరైతేనేమిటి ?

సామాన్యుల జీవనావసరాలని.. నిసిస్సహాయతనీ ..

బలహీనతనీ ఆధారం చేసుకొని  ఏళ్ళకి ఏళ్ళు శ్రమదోపిడీ చేసి కూలీలుగా, జీవమున్న యంత్రాలుగా మార్చే పెట్టుబడి దారీ వ్యవస్థ..ఆ చట్రంలో ఇరుక్కొని బతుకీడ్చే సామాన్యుని బతుకే ఈ కథ. ఈ పెట్టుబడిదారీ వ్యవస్థకి ఆసరాగా నిలిచి ఊతమిచ్చేదే మన గవర్నమెంటు. అందుకే అది చేసే చట్టాలుకూడా సామాన్యుడి ఎదుగుదలకి ఉపయోగపడవు. అది కట్టించే పక్క ఇళ్ళు.. రేషన్…చౌకధరదుకానాలు మొదలైనవి అన్నీ  తమ చాకిరీకి ఉపయోగపడే సామన్యులు చావకుండా చేసే ప్రయత్నాలే. వాళ్ళేసే ఓట్లకోసం పడే పాట్లే.

కూనిగాడు ఎప్పుడోచేసిన చిన్న అప్పు తీర్చటానికి.. ముప్పైయేండ్ళు పెదనాయుడు పొలం కూలీగా మారతాడు.

అతనికి ఒక్క ఎకరం ఎరచూపి.. కూనిగాడి కొడుకు పులిగాడిని మరోముప్పై ఏండ్లకు కూలీ కుదుర్చుకుందామని ఆశ జూపుతాడు పెదనాయుడు. అప్పటికే ఈ జమీందారుల చేతుల్లో అన్యాయానికి గురైపోతున్నామనీ..ఈ పల్లె జీవితం గిట్టుబాటు కాదని తెలుసుకున్న పుల్లిగాడు పట్నంలో కూలీ జీవితం గడుపుతుంటాడు. తండ్రి తనకి ఉన్నపళంగా రమ్మని రాసిన ఉత్తరం చూసి ఎదో జరిగుంటుందేమో అన్న భయం తో పల్లెకొస్తాడు పుల్లిగాడు. అప్పుడు అక్కడ వివిధ జనాల పీడన జీవితాలనీ, వడ్డేర..చాకలి..కంసాలి వంటి వృత్తులవాళ్లూ.. నిమ్నవర్గాలకి చెందిన రోజుకూలీల  దుర్భరజీవితాన్ని ఆవిష్కరిస్తాడు రచయిత.

అప్పుడెప్పుడో దొంగలు ..బందిపోట్లు ఉండేవారు. వాళ్ళు ఊరిమీదపడి  అంతా దోచుకుపోయేవాళ్ళు. కానీ ఈనాడు ఈ పెట్టుబడి దారులు..గవర్నమెంటూ కలిసి పరోక్షంగా దోచుకుంటున్నారు. మనిషి చస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం, అతడు తన కాళ్లమీద నిలబడి పది రూపాయలు సంపాదించగానే ఇంకంటాక్స్, ఆ టాక్స్ ఈ టాక్స్  అంటూ చట్ట  ప్రకారం దోచుకుంటుంది ప్రభుత్వం . బలవంతుడు బలహీనత మీద  దోచుకుంటాడు. పెట్టుబడిదారులు మనుషులని కూలీలుగా మార్చి శ్రమనీ.. స్వేచ్చనీ దోచుకుంటారు. ఈ ‘దోపిడి’ ప్రత్యక్షంగా ఎక్కడా కనపడదు.కానీ దోపిడీ జరుగుతుంటుంది.రోజువారీ జీవితాలలో అంతర్బాగం ఐపోతుంది.  అందుకే ఈ కథలో  దోపిడీ దారుడు పెదనాయుడు ప్రత్యక్షంగా కథలో కనిపించడు.  పెదనాయుడి  పాలేరు ముత్యాలనాయుడు కపిపిస్తాడు.అతడు జనాల భయం…బలహీనత బాగా తెలిసినవాడు. యుగ యుగాలుగా అణువణువునా బానిసత్వాన్ని ..భయాన్ని నిలువెల్లా నింపుకున్న సామాన్యులు తమ గురించి తాము తెలుసుకోలేరని..తెలుసుకున్నా ఎదురించి నిలవలేరనీ అతనికి తెలుసు.అందుకే నోటికొచ్చిన పచ్చి బూతులూ తిడుతుంటాడు. జనాలు నోరుమూసుకొని పడటం తప్ప  ఏమి చెయ్యగలరు ??

పట్నంలో ఇంతకంటే మెరుగైన బతుకు ఉందనీ తెలిసినా

‘ఈ కొలిమిని నమ్ముకొని మా తాత.. తండ్రీ బతికారు.. నేనూ ఈ ఉళ్ళో యాభై ఏళ్ళనించీ బతుకుతున్నా దీన్ని నమ్ముకొనే’  అనే కంసాలి సెంటిమెంటుకు బానిస.

నేలనే తన ప్రాణంగా నమ్మిన  చిన్నరైతు తిరుపాలనాయుడు..తీసుకున్న అప్పు తీర్చలేక, పొలం జప్తు వాయిదా వేయించేప్రయత్నంలో ప్రభుత్వాదికారి లంచగొండితనానికి..నిర్ధయకీ బలయిపోతాడు. కళ్ళముందు జరుగుతున్న ఇలాంటి అన్యాయాన్ని చూడలేక, పుట్టినప్పటినించీ దేవాలయంలో పూజలు చేసే పూజారి..

‘ఊల్లో గుడి ఉండేదేవిటికి ?కంటికి రెప్ప మాదిరి..కాలికి గోరుమాదిరి ఊరును దేవుడు కాపాడాల. ఊరు ఇట్టా కిలపడిపోతా ఉంటే దేవుడు ఉన్నట్టా లేనట్టా ?? మరి గుళ్ళో దేవుడు లేనపుడు ఆ రాతిబొమ్మకి పూజల్జేసే దేవిటికి ?? ‘

దీనులకి..దిక్కులేని వారికి..దరిద్రలకీ అణగారిన ఆర్థ  జనానికి  ఏ సహాయమూ చేయని రాతిబొమ్మకి పూజలు చేస్తున్నానని తెలుసుకుంటాడు పూజారి. అర్చకత్వాన్ని వదిలేస్తాడు.

ముప్పయేళ్ళ బానిసత్వం నించి విములక్తుడయిన కూనిగాడు, కుల వృత్తి ని వదిలేసిన కంసాలి, పూజారీ,  ఉన్నపాటి భూమిని పోగొట్టుకొన్నతిరుపల నాయుడుని  పుల్లిగాడి తో పాటు పట్టణానికి బయలుదేర తీయటంతో  ఎక్కడో  ‘రాముడుండాడూ..రాముని రాజ్జిముండాది,  తమ జీవితాలు బాగుపడతాయ్ అన్నట్టుగా..ఒక చిన్న నమ్మకాన్ని మిగులుస్తాడు రచయిత.

ఇక ప్రత్యెకంగా చెప్పుకోవలసింది రచయిత  శైలి. సునిశితత్వం. పల్లె జీవిత అనుభవం, అక్కడి మనుషుల మనసులోతులు అన్నీ పూర్తి అధికారం ఉన్నది. సన్నివేశ వాతావరణాన్ని అమాంతం కళ్లముందు ఉంచుతాడు. ప్రకృతి వర్ణన అయితే చెప్పనే అక్కరలేదు, ఆ వర్ణనతో  జరగబోయే సన్నివేశాన్ని చూచాయగా చెప్పకనే చెపుతూ కథ మీద ఆసక్థి భిగువు కలిగింపచేస్తాడు. కేశవరెడ్డి నవలల్లో కథ కంటే కథ చెపుతున్న తీరే అద్భుతంగా ఉంటుంది.

భయానికి.. భక్తికి..సెంటిమెంట్కి..సాంప్రదాయానికి…మూడనమ్మకానికి..సంఘనీతికీ..అర్థం లేని నియమాలకీ.. మనమంతా,  ఒక్కోరం ఒక్కదానికి బానిసలం.

ఆ బానిసత్వం మన మనసుల్లో ఉంది. దాన్ని ఎదిరించిన నాడు.. జీవితంలొ కొత్త వెలుగూ, ఆనందం.

Print Friendly

ప్రకృతి ఒడిలో బ్రతుకు పాఠం

రచన- మధురవాణి

 

“బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన ఫలితంగా రానున్న ఇరవై నాలుగు గంటల్లో మెరుపులు, ఉరుములు, పిడుగులు, ఈదురు గాలులతో కూడిన కుంభవృష్టి కురిసే అవకాశం ఉంది. కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వారి సూచన” అంటూ రేడియోలో చెప్తున్న వార్తాహరుడి స్వరం మృదువుగా, ప్రశాంతంగా వినిపిస్తోంది.

సమయం సాయంకాలం నాలుగే అయినప్పటికీ అప్పటికే ఆకాశంలో సూర్యుడు చక్కా సెలవు పుచ్చేసుకోవడం మూలానా, కాలమేఘాలన్నీ గుమిగూడి అత్యవసర సమావేశం పెట్టుకోడం వల్లా అప్పుడే చీకటి తెరలు అలుముకుంటున్నట్టుంది. చెట్లన్నీ పూనకం వచ్చినట్టు ఊగిపోతూ మరి కాసేపట్లో మొదలవబోయే గాలిదుమారం భీభత్సానికి నాందీ ప్రస్తావన పలుకుతున్నట్టున్నాయి.

ఆ బస్తీలోని ఆడవాళ్ళందరూ వాతావరణ పరిస్థితిని గ్రహించి ఇంటి బయటున్న చెంబూ తపేళాలూ, మంచాలూ, బట్టలూ వగైరాలన్నింటినీ ఇంట్లోకి చేరుస్తూ, అలాగే వీధుల్లో ఆడుకుంటున్న పిల్లల్ని బలవంతంగా రెక్క పుచ్చుకు లాక్కొచ్చి ఇళ్ళల్లో పడేస్తున్నారు.

మరి కాసేపటికి ఈదురు గాలులతో గాలి దుమారం మొదలయ్యేసరికి అందరూ ఇళ్ళల్లోకి చేరి తలుపులు మూసుకున్నారు. కొద్ది నిమిషాల వ్యవధిలోనే దాదాపు ఆ వీధి వీధంతా నిర్మానుష్యమైపోయింది.

 

‘ఊరందరిదీ ఓ దారైతే ఉలిపి కట్టెదో దారి’ అన్నట్టు ఆ వీధి చివరన ఓ ఒంటిగది రేకులషెడ్డు ముందు ఒక చిన్న కుక్కి మంచంలో ఓ యువకుడు కూర్చుని ఉన్నాడు. ప్రకృతి విలయానికి ఏ మాత్రం చలించకుండా తపస్సును నిర్విఘ్నంగా కొనసాగించే మునిపుంగవుడి మాదిరి ఉలుకూ పలుకూ లేకుండా కూర్చున్నాడతను.

మాసిపోయిన అతని బట్టలు, ఎండిపోయి రేగినట్టున్న అతని తలకట్టు, మంచంలో రెండు చేతులు వెనక్కి ఆనించి కాళ్ళు ముందుకు విసిరేసినట్టు నిర్లక్ష్యంగా కూర్చున్న అతని వాలకం చూస్తుంటే ఇంతకన్నా పెద్ద దుమారమేదో అతని మనసులో చెలరేగుతోందనిపిస్తోంది. అంతటి గాలి దుమ్ము రేగుతున్నా కూడా రెప్ప వాల్చకుండా తదేకంగా ఎటో చూస్తూ కూర్చున్నాడతను.

 

“అయ్యో బాబూ.. పెద్ద వర్షం వచ్చేలాగుందిరా.. యీ వేళప్పుడు బయటికెక్కడికి బయలుదేరావు? పనేమైనా ఉంటే రేపు చూస్కోవచ్చులే. ఇంట్లోకి వచ్చి కూర్చో” అని ప్రేమగా పిలిచి చెప్పే అమ్మ లేదు అతనికి.

“ఉరేయ్! పెద్ద వాన పడేతట్టుంటే యాడికి రా పోతన్నావు యీ యాలప్పుడు. నోర్మూసుకుని ఇంటో గూచ్చోక” అంటూ వాత్సల్యంతో కూడిన అధికారంతో అరిచి చెప్పే అబ్బ కూడా లేడు.

పోనీ వర్షంలో తోడుగా తనతో పాటూ రావడానికి కనీసం తోబుట్టువులైనా లేరు. అతను తిన్నా తినకపోయినా, ఇంట్లో ఉన్నా, వర్షంలో తడిసినా, ఉన్నా, పోయినా కూడా ఎవరికీ పట్టదు. ఎందుకంటే, అతనికి ‘నా’ అనే వాళ్ళెవరూ లేరు.

యీ సువిశాల ప్రపంచంలో అతనో ఒంటరి ప్రాణి. అదే అతని బాధ కూడా!

ఈ క్షణాన అతని మనసులో రేగుతున్న దుమారమేంటో తెలియాలంటే అతని గతం గురించి కొంత తెలుసుకోవాలి మరి!

 

**********

 

అతను ఎక్కడ పుట్టాడో, ఎవరికి పుట్టాడో తెలీదు. గాలి ఒళ్ళో పెరిగాడు. ఊహ తెలిసిన దగ్గర్నుంచీ ఆ పనీ యీ పనీ చేసుకుని పొట్ట పోసుకుంటూ ఏ చెట్టు నీడనో వెతుక్కుంటూ బతుకు వెళ్ళబుచ్చుతున్నాడు. ఇహ చదువుసంధ్యల మాటయితే చెప్పనక్కరలేదు.

దాదాపు పదహారేళ్ళ వయసు వచ్చేదాకా కాకా హోటళ్ళలో టీలందిస్తూ, కప్పులు కడుగుతూ గడిపాడు. ముందూ వెనుకా ఎవరూ లేని వాడవటం మూలాన శ్రమకి తగ్గ ప్రతిఫలం కూడా దక్కేది కాదు. పొరపాటున ఏ టీ కప్పో చేజారితే చావబాదేవాళ్ళు హోటలు యజమానులు. అలా ఏదో ఒక పెద్ద దెబ్బ తగిలిన ప్రతీసారీ పొట్ట చేతబట్టుకుని మరో ఊరు పారిపోవడం, మళ్ళీ ఏదో పనిలో కుదురుకోవడం, మళ్ళీ ఏదన్నా తేడా వస్తే మరోసారి కాళ్ళకి బుద్ధి చెప్పడం.. ఇలా సాగుతూ వచ్చింది అతని జీవితం.

అన్నేళ్ళు అన్నేసి చోట్లా తిరుగుతున్నప్పటికీ ఎక్కడా కూడా తనపైన రవ్వంతైనా దయాదాక్షిణ్యం చూపించగలవారు ఒక్కరైనా ఎదురు పడలేదతనికి.

 

ఒకసారిలాగే పొట్ట చేతబట్టుకుని ఓ కొత్త ఊర్లో రోడ్డు మీద నించుని దిక్కులు చూస్తున్న అతన్ని “కూలీ పని చేయడానికొస్తావా? సాయంత్రానికి యాభై రూపాయలిప్పిస్తా”నన్నాడు ఓ తాపీ మేస్త్రి. యాభై రూపాలయన్న మాట చెవిన పడగానే సరేనని తలూపి ఆ మేస్త్రీ కూడా వెళ్ళాడు. ఆ మేస్త్రి అతన్ని నేరుగా నిర్మాణంలో ఉన్న ఓ పెద్ద భవనం దగ్గరికి తీసుకెళ్ళాడు. అక్కడ పని చేస్తున్న ఎంతో మంది మేస్త్రీల్లో అతన్ని తీసుకొచ్చినతను కూడా ఒకడు. ఒక్కో మేస్త్రీ కింద అతనిలాంటి వాళ్ళు ఓ ఇరవై మందైనా ఉన్నారు. ఇటుకలు, సిమెంటు, ఇసుక, కాంక్రీటు లాంటివన్నీ ఇనప బొచ్చెల్లో మొయ్యడం అతనికిచ్చిన పని. పొద్దున్న ఏడింటికి మొదలెడితే సాయంత్రం ఆరున్నర దాటేది పనయ్యేసరికి. ఆ పక్కనే ఉన్న కాకా హోటల్లోనే కాఫీలూ, ఫలహారాలూ, లంచూ, డిన్నరూ సమస్తం గడిచిపోయేవి. రాత్రికి నిద్ర కూడా వాళ్ళు కడుతున్న ఆ భవనంలో జరిగిపోయేది. అన్నీ ఖర్చులూ పోగా ఇంకా చేతిలో మిగిలిన ఇరవై రూపాయలు చూస్తే మహా సంబరంగా ఉండేది అతగాడికి.

 

అలా ఓ మూణ్ణెళ్ళు గడిచేసరికి ఆ బిల్డింగు కట్టడం పూర్తయిపోయింది. ఆ మేస్త్రీ వేరే ఏదో రాష్ట్రం పోతున్నాడట. అతనితో పాటు పని చేసిన చాలా మంది కూలీలు కూడా తలో దిక్కూ వెళ్తున్నారు జీవనోపాధి వెతుక్కుంటూ. వెళ్తూ వెళ్తూ మేస్త్రీ చెప్పాడు ఆ ఊర్లో ఫలానా సెంటర్లో పొద్దున్నే నిలబడితే కూలీల కోసం చాలా మందే వచ్చి తీసుకెళ్తారని. మర్నాడు పొద్దున్నే వెళ్లి మేస్త్రీ చెప్పిన చోట నించున్నాడు.  అతనిలాగే పొట్ట గడవడానికి పనికోసం ఎదురు చూస్తున్నవాళ్ళు చాలామందే కనిపించారక్కడ.

ఇంతలో ఓ వ్యక్తి వచ్చాడు అతను నించున్న గుంపు దగ్గరికి. ఆ వ్యక్తి వయసు దాదాపుగా నలభైయేళ్ళ పైనే ఉండొచ్చు. ఓ మోస్తరు లావుగానే ఉన్నాడు. నున్నగా మెరిసే బట్టతల, నుదుటి మీద కనిపిస్తున్న విభూతి రేఖలు, ముఖాన చిందుతున్న చిరునవ్వు, ఇవన్నీ కూడా చూడగానే ఆ వ్యక్తి మీద గౌరవం కలిగేలా చేస్తున్నాయి. తానొక పెద్ద మేస్త్రీననీ, కూలీకి జనాలు కావాలని చెప్పి దాదాపు ఓ వంద మందిని మాట్లాడుకుని వెంట తీస్కెళ్ళాడు. ఆ వ్యక్తితో పాటు వెళ్ళిన వందమందిలో అతను కూడా ఉన్నాడు. అలా ఆ రోజు ఆ కొత్త వ్యక్తితో కలిసి వెళ్ళిన అతను అప్పట్నించీ ఆ వ్యక్తి కూడానే ఉండిపోయాడు!

 

పనిలో చేరిన కొత్తలోనే అతను అనాథని తెలిసాక ఆ వ్యక్తే చేరదీసి మంచీ చెడ్డా చూడసాగాడు. అతనికి తను ‘బాబాయ్’ లాంటి వాడిననీ, అంచేత తనని ‘మేస్త్రీ’ అని కాకుండా ‘బాబాయ్’ అనే పిలవమన్నాడు. ఆ విధంగా యీ లోకంలో తనవాళ్ళంటూ ఎవరూ లేని అతనికి ఏర్పడ్డ మొట్టమొదటి అనుబంధం ‘బాబాయ్’ తోనే!

బాబాయ్ వచ్చాక అతని జీవితంలో ఇదివరకెరుగని నూతనోత్సాహం వచ్చి చేరింది. కొన్నాళ్ళకు బాబాయ్ సలహా మేరకు ఇద్దరూ కలిసి అక్కడికి దగ్గరలో ఉన్న ఓ పెద్ద పట్టణానికి వెళ్ళారు పని చూసుకోడానికి. బాబాయ్ తాపీ పనిలో బాగా చెయ్యి తిరిగినవాడవడం చేత, మొదట్లో సిమెంటు, ఇసుక మోస్తూ తిరిగిన అతను బాబాయ్ దగ్గర చేరిన కొన్నాళ్ళకే తాపీ పని నేర్చుకోడం మొదలు పెట్టాడు.

వాళ్ళు పనిచేసే చోటికి కొన్ని మైళ్ళ దూరంలో ఊరి బయట విసిరేసినట్టున్న ఓ చిన్న బస్తీలో ఒంటిగది రేకులషెడ్డు ఒకటి అద్దెకి తీసుకున్నారు. రోజంతా కష్టపడి పని చేశాక వాళ్ళిద్దరూ కలిసి ఏ హోటల్లోనో భోజనం కానిచ్చి, ఎప్పుడో రాత్రికొచ్చి ఆ రేకులషెడ్డులో పడుకునేవారు.

పగలంతా కష్టపడి పని చేసే బాబాయ్ రోజూ రాత్రిపూట కల్లు దుకాణం దర్శించనిదే నిద్ర పోయేవాడు కాదు. మామూలుగానే మాటకారి అయిన బాబాయ్ గొంతులో చుక్క పడ్డాక మరిన్ని మాటలు దొర్లించేవాడు. బాబాయ్ ఏం చెప్పినా, ఏం చేసినా ఇష్టంగానే ఉండేది అతనికి.

 

అలా అలా హాయిగా కాలం సాగిపోతున్న తరుణంలో అతని జీవితంలో ఒక పెద్ద మలుపు చోటు చేసుకుంది.

ఓ రోజు అతనేదో పని మీద బజారుకి వెళ్లి వస్తుంటే దూరం నుంచి బాబాయ్ ఎవరో ఒక కొత్త వ్యక్తితో ఏదో మాట్లాడుతూ డబ్బులిస్తూ కనిపించాడు. ఆ వ్యక్తి పక్కనే ఓణీ వేసుకున్న ఒక పడుచుపిల్ల కూడా నిలబడి ఉంది. అతను వాళ్లకి దగ్గరగా వెళ్ళే సమయానికి ఆ కొత్తవాళ్ళతో మాట్లాడడం ముగించి బాబాయ్ లోపలికెళ్ళిపోయాడు. ఆ కొత్త వ్యక్తీ, ఆ అమ్మాయి ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ కనిపించారు.

ఆ రోజు రాత్రి మాటల్లో తెలిసింది అతనికి.. బాబాయ్ తనలాగా ఒంటరి వాడు కాదనీ, పొద్దున్న అతను చూసిన అమ్మాయి బాబాయ్ సొంత చెల్లెలి కూతురనీ!

 

బాబాయ్ చిన్నప్పుడే తన తల్లిదండ్రులు కాలం చేశారట. తనకున్న ఒక్కగానొక్క చెల్లెల్ని తానే స్వయంగా చాలా కష్టపడి పెంచి పెద్ద చేసి తన తాహతుకి మించిన సంబంధం తెచ్చి మరీ పెళ్లి చేశాడట. దురదృష్టవశాత్తూ ఒక పాపకి జన్మనిచ్చిన తరువాత బాబాయ్ చెల్లి చనిపోయిందట. ఆ తల్లి లేని పిల్లకి ఉన్న తండ్రి కాస్తా రెండేళ్ళ కిందట ఏదో జబ్బు చేసి పోయాడట. ఆ తరవాత బాబాయ్ తన మేనకోడలి బాధ్యత తాను తీసుకుందామనుకుని వాళ్ళింటికెళ్తే ఆ అమ్మాయి పెదనాన్న ఒక షరతు పెట్టాడట. పోయిన తన తమ్ముడు చేసిన అప్పులు తీరిస్తేనే గానీ ఆ అమ్మాయిని బాబాయితో పంపించనన్నాడట.

ఆ డబ్బు సంపాదించడం కోసం బాబాయ్ ఇలా ఊరూరా తిరుగుతూ తన చేతిలో ఉన్న విద్యతో సంపాదిస్తూ వీలైనప్పుడల్లా ఆ డబ్బు జమ చేస్తున్నాడట. ఆ రోజు ఉదయం తను చూసింది కూడా వాళ్ళనే అని చెప్పాడు.

 

బాబాయ్ చెప్పిందంతా విన్నాక అతనికి చాలా బాధనిపించింది. నా అన్నవాళ్ళు ఉండి కూడా ఇలా ఒంటరిగా బ్రతుకుతున్న బాబాయ్ పరిస్థితికి జాలి కలిగింది. తన స్వార్ధం చూసుకోకుండా చెల్లెలి కూతురి కోసం అంత తపన పడుతున్న బాబాయ్ మీద ఎనలేని గౌరవం కూడా కలిగింది. ఆలస్యం చెయ్యకుండా వెంటనే “నీ అవసరం అయితే ఒకటీ, నా అవసరమైతే ఒకటీనా బాబాయ్.. మనిద్దరం కలిసి కష్టపడి సంపాదించి ఆ అప్పు తీర్చేద్దాం” అన్నాడు అతను.

అతని మాటలకి పొంగిపోయిన బాబాయ్ “నీలాంటి మంచి మనసున్న వాడి చేతిలోనే దాన్ని ముడి పెట్టేస్తే నా జీవితానికింక ఏ చింతా ఉండదురా. నీలాంటి కాదురా.. నీ చేతిలోనే పెడతాను. ఏరా.. నా చెల్లెలి బిడ్డని పెళ్ళి చేసుకుంటావురా?” అనడిగాడు బాబాయ్.

బాబాయ్ మాటలకి అతని మనసులో వెల్లువెత్తిన ఆనందం అంబరాన్ని తాకింది. అప్పటిదాకా జీవితంలో తనవారంటూ ఎవరూ లేని అతనికి ఆ క్షణమే భవిష్యత్తు మీద తీపి ఆశలు చిగురించాయి. తనూ, తన భార్యాపిల్లలు, బాబాయ్.. తనదీ అనే ఒక అందమైన కుటుంబం ఏర్పడబోతోందని అతన్ని ఏవేవో తియ్యటి ఊహలు ఊరించాయి.

 

ఆ రోజు మొదలుకుని అతనూ, బాబాయ్ ఇద్దరూ కలిసి రాత్రనకా పగలనకా చాలా కష్టపడి డబ్బు పోగేసేవారు. అలా ఏడాది గడిచింది. ఇంకొన్ని రోజుల్లో వాళ్ళనుకున్న మొత్తం సిద్ధమైపోతుంది. తనకంటూ ఓ సొంత కుటుంబం ఏర్పడబోతోందని అతను కలలు కంటున్నాడు.

అతను ఎదురు చూస్తున్నట్టే ఆ రోజు రానే వచ్చింది. ఏడాది నుంచీ వాళ్ళు కడుతున్న పెద్ద భవనం పూర్తయిపోయి వాళ్ళకి రావలసిన పెద్ద మొత్తం చేతికందింది. బాబాయ్ డబ్బంతా తీసుకుని వాళ్ళ ఊరికి బయలుదేరాడు. అప్పు తీర్చేసి తన చెల్లెలి కూతుర్ని తీసుకుని మరుసటి రోజుకంతా వచ్చేస్తానని చెప్పాడు.

 

కానీ వారం రోజులు గడిచినా బాబాయ్ తిరిగి రాలేదు. అతని మనసేదో కీడుని శంకించింది. బాబాయికి ఏమైనా ఆపద ఎదురయిందేమోనని భయం వేసింది. మరో రెండ్రోజులు ఎదురు చూసాక అసలు అక్కడేం జరిగిందో తానే స్వయంగా తెలుసుకురావాలని అతను బాబాయ్ చెప్పిన గుర్తుల ప్రకారం వాళ్ళ ఊరికి వెళ్ళాడు. బాబాయ్ చెప్పిన వివరాలతో సరిపోలిన వారెవరూ అక్కడ కనిపించలేదు.

ఎంతగా ఆలోచించినా అసలేం జరుగుతోందో అతనికి అర్థం కాలేదు. బాబాయ్ ఎక్కడికి వెళ్ళాడు, తను చెప్పిన వివరాలు సరైనవి కాదా, కాకపోతే తనతో అబద్దాలు ఎందుకు చెప్పాడు, అసలు బాబాయ్ ఏమైపోయాడు?? ఇలాంటి ఎన్నో జవాబులు దొరకని ప్రశ్నలతో కొట్టుమిట్టాడుతూ ఉండిపోయాడు అతను.

 

అలాంటి అయోమయంలోనే దాదాపు రెండు నెలలు గడిచాక అనూహ్యంగా ఒకరోజు అతని కళ్ళ ముందున్న చిక్కు తెరలన్నీ విడిపోయాయి.

ఒక రోజు బజారులో అతనికి కనపడ్డ ఓ వ్యక్తిని ఎక్కడో చూసినట్టు అనిపించింది. కాసేపు తీవ్రంగా ఆలోచించాక టక్కున గుర్తొచ్చింది. ఆ వ్యక్తి ఆ రోజున బాబాయ్ మేనకోడలితో సహా వచ్చి బాబాయిని కలిసిన మనిషేనని! వెంటనే అతను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ వ్యక్తిని దొరకబుచ్చుకుని బాబాయ్ గురించి వాకబు చేశాడు. ఆ వ్యక్తి ద్వారా బాబాయి గురించి తెలిసిన వివరాలు విని అతను అవాక్కైపోయాడు.

ఆ రోజు అతను చూసినమ్మాయి ఈ వ్యక్తి చెల్లెలట. బాబాయికీ, ఈ వ్యక్తికీ ఏ చుట్టరికమూ లేదట. కొన్నేళ్ళ క్రితం ఎప్పుడో బాబాయ్ వాళ్ళ ఊరిలో కొన్నాళ్ళు పని చేసినప్పుడు ఆ మనిషికి కొంత రొక్కం బాకీ పడి అది తీర్చకుండానే చెప్పాపెట్టకుండా ఊరొదిలి వచ్చేసాడట.

అనుకోకుండా ఆ రోజున బాబాయ్ ఎదురుపడేసరికి బాకీ సంగతి గట్టిగా నిలదీస్తే మరి చేసేది లేక అతగాడికి డబ్బిచ్చాడట. అన్నీ మాయమాటలు చెప్తాడనీ, ఏ ఎండకా గొడుగు పట్టే బుద్ధనీ, చేతికందినంతా అందుకుని ఉడాయించే రకమనీ.. ఇంకా ఏవేవో బాబాయ్ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడాడు.

 

అదంతా విన్నాక అతనికి కాసేపు మెదడు స్తంభించిపోయింది. అతను కన్న రంగుల కలలన్నీ వెలిసిపోయి బోసిగా మిగిలాయి!

చిత్రంగా అతనికి బాబాయ్ మీద కోపం కూడా ఏమీ రాలేదు. అదొకలాంటి విరక్తి కలిగింది. అతని జీవితంలోంచి బాబాయ్ నిష్క్రమించడంతో కథ మళ్ళీ మొదటికి వచ్చినట్టైంది. తానున్న స్థితికి తనకే చిరాకేసింది. పనీపాటా మానేసి బయటి ప్రపంచం మొహం కూడా చూడకుండా నాలుగు రోజుల పాటు ఒంటరిగా ఆ ఒంటి గది రేకుల షెడ్డులోనే పడున్నాడు. తిండీతిప్పలు మానేసి శూన్యంలోకి చూస్తూ గడిపాడు.

 

**********

 

అదిగో అలా నమ్మకద్రోహానికీ, ఆశాభంగానికీ గురై పీకల్లోతు నిర్వేదంలో కూరుకుపోయిన అతను ఇప్పుడిలా గాలిదుమారాన్ని సైతం పట్టించుకోకుండా తన ఒంటిగది రేకులషెడ్డు ముందు పరధ్యానంగా కూర్చుని ఉన్నాడు.

 

ఓ పక్కన గాలిదుమారానికి చెట్లన్నీ ఉద్రేకంతో ఊగిపోతున్నా అతనికి మాత్రం చుట్టుపక్కల సంగతేమీ పట్టినట్టు లేదు. అతని బుర్రలో రకరకాల ఆలోచనలు, భావాలు కలగాపులగంగా వెల్లువెత్తి అతనికి తన జీవితం పట్ల చెప్పలేనంత అసహ్యాన్నీ, విరక్తినీ కలిగిస్తున్నాయి.

తనెందుకు పుట్టాడో, తనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులెవరో తెలీదు. ఊహ తెలిసిన దగ్గర నుంచీ ఏ ఆలనా పాలనా, ఆప్యాయతా ఎరుగడు. ఏ పూటకాపూట పొట్ట నింపుకోడానికి అవస్థ పడాలి. తనెవరికీ అక్కర్లేని మనిషి. తనున్నా పోయినా ఎవరికీ ఏమీ తేడా పడదు. అసలు తనెందుకు బతకాలి, ఎవరికోసం బతకాలి, బతికి ఏమి సాధించాలి.. ఎవరిని ఉద్ధరించాలి.. ఈ తీరున రకరకాల ప్రశ్నలు అతని బుర్రలో గింగిర్లు తిరుగుతూ అతన్ని తీవ్ర అసహనానికి గురి చేస్తున్నాయి.

ఆలోచించినకొద్దీ తన సమస్యకి సరైన పరిష్కారం చచ్చిపోవడమేనని బలంగా అనిపిస్తోంది అతనికి. పుట్టినప్పటి నుంచీ తను పడుతున్న ఈ బాధలన్నీటి నుండి శాశ్వతంగా విముక్తి పొందడానికి అదొక్కటే సరైన మార్గమని తోచింది. ఒక్కసారి అతని మనసులోకి చావాలనే ఆలోచన వచ్చాక ఆ ఆలోచన క్రమంగా ఒక స్థిరమైన నిర్ణయంగా రూపాంతరం చెందడానికి ఎంతోసేపు పట్టలేదు.

 

ఏమీ దిక్కు తోచక ఆలోచనల సుడిలో చిక్కుకుపోయి పరధ్యానంగా ఎటో చూస్తున్న అతని మొహమ్మీద ‘టప్’ మని ఓ వాన చినుకు రాలింది. వెనువెంటనే నాలుగైదు చినుకులు అనుసరించాయి. ఉన్నట్టుండి అతనిలో చలనం వచ్చినట్టుగా మంచంలోంచి దిగ్గున లేచి ఏదో నిర్ణయించుకున్నవాడిలా రేకుల షెడ్డు వారగా పడి ఉన్న డొక్కు సైకిలందుకుని ఆవేశంగా బయలుదేరాడు.

గాలి దుమారం విసురు కాస్త తగ్గి చిటుక్కు చిటుక్కు వాన చుక్కలు కాస్తా చిక్కటి వర్షధారల్లా పెరిగిపోతున్నాయి. మరి కాసేపట్లోనే పెళ పెళమంటూ భారీగా ఉరుములూ మెరుపులతో వాన బాగా జోరందుకుంది. చూస్తుండగానే వర్షం కుండపోతగా కురుస్తూ ఊరిని ముంచేస్తుందేమో అన్నట్టు విజృంభించసాగింది.

అతను మాత్రం వర్షానికి ఏ మాత్రం వెరవకుండా ధృడనిశ్చయంతో ఆ గాలివానలోనే ముందుకి కదిలాడు. ఎక్కడికీ, ఏమిటీ అని తెలీదు. కానీ, తను మాత్రం ఎలాగైనా చచ్చిపోవాలి అంతే.. అని గట్టిగా పదే పదే మనసులో మననం చేసుకుంటూ ఉరుముల్నీ మెరుపుల్నీ సైతం లెక్క చేయకుండా తన ఒంట్లో సత్తువనంతా కూడదీసుకుంటూ ఆ గాలివానలో సైకిలు సవారీ చేస్తున్నాడు. అలా అలా ఊరి పొలిమేరలు పూర్తిగా దాటి బయటి దాకా వచ్చేసాడు.

 

అదొక సన్నటి తారు రోడ్డు. ఆది అంతమూ లేనట్టు కనుచూపుమేరా నల్లగా పాకినట్టు కనిపిస్తోంది. రోడ్డుకి రెండుపక్కలా దట్టంగా పెరిగిన చెట్టూ చేమా, వాటి నిండుగా అల్లుకున్న తీగలూ, ముళ్ళ పొదలూ ఉన్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షపు ధారలన్నీ గుబురుగా పెరిగిన అక్కడి చెట్ల ఆకులపై పడుతూ హోరున శబ్దం చేస్తున్నాయి. ఆ సమయంలో ఆ దరిదాపుల్లో ఎక్కడా కూడా మానుష సంచారం ఉన్నట్టు లేదు.

వర్షాన్నీ, ఈదురుగాలుల్ని ఏ మాత్రం లక్ష్యపెట్టకుండా సైకిలు మీద ఆవేశంగా దూసుకుపోతున్న అతను అకస్మాత్తుగా ఆగాల్సి వచ్చింది. అతని ఆవేశానికి అనుగుణంగా అంత వేగంగా పరిగెత్తలేనన్నట్టు ఆ డొక్కు సైకిలు కాస్తా కదలనని మొరాయించింది.

వెంటనే ఏం చెయ్యాలో పాలుపోక సైకిలు దిగి ఓ పదడుగుల దూరంలో రోడ్డు పక్కనున్న ఒక పెద్ద చెట్టు కిందకి వెళ్ళాడు. సైకిలుని ఓ పక్కగా నిలబెట్టి ఆ చెట్టు కిందే నించుని మళ్ళీ తన ఆలోచనాపథంలోకి జారిపోయాడు.

 

అతని బుర్రలో పదే పదే తన చావుబ్రతుకులకి సంబంధించిన అవే ప్రశ్నలు తిరుగాడుతున్నాయి. ఆలోచిస్తున్న కొద్దీ అతనికి తన జీవితం పట్ల అసహనం పెరిగిపోతోంది. తను అసలు ఎందుకు బతకాలీ అని ఎంతగా ప్రశ్నించుకున్నా ఒక్క సమాధానమూ తోచడం లేదు. ఇక ఆలోచన అనవసరం. చావే శాశ్వత పరిష్కారం అని మరోసారి గట్టిగా అనిపించింది.

అసలు తనెలా చచ్చిపోతే బాగుంటుందో.. అనే సందేహం కలిగింది. ఎలా చావాలా అని రకరకాల ఆత్మహత్యా మార్గాల గురించి చాలాసేపు తర్జన భర్జన పడ్డాడు. ఎంతకీ ‘ఫలానా పద్ధతిలో చస్తే నయం..’ అని ఎటూ తేల్చుకోలేకపోయేసరికి అతనిలో ఆవేశం పెరిగి మరింత కోపం, ఉక్రోషం తన్నుకొచ్చాయి.

ఇంతలో అతని చూపు తను పక్కన నిలబెట్టిన సైకిలు మీద పడింది. అప్పుడు గుర్తొచ్చింది అతనికి.. ఫలానా చోటకి అని కాకుండా ఎటోకటు అన్నట్టు నిర్లక్ష్యంగా అస్సలే మాత్రం ఆలోచన లేకుండా ఈ డొక్కు సైకిలుని నమ్ముకుని వర్షంలో బయలుదేరాడన్న సంగతి.

“అయినా, ఎలాగూ చావాలని నిర్ణయించుకున్నాక ఇంక ఈ డొక్కు సైకిలుతో మాత్రం నాకేం పని. నడవడం ఆగిపోయిన దీన్ని ఇక్కడే వదిలేసి నేను ముందుకెళ్ళిపోవచ్చు కదా!” అనుకున్నాడు.

అనుకున్నదే తడవుగా క్షణం ఆలస్యం చేయకుండా కాలితో ఆ సైకిలుని ఒక్క తన్ను తన్ని విసురుగా కదిలాడు ఆ చెట్టు కింద నుంచి.

 

అతను వడివడిగా నడుస్తూ రోడ్డెక్కి ఓ పాతిక అడుగులైనా వేసాడో లేదో.. వెనక నుంచి ఏదో పెద్ద వెలుగు, దాని వెనకాలే భయంకరమైన శబ్దం వినిపించింది. అంతటి భీకర శబ్దానికి ఉలిక్కిపడిన అతను అప్రయత్నంగా రెండు చెవులూ, కళ్ళూ గట్టిగా మూసుకుని అదాటుగా ఆ రోడ్డు మీదే కూలబడ్డాడు. ఓ నిమిషం తరవాత నెమ్మదిగా కళ్ళు తెరిచి బెరుకు బెరుగ్గా వెనక్కి తిరిగి చూశాడు.

అక్కడ కళ్ళెదురుగా కనపడిన దృశ్యం చూస్తూనే గుండె గుభిల్లుమంది అతనికి.

కొద్ది క్షణాల క్రితం అతను నించున్న చోటులో ఉన్న పెద్ద చెట్టు పిడుగు పాటుకి గురైంది. సగం చెట్టు కొమ్మలన్నీ ఉన్నపళంగా విరుచుకుపడ్డట్టు నిలువునా కుప్ప కూలిపోయి మంటల్లో దగ్ధమవుతూ కనిపించాయి. అక్కడ నేలమట్టం అయిన చెట్టుకి కాదు, స్వయంగా అతనికే ఆ విద్యుదాఘాతం తగిలినట్టనిపించి నివ్వెరపోయి ఏ కదలికా లేకుండా అటుకేసే గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయాడు.

 

ఆ భీభత్సం తాలూకు దిగ్భ్రాంతిలోంచి తేరుకోడానికి అతనికి చాలాసేపే పట్టింది.

ఈ సంఘటనతో, ఈ నిమిషంలో, ఈ క్షణంలో.. సరిగ్గా ఈ ఒక్క క్షణంలోనే అప్పటిదాకా అతని మదిలో చెలరేగుతున్న దావానలం లాంటి తన చావుబ్రతుకుల సమస్యకి ఏదో సమాధానం దొరికినట్టనిపించింది.

తను ఎలా బ్రతకాలో, బ్రతికి ఏం సాధించాలో, ఎవరిని ఉద్ధరించాలో ఇప్పటికీ అతనికి ఇదమిద్దంగా తెలీకపోయినా తను బ్రతికి తీరాలని మాత్రం స్పష్టంగా అవగతమైనట్టు బలంగా అనిపించింది.

 

వర్షం జోరు కాస్త తగ్గింది. ప్రకృతి ఒడిలో బ్రతుకు పాఠాన్ని బుద్ధిగా నేర్చుకున్న అతను మెల్లగా అడుగులేస్తూ ఆ చెట్టు దగ్గరికెళ్ళి కాసేపు తదేకంగా ఆ చెట్టు వంకే చూసి, తర్వాత తన డొక్కు సైకిలందుకుని దాన్ని నడిపించుకుంటూ మెల్లగా చీకట్లో కలిసిపోయాడు.

కానీ.. ఆ చీకటిలోనే కలిసిపోయి అంతమైపోడానికి మాత్రం ఖచ్చితంగా కాదు. ఈ చీకటి రాత్రిని కరిగిస్తూ ఇవాళ్టి రోజుని గతంలోకి నెట్టేసి రేపటి ఒక సరికొత్త సూర్యోదయాన్ని ఆహ్వానించడానికి సిద్ధపడి తేలికపడిన మనసుతో ముందుకి సాగిపోయాడు.

Print Friendly

అతడే ఆమె సైన్యం

రచన: యండమూరి వీరేంద్రనాధ్                                                                                     


ఎపిలోగ్ :

సాయంత్రం అయిదయింది. ఆ వీధి అంత రష్‌గా లేదు. అలా అని పూర్తి నిర్మానుష్యంగానూ లేదు. అంజిగాడి పాన్‌షాప్ దగ్గర మాత్రం ముగ్గురు నిలబడి అరటిపళ్ళు తింటున్నారు.

అంజిగాడి మొహంలో బాధలేదు. అలా అని మనసులో బాధ లేదని కాదు. ముగ్గుర్నించి పైసా రాదని తెలుసు.  ఏడవలేక నవ్వుతున్నాడు.

“ఒక సిగరెట్ ప్యాకెట్ ఇవ్వు. అలాగే మూడు పాన్‌లు కట్టు” అన్నాడు ఆ ముగ్గురిలో కాస్త అప్రెంటిసులా వున్నవాడు.  వాడు పిక్ ప్యాకెట్ స్టేజికి పైనా, మర్డర్ల స్టేజికి క్రిందా వున్నాడు. ఇంకో పది సంవత్సరాలు పోతేగాని రాజకీయాల్లో పైకి వస్తాడో లేదో చెప్పలేం.

“హ్హి! తప్పకుండా! ఇంకేమయినా తీసుకుంటారా” అన్నాడు అంజిగాడు అదే విషాద భరితమైన నవ్వుతో, ఎంత తొందరగా వీళ్ళిక్కడ్నుంచి వెళ్ళిపోతారా అన్న ఫీలింగు వాడిలొ కనపడుతోంది.

“ఏం బాస్ – ఇంకా ఏమైనా….” అనబోతున్న చిన్న రౌడీ మాట మధ్యలో ఆగిపోయింది.  ముగ్గురిలోకి పెద్దవాడిగా కనిపిస్తున్న దాదా చూపు నిలిచిన చోటుకి అతను తన దృష్టి సారించాడు.

పాతికేళ్ళ యువతి ఒక పాపని ఎత్తుకుని కొట్టువైపు వస్తోంది.

అక్కడ అకస్మాత్తుగా చాలా ఇబ్బందికరమయిన నిశ్శబ్దం చోట చేసుకుంది. అంజిగాడి చెయ్యి పాన్‌లనీ సిగరెట్ ప్యాకెట్‌ని తొందరగా అందించింది.  అక్కడనుంచి వాళ్ళని పంపెయ్యాలన్న కంగారు ఆ తొందరలో కనబడుతూంది. అయితే ఆ ముగ్గురూ దాన్నీ పట్టించుకోలేదు.  ఎక్స్‌రే కళ్ళతో ఆమెని చూస్తూ నిలబడ్డారు.

ఆమె వచ్చి ‘రెండు అరటి పళ్ళివ్వూ’ అంది. అంజిగాడు డబ్బులు తీసుకొని ఆమెకు పళ్ళు అందించాడు.  అయితే పళ్ళకన్నా ముందు ఆమె చేతికి ఒక ప్యాకెట్ తగిలింది.

“రెండు అరటిపళ్ళు కొంటే ఇది ఒకటి ఉచితం మేడమ్ అన్నాడు ముగ్గురిలో మధ్యస్తంగా వున్న రౌడీ.

ఆమె మొహం సిగ్గుతో వాడిపోయింది.

అరటిపండు పక్కనే నిరోధ్ ప్యాకెట్ సింబాలిక్‌గా, మానవత్వం పక్కన పశుత్వంలా వుంది.

“నేనేమన్న పొమ్మను” అని ఆమె కదలబోతుంటే… “పాప మంచిగున్నది బుగ్గలు బాగున్నయ్‌లే” అంటూ ఆమె ఎత్తుకున్నా పాప చెంపలు నిమిరాడు.

వాడి మోచెయ్యి ఆ యువతి వక్షాలకి సుతారంగా తగిలింది.  ఆమె అప్రయత్నంగా అడుగు వెనక్కి వేసింది.

సరిగ్గా అదే సమయానికి సైకిల్ మీద వస్తున్న ఒక వ్యక్తి ఈ దృశ్యం చూసి, దిగి దగ్గరకొచ్చాడు. అతడిని చూసి ఆ యువతి తేరుకుంది.

“ఏమిటి గొడవ?” అన్నాడు. అతడామె భర్తలా వున్నాడు.

“ఏమిలేదు. అత్తయ్యగారు అరటిపళ్ళు కావాలంటే వచ్చా. రండి వెళ్దాం” అంది.  వాళ్ళిద్దరూ వెళ్ళబోతూంటే ఒకడు”… రెండరటిపళ్ళు కొంటే ఒక నిరోధ్ ప్యాకెట్ ఫ్రీగా ఇస్తమంటే తీస్కోటంలే నీ పెళ్ళం” అన్నాడు వెకిలిగా నవ్వుతూ.

ఆ వ్యక్తి ఆగాడు

“రండి వెళదాం” అందామె భయంగా

“ఏం బే అట్ల చూస్తున్నవ్? ఏంది నీ పేరు?

“సుబ్బారావు”

ఎడ పన్జేస్తున్నవ్?”

“సెక్రటేరియట్‌లో”

“ఏం పని?”

“గుమస్తా”

“సుబ్బారావు పేరెట్టుకున్నవ్.  గుమస్తాగా చేస్తున్నవ్.  గంత పౌరుషము పనికి రాదు బేటా. పో. నీ పెండ్లాన్ని దీస్కపో.

సుబ్బారావు మొహం ఎర్రబడింది. అయినా ఎం చెయ్యలేని నిస్సహాయతతో సైకిల్ మీద చెయ్యి వేశాడు. కాలరు దగ్గర కాస్త చిరిగిన షర్టూ, లూజు పాంటు అతడిని చూసి నవ్వుతున్నట్టున్నాయి.

“బుగ్గలైతే నున్నగున్నయ్ బై” వెళ్లబోతున్న సుబ్బారావు ఆగటం చూసి వాడు నవ్వేడు. “….నీ పెండ్లంవి కావు నీ కూతురువి. పెండ్లానివి నేను నిమర్లే “

అవతలివాడు ఏమీ చేయ్యలేడని తెలిసి ఆడుకుంటున్నట్టు వుంది వాళ్లకి.

“మర్యాదస్తులతో ఇలా మాట్లాడ్డానికి సిగ్గులేదూ” అన్నాడు.

“ఏం? మేం మర్యాదస్తుల్లా కనబడటంలే” అన్నాడు.

అతడు తనలో తనే “తెలుస్తూనే వుంది” అని గొణుక్కుంటూ వెనుదిరిగాడు.  వెనుకనుంచి భుజంమీద చెయ్యి పడింది.

“ఏమంటున్నవ్?”

“ఏమిలేదు.”

రౌడీ అతడి గడ్డం పట్టుకుని చెంపలు రెండు వేళ్ళతో గట్టిగా నొక్కుతూ “ఏమన్నావ్ బే ఇప్పుడు” అన్నాడు.

అంజిగాడు కొట్టులోంచే “వదిలెయ్యరాదన్న పాపం” అన్నాడు. సుబ్బారావు భార్య కంగారుగా దగ్గర కొచ్చింది. అప్రెంటిస్ రౌడీ తన గొప్పతనం సీనియర్ల దగ్గర నిరూపించుకోవటానికి అన్నట్టు ఆమె మెడమీద చెయ్యివేసి

“ఇక్కడా నున్నగానే వుంది బాస్” అన్నాడు.

అప్పుడు కొట్టాడు సుబ్బారావు అతణ్ణి. లోపల్నుంచి తన్నుకొచ్చిన ఉక్రోషం అతడితో ఆ పని చేయించింది. అక్కడున్న అయిదుగురూ ఆశ్చర్యపోయారు.  ఆ చర్యకి.  చెళ్ళుమన్న శబ్దం తప్ప ఆ తరువాత ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది.

సుబ్బారావుని పట్టుకున్న రౌడీ బలంగా అతడిని వెనక్కి తోశాడు.  కొట్టు క్రిందనుంచి పారుతున్న మురికికాలవలో పడ్డాడు సుబ్బారావు. నల్లటి మురికి వర్షం క్రిందనుంచి పారుతున్న మొహం మీదికి  చిమ్మింది. అతడి భార్య కెవ్వున కేక వేసింది. పాప ఏడవటం ప్రారంభింరింది.  రెండో రౌడీ కాలు అతడి మొహం మీదకు లేచింది. సుబ్బారావు ఆ కాలుని వెనక్కి తోశాడు. అది వూహించని రౌడీ బ్యాలెన్స్ తప్పి తూలటంతో కిళ్ళీకొట్టు తలుపుకి వున్న ఇనుప కొక్కెం కణతకి గుచ్చుకుంది.  అతడు ఆర్తనాదం చేస్తూ కూలాడు.

అనూహ్యమైన ఈ సంఘటన తాలూకు షాక్‌నుండి వెంటనే తెరుకున్నాడు పెద్ద రౌడీ. రెండు చేతులతో అతడిని లేపాడు. మెరుపుకన్నా వేగంగా జేబులోంచి కత్తి తీశాడు. తన ప్రాణాలు పోవటం ఖాయమని సుబ్బారావుకి తెలిసిపోయింది. భార్యవైపు చూశాడు. ఆమె ఏడుస్తోంది. తనని పట్టుకున్న రౌడీవైపు సుబ్బారావు చూశాడు.

ఆ వేగం ఎక్కణ్ణుంచి వచ్చిందో తెలీదు. చూపుడు వేలు, మధ్యవేలు చాకులా చేసి, ప్రత్యర్ధి కత్తికంటే వేగంగా అతడి మొహంవైపు పోనిచ్చాడు. కత్తి తన చేతిని తాకేలోపులో అతడి వ్రేళ్ళు ప్రత్యర్ధి కళ్ళని పొడిచేశాయి.

రెప్పపాటు కాలంలో జరిగిపోయిన ఈ రెండు సంఘటనలకీ జూనియర్ రౌడీ మొదట్లో విచలితుడయినా వెంటనే తేరుకొని అతడి మీదకు దూకాడు. అది అతడి పరువుకి సంబంధించిన సమస్య.  సుబ్బారావుకి ప్రాణానికి సంబంధించిన సమస్య.

ఇద్దరూ ఆ బురదలో పందుల్లా కొట్టుకుంటున్నారు. వాటికన్నా మేమేమి తక్కువ హీనంకాదు అన్నట్టు. చుట్టూ జనం కేవలం ప్రేక్షకుల్లా నిలబడ్డారు “సమాజంలో ఎవరికీ భద్రతలేదు. ఒకరెవరైనా ఆ హక్కుకోసం పొరాడినా, మిగతా వాళ్ళెవరూ సాయం చెయ్యరు” అన్నది అక్కడ నిరూపణ అవుతోంది.

పరువు భయంకన్నా ప్రాణభయమే గెలిచింది. సుబ్బారావు ఆ కుర్రరౌడీని కూడా అధిగమించి నిలబడ్డాడు. బురదలో అచ్చొత్తిన బొమ్మలా వున్నాడు అతడు. భార్యవైపు చూసి నవ్వాడు. ఆ ఆనందంలో వెనుకనుంచి వస్తున్న ప్రమాదం గురించి తెలుసుకోలేదు. ఇనుప వూచమీద పడిన మొదటి రౌడీ లేవటం, కొట్టు ముందు వరుసలో వున్న సోడా బాటిల్ తీసుకుని సుబ్బారావు తలమీద మోదటం క్షణాల్లో జరిగిపోయాయి.

చుట్టూ వున్నవాళ్ళు హాహాకారాలు చేశారు.

రెండు చేతుల్తో తల పట్టుకుని కూలిపోయాడు సుబ్బారావు. తలనుంచి రక్తం ధారగా కారుతూండగా అతడికి స్పృహ  తప్పింది

పది నిమిషాల తరువాత అక్కడికి అంబులెన్స్ వచ్చింది.

అసలు కధ అప్పుడు ఆరంభమయింది.

 

 

అతడే ఆమె సైన్యం

 

ఆస్పత్రి మందుల వాసన తెలుస్తూంది.

“అదృష్టం బావుంది.  తలలో ఎముకలేవీ విరగలేదు.”

అతడు కళ్ళు విప్పాడు. దూరంగా ఒక డాక్టర్ స్కల్ ఎక్స్‌రే పరీక్షిస్తున్నాడు. ఇంకో ఇద్దరు పక్కన నిలబడి వున్నారు. అతడు కళ్ళు తెరవడం నర్స్ గమనించింది. అందరూ దగ్గరగా వచ్చారు. డాక్టర్ మరొకసారి పరీక్షించి మళ్ళీ అదే చెప్పాడు. “అదృష్టం బావుంది”.

అతడు పక్కమీద లేచి కూర్చున్నాడు. తలకి బ్యాండేజ్ తెలుస్తోంది.

“మీరు కావాలంటే వెళ్ళిపోవచ్చు. బలమైన దెబ్బవల్ల సృహ తప్పిందంతే. ఒక పదిరోజులపాటు వచ్చి బ్యాండేజ్ కట్టించుకొండి.

“ధాంక్స్ డాక్టర్!”

“బయట్ మీ భార్య వెయిట్ చేస్తోంది.”

అతడు మొహం చిట్లించి “నాకు భార్యేమిటి? నాకింకా పెళ్ళికాలేదు” అన్నాడు.

అందరూ మొహం చూసుకున్నారు.

“నా పేరు చైతన్య”

అంతా నిశ్శబ్దం.

“మీరంతా అలా ఎందుకున్నారు? నా గురించి ఎవరూ రాలేదేమిటి?” చుట్టూ చూస్తూ అడిగాడు.

“మీ గురించి ఎవరొస్తారని మీరనుకుంటున్నారు?”

“ప్రొడ్య్సూసర్లు, టెక్నీషియన్లు, నన్ను మీరెవరూ గుర్తు పట్టాలేదా? నేను  చైతన్యని.”

“అంటే ప్రస్తుతం తెలుగు సినిమా ప్రపంచంలో టాప్ స్టార్స్‌లో ఒకరయిన చైతన్య మీరని మీ ఉద్దేశ్యమా?”

“ఉద్దేశ్యమేమిటి నాన్సెన్స్ – నేనే చైతన్యని.”

ఒక నర్స్ నవ్వాపుకోలేక మొహం పక్కకి తిప్పుకుంది. కానీ అనుబవజ్ఞుడయిన డాక్టర్ ముఖంలో విషాదం తొంగిచూసింది. సానునయంగా అన్నాడు – “చూడు బాబూ, నీ పేరు సుబ్బారావు. బయట నీ భార్యా, కూతురూ వున్నారు. నీ బ్రెయిన్ సెల్స్ పూర్తిగా చచ్చిపోకముందే ఆక్టివేట్ చేయడానికి ప్రయత్నించు.”

అతడు మంచం మీదనుంచి చటుక్కున దిగాడు.  “నాకు కాదు. మీకు మతిపోయింది. దాదాపు ప్రతిరోజూ నా ఫోటో పడుతూనే వుంటుంది.  మీరు నన్ను గుర్తుపట్టలేకపోవటం ఏమిటి – ఫోన్ ఇవ్వండి.”

“దేనికి?”

“మా ఇంటికి ఫోన్ చేస్తాను. లేకపోతే అన్నపూర్ణాకో, రామానాయిడి స్టూడియొకో చేసి నా డైరెక్టర్‌ని రమ్మంటాను.”

“మీ ఇంటి నెంబరెంత?”

“9344392″

“అది సెక్రటేరియట్ నెంబరు.”

డాక్టర్ తాపీగా అన్నాడు.

“నో” అరిచాడు.

డాక్టరు అతడి అరుపు పట్టించుకోకుండా స్టాఫ్ వైపు తిరిగి “టు స్కాన్ ది బ్రెయిన్, అరేంజ్ టు సెండ్ హిం టు మెంటల్ హాస్పిటల్” అన్నాడు.

“నాన్సెన్స్” ఈసారి మరింత గట్టిగా అరిచాడు అతను. ” ఆ నెంబర్ నాదే.  నన్నొక్కసారి ఫొన్ చేసుకో…..” అతడి మాటలు మధ్యలోనే ఆగిపోయాయి.  పాప నెత్తుకుని అతడి భార్య లోపలికి ప్రవేశించింది.  జరుగుతున్నదేమిటో ఆమెకు తెలిసినట్టులేదు.  భర్త మామూలుగా వుండటం చూసి సంతోషంగా దగ్గరికి వచ్చింది.

“చూడు సుబ్బారావ్! నువ్వు సెక్రటేరియట్‌లో గుమాస్తావి. ఈమె నీ భార్య.”

“కాదు! నేను చైతన్యని. ఏ హీరో ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ.”

“ఏమండీ – ఏమైందండీ మీకు?” అంటూ ఆమె మరింత దగ్గరగా వచ్చింది. ఈ లోపులో నర్సు అతడికి ఇంజెక్షన్ ఇచ్చింది.

అతడి కళ్ళు మూతలు పడసాగాయి.

“9344392 సెక్రటేరియట్ నెంబరు కాద్సార్. అది హీరో చైతన్యగారి నెంబరే” నర్సు అంటోంది.

“నీకెలా తెలుసు?”

“నేను ఆయన ఫాన్‌ని సార్.”

స్పృహ తప్పుతూ వుండగా అతడికి వినిపించిన చివరి మాటలు అవి.

తిరిగి అతడికి స్పృహ వచ్చేసరికి ఒక విశాలమైన గదిలో ఉన్నాడు. దూరంగా నిలబడి పనిచేసుకుంటున్న నర్సు అతడికి మెలకువ రావడం చూసి దగ్గర కొచ్చింది.

“నేనెక్కడ వున్నాను?”

“మెంటల్ హాస్పిటల్‌లో.”

అతడా గదిని పరిశీలనగా  చూశాడు.

“మీరు తెలుగమ్మాయేనా సిస్టర్?”

“అవును.”

“సినిమాలు చూస్తారా?”

“చూస్తాను.”

“నా సినిమాలు ఏమైనా చూశారా?”

ఆమె ఏదో చెప్పబోతూ ఉంటే బయట అలికిడి వినిపించింది. నలుగురు డాక్టర్లు లోపలికి వచ్చారు.

“హౌ ఆర్యూ మిస్టర్ సుబ్బారావ్?” అందర్లోకి పెద్ద వయసున్న వ్యక్తిలా కనబడుతున్న డాక్టర్ అడిగాడు.

“మీరెవరు?” తిరుగు ప్రశ్న వేశాడు అతను.

“నేనీ హాస్పిటల్ సూపర్నెండెంట్‌ని.”

“చూడండి. క్రింద హాస్పిటల్ వాళ్ళు చెప్పింది నమ్మనవసరంలేదు మీరు. నేన్ము నిజంగా సుబ్బారావుని కాదు. నా పేరు చైతన్య. గర్వంగా చెప్పుకుంటున్నాననుకోకపోతే నన్ను గుర్తు పట్టని వాళ్ళు ఆంధ్రదేశంలో దాదాపు లేరు. భ్రేక్‌డాన్స్, డూప్ లేకుండా నేను చేసే ఫైట్స్, యువతలో నాక్రేజ్ పెంచాయి.  వాళ్ళలో ఒక్కసారి ఎవర్నన్నా పిలిపించండి. లేదా మీలో ఎవరన్నా సరే …. ఒక్కరూ నన్ను గుర్తుపట్టటం లేదంటే నేను నమ్మను. పోనీ మా ఇంటి అడ్రసు చెపుతాను. మా తల్లిని ఇక్కడకు పిలిపించండి  ఆవిడా కూడా నన్ను గుర్తుపట్టకపోతే మీరు చెప్పినదంతా నుమ్ముతాను. నాకు పిచ్చెక్కిందని ఒప్పుకుంటాను.”

“తప్పకుండా అలాగే చేద్దాం. కానీ దానికి ముందు ఒక ప్రశ్నకి జవాబు చెప్పండి.  విజయనగరంలో ఒక పదహారేళ్ళ కుర్ర్రవాడికి జ్వరం వచ్చింది.  జ్వరంలో నేను చైతన్య ఫాన్‌ని, ఆయన్ని చూడాలి అని అంటున్నాడు.  వాళ్ళ డాక్టర్ వచ్చి మీతో ఆ విషయం చెప్పాడు. చెప్పండి. మీరు వెళతారా?”

“విజయనగరం- అంతదూరం- షూటింగ్‌లు వదులుకుని…” అతడు సందిగ్ధంగా అన్నాడు.

“అందులోనూ మామూలు జ్వరానికి” డాక్టర్ అందించాడు.

“అవును మామూలు జ్వరానికి….” అతడు నవ్వేడు. ” పైగా ఇలా అందరిళ్ళకీ వెళ్ళడం మొదలు పెడితే నా టైమంతా ఊళ్ళు తిరగటానికే సరిపోతుంది.”

“మరటువంటప్పుడు పిచ్చాసుపత్రిలో ఎవరో సుబ్బారావు, నేనే చైతన్యని అని అంటే ఆ డాక్టర్ వెళ్ళి చైతన్య తల్లిగారిని రమ్మని పిలిస్తే బావుంటుందా?”

అతడి మొహం వివర్ణమైంది. అతికష్టంమీద తమాయించుకుని “నాకోసారి ఫోను చేసుకునే చాన్స్ ఇస్తే మీకేం నష్టం?” అన్నాడు.

“మీ ఇంట్లో ఎవరెవరుంటారు?”

“నేను, మా అమ్మా, మిగతా పనివాళ్ళు, నా సెక్రటరీ..”

“సరే ఫోను చేయండి.”

9344392

ట్రింగ్…ట్రింగ్…

అవతల్నుంచి రిసీవర్ ఎత్తిన చప్పుడు.

“హల్లో.”

“ఎవరు మాట్లాడేది?”

అట్నుంచి విసుగ్గా “మీకెవరు కావాలి?” అని వినిపించింది.

“అమ్మగారిని పిలువు.”

“ఏ అమ్మగారు?”

“చైతన్య తల్లిగారు”

“మీరెవరు?”

“నేను చైతన్యని.”

“ఎవరూ?”

“త్వరగా అమ్మని పిలువు.”

నిమిషం తరువాత మరో గొంతు లైన్‌లోకి వచ్చింది.

“ఎవరు మాట్లాడేది?”

“సుబ్బరాజు.”

సుబ్బరాజంటే చైతన్య సెక్రటరీ. అతడు తేలిగ్గా వూపిరి పీల్చుకున్నాడు.

“నేను చైతన్యని.”

“ఏం కావాలి చెప్పండి.”

“అమ్మ లేదా?”

“అమ్మగారు వారం రోజుల క్రితమే కాశ్మీర్ వెళ్ళారు. చైతన్యగారితో కలసి.”

“సుబ్బరాజూ-నేను చైతన్యని.”

“అవును చెప్పారుగా” ఇంకో చైతన్య ఎవరో అన్నట్లు విసుగ్గా అన్నాడు.

అతడు కోపం అణుచుకుంటూ- “నిన్న షూటింగ్‌కి బయలు దేరినప్పుడు అమ్మ నాకు టిఫిన్ కూడా యిచ్చింది.  వారం రోజుల క్రితం కాశ్మీర్ వెళ్ళటం, ఏమిటి? అసలు నువ్వు సుబ్బారాజువేనా?” అంటూండగా..

అవతల్నుంచి ఫోన్ కట్ అయింది. సినిమా యాక్టర్లకి ఇలాటి ఫోన్లు మామూలే.  అతడు నిస్సహాయంగా ఫోన్ పెట్టేసి వెనుదిరిగాడు. డాక్టర్ ఏమి మాట్లాడలేదు.  అతడు తన గదివైపు నడిచాడు. లోపలికి ప్రవేశిస్తూ ఆగిపోయాడు డాక్టర్ అతని భార్యని అడుగుతున్నాడు.

“ఏమ్మా! మీ ఆయనకి చైతన్య అంటే చాలా ఇష్టమా?”

“చాలా ఇష్టం డాక్టర్‌గారూ! ఇంటినిండా ఆయన ఫోటోలే అతికించుకుంటూ  వుంటారు. ఈ వయసులో కూడా తలుపులన్నీ వేసుకుని బ్రేక్ డాన్సులు చేస్తుంటారు.”

“అదీ విషయం” మరో డాక్టర్ అన్నాడు.  “ఇట్సె క్లియర్ కేస్ ఆప్ పారానాయిడ్ సైకాలజీ. అమ్మవారు పూనినప్పుడు భక్తులు “నేనే పోలేరమ్మనీ” అని చిందులు తొక్కుతారు.  ఇదీ అలాంటి కేసే, మన పేషెంట్  చైతన్య ఫాన్, చైతన్య సెక్రటరీ పేరు, ఫోన్ నెంబరుతో సహా కంఠతా పట్టినంత భక్తుడు. తలమీద ఈ గాయంతో, he entered the shoes of Chaitanya.”

మిగతావాళ్ళు తలూపారు.

“డాక్టర్‌గారూ! ఆయన బాగుపడతారా? ఇద్దరి తరపునా పెద్దవాళ్ళు ఎవరూలేని సంసారమండీ మాది” ఏడుస్తూ అంటోంది ఆమె. బయటినుంచి ఇదంతా వింటున్న అతను ఒక్క ఉదుటున లోపలికి వెళ్ళాడు.  ఆమెని పట్టుకుని విసురుగా తనవైపు తిప్పుకున్నాడు. “ఏమిటీ నువ్వు నాభార్యవా? నా పేరు సుబ్బారావా” ఆడదానివి కాబట్టి బ్రతికిపోయావు. మొగాడివైతే పాతేసి వుండేవాడిని.”

డాక్టర్లు అతడిని బలవంతంగా అక్కడినుంచి తీసుకెళ్ళారు.

“ఆమె అబద్దం చెపుతోంది.  ఆమె ఎక్‌స్త్ట్రా ఆర్టిస్టు” గింజుకుంటూ అన్నాడు.

“మిస్టర్ సుబ్బారావ్! నీ మొహం అద్దంలో ఎప్పుడన్నా చూసుకున్నారా?”

అతను ఆగాడు. డాక్టర్లు అతడి చేతుల్ని వదిలేశారు. దూరంగా గోడకి నిలువుటద్దం.

అతను అందులో తనని తాను చూసుకున్నాడు.  మార్పేమీ లేదు. కాస్త నొక్కుల జుట్టు, అందంగా విప్పారిన కళ్ళు, బలమైన చెంపలు… ఎందరో యువకుల పుస్తకాల మధ్యలోనూ,  యువతుల హృదయాల్లోనూ దాచుకోబడిన రూపం అది.  రెండురోజుల అలసటవల్ల కాస్త గెడ్డం మాసిందంతే.

“మీది చాలా అందమైన పర్సనాలిటీ సుబ్బారావ్! మీ పారానాయిడ్ సైకాలజీకి అది కారణం అయింటుంది. ‘చైతన్యకన్నా నేను అందగాడినీ అన్న భావం మీలో ఏమూలో వుంది . అది నిజమే! మీరు పిక్చర్ ఫీల్డులో వుండి వుంటే బహుశా చైతన్య నెంబర్ వన్ హీరో అయి వుండేవాడు కాదేమో.”

“నాన్సెన్స్! నేనే చైతన్యని.”

“మీ ఫోటో తరుచూ పేపర్లో పడుతూ వుంటుంది కదూ?”

“దాదాపు రోజూ ఏదో ఒక అడ్వర్టయిజ్‌మెంట్…” అన్నాడు అతడు.

దాక్టర్ అసిస్టెంట్ వైపు తిరిగి-”ఈ రోజు పేపరు పట్రా” అన్నాడు. అయిదు నిమిషాల్లో పేపర్ వచ్చింది. అతడు అన్నాడు-

“చివరి పేజీ చూడండి. ఈ రోజే నా పిక్చర్ రిలీజ్.  ఫుల్‌పేజీ ప్రకటన వుంటంది” అతడి కంఠంలో ‘ఇక ఈ అయోమయానికి ముగింపు దొరకబోతోంది కదా’ అన్న రిలీఫ్ కనబడుతోంది.

డాక్టర్ దృష్టి దానిమీద పడింది.  అడ్డుగా వున్న డాక్టర్ తల క్రమక్రమంగా, నెమ్మదిగా వెనక్కి తొలగుతూన్న కొద్దీ పైనుంచి కనబడుతుంది.

“అతడే ఆమె సైన్యం”

హీరోయిన్ ఫోటో-

వెనుక మిషన్‌గన్ పట్టుకుని అందమైన హీరో ఫోటో.

తను కాదు, వేరే ఎవరో,

“ఇతను చైతన్య కాదు” అరిచాడు అతను. “నేనే చైతన్యని.  అతడే ఆమె సైన్యం’ సినిమాలో హీరోని నేనే.”

అతని వైపు జాలిగా చూస్తూ సూపర్నెండెంట్ నెమ్మదిగా అన్నాడు- “లాభంలేదు.  షాక్ ట్రీట్‌మెంట్ ప్రారంభించండి.”

సుబ్బారావు భార్య రోదించటం మొదలు పెట్టింది.

 

2

అతడి మెదడులో ఫిరంగులు పేలుతూన్న హోరు! లయబద్ధంగా తలమీద ఒకే బీట్‌లో ఎవరో కొడుతున్న భావన!! తన నుంచి తాను విడిపోయి వెయ్యిరూపాలుగా విశ్వరూపం ప్రదర్శిస్తూ నాట్యం చేయాలన్న కోర్కె! రకరకాల రంగుల విశ్లేషణాలు శరీరం మీద పాములా జారిపోతూంటే తాండవించాలన్న తపన! తపోభంగమైన ఋషిలా వుంది అతని పరిస్థితి. నెమ్మదిగా అతడికి స్పృహ వచ్చింది. చేతులూ కాళ్ళూ స్వాధీనంలోనే లేవు. చుట్టూ చూశాడు. అదే పక్క. అదే హాస్పిటల్ వాతావరణం.

తనకి కరెంట్ షాక్ ఇచ్చి, ఆ తరువాత తిరిగి పక్కమీదకు చేర్చారని అర్ధమైంది.

అందుకే ఇంత నిస్సత్తువ! షాక్ తరంగాల వత్తిడివల్ల కంటినుంచి నీటిచుక్క చెంపమీద జారింది. అతడు గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. ఏమిటిది? అసలేం జరుగుతోంది? తను సుబ్బారావేంటి? తను ఇప్పుడీ పిచ్చాసుపత్రిలో వుండటం ఏమిటి” అక్కడ తన షూటింగ్‌లు ఎలా జరుగుతున్నాయి? తాను నటిస్తున్న చిత్రాలు దాదాపు అయిదున్నాయి. ఆ నిర్మాతలు ఎంత టెన్షన్ అనుభవిస్తూ వుండి వుంటారు.  ముఖ్యంగా – ఇంకో నెలరోజుల్లో రిలీజ్ కానున్న రెండు కోట్ల ప్రాజెక్టు నిర్మాత రెడ్డి – ఆయన కసలే బి.పి. ఆయన ప్రస్తుతం ఏం చేస్తూ వుండి వుంటాడు? తను ‘తప్పిపోయిన విషయం పేపర్లో వచ్చి వుంటుందా? రాష్ట్రంలో తన అభిమానులు ఆ వార్తకు ఎలా స్పందించి వుంటారు? తన ఇంటి దగ్గర పరిస్థితి ఎలా వుండి వుంటుంది? పోలీసులు ఏం చేస్తూ వుండి వుంటారు?

అతడి ప్రశ్నలన్నింటికీ సమాధానంగా పక్కనే పేపర్ నవ్వుతూ కనబడింది. విప్పి చూశాడు. ఎక్కడా తన ప్రసక్తే లేదు.  చివరిపేజీలో మామూలుగానే చైతన్య ఫోటో…

‘అతడే ఆమె సైన్యం’ అడ్వర్‌టైజ్‌మెంట్….

“నేడే పదో రోజు” అని

ఎదురుగా అద్దంలో తన ప్రతిబింబం వెక్కిరిస్తూ.

రెంటికీ పోలికే లేదు.

అతడు బలంగా నిట్టూర్చబోతుంటే ‘హలో’ అని వినపడింది.  ఒకాయన లోపలికి వచ్చి, ‘కొత్తగా వచ్చార్టగా’ అన్నడు చొరవగా కూర్చుంటూ.

చైతన్యకి ఒళ్ళు మండింది.  అదేదో ఆఫీసు అయినట్టు, తను అప్పుడే అందులో చేరినట్టు ఆయన విష్ చేయడం చూసి.

“ఎవరు మీరు?” అని అడిగాడు.

ఆయన అటూ ఇటూ చూసి- “నేను అల్లు రామలింగయ్యని” అన్నాడు

చైతన్య అదిరిపడి అతనివైపు చూశాడు. అతనికి యాభై అయిదేళ్ళుంటాయి. సన్నగా, పొట్టిగా వున్నాడు. “నేనే అల్లు రామలింగయ్యని అంటే వీళ్ళు నమ్మటంలేదు.  ఎస్వీ రంగారావుగారూ, నేనూ కలిసి నటించిన చిత్రాల్లో విషయాలు వివరంగా చెప్పినా కూడా వీళ్ళు నమ్మటంలేదు.”  అరగంటసేపు తన ఫామిలీ గురించి చెప్పాడు.

“నేను రామలింగయ్యనని మొదట్లో ఎవరూ నమ్మలేదు. చివరికి మా అబ్బాయి అల్లు అరవింద్ గుర్తుపట్టాడు. నెలనెలా వచ్చి పళ్ళూ అవీ తెచ్చి ఇస్తూ వుంటాడు.  తొందరగా కోలుకొమ్మని విష్‌చేస్తూ వుంటాడు. నాకు విషయం పూర్తిగా అర్ధమైంది. నాకు పిచ్చిలేదు. ఇంకేదో ఆస్పత్రిలో నేను బాధ పడతానని ఇలా చెప్తునారు” అతనికి నవ్వొస్తూంది. బలవంతంగా ఆపుకున్నాడు. ఆయన నెమ్మదిగా అన్నాడు. “నాకు నా వారందర్నీ చూడాలనుంది కానీ నా కోసం ఎవ్వరూ రారు. రాత్రంతా ఒంటరిగా కూర్చుని కిటికీలోంచి బైటకు చూస్తూ కూర్చుంటాను. చీకటి తప్ప ఇంకేమీ కనపడదు నాకు” ఆయన కంఠం రుద్ధమైంది. ‘అతనికి’ కూడా కళ్ళు తడి అయ్యాయి.

“పాపం నా నిర్మాతలు ఏమయ్యారో అక్కడ, నేనేమో ఇక్కడ వుండి పోయాను.”

అతను అదిరిపడ్డాడు.

తను మనసులో అనుకున్న మాటే ఆయన భైటికి అన్నాడు. అప్పుడే ఆయన దృష్టి పేపరుమీద పడింది. చివరిపేజీ ప్రకటన చూపిస్తూ “ఇదిగో ’అతడే ఆమె సైన్యం’.  ఇందులో కూడా నేను ’యాక్ట్’ చేశాను. ఇదే నా ఆఖరి సినిమా. ఇదే నా ఫోటో” అంటూ చూపించాడు. ఇది (నిజం) అల్లు రామలింగయ్యది. అతడు ఆయన వైపు జాలిగా చూశాడు. అంతలో బయట గుమ్మం దగ్గర అలికిడి అయింది. అతడు తల తిప్పి చూశాడు.

తన జీవితంలో అంత అద్భుతమైన అందాన్ని అతడు అంతకు ముందెన్నడూ చూడలేదు. తూర్పు నుంచి వచ్చే సూర్యుడు థాయ్‌లాండ్ పూల సొగసుని, ఉత్తరం నుంచి వచ్చే గాలి మంచు ధృవపు తెల్లదనాన్ని పశ్చిమనుంచి ఇంటికొస్తూన్న పక్షి ఈజిప్టు పిరమిడ్ల నునుపుదనాన్ని తెచ్చి ఆమెకిచ్చి నట్టున్నాయి.

ఆమె లోపలికి వచ్చి మృదువుగా “మీరిక్కడ వున్నారా? మీకోసం హాస్పిటల్ అంతా వెతికాను” అంది.

“నేను రాను. వస్తే ఆ చేదు మందిస్తావు” అరిచాడు ఆయన.

“ఇవ్వను. రండి. మీ అబ్బాయిగారు వచ్చారు.”

ఆయన అబ్బాయి పేరు వినగానే లేచాడు. అరవింద్ వచ్చాడని తెలియగానే అతడు ఉద్వేగంతో లేచి “సిస్టర్” అని అరిచాడు. ఆమె ఆగింది.

“మీ పేరు?”

“అక్షౌహిణి.”

ఆ పేరులోని విలక్షణతకి అతడు ఆశ్చర్యపడ్డాడు. తన ఆశ్చర్యాన్ని అణుచుకుని “నాకో సాయం చేస్తారా?” అని అడిగాడు.

ఆమె చిరినవ్వుతో ‘చెప్పండి’ అంది.

“ఒకసారి అరవింద్‌ను కలుసుకోవాలి నేను” అన్నాడు.

ఆమె మౌనంగా తలూపి అక్కణ్ణుంచి ఆయన్ని తీసుకువెళ్ళిపోయింది.  రెండు నిమిషాల తరువాత డాక్టర్ వచ్చి “అరవింద్‌ని కలుస్తావా?” అన్నాడు.

అతను చప్పున లేచి తలూపాడు. అరవింద్‌ను కలుస్తే ఈ సమస్య క్షణాల్లో తేలిపోయినట్టే.

ఇద్దరూ కారిడార్లో వెళుతూ వుండగా డాక్టర్ అన్నాడు- “అరవింద్ చాల పెద్ద ప్రొడ్యూసర్ అనుకుంటాను! నాకు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి అంతగా తెలీదు.”

అతను ఏదో చెప్పబోతూ ఆగిపోయాడు. దూరంగా ఒక యువకుడు ఆయనకి పండ్లు ఇస్తున్నాడు.

“అతను అరవింద్ కాదు.”

ఈసారి డాక్టర్ నిరాకరించలేదు.  “అవును-కాదు” తాపీగా అన్నాడు. “ఇక వెనక్కి వెళదామా?”

ఇద్దరూ గదికి చేరుకున్నాక డాక్టర్ అన్నాడు- “నీ దగ్గర కొచ్చినాయన పేరు రామస్వామి. చిన్నప్పట్నుంచి ఆయన పేరనాయిడ్! ఆడవాళ్ళలాగా జుట్టు పెంచుకోవటం, దుస్తులు వేసుకోవటం చేసేవాడట. మళ్ళీ ఈ ముసలి వయసులో ఆ వ్యాధి తిరగబెట్టింది. కుటుంబంలో ఏవో గొడవలొచ్చాయి. మీకన్నా తీవ్రమైన కేసు. కొడుకుని చూడకపోతే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టనన్నాడు. ఈ ఆస్పత్రిలోనే పనిచేసే ఒక డాక్టరుని అరవింద్‌లా వారానికొకసారి పంపిస్తూ వుంటాం.”

దాక్టర్ ఆగి, తిరిగి చెప్పటం మొదలుపెట్టాడు. “మీకన్నా తీవ్రమైన కేస్ ఇది.  మిస్టర్ సుబ్బారావ్! కనీసం మీ ఫోటోని మీరు గుర్తుపట్టగలిగారు. ఆయన రామలింగయ్య ఫోటోని చూపించి అది తనే అంటాడు. ‘లూనసీ’ లో అది పరాకష్ట.”

అతని మొహం కోపంతో ఎర్రబడింది. డాక్టర్ దాన్ని పట్టించుకోకుండా అన్నాడు- ” ఆ ముసలాయన్ని నేనే మీ గదికి ఏదో వంకపెట్టి పంపించాను! సుబ్బారావ్… మీరు పరిస్థితి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి మీది కేవలం ఆక్సిడెంట్ మాత్రమే.  మీరు కూడా మాతో సహకరిస్తే-నేనే చైతన్యని అన్న హెలూసినేషన్ – అంటే భ్రాంతి నుంచి త్వరగా బయటకొస్తారు.”

అతను జవాబు చెప్పలేదు. న్యూస్‌పేపర్ ఆఖరి పేజీ గాలికి రెపరెపలాడుతోంది.  కళ్ళముందు ముసలాయన కదలాడుతున్నాడు. అతడికి మొదటిసారి తను సుబ్బారావ్‌నేమో అన్న అనుమానం, వచ్చింది.

*     *    *    *    *

 

“మీ కోసం ఇన్‌స్పెక్టర్ గారొచ్చారు.”

అతడు చటుక్కున లేచి నిలబడ్డాడు. ఇన్‌స్పెక్టర్ లోపలికి వచ్చి కూర్చున్నాడు. వార్డ్ బోయ్ బయటికి వెళ్ళాక ఇన్‌స్పెక్టర్ అతనివైపు తేరిపార చూస్తూ “మీరు చైతన్యననీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్‌వన్ స్టార్‌నని చెప్పుకుంటున్నారనీ ఈ హాస్పిటల్ సూపర్నెండెంట్ చెప్పారు. నిజమేనా?” అన్నాడు.

అతను సమాధానం చెప్పలేదు. ఒకే జావాబు చాలమందికి చెప్పి చెప్పి అతడు మానసికంగా అలసిపోయి వున్నాడు.

“మీరు చైతన్య అని ఋజువులు ఏమయినా వున్నాయా?” ఇన్‌స్పెక్టర్ అడిగాడు.

అతని మొహంలో ఒక్కసారిగా కళ వచ్చింది.  “థాంక్స్ ఇన్‌స్పెక్టర్. మీరొక్కరడిగారు ఈ ప్రశ్న. సినిమా ప్రపంచానికి సంబంధించిన ఒక ప్రముఖుడి నెవర్నయినా పిలిపించండి చాలు. అతను కాదంటే నేను మీరేం చెబితే దానికి ఒప్పుకుంటాను.”

“మీరేం చదివారు?”

“గ్రాడ్యుయేట్‌ని ఇన్‌స్పెక్టర్.”

“కాదు. నువ్వొక డబుల్ గ్రాడ్యుయేట్‌వి” ఇన్స్‌స్పెక్టర్ అతనివైపు సూటిగా చూస్తూ నవ్వేడు.

“చాలా గొప్ప ప్లాన్ వేశావు మిస్టర్ సుబ్బారావ్! హాట్స్ఆఫ్ టు యూ” అంటూ ఫైల్‌లోంచి కాగితాలు బయటకు తీసి, అతడి ముందుకు తోశాడు

ఆంధ్రా యూనివర్సిటీ సర్టిఫికేట్ అది. సుబ్బారావు ఏడు సంవత్సరాల క్రితం ‘లా’ డిగ్రీ పొందినట్లు సర్టిఫికేట్.  అతడు దానివైపు అయోమయంగా చూశాడు.

“నీ భార్య యిచ్చింది మీ ఇంట్లో వెతికి-” అని ఇన్‌స్పెక్టర్ చెప్పడం ప్రారంభించాడు. “మంచి తెలివితేటలు నీవి. ఈ విధంగా పిచ్చి ఎక్కినట్టు నాటకమాడితే నీ మీదకు ఏ నేరమూ రాదని ఈ ఎత్తు వేశావు కదూ?”

“నేరం ఏంటి? నేనే నేరం చేశాను?”

“మూడు రోజుల క్రితం నీ చేతిలో దెబ్బతిన్న రౌడీల్లో ఒకడు మొన్న ఆస్పత్రిలో మరణించాడు. అదీ నేరం.”

“నాన్సెన్స్” కాలితో నేలని గట్టిగా కొడుతూ అతను అన్నాడు. “అదంతా షూటింగ్. ఆవిడా నా భార్య కాదు.  ఎగస్ట్రా ఆర్టిస్టు. కొత్త పిక్చర్లో నా పాత్ర పేరు సుబ్బారావు. సీను షూట్‌చేస్తూ వుండగా, ఆ ఫైటర్ నిజంగానే నా తలమీద కొట్టాడు నాకు స్పృహ తప్పింది.”

అతడి అరుపుల్ని ఇన్‌స్పెక్టర్ పట్టించుకోలేదు.

“ఇండియన్ పీనల్ కోడ్‌లో ఒక సెక్షన్ వుంది సుబ్బారావ్. దాని ప్రకారం పిచ్చి తగ్గేవరకు నేరస్తుల్ని శిక్షించకూడదు. లా గ్రాడ్యూయేట్ వైన నీకు ఆ విషయం తెలుసు.  అందువల్లే ఇంత నాటకం ఆడుతున్నావని నాకు తెలుసు”. ఇన్‌స్పెక్టర్ లేచాడు. “ఓ.కే.! నిన్ను ఎలా దారికి తీసుకురావాలో మాకు తెలుసు. నీకు షాక్‌ల మీద షాక్‌లు యిస్తారిక్కడ. దీనికన్నా కోర్టులో అసలు విషయం ఒప్పుకోవడమే మంచిదనిపించే స్టేజికి నిన్ను తీసుకొస్తాను. అప్పటివరకూ నేను విశ్రమించను. గుడ్‌బై-” అంటూ వెళ్ళిపొయాడు.

అతడు వెళ్ళిన పది నిముషాలకి డాక్టర్ వచ్చాడు.  అతడిలో ఇదివరకంతటి సౌమ్యత కనపడలేదు. బహుశా ఇన్‌స్పెక్టర్ విషయమంతా చెప్పివుంటాడు.

“మొత్తం మమ్మల్నందర్నీ ఫూల్స్‌ని చేశావు సుబ్బారావ్. చైతన్య అనే నటుడి మీద వున్న విపరీతమయిన అభిమానంతో నువ్విలా మారావని జాలిపడ్డామే తప్ప, న్యాయస్థానాన్ని అధిగమించటానికి పిచ్చాసుప్రతిని ఆయుధంగా వాడుకున్నావని అనుకోలేదు” అన్నాడు.

ఆ క్షణంనుంచీ అతడికి నరకం ప్రారంభమయింది. షాక్ ట్రీట్‌మెంట్ పేరుతో అతడిని హింసించడం మొదలు పెట్టారు. వార్డ్‌ బోయ్‌తో సహా అతడిని అందరూ ఒక హంతకుడిగా చూసేవారు. రెండురోజుల్లో అతడి చర్మం కమిలిపోయింది.  సూదులు గుచ్చీ గుచ్చీ జబ్బలు రాటుదేలిపోయాయి. రోజుకి ఒకపూటే తిండి.  ప్రొద్దున్నే ట్రీట్‌మేంట్ మొదలయ్యేది. భయంకరమైన ట్రీట్‌మెంట్.

దాని గమ్యం ఒక్కటే.

“నువ్వు సుబ్బారావ్ వని వప్పుకో…”

 

*                            *                           *                         *

 

 

“నిన్ను చూస్తూంటే నాకు చాలా ఆశ్చర్యంగా వుంది” అన్నాడు హాస్పిటల్ సూపర్నెండెంట్.  “విదేశీ గూఢచార్లని హింసించే లెవల్లో నిన్ను బాధలు పెట్టాం.  అయినా నిన్ను మానసికంగా ‘బ్రేక్’ చేయలేకపోయాం, నీతో నిజం చెప్పించలేకపోయాం! నీకు నిజంగా పిచ్చెక్కి వుంటే మా షాక్స్‌కి అది వదిలిపోయి వుండాలి.  నీవుగానీ నాటకం ఆడుతూ వుండి వుంటే ఈపాటికి నిజం చెప్పేసి వుండాలి. రెండూ జరగలేదు. ఎందుకో మాకు అర్థంకావటంలేదు!”

“కారణం నేను నిజంగా చైతన్యని కాబట్టి” అన్నాడతను. “ఒకసారి నేను నమ్మిన విషయాన్ని బ్రహ్మరుద్రులు వచ్చినా మార్చలేరు.  శరీరాన్ని అదుపులో వుంచుకోకపోతే నటుడు ప్రేక్షకుల్ని అలరించలేడు. మనసుని కంట్రోల్‌లో వుంచుకోలేక పోతే నటుడిగా రాణించలేడు. శరీరమూ మనసూ చెప్పినట్టు వుండకపోతే ఫీల్డులో నెంబర్ వన్ అవలేడు.”

“నువ్వు సెక్రట్రియేట్‌లో గుమాస్తాగా కన్నా, యుద్ధంలో కమేండర్‌గా బాగా పనిచేస్తావు. శత్రువుల చేతికి చిక్కినా, నీ నుంచి ఒక్క రహస్యం బయటికి పొక్కదు.”

వీరి సంభాషణ జరుగుతూ వుండగా ఆమె వచ్చింది.  అదే వెలుగు. గదంతా ఒక మెరుపు తీగె నిండినట్టు.

ఆమె… అక్షౌహిణి. లోపలికి వచ్చి “సర్, గాంధీనగర్ ఏరియా ఇన్‌స్పెక్టరు వచ్చారు” అంది.

అతని బాధంతా ఒక్కసారిగా ఎవరో చేత్తో తీసేసినట్టు పోయింది.  గాంధీనగర్ అంటే తన ఏరియా. తన ఇల్లు వుండే ప్రదేశం. ఒక హీరో ఇల్లు వుండే ప్రదేశపు  ఇన్‌స్పెక్టర్‌కీ- అతనికీ చాల దగ్గిర సంబంధాలుంటాయి.  అభిమానుల్ని కంట్రోల్ చేసే విషయంలోనూ, లా అండ్ ఆర్డర్ విషయంలోనూ పోలీస్ అవసరం చాలా వుంటుంది.

అతడు ఆత్రంగా చూస్తూ వుండగా ఇన్‌స్పెక్టర్ లోపలికి వచ్చాడు. “గుడ్‌మార్నింగ్ డాక్టర్!” అన్నాడు.

“ఇదిగో ఇతనే ‘చైతన్య’నని చెప్పుకునే సుబ్బారావు” అన్నాడు డాక్టర్.

అప్పటివరకూ మౌనంగా వున్న ‘అతను’  కదిలి, “వెంకట్రావ్ ఏమయ్యాడు” అన్నాడు.

“వెంకట్రావ్ నీకు తెలుసా?” ఇన్‌స్పెక్టర్ తిరుగుప్రశ్న వేశాడు.

“వెంకట్రావ్, గాంధీనగర్ ఏరియా ఇన్‌స్పెక్టర్. చైతన్య అభిమాని ఎన్నిసార్లు డబ్బిచ్చినా పుచ్చుకునేవాడు కాదు. చైతన్యకి ప్రొటెక్షన్ ఇవ్వటం తన అదృష్టంగా భావించేవాడు.”

“వెంకట్రావుకి ట్రాన్స్‌ఫరయింది.  అతని స్ధానంలోకి నేనొచ్చాను” ఇన్‌స్పెక్టర్ సమాధానమిచ్చాడు.

“ఆయన్నొకసారి రమ్మనండి. ఈ మిస్టరీ విడిపోతుంది.”

“అవసరం లేదు. నేనే నిన్ను చైతన్య ఇంటికి తీసుకువెళతాను.” అతడికి రిలీఫ్‌గా అనిపించింది. ముందు తన తల్లిని చూడాలి. సుబ్బరాజు తనతో అలా ఎందుకు మాట్లాడాడో కనుక్కోవాలి. అతడు లేచి, “థాంక్స్, వెంటనే వెళదాం పదండి” అన్నాడు.

“నే నొప్పుకోను” అన్నాడు డాక్టరు. అతడు చప్పున డాక్టర్‌వైపు చూసి “ఏం?” అన్నాడు.

డాక్టర్ అతడి ప్రశ్నని పట్టించుకోకుండా ఇన్‌స్పెక్టర్‌వైపు తిరిగి, “ఇతను మా పేషెంట్. మా అనుమతి లేకుండా తీసుకువెళ్ళడానికి వీల్లేదు” అన్నాడు.

“ఇతను మీ పేషెంట్ కాదు. ఒక క్రిమినల్, పిచ్చివాడిలా నటిస్తున్నాడు. ఇతనిమీద కేసు వుంది.  ఆ కేసు ఇన్వ్‌స్టిగేట్ చేసే బాధ్యత మా డిపార్ట్‌మెంటుది.  చైతన్య ఇంటికి ఇతడిని తీసుకెళ్ళి, ఇతడి రియాక్షన్ గమనించటం మా ఎంక్వయిరీలో ఒక భాగం. దీనికి మీరు ఒప్పుకుంటారా లేదా?”

డాక్టర్ మరేమీ మాట్లాడలేకపోయాడు.

అతనయితే అసలు ఈ సంభాషణే వినడంలేదు. ఎప్పుడు వెళదామా అని మనసు తహతహలాడుతోంది.

అందరూ లేచారు.

అప్పటివరకూ నిశ్శబ్దంగా వున్న ఆమె, “సర్! నేనూ వీళ్ళతో వెళతాను” అంది. అందరూ ఆమెవైపు ఆశ్చర్యంగా చూశారు.

“చైతన్యగారిని ఈయన చూసినప్పుడు ఆ షాక్ తట్టుకోలేక ఏమైనా రియాక్షన్స్ వస్తే, పక్కన నర్సుగా నేనుండటం మంచిదనుకుంటాను.

అతడామె వైపు కృతజ్ఞతా పూర్వకంగా చూశాడు. తన గురించి ఆలోచించేందుకు ఎవరో ఒకరు వుండటం ఎంతో సంతోషంగా అనిపించింది. తను చైతన్య అవనీ, సుబ్బారావు అవనీ- అది వేరే సంగతి.

“థాంక్స్” అన్నాడు ఆమెకి మాత్రమే వినిపించేటట్టు. ఆమె నవ్వి వూరుకుంది. ఇంద్రధనస్సు మీద తెల్లమేఘం బంగారుపుటంచు అద్దినట్టు ఆ నవ్వు. ఎందరు స్త్రీలతో సాన్నిహిత్యం వున్నా, ఈ పరిమళాన్ని అతడు అంతకుముందు అనుభవించలేదు.

రెండు నిమిషాల తర్వాత గమనించాడు అతడు జీపు గాంధీనగరం వైపు వెళ్ళటం లేదని.

“ఇటెక్కడికి?” అని అడిగాడు. ఎవరూ సమధానం చెప్పలేదు. జీపు ఒక పాత గోడౌన్‌లోకి వెళ్ళి ఆగింది. “దిగు సుబ్బారావ్” అన్నాడు ఇన్‌స్పెక్టర్.

“ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు నన్ను?”

ఇన్‌స్పెక్టర్ నవ్వుతూ కేప్ తీసేశాడు. పోలీసులు కూడా అదేపని చేశారు. మరో ఇద్దరు గూండాలు లోపల్నుంచి వచ్చి వారితో చేరారు.

“మా మనిషిని అంజిగాడి కిళ్ళికొట్టు దగ్గిర చంపావు.  పోలీసులూ, కేసులూ, వీటిమీద మాకు నమ్మకం లేదు సుబ్బారావ్! కత్తికి కత్తి – ప్రాణానికి ప్రాణం, అదే మా రూలు. ఎవడో నీ మీద కేసు పెట్టడం-కోర్టులో శిక్షపడటం-అంతవరకూ మేం వూరుకోలేం. ఊరుకుంటే మావాడి ఆత్మ శాంతించదు” అంటూ కత్తి తీశాడు.

అతడింకా అయోమయం నుంచి తేరుకోలేదు. ఆ అయోమయం, పోలీసుల వేషంలో వచ్చిన రౌడీల్ని చూసి కాదు. కిళ్ళీకొట్టు దగ్గిర చనిపోయిన మనిషి గురించి.

“మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థంకావటంలేదు. అదంతా షూటింగ్‌లో ఒక భాగం”.

అతడి మాటలు వినిపించుకోకుండా ముందుకొచ్చాడు రౌడీ. ఆమె కెవ్వున అరిచింది.  అతడు ఆగి, “ఒహో నువ్వూ వున్నావు కదూ” అని నవ్వేడు. పక్కనున్న ఇద్దరు గూండాలు వచ్చి ఆమెను పట్టుకోబోయారు. తన ముందున్న కత్తిని పట్టించుకోకుండా అతడు ముందుకు కదిలాడు. ఒకటే దెబ్బ. ఆమెని లాగబోతున్న ఒక గూండా మొహం ఆ దెబ్బకి పచ్చడయింది. రెండో గూండా గాలిలో ఎగిరి అతడిని తన్న బోయాడు.

తను చైతన్యా? సుబ్బారావా?

డాక్టర్ అన్నట్టు ఇదంతా భ్రాంతా?

తను చైతన్యే అయితే డూప్ లేకుండా ఇలాంటి ఫైట్స్ చేయగలడు. తను సుబ్బారావే అయితే భయపడి లొంగిపోతాడు.  “కమాన్ చైతన్యా – కమాన్. ఇది నీకో లెక్కకాదు” అంటూ అతడు తనని తాను సెల్ఫ్ హిప్నటైజ్ చేసుకున్నాడు.

తన మీదకి వస్తున్న కాలుని అతను అలాగే గాలిలోకి పైకి ఎత్తి మెలిక తిప్పాడు. అక్కడినుంచి క్రిందపడ్డ రౌడీచేసిన ఆర్తనాదం గాలిలో కలిసిపోయింది. ఆమె అతనివైపు కృతజ్ఞతా పూర్వకంగా చూసింది.  అతనేదో అనబోతూంటే వెనుక ఎవరో కదిలినట్టయింది.  అతడు చప్పున ముదుకు వంగి, వెనుకనుంచి వస్తున్న రౌడీని అలాగే లాగి, మెడమీద కొట్టాడు. ఆమె బయటకు పరుగెత్తింది.

అక్కడొక అయిదు నిమిషాలపాటు భయంకరమయిన పోరాటం జరిగింది.  బ్రతుక్కీ చావుకీ మధ్య పోరాటం, బ్రతుకే గెలిచింది.  అతడు వాళ్ళని కొట్టి పడెయ్యబోతుంటే బయట వ్యాన్ చప్పుడు వినిపించింది.  ఆమె ఆందోళనగా లోపలికి పరిగెత్తుకు వచ్చింది. వెనుకే హాస్పిటల్ స్టాఫ్.

తిరిగి ఆ నరకకూపానికి వెళ్ళాలి అనుకోగానే అతడు నిజంగా పిచ్చివాడయ్యాడు. చెల్లాచెదురుగా పడివున్న శరీరాల మధ్య నుంచి అదే వూపులో బయటకు పరుగెత్తబోయాడు, ఎవరు పట్టుకున్నారో తెలీదు. ఎవరు గుచ్చారో తెలీదు. ఇంజక్షన్ సూది అతడి శరీరంలో ప్రవేశించింది.

 

*                 *               *                    *

 

 

ఆతడికి నెమ్మదిగా స్పృహ వచ్చింది.

ఇదంతా కలా? నిజంగా జరుగుతూ వుందా? ఏమి అర్థంకావడంలేదు. అతను రెండుగా విడిపోయాడు.

ఒకటి సుబ్బారావు భార్యా, పిల్లవాడు. తను సెక్రటేరియట్‌లో పని చేస్తున్నాడు. కిళ్ళీకొట్టు దగ్గ్గర గొడవైతే ఒక రౌడీని కొట్టాడు. తనకి తలమీద దెబ్బ తగిలింది. పిచ్చాసుపత్రిలో చేర్చారు. ఆ రౌడీ మరణించేసరికి పోలీసులు తనమీద కేసు పెట్టారు. ఆ రౌడీ తాలూకు మనుషులు వేషాలేసుకొచ్చి తన ప్రాణం తీద్దామనుకున్నారు. ఇదొక కథ.

తను చైతన్య. ఆంధ్రుల అభిమాన నటుడు. షూటింగ్‌లో ప్రమాదవశాత్తు దెబ్బ తగిలింది. పిచ్చాసుపత్రిలో చేర్చారు. “నేను చైతన్యని”  అన్నా ఎవరూ ఒప్పుకోవటంలేదు, ఇది రెండో కథ.

ఈ రెండు కథలూ చెపితే- అందరూ మొదటిదానికే ఓటు వేస్తారు. ఇంతమంది చెపుతున్నా, న్యూస్ పేపర్ చూపిస్తున్నా, అది తన ఫోటో కాకపోయినా- ఇంకా తను చైతన్యననటం… నిజంగా తనకి మతిభ్రమించిందా? తన భార్యని గుర్తుపట్టలేకపోతున్నాడా?

ఓ.కే.!

తను నిజంగా సుబ్బారావే అయితే-ఆ రౌడీని చంపినందుకు ఆనందంగా శిక్ష అనుభవిస్తాడు కానీ దానికన్నా ముందు తనొక సారి చైతన్యని కలవాలి. తనని అంత ఫారనాయిడ్‌ని చేసిన చైతన్య ఎవరో ఒకసారి చూడాలి. డాక్టర్ చెప్పినట్లు, చైతన్యని చూసిన ఉద్వేగంలో తనకి తిరిగి గతం గుర్తుకు రావచ్చు.

అతడు దినపత్రికవైపు చూశాడు.

“అతడే ఆమె సైన్యం”.

క్రింద చైతన్య ఫోటో-

చాల మామూలుగా వున్నాడు ఫోటోలో.  సిగరెట్ కంపెనీకి మోడలింగ్ చేసే వ్యక్తిలా వున్నాడు. ఇతడేనా చైతన్య? ఇతడేనా అఖిలాంధ్ర ప్రేక్షకుల అభిమాన నటుడు? ఇతడికీ తనకీ పొలికలు లేనేలేవు. అతడి తల్లిని చూస్తే బావుండును.

అతడు ఆలోచనల్లో వుండగానే ఆమె లోపలికి వచ్చింది-భొజనం ట్రేతో! అదే నవ్వు. హంస రెక్క విరుచుకున్నట్టు.

“మీరు సినిమాలు చూడరా?” ఆమె భోజనం పెడుతుంటే అడిగాడు.

“చూస్తాను” మెల్లిగా అంది.

“నాకీ షాక్ ట్రీట్‌మెంట్, ఇంజెక్షన్‌లూ వద్దు! మీరు చెపితే నమ్ముతాను చెప్పండి. నేను చైతన్యనా? సుబ్బారావ్‌నా?

ఆమె సమధానం చెప్పకుండా బయటకు వెళ్ళిపోయింది. తరువాత వచ్చి టాబ్లెట్లు యిచ్చి వెళ్ళింది.  టాబ్లెట్ వేసుకుని కాగితం పారేయబోతూ ఆగాడు. దానిమీద చిన్న అక్షరాల్తో వుంది. “మీరు చైతన్యే, ఈ రాత్రి పన్నెండింటికి మీరు పారిపోవటానికి ఏర్పాటు చేస్తాను. సిద్ధంగా వుండండి- అక్షౌహిణి.”

ఆ ఉత్తరం అతడి చేతిలో వణికింది! కోటి చేతులు ఒక్కసారిగా సితారులు మీటిన భావం!

ఒక అయోమయం స్థితినుంచి బయటపడ్డట్టు వుంది. తనని ఇంతకాలం ఎందుకు సుబ్బారావని భ్రమింపచేశారో, కారణాలు వెతికే ఓపిక కూడా లేదు. ఆమెని కలుసుకోవాలని మనసు ఉవ్విళ్ళూరసాగింది. అయితే ఆమె కనపడలేదు.

టైం ఎంత నెమ్మదిగా కదుల్తుందో అతడికి మొదటిసారి తెలిసింది.  షూటింగ్‌ల్లో అయితేనేం, ఇంటిలో అయితేనేం – అతడికి టైం చూసుకునే అవసరం (అవకాశం) వుండేది కాదు. అతిథులు, అభిమానులు ఎప్పుడూ చుట్టూచేరి, అతడి సమయాన్ని తినేస్తూ వుండేవారు.

క్రమంగా చీకటి పడింది.

ఆమె కనపడలేదు.

అతడికి అనుమానం వచ్చింది.  ఇదికూడా ఈ నాటకంలో ఒక భాగమేమో అని!

ఆస్పత్రి నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది.

పదిన్నర.. పదకొండు.. పదకొండున్నర.

అయిదు నిమిషాల తక్కువ పన్నెండు.

తన మనసుని స్వాధీనంలో వుంచుకోవటానికి అతడు ప్రయత్నించసాగాడు. తను మొట్టమొదటిసారి కెమేరాముందు నిలబడటం గుర్తొచ్చింది.  స్టార్ట్.. సౌండ్… క్లాప్… యాక్షన్… తడబాటు… ఓ.కే…

పన్నెండు గంటలకు ఒక్క నిమిషం తక్కువగా వుందనగా తలుపు తెరుచుకుంది.  ఆమె లోపలికి వచ్చింది  అతడు చప్పున ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఏదో అనబోతూ వుంటే ఆమె “…ష్” అని సైగ చేసింది.  ఇద్దరూ నిశ్శబ్దంగా బయటకు కదిలారు.

వరండా చివర్లో ఒక నర్సు కునికిపాట్లు పడుతూంది. తన అడుగుల చప్పుడే తనకి డ్రమ్‌బీట్స్‌లా వినపడుతున్నట్టు అనిపించింది.  నర్సుని దాటుకుని మెట్ల దగ్గరికి వచ్చారు ఇద్దరూ. అక్కడికి చలిగాలి రివ్వున వీస్తూంది.

క్రిందికి మెట్లు దిగారు. అద్దాల అవతల చీకటి ఆ నిశ్శబ్దానికి తోడై ఎంతటి ధైర్యవంతుడినైనా భయపెడుతూంది. దానికి తోడు చలిగాలి.

బిల్డింగ్‌కి వంద గజాల దూరంలో ఎత్తయిన ప్రహరీగోడ వుంది. గేటు దగ్గర సెంట్రీలు యిద్దరున్నారు. ఆ ఆవరణ అంతా వెలుతురు నిండి వుంది.  అతడి దృష్టి సెంట్రీల పక్కనున్న కుక్కలమీద పడింది.

అంతకు ముందురోజే అతడు వాటిని చూశాడు. కానీ అవి ఎందుకో అర్థంకాలేదు.

ఆమె అది గమనించి అంది- “ఆస్పత్రిలో కొందరు ప్రమాదకరమైన పేషెంట్లు వున్నారు. వాళ్ళు బయట ప్రపంచంలోకి వెళితే, మర్డర్లు, మరిన్ని నేరాలు చెయ్యవచ్చ్చు. అందుకని ఇంత జాగ్రత్తగా కాపలా” అర్థమైనట్టు అతడు తలూపి మరింత నిశితంగా చూశాడు.

ఆమె అన్నది- “నేనూ మీతో రావల్సి వుంటుంది. సాయంత్రం డ్యూటీ అయిపోయాక నేనిక్కడే వుండిపొయాను. నేను వుండిపోయినట్టు ఎవరికీ తెలీధు.”

“థాంక్స్!”

సెంట్రీలు ప్రతీ అయిదు నిమిషాలకీ చెరోపక్కకీ వెళ్ళి రావటం అతను గమనించాడు. తిరిగి రావటానికి మరో అయిదు నిముషాలు పడుతుంది.  కానీ ఆ టైంలో కుక్కలు అక్కడ కాపలా కాస్తునాయి.

అతడు రెండు నిముషాల ఆగి, సెంట్రీలు దూరంగా వెళ్ళగానే చేతిలో బ్రెడ్ కుక్కల దగ్గరికి విసిరాడు. చీకట్లోంచి వచ్చిపడిన రొట్టెముక్కల్ని ఆత్రంగా తిని – నెమ్మదిగా నడుము వాల్చాయి అవి.

“ఏమిటిది? ఎలా జరిగింది?” అని అడిగింది ఆమె.

“ఇలాంటి అవసరం ఏదో వస్తుందని తెలుసు. సాయంత్రం మీనుంచి ఉత్తరం అందేక, రొట్టె తినకుండా దాచి వుంచాను” అన్నాడు.

“కానీ అవి తిని, ఆ కుక్కలు మత్తు లోకి ఎలా జారుకున్నాయి?”

“పెథిడ్రిన్ ఇంజెక్షన్ బాటిల్ కాజేసి దాచేసి వుంచాను. ఆ బ్రెడ్‌లో అది కలిపాను.”

ఆమె కళ్ళు విప్పారితం చేసి అతనివైపు చూసింది. “ఇంత దూరదృష్టి మామూలు మనుష్యులకు వుండదు. మీరు సినిమాల్లోనే కాదు బయట కూడా హీరోయే”

అతనికి పొగడ్తలు అంతగా నచ్చవు. తన చుట్టూ వున్న జనం నోట ఆ పొగడ్తలు వినీ వినీ విసుగెత్తి వున్నాడు.

“మీ పేరు బావుంది. అక్షౌహిణి. ఎవరు పెట్టరు?” అన్నాడు మాట మారుస్తూ.

“మా నాన్నగారు మిలటరీలో కల్నల్. అక్షౌహిణి అంటే సైన్యం. అందుకే ఆ పేరు పెట్టారు.”

అతడు ఆశ్యర్యంగా “కల్నల్ కూతురైయుండి నర్సుగా చేస్తున్నారా?” అన్నాడు.

“ఏం తప్పేముంది? అదేమీ తక్కువ ఉద్యోగం కాదే.”

“ఐయామ్ సారి! నా ఉద్దేశ్యం అదికాదు”

పడిపోయిన కుక్కల సంగతి చూసుకోకుండా సెంట్రీలు మళ్ళి రౌండ్స్‌కి వెళ్ళారు.

“క్విక్” అన్నాడు అతడు. ఇద్దరూ ద్వారం దగ్గరికి పరుగెత్తారు. గేటు పక్కనే వున్న చెట్టుకొమ్మని పట్టుకుని ఒక్క స్వింగ్‌లో అతడు పైకి చేరుకున్నాడు. అంత టెన్షన్లో కూడా ఆమె ఆ అద్భుత విన్యాసానికి నివ్వెరపోయింది.  గోడమీద గాజుపెంకులున్నాయి. చెప్పులతో నిలబడితే ఫరవాలేదు కాని చెయ్యి ఆనిస్తే కష్టం. ఆమెని వదిలిపెట్టి వెళ్ళటం అతనికి ఇష్టంలేదు. తన కోసం అంత రిస్క్ తీసుకున్న ఆమెకి, తనవల్ల ఉద్యోగం పోవటం సహించలేడు. అతడు గోడ అంచుమీద వంగి, క్రిందకి చేయి సాచేడు. పూర్తిగా పడుకుంటేగానీ ఆమె చెయ్యి అందటం లేదు.

దాంతో అతడి శరీరం అంతా గాజుపెంకులు గుచ్చుకుని రక్తం ప్రవించసాగింది. అక్షౌహిణి కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి.

“తొందరగా…. చెయ్యి అందివ్వు” అని అరిచాడతడు. ఆమె చెయ్యి అందించింది. ఆమె బరువుకి పెంకులు మరింత లోపలికి వెళ్ళాయి, బాధని అదిమిపెట్టి, పెదాలు బిగపట్టి ఆమెని పైకి లాగసాగాడు! చివరివరకూ వచ్చాక ఆమె చెయ్యి గోడ చివరి అంచు పెంకుమీద ఆని, ఆమె బాధతో కెవ్వున అరిచింది.  అతడు వారించబోయే లోపులోనే ఆ కేక గాలిలో కలిసిపోయింది.  సెంట్రీలు పరుగెత్తుకు రాసాగారు.

అతడు రెండు చేతులతోనూ ఆమె భుజాలు పట్టుకుని పైకి లాగటానికి ప్రయత్నం చేయసాగాడు. సెంట్రీ విజిల్ వూదాడు. ఆమె అతడితో పాటూ పైకి రావటానికి ప్రయత్నం చేస్తోంది.

“ఆగండి-స్టాప్‌దేర్” రెండో సెంట్రీ అరుస్తున్నాడు.

ఈ అవకాశం పోతే మరి రాదని అతడికి తెలుసు. తన గాయాన్ని కూడా లెక్కచేయటం లేదతడు. అతడి గాయాలనుంచి  ప్రవిస్తూన్న రక్తం ఆమె మీద బొట్లు బొట్లుగా పడుతూంది.

హెచ్చరికగా సెంట్రీ గాలిలోకి రైఫిల్ పేల్చాడు. అక్కడి నిశ్శబ్దం ఒక్కసారిగా చెదిరింది.  ఆస్పత్రి ఆవరణలో వున్న చెట్లమీద విశ్రాంతి తీసుకుంటున్న పక్షులన్నీ ఆ అర్థరాత్రి శబ్దానికి ఒక్కసారిగా రెక్కలు టపటప కొట్టుకుంటూ పైకి లేచాయి.

గోడమీద కాలుపెట్టి ఒక్క అంగలో పైకి రావచ్చు కానీ భయంవల్లా టెన్షన్‌వల్లా ఆ పని చేయలేక పోతూంది. ఆమెని వదిలి అతడు వెళ్ళిపోవచ్చు కానీ కృతజ్ఞత భావంవల్ల అతడా పని చేయలేకపోతున్నాడు.

అదే ఆ ఇద్దరి పాలిట శాపంలా పరిణమించింది.

ఒక రైఫిల్ బుల్లెట్ అతని పక్కనుంచి దూసుకుపోయింది. అంత పరిణామాన్ని అతడు వూహించలేదు. ఒక పిచ్చాసుపత్రి నుంచి పేషెంట్ పారిపోతుంటే అతడిని పట్టుకోవటానికి అలా రైఫిల్స్ పేల్చనవసరం లేదు, గేటు బైటికొచ్చి గోడ ఇవతల్నించి పట్టుకోవచ్చు. అతడు రెండు చేతులతో ఆమెని పట్టుకుని పైకి లాగుతూండగా అప్పుడు వినిపించింది.  రెండో బుల్లెట్ శబ్దం. దానితోపాటు ఆమె ఆర్తనాదం.

సెంట్రీ రైఫిల్ నుంచి వెలుపడిన బుల్లెట్ ఆమె వెన్నులోంచి దూసుకుపోయింది. క్షణాల్లో ఆమె శరీరం తోటకూర కాడలా వాడిపోయింది.  నేలమీద కుప్పగా కూలిపోయింది. అతడామె తలని వళ్ళోకి తీసుకున్నాడు. ఆమె ఏదో చెప్పబోయింది.  నోటినుంచి మాట రాలేదు.

అమె తల పక్కకి వాలిపోయింది.

అతడింకా దిగ్ర్భమనుంచి కోలుకోలేదు. జరుగుతున్నదంతా కలో నిజమో తెలియటం లేదు. క్షణం క్రితం వరకూ తన ముందు సజీవ ప్రతిమలా తిరుగుతూ, తన కళ్ళల్లో మెరుపుల్ని పండించిన ఓ అద్భుత సౌందర్యరాశి రెప్పపాటు కాలంలో నిర్జీవంగా మారటాన్ని అతడు జీర్ణించుకోలేకపోయాడు. అతడా అచేతనామయవస్థలో వుండగానే తన మొహంమీద ఏదో ద్రవం చల్లబడినట్లు అనిపించింది. జూలో జంతువులు బోనులో నుంచి పొరపాటున బయటకొస్తే వాటిని వెంటనే మత్తులోకి పంపే ద్రవం అది.

 

3

 

ఏటవాలుగా ఒక సూర్యకిరణం మొహం మీద చురుక్కుమని పడటంతో అతడికి మెలకువ వచ్చింది.

కళ్ళు విప్పి చుట్టూ చూశాడు. అదే హాస్పిటల్ రూమ్.

అతడికి మెలకువ రావటం చూసి, వరండా లోంచి వెళుతూన్న డాక్టర్ లోపలికి వచ్చాడు. “గుడ్‌మార్నింగ్ సుబ్బారావ్.”

“నేను సుబ్బారావ్‌ని అవనీ,  చైతన్యని అవనీ నా మూలంగా ఒక అమ్మాయి ప్రాణాలు పోగొట్టుకుంది. దానికి నేను శిక్షార్హుణ్ణి” అన్నాడు.

“నీ మూలంగా ప్రాణాలు పోగొట్టుకోవడం ఏమిటి?”

“నిన్న రాత్రి జరిగిన సంఘటన-”

“ఏం జరిగింది సుబ్బారావ్?”

ఏం జరిగిందో ఆ డాక్టర్‌కి తెలిసి వుండకపోవచ్చు. అతడు జరిగినదంతా చెప్పేడు.. డాక్టర్ మొహంలో రంగులు మారాయి. “మైగాడ్” అని గొణుక్కున్నాడు అంతలో ఆ గదిలోకి సూపర్నెండెంట్ వచ్చాడు. డాక్టర్ ఆయన్ని దూరంగా తీసుకువెళ్ళాడు.

“నిన్నరాత్రి నుంచి పేషెంట్‌కి హెలూసినేషన్ (భ్రాంతి) స్టార్ట్ అయినట్టు అనుమానం సార్.”

“పారనాయిడ్ ప్రవర్తనకి తోడు హెలూసినేషన్ కూడానా – ఐ పిటీ హిమ్.”

ఎంత తక్కువ గొంతులో మాట్లాడుకున్నా ఆ మాటాలు అతని చెవిన పడ్డాయి. గాలిలా వాళ్ళ మధ్యకు వెళ్ళి “మీరేమనుకుంటున్నారో నాకు అర్థంకావటంలేదు. నిన్నరాత్రి నేనీ ఆస్పత్రి నుంచి పారిపోవాలనుకున్నాను. ఒకామె నాకు సాయం చేయటానికి సిద్ధపడింది. ఆ ప్రయత్నంలో ఆమె సెంట్రీల రైఫిల్ గుళ్ళకి బలి అయింది” అన్నాడు.

“సెంట్రీల గుళ్ళకా?” ఆశ్చర్యంగా అడిగాడు సూపర్నెండెంట్.

“అవును. ఆ విషయం మీకింతవరకూ తెలియకపోవటం ఆశ్చర్యకరం.”

“మీకు కలవచ్చి వుంటుంది సుబ్బారావ్.”

అతన్ని లాగిపెట్టి కొట్టాలన్న కోరికని బలవంతంగా ఆపుకున్నాడు అతడు. “కలకాదు. నిజం. మీ సెంట్రీలని ఎంక్వయిరీ చేయండి.”

“అక్కర్లేదు. ఇది ఆర్మీ క్యాంప్ కాదు. పిచ్చాసుపత్రి.  పారిపోయే రోగుల్ని కాల్చడానికి ఇక్కడ సెంట్రీలు, వాళ్ళ దగ్గిర రైఫిల్సూ వుండవు.”

అతడు షాక్ తగిలినట్టు నిలబడిపోయాడు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. “ఇతడిని జాగ్రత్తగా ట్రీట్ చేయాలి. చాలా విచిత్రమయిన కేసు” అని పాల్ అంటూ వుండటం దూరం నుంచి వినిపించింది.

 

*                                  *                                  *

 

అతడు ఆ ఒంటరి గదిలో రెండు గంటలు నరకం అనుభవించాడు.

ఆమె రూపం అతడి కళ్ళముందు నుంచి తొలగిపోవటం లేదు. తనని బయటకు పంపే ఆమె ప్రయత్నం, చెయ్యి అందిస్తూ వుండగా ఆమె వెన్నులో బుల్లెట్స్ గుచ్చుకోవటం, ఆమె తన వైపు చూసిన ఆఖరి చూపు అతడికి కదిలించి వేస్తున్నాయి. అందరికన్నా అతీతమైనదేదో వుంది ఆమెలో. ఒక రకమైన గ్రేస్ అది. బహుశా కల్నల్ కూతురవటం వల్ల వచ్చిందేమో అది. అందుకేనేమో యుద్ధంలో సైనికుడిలా మరణించింది-ఆఖరి చిరునవ్వుతో.

మనసంతా చీకటి కమ్మినట్టు ఒక ఆర్థ్రభావం.

అతడు కవికాదు. కానీ ఒక నిజమైన అభిమానాన్ని మాటల్లో వ్యక్తీకరించటానికి కవిత్వం అవసరంలేదు. జ్ఞాపకం వచ్చే పెదవి నవ్వు ఆనందభైరవి అయితే, జ్ఞాపకం మిగిల్చే కంటిచుక్క శివరంజని…! కాలం కడగలేని ఒకే ఒక వస్తువు – జ్ఞాపకం. ఆమెతో అతడి పరిచయం కొన్ని గంటలు మాత్రమే. పేరే గమ్మత్తయినది “అక్షౌహిణీ”.

పైకి లాగటం కోసం తనామెకి చెయ్యి అందిస్తూంటే కనీసం తననైనా ప్రాణాలు దక్కించుకొమ్మన్ని అర్థిస్తూ ఆమె చూసిన చూపు అతడిని వేదనాపూరితుడిని చేస్తోంది. ఆ గదిలో ఒంటరితనం ఆవేదనకి మరింత సాంద్రత కలిగిస్తోంది. అతడికి కవిత్వం రాదు.

ఏ కవి అన్నాడు?

-          స్వప్న సంగీతాలు నేను గానవిస్తూంటే నీ చుట్టూ వున్న సౌండ్ ప్రూఫ్ నిశ్శబ్దాని కెంత నిర్దయ? ఈ నిశ్శబ్ద హిమసుమం కోసం ఇవ్వాళ ఉదయించని నిన్నటి సూర్యుడా! నిన్ను ప్రేమించిన నేరానికి, నువ్వు మిగిల్చిన సంధ్య రక్తాన్ని నీ గుర్తుగా చీకటి పాదాలకి పూస్తోంది ఈ ప్రపంచం.

ఆత్మహత్యించుకుంటున్న నిన్నటి స్వప్నాల డెడ్‌బాడీస్ మీద నుంచి చెయ్యిపట్టి లాక్కెళుతున్నాడు నేటి సూర్యుడు.

ఎన్ని ఓదార్పుల శస్త్రచకిత్సలు కావాలో – చీలిన నా హృదయాన్ని అతకటానికి.

రాత్రి పత్రంమీద వెన్నెల కిరణాల కలంతోనే రాసిన మౌనాక్షారాల నక్షత్రాలు, ప్రత్యూషంలో హిమబిందువులై, అపరాహ్ణంలో దాహార్తితో అరిచే పక్షుల దీనరవాలై, సాయం సంధ్య మసకల్లో చీకట్లుగా కలిసిపోతున్నాయి.

కేవలం ఉదయపు వాస్తవ విషాదాన్ని దర్శించటం  కోసం, నిన్ను తల్చుకుంటూ, రాత్రి అంచుల మీద ప్రయాణిస్తాను.

పరిచయం కానంతకాలం నిన్ను పోగొట్టుకున్నాను. పరిచయం ఆయాక నన్ను పోగొట్టుకున్నాను.

నా నిస్తేజపు కళ్ళనుంచి నీ అద్భుత సౌందర్యానికి చేసిన వంతెన మీద నడిచే నిర్దయ సైనికులు నా చుట్టూ వున్నవారు.

ఒక శరద్రాత్రి, ఏటవాలు క్షణాలమీద నిటారుగా నిలబడి, వెన్నెల తీవెల్ని మీటగల అనుభవాన్ని ఇచ్చేదే ప్రేమ. కనురెప్పల మైదానాల మీద కలల వితనాలు జల్లి, అనుభూతుల పంట పండించేదే ప్రేమ. కొబ్బరితాడు చేదా, తియ్యటి నీళ్ళు, మిద్దెలో వుంచిన మామిడి పళ్ళ వాసనా, తాటాకులమీద తొలకరి జల్లుల చప్పుడు కలిస్తే ప్రేమ, మనసుకు మాట్లాడే అనుమతి ఇచ్చేది ప్రేమ. నీ అద్భుతంలో, నీ అనంతంలో, నీ అద్వితీయంలో  సర్వస్వం విలీనమవ్వటం ప్రేమ.

కార్తీకమాసపు చిరుచలి రాత్రంతా కుప్పగా పోసే వెన్నల నీవైతే, ఆకాశం అంచున సూర్యుడు వెళ్ళిపోతూ వ్రాసే కవితాపంక్తి నీ స్నేహమైతే,

నిన్నే నిన్నే తలుచుకుని

నిద్దుర పొద్దులు మేలుకుని

వేచాను నువ్వొస్తావని

నువ్వొస్తే ప్రాణం వొస్తుందని.”

 

*                                              *                                              *

ఏదో శబ్దమవటంతో అతడు తన స్వాప్నికావస్థనుంచి తేరుకున్నాడు. వరండాలో ఇద్దరు డాక్టర్లు వెళుతున్నారు.

అప్పుడే వచ్చింది అతడికో ఆలోచన.

టేబుల్ పక్కనున్న నీళ్ళసీసా భళ్ళున బ్రద్దలుకొట్టాడు. ఆ శబ్దానికి డాక్టర్లు వెనుదిరిగారు.

అతడు గాలిలా దూసుకువెళ్ళాడు వాళ్ళ దగ్గరికి. ఏం జరుగుతూ వుందో తెలుసుకునే లోపులోనే ఒక డాక్టర్ మెడమీద ఆ సీసా అంచుని కత్తిలా ఆంచి, అతడిని పట్టుకుని తన గదిలోకి లాక్కొచ్చాడు.

ఈ దృశ్యం చూసి సిబ్బంది పరుగెత్తుకు రాసాగారు.

“ఖబడ్దార్! ఎవరైనా నా గదిలోకి రావటానికి ప్రయత్నిస్తే ఈ డాక్టర్ ప్రాణాలు పోతాయి. అంతేకాదు! అక్షౌహిణి శవాన్ని మీరేం చేశారు? ఆ విషయం అయిదు నిమిషాల్లో పోలీసుల్ని పిలిపించి మీరు చెప్పాలి. లేకపోయినా ఈ డాక్టర్ ప్రాణాలు మిగలవు.”

అతడి చేతుల మధ్య డాక్టర్ వణికిపోతున్నాడు.

అంతలో అక్కడికి సూపర్నిండెంట్ పరుగెత్తుకు వచ్చాడు.

“వదులు సుబ్బారావ్! మా డాక్టర్ని వదిలెయ్యి.”

“వదల్ను. ఆమెని చంపిన సెంట్రీల సంగతి తేల్చండి ముందు.”

“ఆమె ఎవరు?”

“అక్షౌహిణి”.

“అంటే?”

“అదికూడా మీకు తెలిదా? ఆమె మీ ఆస్పత్రిలో పనిచేసే నర్సు.

“మెదడుకి తార్కికంగా ఆలోచించడం నేర్పు సుబ్బారావ్. అక్షౌహిణి అనే పేరు ఎవరికయినా వుంటుందా?”

అతను కాస్త షాక్ తిన్నాడు.  అయినా తమాయించుకున్నాడు. “నేను చెప్పేది మధ్యాహ్నం నాకు మందిచ్చిన నర్సు గురించి.”

డాక్టర్లు మొహమొహలు చూసుకున్నారు. “నువ్వు చెప్పేది ప్రనూష గురించా?”

“ప్రనూష ఎవరు?”

“ఎవరైతేనేం? చంపేసేరుగా?”

“ప్రనూష చనిపోవటం ఏమిటి? అదిగో-”

ఒక చలనచిత్రం స్లోమోషన్‌లో కదిలినట్టు అతడు తల తిప్పి చూశాడు.  కిటికీ ఊచల్ని పట్టుకొని తనవైపే భయం భయంగా, దిగులుగా చూస్తున్న ‘ఆమె’ కనపడింది. అతడికెంత షాక్ అంటే- అచేతనావస్థలో చేతిలో సీసా వదిలేశాడు.

అయితే అతడిని ఎవరూ పట్టుకోవడానికి రాలేదు. అతడి చేతుల్లో అప్పటివరకూ బందీగా వున్న డాక్టర్ కూడా అతడివైపు సానుభూతిగా చూస్తూ అక్కడే వుండిపోయాడు.

ఆమె అందమైన కళ్లలో అతడి స్థితిపట్ల ఆర్ద్రతతో కూడిన జాలి.

“అక్షౌహిణి” అన్నాడు అస్పష్టంగా.

“కాదు. ఆ అమాయి పేరు ప్రనూష” అన్నాడు డాక్టర్ పాల్. అందరూ క్రమంగా అక్కడనుంచి వెళ్ళిపోసాగారు.

“ప్రనూష చాలా అందమైనది సుబ్బారావ్! ఇక్కడ చాల మంది డాక్టర్లే మతులు పోగొట్టుకున్నారు. నీ మనస్తత్వం నువ్వు అనలైజ్ చేసుకో, మతిస్థిమితానికి అదే అన్నిటికన్నా పెద్దమందు నువ్వే హీరోవి అన్న భ్రమ నీది. హీరోలా ఆపదలో పడ్డాననుకున్నావు. ప్రనూష నిన్ను రక్షించాలనీ, ఆ ప్రమాదంలో తన ప్రాణాలు పోగొట్టుకోవాలనీ సినిమా కధలా రాత్రంతా ఆలోచించావు. అదే భ్రమ. హెలూసినేషన్. అంతా నిజంగా జరిగినట్లు నీ కనిపించింది. అందుకే భ్రమలోంచి బయటికిరా సుబ్బారావ్.”

డాక్టర్ పాల్ వెళ్తూ వుంటే ఆమె అతడిని అనుసరించింది.

“నాకాయన ఏం పేరు పెట్టారు డాక్టర్?”

“అక్షౌహిణి అట.”

“భలే వుందే… అంటే?”

“సైన్యం అని అర్థం.”

వరండా చివర్లో వాళ్ళ మాటలు మాయమయ్యాయి.

అతడు మాత్రం అలాగే శిలాప్రతిమలా నిలబడివున్నాడు.

వరండాకి ఇటు చివర అతడి భార్య నిలబడి వుంది బిడ్డనెత్తుకుని … కళ్ళనిండా నీళ్ళతో.

అతడు నెమ్మదిగా తన భార్య దగ్గరికి వెళ్ళి ఆమె తల మీద చెయ్యివేసి, “నన్ను క్షమించు” అన్నాడు.

ఆమె ఆశ్చర్యంగా తలెత్తింది.

“అవును! నాకు ఏది నిజమో, ఏది అబద్ధమో అర్ధంకావడం లేదు. జరిగిన విషయాలన్నీ చూస్తూంటే ఈ డాక్టర్లు చెప్పేవన్నీ నిజమేనేమో అనిపిస్తూంది. అదే నిజమయిన పక్షంలో నా అంత దురదృష్టవంతుడు మరెవరూ వుండరు. నీ పేరుతో సహా, నాకేమీ గుర్తులేదు.”

ఆమె కళ్ళలో నెమ్మదిగా వెలుగొచ్చింది. కళ్ళలో నీళ్ళు అలాగే వుండగా, పెదాలమీద నవ్వు అందంగా కదలాడింది. ఇన్నాళ్ళూ పడ్డ వ్యధ అంతా ఆ క్షణం తొలిగిపోయినట్టు అనిపించింది. మంగళసూత్రం తీసి కళ్ళకద్దుకుంటూ అక్కడనుంచి వెళ్ళిపోయింది. ఆమె ఆనందం ఆమెని మాట్లాడినివ్వలేదు. డాక్టర్ని కలుసుకోవటం కోసం వడివడిగా వెళ్ళింది. ఆమె దూరంగా డాక్టర్‌తో మాట్లాడటం వినిపిస్తూంది. అంతా విని డాక్టర్ అన్నాడు..

“ఇప్పటి వరకూ తన భ్రమలో వున్నాన్నన్న విషయం అతనికి తెలియటం శుభసూచకమే! కానీ ఆ కాస్తా సరిపోదు. అతడికి తన గతం పూర్తిగా గుర్తు రావాలి మొత్తం మీద ఇది మంచి పరిణామమే”

ఆమె అతడికి నమస్కారం చేసి కదిలింది.

ఆమె వెళ్ళిపోయిన తరువాత డాక్టర్ అతని వద్దకు వచ్చాడు.

ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడుకోలేదు. నిశ్శభ్దాన్ని చీలుస్తూ డాక్టరే అన్నాడు.  “మనస్తత్వశాస్త్రం, మానసిక పరిణామం చాల క్లిష్టమైనవి సుబ్బరావ్! నాకీ వైద్యంలో పాతిక సంవత్సరాల అనుభవం వుంది. మనిషి అంత క్లిష్టమైన ప్రవర్తన గల జంతువు ఈ ప్రపంచంలో మరొకటి లేదు. నేనుకొన్ని వేలమంది రోగుల్ని ఈ ఆస్పత్రిలో ట్రీట్‌చేసి పంపించాను. కానీ ఇంతకు పదిరెట్లు “పేషెంట్లు” బయటి ప్రపంచంలో వున్నారని నాకు తెలుసు. పైకి నవ్వుతూ కనిపిస్తూ ఇంట్లో రాక్షసులుగా ప్రవర్తించే వాళ్ళూ, కొద్ది ఓటమికే ఆత్మహత్య గురించి ఆలోచించేవాళ్ళూ, తాము నమ్మిందే నిజమని భ్రమించి కొంతకాలానికి అది అవాస్తవికమని తెలిసినా ఆ భ్రమనుంచి బయటపడలేనివాళ్ళూ, బాధల్ని మర్చిపోవటానికి తాగుడిని ఆశ్రయించేవాళ్ళూ – వీళ్ళంతా పిచ్చి వాళ్ళు కాక మరేమిటి? నువ్వు ఆరాధించే నటుడు చైతన్యనే తీసుకో! వసూళ్ళలో అతను పెద్ద అని అందరికీ తెలుసు. అకస్మాత్తుగా మరొక నటుడి పిక్చర్ హిట్ అవుతుంది. తనే ఒక నంబర్‌వన్ అంటాడు. రచయితల్లో కూడా అంతే! ఇదంతా పబ్లిసిటీ కోసమయితే పర్వాలేదు. కానీ ఆ వ్యక్తులు కూడా దీన్ని మనస్పూర్తిగా నమ్ముతారు. చుట్టూ వున్న వాస్తవాల్ని, స్టాటిస్టిక్స్‌ని, తమ పొజిషన్నీ గుర్తుపెట్టుకోరు. ఇలా తమకి ఆనందం ఇచ్చే ఒక అబద్దాన్ని ‘మనస్పూర్తిగా” నమ్మటమే పారనాయిడ్ సైకాలజీ. నువ్వు తొందర్లోనే అందులోంచి బయట పడటం నాకు ఆనందంగా వుంది. నెమ్మదిగా నీ గత జీవితం గుర్తుతెచ్చుకోవడానికి ప్రయత్నించు. దానికి నీ భార్య సాయం తీసుకో” అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు. అతడు చాలాసేపు మంచంమీద అలాగే పడుకున్నాడు.

ఎక్కడో ఏదో సంతృప్తి.

…..అతడి కళ్ళముంది తన భార్య కదలాడింది. ప్రనూష గోచరించింది. ప్రనూష గుర్తొచ్చినప్పుడు ఒక అందమైన మెరుపు తీగె కదలాడిన భావం. భార్య గుర్తుకొచ్చినప్పుడు-తప్పు చేస్తున్నానేమో అన్న భావం.

ప్రనూషని చూడగానే తనలో కదలాడిన ప్రేమభావమే-ఆ రాత్రి ఆమెతోసహా పారిపోవటానికి చేసే యత్నంగా కలొచ్చిందా?

కలలో కూడా ఎంత లాజిక్?

అక్షౌహిణి.

సైన్యం.

ఒక స్త్రీకి సహాయపడాలనే కోరిక, పురుషుడిలో అంతర్గతంగా అలాగే వుంటుందికాబోలు. తనే ఆమెకి సైన్యంగా ఈ ఆస్పత్రి నుంచి తప్పించుకోవాలన్న కోరికకి ప్రతిరూపమే ఆ కల అయివుండవచ్చు. ఆమె తనని చైతన్యగా గుర్తించడం, తనలోని (ఆమెచేత) గుర్తింపబడలన్న కోరికకి నిదర్శనం. ఒక సుబ్బారావుగా ఆమె తనని గుర్తించకపోవచ్చు. చైతన్య అదృష్టవంతుడు. ప్రనూషలాంటి ఎంతోమందిచేత గుర్తింపబడుతున్నాడు.

అయినా ఇదంతా తనకి అనవసరం!

తన భార్యకి అన్యాయం  చేయకూడదు.

-అతడు తన భార్యని గుర్తు చేసుకోవటానికి ప్రయత్నం చేశాడు. తన కొడుకుని, తన గతాన్ని జ్ఞాపకం చేసుకోవాలనుకున్నాడు. జరిగినదంతా నిజమైతే తన భార్య ఎంత మానసిక క్షోభ అనుభవిస్తూ వుండి వుండాలి. గతం మర్చిపోయిన భర్త కన్నా నరకం ఏముంది?

అసలు తన తల్లిదండ్రులెవరు? తను ఏ కాలేజీలో చదివాడు?

తలుపు దగ్గర అలికిడి అవడంతో అతడు తలతిప్పి చూశాడు. అతడి భార్య గుమ్మం దగ్గర నిలబడి వుంది. చేతిలో బాబు.

అతడు లేచి వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు. కొడుకుని చేతుల్లోకి తీసుకుని “నన్ను క్షమించు. నిజంగా నాకేమీ గుర్తులేదు” అన్నాడు. కొంచెం ఆగి, “… గుర్తు తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తాను” అని మళ్ళీ అన్నాడు.

అతడిలో వచ్చిన ఆ కాస్త మార్పుకే ఆమె కదిలిపోయినట్టు కనిపించింది. ఇన్నాళ్ళ దిగులు, ఒంటరితనం ఏమవుతుందో అన్న భయం ఆమె చుట్టూ స్తబ్దతని పేర్చాయి. ఈ ఓదార్పుకి అది కరిగింది.

అతడి భుజాలమీద తల ఆంచి వెక్కివెక్కి ఏడవటం ప్రారంభించింది. అతడు అనునయంగా ఆమె తల నిమిరాడు.

“నువ్వేమీ అనుకోకపోతే నా గురించి కొద్దిగా చెప్పు. ఏదయినా ఒక పాయింటు దగ్గర నాకు అంతా గుర్తు రావచ్చు. ముందు నీ పేరు చెప్పు.”

“లక్ష్మి”

“బాబు పేరు?”

“చైతన్య”

అతడు వులిక్కిపడ్డాడు. “అవునండీ! మీరు చైతన్యగారి అభిమాని. మన ఇంటినిండా ఆయన ఫోటోలే. బాబుకి కూడా ఆయన పేరు పెట్టారుఔ

“నేను బాగుపడి మన ఇంటికి రాగానే ఆ ఫోటోలన్నీ తీసేద్దాం. అభిమానం వుండటం మంచిదేగానీ, ఫోటోలు  బెడ్‌రూంలో పెట్టుకొనేటంత అవసరం లేదు. నేను ముందు ఈ చైతన్య “అబ్సెషన్” నుంచి బయటపడాలి. దానికి మనం ఏర్పాటు చేసుకోవాలి.”

“మీ ఇష్టం.”

ఆ తరువాత అతడికి అతడిని గురించిన వివరాలు చెప్పింది ఆమె. కిళ్ళీ కొట్టుముందు గొడవ, తలకి దెబ్బ తగలటం వగైరా. ఆమె వెళ్ళిపోయాక అతడు డాక్టర్‌తో మాట్లాడాడు.

“నన్ను ఇంటికి ఎప్పుడు పంపిస్తారు డాక్టర్?”

“ఎందుకు అలా అడుగుతున్నావ్?”

“ఇంటి పరిసరాలు చూస్తే గతం గుర్తొచ్చే సూచనలున్నాయి అని మీరే అన్నారుగా-”

డాక్టర్ తటపటాయించి, “ఇందులో కొద్దిగా యిబ్బంది వుంది సుబ్బరావ్. నీ జబ్బు నయమైంది అన్న సర్టిఫికేట్టు మేమిస్తే-వెంటనే పోలీసులు నిన్ను అరెస్టు చేస్తారు. ఆ ప్రమాదం వుంది.”

“కాని నేను ఆత్మరక్షణ కోసమే ఆ రౌడీని కొట్టాను.”

“ప్రమాదం పోలీసుల్నించి కాదు. చనిఫొయిన రౌడీ తాలూకు మనుష్యులనుంచి.”

“ఆ ప్రమాదం ఎప్పుడూ వుంది” అన్నడు.  “నేనూ జీవితాంతం ఎలాగూ వుండలేనుగా.”

“సరే నీ ఇష్టం”.

ఆ తరువాత అతడు చాలాసేపు స్తబ్ధంగా పక్కమీద పడుకుని వుండిపోయాడు. సముద్ర కెరటాలు ఒడ్డుని కొట్టినట్టు ప్రనూష ఆలొచన్లు మనసుని తాకుతున్నాయి.

అతనికి నిద్రపట్టడం లేదు. మధ్యాహ్నం నిద్ర అతడికి అలవాటు లేదు. దూరంగా ఎక్కడో ఒక పక్షి దాహంతో అరుస్తొంది. అతడు విసుగ్గా పక్కమీద నుంచి లేచాడు. కిటికీ దగ్గర నిలబడి బయటకు చూడసాగాడు. ఎండ ఏటవాలుగా పడుతోంది. బిల్డింగ్ చుట్టూ చెట్లు. దూరంగా ప్రహరీగోడ. గోడ అవతల రోడ్డు. పెద్ద రష్ గా లేదు. ఒక సైకిలిస్ట్ నెమ్మదిగా వెళుతున్నాడు. బహుశ ఆస్పత్రి వూరి చివరగా వుండి వుంటుంది. అందుకే అంత నిశ్శబ్ధంగా వుంది.

అతడు తిరిగి పక్క దగ్గరకు రాబోతూ ఆగిపోయాడు.

దూరంగా-

కొమ్మల మధ్యనుంచి – చెట్ల ఆకుల వెనుకనుంచి-

మసగ్గా-

అస్పష్టంగా కనబడుతూంది సినిమా వాల్‌పోస్టర్ బ్యానరు.

నేడే విడుదల-

“అతడే ఆమె  సైన్యం.”

అదే

తనకి పదిరోజుల క్రితం ప్రొడ్యూసర్ చూపించింది.

ఇది కూడా భ్రమేనా?

అతడు కళ్ళు నలుముకున్నాడు.

ఆ వాల్‌పోస్టర్ మీద హీరో – హీరోయిన్‌లు వున్నారు.

ఆకారాలు స్పష్టంగా కనిపించడంలేదు.

ఎవరా హీరో?

చైతన్య కదూ, న్యూస్ పేపర్లో చూశాడు సరే… కానీ పోస్టర్‌లో.

ఎలా వుంటాడు అతడు? తనని ఇంత ప్రభావితం చేసిన ఆ నటుడు ఎంత అధ్బుతమైన అందంతో, అపరాజితమైన మొగతనంతో విలసిల్లుతూ వుండి వుంటాడు? ఒకప్పుడు తను అతడి ఫాన్. మతిపోతే, గతం మర్చిపోయి, అతడినే తనుగా వూహించుకునేటంత వీరాభిమానిగా తనని చేసిన ఆ హీరో ఎలా వుంటాడు? న్యూస్ పేపర్‌లో చూపించిన ఫోటో సంతృప్తికరంగా లేదు. ఎలా ఆ వాల్‌పోస్టర్ చూడటం?

అతడు కిటికీలోంచి ముందుకు వంగి చూడటానికి ప్రయత్నం చేశాడు. కొమ్మలు మరింత అడ్డు వచ్చాయి.

అతడిలో పట్టుదల ఎక్కువైంది.

గదిలో చుట్టూ చూశాడు.

అతడి దృష్టి గాజుగ్లాసు మీద పడింది.

వెళ్ళి గది తలుపు వేసి వచ్చాడు. గ్లాసు అడుగు బ్రద్ధలు కొట్టి దాని క్రింద భాగాన్ని ‘లెన్స్’ గా తయారు చేశాడు. న్యూస్ పేపర్ గుండ్రంగా మడిచి, దాన్నొక రూళ్ళకర్రగా చేసి, మరోగాజు ముక్క రెండోవైపు అమర్చాడు. ఒక చిన్నసైజు అశాస్త్రీయమైన టెలిస్కోప్ తయారయింది. అయిదు నిమిషల అడ్జెస్ట్‌మెంట్ తరువాత దూరపు దృశ్యాలని స్పష్టంగా కనిపింపచేసే ఫోకస్ వచ్చింది. దాంతో వాల్‌పోస్టర్‌ని చూశాడు.

చెట్ల అవతల్నించి దృశ్యం మరింత స్పష్టంగా కనిపించింది.

అతడి నుదుట చెమట పట్టింది.

‘అతడే ఆమె సైన్యం” అన్న అక్షరాల మీద నిలువెత్తు ఫోజుతో నిలబడ్డ చైతన్య.

-          తనే.

-

4

అతడు చాలాసేపు ఆ కిటికీ దగ్గర అలాగే నిలబడి వుండిపోయాడు.

వీళ్ళంతా ఎవరు?

తనని ఎందుకిలా మోసం చేశారు?

తన భార్యగా నటించిన స్త్రీ ఎవరు? ఆస్పత్రి సూపర్నెండెంట్‌తో సహా ఎందుకింత నాటకం ఆడుతున్నారు?

అతడి మళ్ళీ ఇంకో అనుమానం కలిగింది.

ఇది కూడా భ్రమేనేమో, డాక్టర్ చెప్పినట్టు పారనాయిడ్ మనస్తత్వంలో ఇదీ ఒక భాగమేమో.

అతడు ఆ రకమయిన అలోచనల్లో వుండగా తలుపు చప్పుడైంది. సూపర్నెండెంట్ లోపలకి వచ్చాడు. “కంగ్రాచ్యులేషన్స్ మిస్టర్ సుబ్బారావ్! మీరు మీ గతం గుర్తించడం మొదలుపెట్టారట కదా-”

“అవును. ఆ నర్సు-ఆ అమ్మాయి పేరేమిటి?”

“ప్రనూష.”

” ఆ ప్రనూష సంఘటనతో నాకు నిజంగా పిచ్చెక్కిందని అర్ధమయింది.”

“దాన్ని పిచ్చి అనకండి. గతం మర్చిపోయారంతే! పిచ్చి అంటే ఇన్‌సేనిటీ. మీది లాస్ ఆఫ్ రిమెంబరెన్స్.”

“మీ డాక్టర్లు ప్రతిదానికి ఒక కొత్త పేరు పెడతారు. లేకపోతే వైద్యశాస్త్రమే వుండదు కదా.”

అదో పెద్ద జోకయినట్టు డాక్టరు నవ్వేడు.

“నేను మా ఇంటికి వెళ్ళిపోవచ్చా?”

“నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు సుబ్బారావ్. కనీసం ఇంకో వారం రోజులు ట్రీట్ చేసి వదిలేస్తాం.”

“నాకీ రూమ్ లో బోర్ కొడుతోంది. కనీసం వరండాల్లో అయినా తిరగొచ్చా?”

“హాయిగా తిరగొచ్చు. కానీ రకరకాల పిచ్చివాళ్ళుంటారు. వీలైనంత వరకూ తిరగకపోవటమే మంచిది.”

“కనీసం ఒక అరగంట అయినా మీతో తిరగనివ్వండి డాక్టర్. లేకపోతే నిజంగానే ఈ గదిలో పిచ్చెక్కేట్టే వుంది నాకు.”

మళ్ళీ బిగ్గరగా నవ్వి “ఓకే నాతో రండి” అని కదిలాడు. ఇద్దరూ బయటకు వచ్చారు. విశాలమైన కారిడార్. అంతకుముందు చూసిందే మెట్లు దిగి క్రిందికి వచ్చారు. చెట్లు అలాగే వున్నాయి. అదే గేటు-అదే దారి- అతడు చాలా క్యాజువల్‌గా నడుస్తున్నట్టు వున్నాడేగానీ, చూపులు మాత్రం నిశితంగా పరిశీలిస్తున్నాయి.

చివరకి కావల్సింది దొరికింది.

గోడమీద-

ఎర్రగా-

మరక!

ప్రనూష (తన పేరు అక్షౌహిణి అని అబద్ధం చెప్పిన అమ్మయి గోడ ఎక్కుతూ పడిపోయింది అక్కడే!)

అది రక్తం మరక కాదు. అయిటే ఈ పాటికి ఎండి జిగురు వర్ణంలోకి మారిపోయి వుండేది. రంగు కలిపి నాటకం ఆడారు. ప్రనూష, గార్డులు, డాక్టర్లు అందరూ కలిసి నాటకం ఆడారన్నది నిర్వివాదాంశం.

అతడు మొహంలోకి ఏ భావాలూ బయటకు కనపడనివ్వలేదు.  డాక్టర్‌తో కలసి వెనక్కి తిరిగి వచ్చాడు. రూమ్‌లోకి వెళ్ళబోతూంటే డాక్టర్‌ని ఆపి “ఇంకో వారంరోజులు నేనిక్కడే వుండాలంటే… “అని ఆగి కాస్త తటపటాయించి, “నా భార్యని నాతో వుంచుకోవచ్చా?” అన్నాడు.

ఈసారి డాక్టరు నవ్వలేదు. కాస్త సంశయించాడు.

అతడు నొక్కి చెపుతున్నట్టు “నా భార్యతో నేనుండటానికి మీకేమిటి అభ్యంతరం డాక్టర్? అదీగాక ఈ వారంరోజులూ నా గతం గురించి తెలుసుకునే అవకాశం కూడా వుంటుంది కదా” అన్నాడు.

“సరే అయితే” అన్నాడు సూపర్నెండెంట్. అతడి మొహం కాస్త అప్రసన్నంగా వుంది.

 

 *                                             *                                              *

రాత్రి ఎనిమిదింటికి వచ్చింది ఆమె.  అతడు నవ్వి “ఇంకా వారంరోజులు వుండాలట, ఇక్కడ నాకేమో ఒంటరిగా బోర్ కొడుతోంది. అదీగాక నీ నుంచి నా గతం గురించి తెలుసుకుంటే మరింత తొందరగా బాగుపడతానని డాక్టర్లు చెప్పారు. అందుకే రాత్రికి నిన్ను పంపమని చెప్పాను. నీకేమీ అభ్యంతరం లేదు కదా” అన్నాడు.

“అయ్యో నాకేమిటండీ అభ్యంతరం? భర్త దగ్గరికి రావటానికి భార్య కెందుకు అభ్యంతరం?”

అతడు ఆమెవైపు సూటిగా చూశాడు.  ఆమె కళ్ళల్లో అదోలాటి అమాయకత్వం, దీనత్వం ప్రతిబింబిస్తున్నాయి. అయితే ఆ దీనత్వం దిగులువల్ల వచ్చింది కాదు. కారణం తెలీదు. ప్రనూషది ప్రళయకాల ఝంఝామారుతంలాంటి అందమయితే లక్ష్మిది సెలయేటి పాయలాటి అందం.

ఇద్దరూ కలిసి భోజనం చేశారు.

బాగా చీకటి పడింది.

“మన పెళ్ళి ఎప్పుడైంది?”

“ఎనిమిది సంవత్సరాల క్రితం.”

“నా తల్లిదండ్రులు?”

“ఇటీవల నాన్నగారు పోయారు. అమ్మగారు మీ చిన్నప్పుడే పోయారు.”

“నాకు అక్కలు, అన్నలు, చెల్లెళ్ళు?”

“ఎవరూ లేరు”

“ఒక్కడే కొడుకునా? ఇంకా ఎవరో వున్నట్టు గుర్తే.”

ఆమె తడబడి- “ఒక చెల్లెలు వుండేది – పోయింది.”

“ఎంతకాలమైంది?”

“ఆరేళ్ళు -వినాయకచవితి రోజు.”

“అప్పటికి తనకి పెళ్ళయిందా?”

“లేదండీ! అప్పటికి తన వయసెంతనీ? పధ్నాలుగు”

ఇటుకలు కట్టినట్టు ఆమె ఆడుతున్న అబద్ధాలు వింటూంటే అతడి కోపం కట్టలు తెగుతోంది.

“అమ్మ పోవటం నాకు గుర్తుంది. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన రోజే తెలిసింది ఆ మరణవార్త. నువ్వేమో చిన్నపుడే పోయిందంటున్నావు.”

లేదండీ! చిన్నప్పుడే పోయారు. మీకు ఆరేళ్ళ వయస్సులో….”

అతడు పక్కమీద వాలుతూ ” ఈ రోజుకి ఈ ‘గతచింతన’ చాల్లే, పడుకుందాంరా” అన్నాడు.

“నేనుక్రింద పడుకుంటాను” ఆమె బెదురుగా అంది.

“అదేం?”

“మొన్నటి యాక్సిడెంట్‌లో మీ వెన్నముక్కకి దెబ్బ తగిలింది. కొంతకాలం దూరంగా వుండమన్నారు డాక్టర్లు”

“సుమంగళి సిన్మాలోలా రాత్రిళ్ళు చన్నీళ్ళు స్నానాలు చేస్తూ వుండాలన్నమాట నువ్వు. పాపం చాల కష్టం వచ్చిందే. అయినా ఈ దెబ్బలేంటో? అన్నీ నా ముఖ్యమైన భాగాలమీదే తగిలినట్టున్నాయి. మెదడు, వెన్నుముక, వగైరా. అన్నట్టు నా ఇంకే అంగాలు ఈ ఆక్సిడెంట్లో పాడాయ్యాయో చెప్పగలవా?”

 

ఆమె మాట్లాడలేదు.

“గుడ్‌నైట్! పడుకో”.

ఆమె క్రింద పక్క వేసుకుని పడుకుంది.

రాత్రి ఒంటిగంట అవుతూ వుండగా పక్కన ఎవరో కదుల్తున్నట్టు అనిపించి ఆమెకి మెలకువ వచ్చింది.

“నేనే” అన్నాడు.

“ఏమిటిది వదులు-వదలండీ.”

“ఇప్పుడే బాత్‌రూమ్‌కెళ్ళి ఒళ్ళంతా పరీక్షించుకున్నాను. అన్నీ బాగానే వున్నాయి. నువ్విక సుమంగళిలోలా బ్రతకనవసరం లేదు.” ఆమె అతడి చేతుల మధ్య గింజుకుంటూంది.

అతడామె కుచ్చిళ్ళమీద చెయ్యి వేశాడు.

ఆమె అరవబోయింది

అతడి పెదవులు ఆమె నోటిని నొక్కిపట్టాయి.

ఆస్పత్రి నిద్రపోతోంది

అతడామె కుచ్చిళ్ళు లాగేశాడు. ఆమె రోదిస్తూంది, అతడు పట్టించుకోలేదు. అతడి చేతులు ఆమె పొత్తికడుపుని నిమిరాయి.

అంతే!

క్షణాల్లో అతడు మాములు మనిషి అయ్యాడు. మొహం దూరంగా జరిగింది. లేచి వెళ్ళి మంచంమీద కూర్చున్నాడు. అతడిలొ వచ్చిన ఆకస్మికమైన మార్పుని చూసి ఆమె అశ్చర్యపోయింది,

అతడు తాపీగా “ఇప్పుడు చెప్పు” అన్నాడు.

ఆమె నిరత్తురాలై చూసింది.

“నీకు పిల్లల్లేరని నీ కడుపు చూస్తేనే తెలిసింది. కథలు కూడా సరిగ్గా అల్లలేవని నీ మాటలద్వారా అర్థమైంది. నీ లెక్క ప్రకారం నా తల్లి చచ్చిపోయిన ఆరేడేళ్ళకు నా చెల్లి పుట్టింది అవునా?” ఆమె బిత్తరపోయింది. అతడు నవ్వేడు.

“నేను చైతన్యని అని నాకు ఋజువుల్తోసహా తెలిసింది. నన్నెందుకు ఆ సాలేగూడులోకి ఇరికించారు? ఈ నాటకంలో నా పాత్ర ఎంతవరకు”

ఆమె జవాబు చెప్పలేదు.

“చూడూ – నువ్వు కాస్తో కూస్తో చదువుకున్నదానిలా కనపడుతున్నావు. నేను స్పృశించగానే నువ్వు తడబాటు పడిన విధానం చూస్తుంటే నీకింతవరకు పురుష స్పర్శలేదని అర్థమంది. మొత్తం కథంతా చెపుతావో ఈ రాత్రి శీలం పోగొట్టుకుంటావో నీ ఇష్టం. ఈ గదిలో నిన్ను నేనేంచేసినా ఎవరూ పట్టించుకోరు. అవకాశం దొరికినా నేను నిన్నేమీ చేయటం లేదు. ఆ కృతజ్ఞత నీకుంటే, నీ పవిత్రత మీద నీకు విలువుంటే-నిజం చెప్పు. అసలీ సుబ్బారావెవరు? నా భార్యగా నువ్వెందుకు నటిస్తున్నావు?”

ఆమె చాలాసేపు ఏడుస్తూ వుండిపోయింది. అతడు ఆమెని అలాగే వదిలేశాడు. ఆమె వీళ్ళ మనిషి కాదని తెలుస్తూనే వుంది. లేకపోతే ఇంత తొందరగా బెదిరిపోయి దారికిరాదు. అతడి అంచనా నిజమయింది.

“నేను వీళ్ళ మనిషిని కాను” అంది ఆమె నెమ్మదిగా.

“అసలెవరు వీళ్ళు?”

“నాకు తెలీదు. సినిమాల్లో చిన్న వేషాలు వేసుకునేదాన్ని నేను. మీతో వేషం అనగానే పొంగిపోయాను. ఆ ముందురోజే మా తమ్ముడ్ని కిడ్నాప్ చేశారు. షూటింగ్ టైంలో మీకు నిజంగానే యాక్సిడెంట్ జరుగుతుందనీ, అంబులెన్స్‌లో వీళ్ళొచ్చి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొస్తారనీ నాకుముందే తెలుసు. మీకు షూటింగ్‌లోనే జాగ్రత్తగా వుండమని చెపుదామనుకున్నాను. కానీ నా తమ్ముడి ప్రాణాలకు ప్రమాదమని చెప్పలేదు.”

“సుబ్బరావ్ అనే వాడెవడూ లేడా?”

“లేడు,”

“అతడే ఆమె సైన్యం సినిమా ప్రకటన పేపర్‌లో పడింది, అందులో నా ఫోటో లేదే.”

“మీ కోసం డమ్మీ పేపరు తయారు చేశారు వాళ్ళు,”

“ఇంత బాగా మాట్లాడుతున్నావు. నువ్వు ఏం చదువుకున్నావు?”

“బి.ఏ. పాసయ్యాను చైతన్యగారూ. మాది పెద్ద కుటుంబం. సినిమాల్లో వేషాలేసి పోషిస్తూ వుంటాను”.

“నీ తమ్ముడి జాడ తెలీదా?”

“తెలీదు. ముందు లక్షరూపాయలిస్తామని ఆశ పెట్టారు నేను వినలేదు. దాంతో మా తమ్ముడిని కిడ్నాప్ చేసారు.”

“ఈ గ్యాంగ్ మూలస్థంభం ఎవరో తెలుసా నీకు?”

“తెలుసు”

“ఎవరు?”

“ప్రనూష”

చైతన్య అదిరిపడ్డాడు.

“నువ్వు చెప్పెది నర్సు ప్రనూష గురుంచే?”

“ఆమె నర్సు కాదు. నా దగ్గరికి కాడిలాక్ కారులో వచ్చింది.”

“విదేశీ గూఢచారిణా?”

“ఏమో, నాకు తెలీదు.”

“ఒక సినీయాక్టర్ని ఈ విధంగా బ్రెయిన్ వాష్ చేయడంలో ఆమె ఉద్దేశ్యం ఏమై వుంటుంది?” సాలోచనగా అన్నాడు.

ఆమె జావాబు చెప్పలేదు.

“ఈ హాస్పిటల్ సూపర్నెండెంట్ ఎవరు?

“ఆమె మనిషే.”

“పోలీస్ ఇన్‌స్పెక్టర్? ఆ గుండాలు?”

“అంతా వాళ్ళే”

“ఇదంతా ఒక పెద్ద గ్యాంగ్ అన్నమాట”

అతడు కొద్దిసేపు మౌనంగా వుండి “ఏ ధైర్యంతో నాభార్యగా ఈ రాత్రి లోపలికి వచ్చావ్?” అని అడిగాడు.

“నాకేమీ కాదని వాళ్ళు చెప్పారు. నా అరోగ్యం సరిగ్గా లేదని చెప్పమన్నారు. మీ వెన్నెముకకి దెబ్బ తగిలిందని చెప్పమన్నారు. నా తమ్ముడి కోసం నేనిదంతా చేయక తప్పలేదు చైతన్యగారూ! నన్ను క్షమించండి.

“ఓ.కే. అయిందేదో అయిపోయింది. నాకిదంతా చెప్పినందుకు కృతజ్ఞతగా నీ తమ్ముడిని ఆ గ్యాంగ్ బారినుండి రక్షించి నీ కప్పగిస్తాను. ఆ ప్రనూష అంతు తేలుస్తాను. ఈ రాత్రికి హాయిగా నిద్రపో.”

పది నిమిషాల్లో అతను నిద్రలోకి జారుకున్నాడు. ఇన్నాళ్ళ టెన్షన్ లేకపోవడంతో హాయిగా నిద్రపట్టింది.

 

5

అప్పటికి చైతన్య కనపడక పదిరోజులు దాటింది.

మొత్తం సినీరంగమంతా పారలైజ్ అయిపోయింది. చైతన్యకి సంబందించిన నిర్మాతలూ, టెక్నీషియన్సే కాకుండా పరిశ్రమలో అందరూ దిగ్బ్రాంతిలో వుండిపోయారు. సాధారణంగా ఏ సమస్య అయినా రోజులు గడిచేకొద్దీ చల్లబడుతుంది. కానీ చైతన్య అదృశ్యమైన విషయం రోజు రోజుకీ తీవ్రమవసాగింది.

షూటింగ్ జరుగుతూ వుండగా హీరో తలమీద దెబ్బ తగిలింది. అయిదు నిమిషాల్లో అంబులెన్స్ వచ్చింది. మిగతవారి నెవరినీ ఎక్కించుకోకుండా కేవలం చైతన్యనే తీసుకెళ్ళారు. నిర్మాతతో సహా మిగతా అందరూ ఆస్పత్రికి వెళ్ళేసరికి, అంబులెన్స్ ఎంతసేపటికీ రాలేదు. గంట గడిచి రెండు గంటలయ్యాయి. మిగతా ఆస్పత్రుల్లో ప్రయత్నించారు. అంబులెన్స్‌కి ఆక్సిడెంట్ జరిగిందేమో అని వాకబు చేశారు. ఫలితం లేదు.

అంబులెన్స్ జాడ తెలీలేదు.

మరుసటి రోజునుంచీ అది సెన్సేషనల్ వార్త అయింది. అభిమాన సంఘాల వాళ్ళ అలజడి, కోట్లు పెట్టుబడి పెట్టిన నిర్మాతలు అయోమయం, ఆగిపోయిన షూటింగ్‌లు…

ఇవన్నీ ఒకవైపు–

చైతన్య తల్లి పరిస్థితి మరో వైపు.

అతడి జాడ తెలియడం లేదనగానే ఆవిడ స్పృహ తప్పిపోయింది. కొడుకంటే ఆమెకు ఎంత ప్రాణమో అందరికీ తెలుసు. పాతిక సంవత్సరాల క్రితం కాశ్మీర్ నుంచి కొడుకుని తీసుకుని వచ్చింది తల్లి. ఆమె భర్త యుద్ధానికి సంబంధించిన రాడారు శాఖలో పనిచేసేవాడు. యుద్ధంలో ఆయన మరణించిన తర్వాత వచ్చే పింఛను డబ్బులతో కొడుకుని చదివించింది. వాళ్ళుండే చోటుకి ఒకసారి అవుట్‌డోర్ షూటింగ్ నిమిత్తం ఒక సినిమా కంపెనీ వచ్చింది. షూటింగ్ మధ్యలో ఒక కుర్రాడు కావల్సి వచ్చాడు. ఆ వేషానికి చైతన్యని తీసుకున్నారు. ఆ సినిమా రిలీజ్ అయ్యాక ఒక మంచి దర్శకుడి దృష్టి చైతన్యమీద పడింది. తన తర్వాత చిత్రంలో వేషం కోసం చైతన్య తల్లిని కలుసుకున్నాడు. తల్లికి ఇష్టంలేదు.  కానీ దర్శకుడూ నిర్మాత కలిసి ఒప్పించారు.  ఆ చిత్రం కేవలం చైతన్య వల్లే బాగా ఆడింది.

పధ్నాలుగో ఏడునుంచి చైతన్యకి సినిమా ఛాన్సులు రావటం మానేశాయి. సాధారణంగా ఆ వయసులో అది సహజమే! తిరిగి ఇరవై రెండో ఏట అతను మళ్ళీ రంగప్రవేశం చేశాడు. రొమాంటిక్ సబ్జెక్ట్ అది. పదిహేనేళ్ళ అమ్మాయితో రొమాంటిక్ స్టోరీ! ఇరవై అయిదు వారాలు ఆడింది.

అతడికి విపరీతంగా ఛాన్సులు రావటం మొదలు పెట్టాయి. అయితే తొందర్లోనే అతడొక విషయం తెలుసుకున్నాడు.

ప్రేక్షకుల టేస్టు మారుతుంది. కేవలం రొమాంటిక్ హీరోగా నిలదొక్కుకోవటం కష్టం.

అతడు ఫైట్స్‌లోనూ, డాన్స్‌లోనూ ఏకాగ్రత చూపించటం ప్రారభించాడు. అది బాగా లాభించింది. చిత్ర పరిశ్రమకి థర్డ్ డైమెన్షన్ లభించనట్టయింది. అన్నిటికన్నా ముఖ్యంగా, ఫైట్స్ చేసేటప్పుడు మొహంలో ఎక్స్‌ప్రెషన్… ఆ కసి, క్రౌర్యం- యువకులని ఉర్రూత లూగించింది.

ఏ రంగంలో అయినా-ముందువాడిని అనుసరించేవాడు, రెండోవాడిగానే మిగిలిపోతాడు. కొత్త పంథా వెతికేవాడే ముందుంటాడు. ఒకసారి ముందుకు వచ్చాక, ఆ స్థానాన్ని నిలబెట్టుకోవటానికి కృషి అవసరం. ఈ రెండు లక్షణాలు చైతన్యలో పుష్కలంగా వున్నాయి. అతడి విజయాన్ని గెలవగలిగేది ఒక్కటే! అతడి వయసు! అంతవరకూ అతడు నిర్విరామంగా పనిచేస్తూ వుంటాడనేది నిర్వివాదాంశం.

ఈ విజయం వెనుక వున్న స్త్రీ అతడి తల్లి! పైకి చాలా మామూలుగా కనపడే వ్యక్తిత్వం ఆమెది. కానీ చాలా లోతయినది, క్లిష్టమైనది. కష్టాల్ని పళ్ళబిగువున అదిమిపెట్టి కోట్లు సంపాదించాక కూడా అలాగే వున్నది ఆమె వ్యక్తిత్వం. ప్రేమ ఎంత గొప్పదో, జీవితంలో ఎంత కష్టపడిందో, ఎంత పోగొట్టుకున్నదో తెలిసిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఒకే ఒకరు-ఆమె కొడుకు!.

 

*                                        *                                  *

 

హాస్పిటల్ సూపర్నెండెంట్ పాల్ మొహంలో అంత కౄరత్వం ఎప్పుడూ కనపడలేదు. మొహం వికృతంగా మారింది. ఆమె రెక్క పట్టుకుని విసురుగా లాగుతూ “ఎక్కడకు వెళ్ళాడు? ఎప్పుడు పోయాడు?” అని అరిచాడు.

లక్ష్మి బెదిరి “నేను నిదురపోయాను” అంది.  అంతలో అక్కడికి ప్రనూష వచ్చింది. పాల్ ఆమెకి పరిస్థితి చెప్పాడు. ఇప్పుడు అతను సూపర్నెండెంట్‌లా, ఆమె నర్సులా లేరు. ఒక అధికారిణి ముందు చేతులు కట్టుకుని మాట్లాడే సేవకుడిలా వున్నాడు పాల్. విషయం తెలుసుకున్నా ప్రనూష పాల్‌లా కంగారుపడలేదు.

“మనం ఇంతమంది కాపలా కాస్తుండగా ఎలా తప్పించుకోగలడు పాల్? మన ప్రహారీ గోడలు చాల ఎత్తయినవి. మన కుక్కలు చాలా చురుకైనవి” అంది ఇంగ్లీషులో.

“ఈ కాంపౌండ్‌లోనే అతను ఎక్కడో వుండి వుంటాడు.”

“వెతికించండి మరి! మొత్తం అందరినీ ఈ పనిలో ప్రవేశపెట్టండి.”

పాల్ జోసఫ్ హాడావుడిగా బయటకు వెళ్ళాడు. బయట కలకలం మొదలైంది లోపల లక్ష్మి ప్రనూషని అడిగింది-”ఇకనైనా నా తమ్ముడిని వదిలిపెడతారా?”

“తమ్ముడేమిటి?”

లక్ష్మి మొహం వెలవెలబోయింది.  “నా తమ్ముడిని కిడ్నాప్ చేసి నన్ను బలవంతంగా ఇందులోకి దించి ఇప్పుడు  నాకేమీ తెలియదని బుకాయిస్తున్నారా?” రోదించడం మొదలుపెట్టింది.

అంతలో జోసెఫ్ తిరిగివచ్చాడు. అతడి చేతిలో చిన్నగుడ్డ ముక్క వుది. చైతన్య పడుకునే బెడ్‌షీట్ తాలూకు ముక్క అది. ” ఈ గుడ్డల్ని తాడులా కట్టి గోడదూకి పారిపోయినట్టునాడు మేడమ్! ఈ ముక్క చెట్టు దగ్గర కనబడింది” అన్నడు.

“గోడ దగ్గర చెట్లేవీ లేవే! ఎలా దూకాడు?” అంది ప్రనూష.

“అవన్నీ ఆలోచిస్తూవుంటే మనకి ప్రమాదం. అతనీపాటికే పోలీసుల్ని తీసుకొస్తూ వుండి వుంటాడు.”

“అవును. మనం తొందరగా ఈ బిల్డింగ్ ఖాళీ చేయాలి. సామానులు వదిలెయ్యండి” అంటూ అక్కణ్ణుంచి బయటకు వెళ్ళింది. లక్ష్మి ఆమెతోపాటే తన తమ్ముడి గురించి అడుగుతూ అనుసరించింది. జోసెఫ్ కూడా ఆమె సూచనలు అమలు జరపటానికి పరుగెత్తాడు. ఒక్కసారిగా ఆ గదిలో నిశ్శబ్దం అలుముకుంది.

ఆ నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ, మంచం అడుగునుంచి లేచాడు చైతన్య. అతను అప్పటివరకూ అక్కడే, ఆ గదిలోనే వున్నాడు. ఆ గదిలో వెతకాలన్న ఆలోచన ఎవరికీ రాలేదు.

ప్రనూష కొచ్చిన అనుమానం కరక్టే. ఎటువంటి తాడు సాయంతో నైనా ప్రహరీ గోడ దూకి బయటకి వెళ్ళడం దుర్లభం. ఆ విషయం చైతన్యకి తెలుసు. అసలు అతడా ప్రయత్నమేమీ చేయలేదు కూడా! అర్థరాత్రి లక్ష్మి నిద్రపోయాక చిన్న బెడ్‌షీట్ ముక్క కత్తిరించి చెట్టు మొదట్లో పారేసి వచ్చి దాక్కునాడు. మిగతా అంతా అతను అనుకున్నట్టే జరిగింది.

బయట హడావుడి ఎక్కువైంది.

చైతన్య కిటికీలోంచి బయటకు చూశాడు. అతడికి కొద్దిగా ఆశ్చర్యం కూడా కలిగింది. బయట ఎంతోమంది జనం వుంటారనుకున్నాడు. గార్డులతో కూడా కలిపి పదిమందికన్నా ఎక్కువలేరు. కొందరు వ్యాన్ ఎక్కుతున్నారు. ప్రనూష కారు దగ్గర వుంది. వీళ్ళంతా తనకోసమే – తన ఒక్కడికోసమే ఇంత నాటకం ఆడారంటే అతడికి ఆశ్చర్యంగా వుంది. తను వెళ్ళి పోయాడని తెలియగానే అందరూ ఖాళీ చేస్తున్నారంటే కేవలం తనకోసమే ఈ ఆస్పత్రి నాటకం…

అతడు ముందు వరండాలోకి వచ్చాడు.

మొట్టమొదటసారి అతడికి పక్కగదులు చూసే అవకాశం కలికింది. కేవలం గుమ్మం దగ్గరికి స్క్రీన్‌లు వున్నాయంతే! లోపల మంచాలూ కుర్చీలూ ఏమీ లేవు. గదులన్నీ ఖాళీగానే వున్నాయి.

ప్రనూష తన నెంత  మోసం చేయనీ, ఎన్ని బాధలు పెట్టనీ ఆ క్షణం మాత్రం ఆమె తెలివితేటల్ని మెచ్చుకోకుండా వుండలేక పోయాడు. కేవలం పదిమంది మనుష్యులతో, నాలుగు స్టెతస్కోప్‌లతో, గుమ్మం కర్టెన్లతో, ఒక పెద్ద ఆస్పత్రి వాతావరణం సృష్టించింది. తనకి నిజంగానే మతిభ్రమించిందేమో అన్నంత అనుమానం కలిగించింది. హేట్సాఫ్ టు హర్.

కానీ ఇదంతా ఎందుకు?

అతడికి వాళ్ళమీద వైరభావంకన్నా, ఇదంతా ఎందుకు చేశారో అన్న అనుమానమే ఎక్కువ వుంది.

మనిషి పనిచేసే ప్రొఫెషన్ యొక్క ప్రభావం అతని మనస్తత్వం మీద ఎక్కువ వుంటుంది. చైత్తన్య చాల సినిమాల్లో హీరోగా నటించాడు. ఎనో కథలు అతని చుట్టూ అల్లబడ్డాయి. హీరోలు పోలిసుల్ని ఆశ్రయించరు. వీలైనంతవరకు ఒంటరిగానే పోరాడతారు. విలన్ని చావబాదాక హీరోయిన్ తమ్ముడో, కమేడియనో పోలీసుల్ని పిలుచుకు రావటం జరుగుతూ వంటుంది. ఈ రకమైన మనస్తత్వమే బహుశ అతడిని అంతర్లీనంగా ఆ పనికి ప్రేరేపించి వుంటుంది.

ఆ గదిలో వుండి అవతలివాళ్ళకి తను పారిపోయానన్న భ్రమ కలిగించటం నిజంగా అతడి తెలివితేటలకి ఉదాహరణ.

అందరూ క్రిందికి వెళ్ళారని నిశ్చయించుకున్నాక అతడు బయటకి వచ్చాడు. జనం వ్యానులో ఎక్కి వెళ్ళిపోతున్నారు. బయట మరో రెండు కార్లున్నాయి.

చైతన్య చెట్ల చాటునుంచి ఒక కారు వెనక్కి చేరుకున్నాడు. అదెవరిదో తెలీదు. వెనుక సీటు క్రింద కూర్చుని- ఎవరైనా తలుపు తెరుస్తే అటాక్ చెయ్యటానికి సిద్ధంగా వున్నాడు. మరో అయిదు నిముషాల తరువాత కారు కదిలింది. ముందు సీట్లో ఎవరో డ్రైవ్ చేస్తున్నారు.

చైతన్య లేచే ప్రయత్నమేమీ చేయలేదు. అతను బయట పడాలనుకుంటే ఆ క్షణమే డ్రైవరు మీద అటాక్‌చేసి బయటకు రావొచ్చు కానీ అతడి ఉద్దేశ్యం అదికాదు.

కారు ఆగిన కొద్ది నిమిషాలకి అతను తలెత్తి చూశాడు. ఒక పాడుబడిన బిల్డింగ్ ముందు వుంది అది. అతను తలుపు తెరుచుకుని బయటకి వచ్చాడు. నిర్మానుష్యంగా వుంది. అతడు బిల్దింగ్ వైపు వెళ్ళి కిటికీలోంచి చూశాడు.

డాక్టర్ పాల్ జోసెఫ్ ఎవరితోనో వైర్‌లెస్‌లో మట్లాడుతున్నాడు.

“అవును. ఆపరేషన్ ఫెయిల్ అయింది. అతను తప్పించుకున్నాడు. ప్రనూష వెళ్ళిపోయింది” అంటున్నాడు.

చైతన్య నిశ్శబ్దంగా లోపలికి ప్రవేశించాడు. బయట కనబడినంత పాడుబడినదిగా లేదు ఆ బిల్డింగ్ లోపల. అతడి దృష్టి కుడివైపు గదిమీద పడింది.

కిటికీలోంచి కుర్రవాడు కనపడుతున్నాడు. బహుశ లక్ష్మి తమ్ముడయి వుంటాడు. గుమ్మం బయట తాళం వేసి వుంది.

చైతన్యకి ఆశ్చర్యం వేసింది. సాధారణంగా ఇలాంటి వ్యవహారాల్లో పదిమందికి తక్కువ కాకుండా కాపలాదారులు, అనుచరులు వుంటారు. కానీ ఇక్కడ అలాంటి ఆర్భాటాలూ ఏవీ కనబడటం లేదు. జోసెఫ్ వైర్‌లెస్ ఆఫ్‌చేసి, మెడదగ్గర వూపిరి వెచ్చగా తగలడంతో వెనుదిరిగాడు.

అంత దగ్గరగా, అంత అకస్మాత్తుగా, అనూహ్యమైన రీతిలో చైతన్యని చూసి అదిరిపడ్డాడు జోసెఫ్ పాల్.

“చెప్పండి సూపర్నెండెంట్‌గారూ! ఎమిటిదంతా?”తాపీగా అడిగాడు చైతన్య. జోసెఫ్ ఇంకా షాక్‌నుంచి తేరుకోలేదు.

“చెప్పండి. ఇంత నాటకం ఎందుకాడారు? నా మీద మానసికంగా ఇంత వత్తిడి తీసుకురావటానికి ఎందుకు ప్రయత్నించారు?”

సమాధానం చెప్పకుండా జోసెఫ్ గాలిలా కదిలాడు ఊహించని వేగంతో చైతన్య మీదకు వచ్చాడు. ఇంకెవరైనా అయితే ఆ అనుహ్యమైన వేగానికి క్రిందపడి పోవాల్సిందే. అయితే చైతన్యకి డూప్‌లేకుండా ఫైట్లలో తప్పించుకోవడం అలవాటే, సెకండ్‌కి ఇరవై నాలుగు ఫ్రేములు తిరిగే కెమెరాకి అందకుండా మొహం తిప్పుకోగలగాలి. అలాగే, ట్రిక్స్ ఏమీ లేకుండా సమ్మర్‌సాల్ట్ చెయ్యగలిగి వుండలి. లేకపోతే ప్రేక్షకులు గ్రహించే స్థితిలో వున్నారు. రోజుకి రెండు గంటలు ఇవి ప్రాక్టీసు చేస్తాడు చైతన్య. జోసెఫ్ నుంచి తప్పించుకోగలగటం అతడికి పెద్ద సమస్య కాలేదు.

అయితే జోసెఫ్ పాల్ అంత తొందరగా ఓడిపోలేదు. చైతన్య మెడమీద కిక్ ఇచ్చాడు. అంత టెన్షన్‌లోనూ చైతన్యకి ఆశ్చర్యం వేసింది. “ఇతడు వృత్తిరీత్యా  డాక్టర్ కాదు నిశ్చయంగా” అనుకున్నాడు. రెండు నిమిషాలపాటు ఇద్దరి మధ్యా ద్వంద్వ యుద్ధం సాగింది. చివరికి చైతన్య అతడిని లొంగదీసుకున్నాడు. చేతులు వెనక్కి విరిచి పట్టుకుని “ఇప్పుడు చెప్పు” అన్నాడు.

“అతడిని విడిచిపెట్టు చైతన్యా! లేకపోతే ఈ కుర్రాడి ప్రాణాలు దక్కవు” అని దూరంనుంచి వినిపించింది.

లక్ష్మి తమ్ముడి మెడచుట్టూ చేతులువేసి ఒక రౌడీ నిలబడి వున్నాడు. ఆ కుర్రవాడు గింజుకుంటూ ఏడుస్తున్నాడు. జోసెఫ్‌తో జరిగే ఘర్షణలో ఆ రౌడీ ఎప్పుడు తలుపుతీసి కుర్రవాడిని బయటకు తీసుకువచ్చాడో చైతన్య చూసుకోలేదు.

వాళ్ళమధ్య కొని క్షణాలు నిశ్శబ్దంగా కదిలాయి.

“వదుల్తావా? ఈ కుర్రవాడిని చంపెయ్యమంటావా”

చైతన్య జోసెఫ్ డోక్కలో గుచ్చాడు.  “నువ్వా కుర్రాడిని చంపేస్తే ఇక్కడ నీ బాస్ వీపులో ఆరు గుళ్ళు దూసుకుపోతాయి. కుర్రవాడిని వదులు.”

అటు జోసెఫ్, ఇటు అనుచరులు నిర్విణ్ణులయ్యారు.

“రెండూ క్షణాలు టైమ్ ఇస్తున్నాను మా బాస్‌ని వదిలెయ్యి.”

“నువ్వు కాదు, రెండు క్షణాలు టైమ్ నేనిస్తున్నాను” చైతన్య అన్నాడు “చూడూ… ఆ కుర్రాడు ఎవరో నాకు తెలీదు. నాకేమీ కాడు కూడా. అతనికోసం నీ బాస్‌ని వదలటం అసంభవం. చెప్పు… వదుల్తావా? ట్రిగ్గర్ నొక్కమంటావా?”

జోసెఫ్ కల్పించుకుని “వదిలెయ్” అన్నాడు కంగారుగా.

అనుచరుడు వదిలెయ్యగానే కుర్రవాడు కారు దగ్గరికి పరిగెత్తాడు. అతడు చైతన్య దగ్గిరకు వచ్చివుంటే బావుండేది. అతడిని సురక్షిత స్థానంలో వుంచి చైతన్య వాళ్ళని అటాక్‌చేసి వుండే వాడు. ఇప్పుడిక ఏం చేసినా, జోసెఫ్ డొక్కలో గుచ్చింది దువ్వెన అని తెలిసిపోతుంది.

చైతన్య కూడా జోసెఫ్‌ని షీల్డ్‌గా చేసుకుని కారు దగ్గిరకు వెళ్ళాడు.

 

 

6

 

            అంత గొప్ప ఆహ్వానాన్ని అతడు జీవితంలో ఎప్పుడూ ఊహించలేదు, అనుభవించలేదు.

అతడు డైరెక్టుగా స్టూడియోకి వెళ్ళాడు. శ్మశాన నిశ్శబ్దంతో పడివున్న స్టూడియో అతడి రాకతో చైతన్య వంతం అయ్యింది. ఆనకట్ట తెగిన నదీ ప్రవాహం అయింది. కన్నీళ్ళూ, కౌగిలింతలూ…. అతడు విచలితుడయ్యాడు. అందరూ ప్రొఫెషనల్సే.. కానీ వారి మనుసుల్లో తను ఇంతటి స్థానం సంపాదించుకున్నాడని తెలీదు. తప్పిపోయాడనుకున్న కుటుంబసభ్యుడు తిరిగి వచ్చినట్టు ప్రతి ఒక్కరూ ఫీలవటం….

ఆ ఆర్ద్రతకి అతడి మనసు ద్రవించింది.

తల్లి అతడిని చూసి పక్కమీదనుంచి లేచి వచ్చింది. అతడిని చేతులమధ్య తీసుకుని, అతడి చేతులమధ్య స్పృహ తప్పిపోయింది. అతడి చిన్నతనమునుంచీ వాళ్ళిద్దరే ఒకరికొకరిగా బ్రతికారు. తండ్రి లేడు. ఆమెకి అతడంటే ప్రాణం. అతడు తప్పిపోయాడని, జాడ తెలియడంలేదనీ తెలిసిన క్షణంనుంచీ ఆమె పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు.

రెండు రోజులపాటు హడావుడి. పోలీసులు దాదాపు నాలుగు గంటలపాటు ప్రశ్నించి వెళ్ళారు. అతడు చాల విషయాలు చెప్పలేదు. అవసరమయినంతవరకే చెప్పాడు. పోలీసులు లక్ష్మిని కూడా ప్రశ్నించారు. కానీ ఏ వివరాలూ తెలియలేదు.

పేపర్లలో ఈ వార్త ప్రముఖంగా వచ్చింది. గత కొన్ని రోజుల్నుంచి సంచలనం సృష్టిస్తున్న ఈ సంఘటన సుఖాంతమైనందుకు ఎడిటోరియల్స్ కూడా వ్రాయబడ్డాయి. తను లేని రోజుల్లో పత్రికల్లో పడిన రకరకాల వార్తలు చదివాడు. చాలా రకాలుగా సర్క్యులేషన్ పెంచుకోవటానికి దాదాపు అన్ని పత్రికలూ ట్రై చేశాయి. అతడి దృష్టి ఒక పత్రికలో ఫోటో మీద పడింది. తన తల్లి ఫోటో అది. తను లేనప్పుడు ఆవిడ నిస్త్రాణగా ఎలా పడివున్నదీ వేశారు. అతడి కళ్ళల్లో తడి కదలాడింది. తనని బంధించినప్పుడూ, హింసించినప్పుడు కోపం రాలేదు. ఇప్పుడొస్తూంది. అతడు వివరాలన్నీ పోలీసులకు చెప్పనిది అందుకే, ఈ విషయం తనే స్వయంగా తేల్చుకోవాలి. ముఖ్యంగా, సెక్రట్రియేట్‌లో సుబ్బారావు అనేవాడు ఎవరూ లేడని తెలిసిన తర్వాత అతడిది ప్రాక్టికల్ జోక్ అనేది అర్థమైంది. ప్రనూష మీద అతడికి కోపం రావటంలేదు. ఒక కోటీశ్వరురాలు తనమీద అంత పెద్ద నాటకం ఎందుకు ఆడించిందో తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువ అవుతూంది. వాళ్ళు తననుంచి ఎక్కువ ఆశించలేదు అనిపిస్తోంది. తను తప్పించుకుపోయాడని తెలిశాక వాళ్ళు ఆ హాస్పిటల్‌ని ఖాళీచేసి అక్కడునుంచి ఎంత తొందరగా వెళ్ళిపోవాలా అని ఆలోచించారే తప్ప తనని వెతికి పట్టుకునే ప్రయత్నం చేయలేదు. ఆ ఆస్పత్రి బిల్డింగ్ నెలరోజులపాటే అద్దెకి తీసుకున్నారంతే….

ఒకటి మాత్రం నిజం!

నెలరోజుల తర్వాత తనని ఎక్కడికో తీసుకెళ్ళే ప్రయత్నంలో వున్నారు వాళ్ళు.

లేదా తాను చైతన్య అనే విషయం పూర్తిగా మర్చి పోయేలా చేసి, పిచ్చివాడిగా మార్చి పంపించి వుండేవారు. తన రంగంలోవున్న ప్రత్యర్థులు చేసిన పనా ఇది? అదృష్టవశాత్తు సినిమారంగలో అంత దారుణాలు చెలరేగటంలేదు.

అయినా ప్రనూషని చూస్తూంటే అంత దారుణమైన ఆలోచన వున్న అమ్మాయిలా అనిపించలేదు. లక్ష్మి తమ్ముడిని కిడ్నాప్ చేసి వుంచిన చోట కూడా వాళ్ళు తగినన్ని జాగ్రత్తలు తీసుకోలేదు.  కొన్ని విషయాల్లో ఎంత పకడ్బందీగా ప్రవర్తించారో, మరికొన్ని విషయాల్లో అంతే తేలిగ్గా వున్నారు.

రోజులు గడుస్తున్నాయి. క్రమక్రమంగా ఈ విషయం అందరూ మర్చిపోతున్నారు. అతడు మర్చిపోలేదు. తనకి జరిగిన విషయాలని అంత తొందరగా మర్చిపోయే స్వభావంకాదు అతడిది.

ఒకరోజు లక్ష్మి వచ్చింది. ఆ రోజు ఎవరో ఆమెకి పోస్ట్‌లో డ్రాఫ్ట్ పంపారు పాతికవేలకి! చిన్న థాంక్స్ కార్డుకూడా వుంది. లక్ష్మి తనకది చూపించగానే ‘ఇదేదో విదేశీ వ్యవహారం కాదు ముందు వూహించినట్టు ప్రాక్టికల్ జోకే! తన ఫాన్ ఎవరో లక్షలు ఖర్చుపెట్టి వేసిన ప్రాక్టికల్ జోక్!’ అనుకున్నాడు.

“పాతికవేలు వచ్చాయిగా, బీ. హాపీ” అన్నాడు నవ్వుతూ.

ఆమె నొచ్చుక్కుంటూ “నేను మిమ్మల్ని చాలా కష్టపెట్టాను” అంది-దానికి ఈ పాతికవేలు బహుమతి కాదు అన్న నిష్ఠూరంతో.

అంతలో అతడి తల్లి వచ్చింది. లక్ష్మిని ఆమెకు పరిచయం చేశాడు “అమ్మా ఈ అమ్మాయే లక్ష్మి, నన్ను అయోమయంలో పడేసిన వాళ్ళల్లో మొదటిది.”

లక్ష్మి విషణ్ణవదనంతో “నా తమ్ముడు” అంటూ ఏదో అనబోయింది. అతడు బిగ్గరగా నవ్వి “నేను చెపుతున్నది నీ నటన గురించి” అంటూ తల్లివైపు తిరిగి, “ఎలా వుందమ్మా-వచ్చే సినిమాలో నా హీరోయిన్?” అని అడిగాడు.

లక్ష్మికి ముందు అర్థకాలేదు. అర్థమవగానే, మల్లెపూల పరిమళం చుట్టుముట్టినట్టయింది.

“నిజమా?” అంది తను వింటున్నది అబద్ధమేమో అన్న అనుమానంతో.

“నిజమే. ఈ రోజే ప్రొడ్యూసర్‌తో మాట్లాడాను. జూన్‌లో సినిమా ప్రారంభమవుతుంది. బహుశా నీ దగ్గరికి రేపొస్తారు వాళ్ళు” అన్నాడు.

ఆమెకు లోపల్నుంచి దుఃఖం తన్నుకు వచ్చింది. ఆనందం మితిమీరగా వచ్చిన దుఃఖం అది. దాన్ని దాచుకునే ప్రయత్నమేమీ చేయలేదామె. అతడి తల్లి ఆమె తలమీద అనునయంగా చెయ్యి వేసింది.  పేపర్లో ఫస్ట్‌క్లాస్ చూసుకుని ఏడ్చే చిన్నపిల్లలా ఏడ్చి, ఏడ్చి, కొంచెంసేపటికి ఆమె తేరుకుంది.

“ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను.”

“ఏం? నీకేం తక్కువ? ఒక స్టేజిలో నువ్వు నా భార్యవే నేమో అని నాకే అనుమానం వచ్చింది. అంత బాగా నటించావు”అన్నాడు.

లక్ష్మిని అతడి తల్లి లోపలికి తీసుకువెళ్ళి చాలసేపటివరకు ఆమె గురించిన వివరాలు అడిగింది. లక్ష్మి వెళ్ళిపోయాక కొడుకుతో “ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయిలా వుందిరా చైతూ” అంది.

“నీ మెచ్చుకోలు సంపాదించిందంటే నిజంగానే మంచి అమ్మాయి అయివుండాలి” అన్నాడు అతను తేలిగ్గా. ఆవిడ మట్లాడలేదు. లక్ష్మికీ, తనకీ దగ్గర పోలికలున్నాయి అనుకుంది. ఒక చిన్న పావురం బలహీనమైన రెక్కల్తో ఒక గూడుని నిలబెట్టడానికి ప్రయత్నించినట్టు ఆ అమ్మాయి ఎక్‌స్ట్రా వేషాలు వేసి కుటుంబాన్ని పోషిస్తోంది.

ఒకప్పుడు తను అంట్లు తోమి కొడుకుని చదివించినట్టుగా.

 

                                              *         *          *

Print Friendly

“పద్మప్ప”

రచన:  మంథా భానుమతి.      

“వధ.. వధ.. వందలమంది.. వేలమంది. నరమేధం! ఇదెక్కడి మానవ జన్మం.. ఎవరిచ్చారు అధికారం? ఎక్కడిదీ రుధిరం? ఏరులై పారుతోందే.. గుండె ఢమరుకంలా కొట్టుకుంటోంది. నేనేం చెయ్యాలి? ఏం చెయ్యగలను? ఒడలంతా చెమటలు.. అలా కారుతూ రుధిర ధారల్లో కలిసిపోతున్నాయి..” కలత నిద్రలోంచి ఉలిక్కిపడి లేచాడు భీమనప్పయ్య. ఎటువంటి కలా.. పీడకల అనడం కూడా తక్కువే! సబ్బినాడుకి వచ్చి అప్పుడే రెండు మాసాలవుతోంది.
ఏదో చప్పుడు.. చీపురుతో వీధివాకిలి ఊడుస్తున్న శబ్దం. అప్పుడే తెల్లవారుతోందా.. రెండు ఘడియలు కూడా కళ్లు మూత పడలేదు. పక్కన ఇల్లాలు విశ్రమించిన చాప ఖాళీగా ఉంది. ఎప్పుడు దూరాడో, పద్మప్ప తన పక్కనే ముడిచి పెట్టుకుని పడుక్కున్నాడు. అలికిడి వినగానే కళ్లు తెరిచి తండ్రిని చూసి నవ్వాడు.. అచ్చు ఉదయిస్తున్న బాల భానుడిలా!
విప్పారిన కుమారుని మోము చూడగానే భీమనప్పయ్య హృదయంలో ప్రేమ పెల్లుబికింది. గుండె కొంచెం కుదుట పడింది. పసివాడిని లేపి ఎత్తుకుని వీధి వాకిట్లోకి తీసుకొచ్చాడు.
“అమ్మా!” పద్మప్ప కింది కురికి ఒక్క గెంతులో ముగ్గులు తీర్చి దిద్దుతున్న తల్లి వీపుకానుకుని ఊగ సాగాడు.
భీమనప్పయ్య కుటుంబం ఉన్న సత్రం గోదావరి పాయకి దగ్గరగా ఉంది. అక్కడ్నుంచి నీళ్లు తెచ్చి కళ్లాపు జల్లి శుభ్రం చేసి ముగ్గు వేస్తోంది అతని భార్య. అంత పెద్ద ఆవరణని శుభ్రం చెయ్యడానికి చాలా సమయమే కావాలి.. ఎప్పుడు లేచిందో.. నుదుటిన ఏర్పడ్డ చెమటని కొంగుతో అద్దుకుంటూ, భర్తని చూసి చిరునవ్వు నవ్వింది. భీమనప్పయ్య తప్పు చేసిన వాడి వలె తల దించుకుని, కొడుకుని తీసుకుని నది వద్దకు వెళ్లాడు, కాలకృత్యాలు తీర్చుకుని, స్నానం చేసి రావడానికి.
తాను కొంచెం ముందు లేచి, కాసిని నీళ్లయినా తేవచ్చు కదూ! రాత్రిళ్లు ఇటు దొర్లీ, అటు దొర్లీ నిద్ర అనేది కరవైపోయింది. ఉండేది సత్రం అయినా, ఎక్కువ రోజులు ఉంటే మర్యాదగా ఉండదని, తమ వంట తామే వెనుక అరుగు మీద చేసుకుంటున్నారు. మూల్యం చెల్లించకుండా ఉంటున్నందుకు వాకిలి, మండువా శుభ్రం చేస్తుంది అతని భార్య. ఊరు వదిలినప్పుడు తాతగారిచ్చిన రొక్కం అయిపోవచ్చింది.
“నాన్నగారూ! ఇటు చూడండి.. నాకు వచ్చేసింది.” నోటి నిండా నీళ్లు నింపి గడగడ శబ్దం చేస్తూ పుక్కిలించి ఉమ్మేశాడు పద్మప్ప, పెద్ద ఘనకార్యం చేసినవాడిలాగ. మామూలుగా అయితే కొడుకుని గాల్లోకి ఎగరేసి బుగ్గమీద ఒక ముద్దిచ్చేవాడు. కానీ అప్పుడు మాత్రం కాదు.. రేపటి సంగతెలాగ? సంభారాలు ఇంక రెండు మూడు రోజుల వరకూ వస్తే గొప్పే.. అదీ ఇల్లాలి చాకచక్యం వల్ల ఒక నెలకని పంపినవి రెండు వరకూ..
అన్యమనస్కంగా తనయుని ఒడలు అంగవస్త్రంతో తుడిచి, ఇసుకలో కూర్చోపెట్టి, అక్షరాలు దిద్దమని తను నది లోకి దిగాడు. బుంగమూతి పెట్టి తండ్రిని కినుకగా చూసి, అక్షరాలు దిద్దసాగాడు పద్మప్ప.
“ఈ పాపడి మొహంలో భాస్కరుని తేజస్సు ఉట్టిపడుతోంది. అసమాన కీర్తి నార్జిస్తాడు. ఇతని నాలుక మీద చదువులతల్లి నాట్యమాడుతుంది. ఎవరు బాబూ మీరు? మిమ్మల్ని ఈ ప్రాంతాల చూచిన జ్ఞప్తి రావట్లేదే..” పక్షులగానం తప్ప వినిపించని ఆ ప్రశాంత వాతావరణంలో గంభీరమైన కంఠద్వని విని ఒడ్డుకి వచ్చాడు భీమనప్పయ్య. పద్మప్ప లేచి నిలబడి కుతూహలంగా చూస్తున్నాడు.
“అయ్యా.. తమరు..”
“నన్ను సింగన జోస్యులంటారు. ధార్వాడ పరగణాల్లోంచి వలస వచ్చి ఇక్కడ స్థిరపడ్డాము. రెండునెలలుగా.. మా బంధువుల ఇంట్లో శుభకార్యానికి యణ్నికెర గ్రామం వెళ్లి నిన్ననే వచ్చాము. మీరు ఏదైనా కార్యార్ధులై ఇచ్చటికి వచ్చారా?”
“లేదు స్వామీ! మేమునూ మీవలెనే ఇచ్చట ఉండిపోవాలని వచ్చాము.. మాది కృష్ణాతీరం. పుట్టిన ఊరినీ, బంధుమిత్రులనూ, కుటుంబాన్నీ వదిలి రావలసి వచ్చింది.. జిన ధర్మాన్ని పాటిస్తున్నాననీ, వైదిక ధర్మాన్ని వదిలేశాననీ గ్రామస్థులు వెలి వేశారు..”
భీమనప్పయ్య చెప్పినదంతా శ్రద్ధగా విన్నాడు సింగనజోస్యులు.
“మంచి పని చేశారు. ఇక్కడ ప్రజలలో అధికులు జైనులే. నేను కూడ జైన బ్రాహ్మణుడనే. మీ కన్నులలో కాంతిని బట్టి చెప్పచ్చు.. మీరు, మీ పుత్రులు అజరామరమైన కీర్తి ప్రతిష్టలనార్జిస్తారు.”
“సందేహం వద్దు సామీ.. ఈ మహానుభావుడు జ్యోతిష్యశాస్త్ర కోవిదుడు. వీరు చెప్పారంటే ఆ బ్రహ్మదేవుడు రాసి పెట్టుండాల్సిందే.” అప్పుడే వచ్చి వీరి సంభాషణ విన్న సత్రం యజమాని వీరప్ప అన్నాడు.. ఇద్దర్నీ అరాధనగా చూస్తూ.
భీమనప్పయ్య కొత్త ఊపిరి పోసుకున్నట్లు, ఆ ప్రాతఃకాలపు కాంతిలో ఎర్రగా మెరిసిపోయాడు.
అసంకల్పితంగా జినసేనుడు రచించిన పూర్వపురాణ కావ్యంలోని, మొదటి తీర్థంకరుడైన ఋషభనాధుని పంచకళ్యాణాలలో ఒక దానిని గానం చేశాడు. అతని గానాన్ని విని అక్కడికి స్నానానికి వచ్చిన పల్లె ప్రజలందరూ మైమరచి కూర్చుండిపోయారు.
“అజ్ఞాన తమోనీకారుడగు నితడు, గుణ రత్నాకరుడు. ” వెంటనే సింగన జోస్యులు బిరుదు ప్రదానం చేశాడు.
కన్నుల నీరు చిప్పిల్లగా, తన తండ్రి వలె గోచరించిన సింగన గారికి సాష్టాంద దండ ప్రణామము చేశాడు భీమనప్పయ్య.
……………………………
సింగన గారి సహాయంతో గ్రామంలో ఖాళీగా ఉన్న ఇంట్లోకి సంసారాన్ని తరలించాడు భీమనప్పయ్య.
“ఆ గృహస్థు, ధార్వాడ పరగణాకి వెళ్లారు లేవయ్యా! ఆ ఇంటి బాధ్యతని నాకు అప్పగించారు. ఆయన రాజుగారి సైన్యంలో అధికారి. అక్కడ దేశ రక్షణకై పంపారు. నేనిక్కడికి రాలేదూ… పొట్ట చేత పట్టుకుని వెళ్లాల్సిందే ఎవరైనా..” మొహమాట పడుతున్న భీమనప్పయ్యకి సర్ది చెప్పారు.
“మీరు చెప్పాక ఇంక అభ్యంతరమేముంది బాబయ్యగారూ?” పద్మప్పని చంకనేసుకుని వాడి తల్లి సంబరంగా అంది. అవును మరి.. సత్రంలో ఈ చివర్నుంచాచివరికి శుభ్రం చేసే సరికి నడుం నేలకి అతుక్కుపోతోంది.
ఇంటి ముందు నిర్మించిన పర్ణశాలలో విద్యాపీఠాన్ని ఆరంభించాడు భీమనప్పయ్య. సింగన జోస్యులవారే ముహుర్తం పెట్టారు. ఆ నోటా ఆనోటా ఏ విధంగా పాకి పోయిందో గానీ నెల తిరిగే సరికల్లా పదిమంది విద్యార్ధులు చేరారు. అక్షరాలు దిద్దే వారి దగ్గర్నుంచీ, వ్యాకరణ శాస్త్రం అధ్యయనం చేస్తున్న వారి వరకూ ఉన్నారక్కడ.
కొద్దికాలంలోనే పాఠశాలగా రూపు దిద్దుకుని, భీమనప్పయ్యగారు తన సహాయార్ధం కొందరు గురువుల్ని కూడా తన విద్యాపీఠంలో చేర్చుకునే స్థాయికెదిగారు. అతని ఖ్యాతి అనతి కాలంలోనే రాష్ట్రకూట సామ్రాజ్యం అంతా పాకింది.
సింగన జోస్యుల కుటుంబంతో సాన్నిహిత్యం కూడా పెరిగింది.  ఒక రోజు సూర్యోదయానంతరం.. రెండు ఘడియలయింది..
భీమనప్పయ్య కొడుకుతో కలిసి నమోకార మంత్రాన్ని జపించి (జైన ప్రార్ధన), యోగ సాధన కూడా ముగించి, క్షీర పానం చేస్తున్నాడు.
“అరే.. తాతగారు.. అమ్మా! తాతగారొచ్చారు..” పద్మప్ప సంభ్రమంగా లేచి వంటింట్లోకి పరుగెత్తి తల్లిని పిల్చుకొచ్చాడు. భీమనప్పయ్య కూడా ఆశ్చర్యంగా చూస్తూ లేచి నిల్చున్నాడు.
“అమ్మీ! బాగున్నారా? భీమయ్యా! నిన్నొక కోరిక కోరాలని వచ్చానయ్యా.. మమ్మల్ని కూర్చోపెడతారా లేదా?” సింగన్నగారు సతీ సమేతంగా ఇంట్లోకి వచ్చారు.
“రండి.. రండి. బాబయ్యగారూ! అనుకో లేదు కదా.. అందుకే కాస్త.. కూర్చోండి.” చాప పరిచి, లోనికి వెళ్లి మంచి తీర్ధం తెచ్చి ఇచ్చింది భీమనప్పయ్య భార్య.
పద్మప్ప, సింగన్నతాతగారు తెచ్చిచ్చిన రిషభ తీర్ధంకరుడి చందనం బొమ్మ ఇంటి ముందున్న పాఠశాల లోకి తీసుకెళ్లి, ఒక పీఠం మీద పెట్టి, వివిధ పుష్పాలతో అలంకరిస్తున్నాడు.
చాప మీద అతిథులు ఇద్దరూ ఆసీనులయ్యాక విసినికర్రతో విసురుతూ అడిగాడు భీమనప్పయ్య, “మేం మీ కోరిక తీర్చగల సమర్ధులమా సింగన్నగారూ! ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నాం..”
“నేనడగబోయేది మీరిద్దరూ తీర్చగలదే! ఏదో ఉపన్యాసాలిచ్చి, నాన్చి చెప్పను. తిన్నగా అడిగేస్తున్నా.. మా అమ్మాయి ’వబ్బెణబ్బ”ని భీమనప్పయ్యకిచ్చి కన్యాదానం చేద్దామని అడగడానికి వచ్చాం. మీరు ఔనంటే సంతోషంగా వెళ్తాం.”
విసినికర్రలు రెండూ ఆగిపోయాయి. నోటమాట రానట్లు, కళ్లు పెద్దవి చేసి చూస్తుండి పోయారు భార్యాభర్తలిద్దరూ.
సింగన్నగారు సబ్బినాడులో మంచి పేరున్నవారు. ధనవంతులు. వారి అమ్మాయిని, పెళ్లయి, ఒక కొడుకున్న వానికి ఇస్తామనడం.. అదీ ఒక్క చిన్ననాణెం చేతలేని వాడికి! తాము వింటున్నది నిజమేనా.. కల కాదు కదా! స్వయంగా వారే వచ్చి..
భీమనప్పయ్యకి ఏమనాలో అర్ధమవలేదు. భార్యని పరికించాడు.
ఆమె నిశ్చేష్ట అయి నిల్చుండి పోయింది. పెదవులు వణుకుతూ.. కళ్లలోనుంచి ఏ క్షణంలో నైనా నీళ్లు రాలడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎంత కష్టమైనా.. రోజుల తరబడి గంజి తాగైనా గుండె ధర్యంతో నిల దొక్కుకుంది. పుట్టి పెరిగిన ఊరినీ, కన్న వారినీ.. అత్తింటినీ వదిలి, కట్టుకున్న వాడి వెంట.. కట్టుబట్టలతో వచ్చినప్పుడు కూడా ఏ ఆలోచనా లేదు. కలత చెందలేదు. అది తన కర్తవ్యం అనుకుంది. ఇప్పుడీ పెద్దాయనకి తన సంసారమే దొరికిందా? కాదంటే ఏం చేస్తారో.. తమని అన్ని విధాలా ఆదుకుంటున్నారు. వారు తలుచుకుంటే వారమ్మాయికి సంబంధమే దొరకదా! సవతితో కాపురం..
నిస్సహాయంగా తల దించుకున్న భార్యని చూసి భీమనప్పయ్య కదిలిపోయాడు.
సమాధానం చెప్పడానికి నోరు తెరవబోయాడు..
“ఆగండి.. నా మాటలు విన్నాకా మీ నిర్ణయాన్ని చెప్పవచ్చు. అదీ.. వెంటనే అవసరం లేదు.. ఆలోచించుకుని, నెమ్మదిగా చెప్పవచ్చును. ఒకవేళ మీరు కాదన్నా.. మన స్నేహానికి అదేమీ అడ్డంకి కాదు.” భార్య కేసి చూశారు సింగన్న. ఆమె ఔనన్నట్లు తలూపింది.
“అమ్మీ! ఇది నేను కావాలని చేసింది కాదు. వీరు ఇప్పుడు చెప్పేవరకూ నాకేమీ తెలియదు. నేనా అమ్మాయిని చూడను కూడా చూడలేదు.” ఇంటి లోపలికి వెళ్లబోతున్న ఇల్లాలిని ఆపి అన్నాడు భీమనప్పయ్య.
“అవునమ్మా! అబ్బాయి అమాయకుడు. గుణరత్నాకరుడు. రవి సమానమైన అతని తేజాన్ని, తెలివిని, విద్యని చూసి మేమే చొరవ తీసుకున్నాం. నువ్వు మా అమ్మాయి వంటి దానివే! నీకుఅన్యాయం చేస్తామా?” సింగన్నగారి భార్య అంది.
దెబ్బతిన్న పక్షిలా చూసింది.. తనకి సవతిని ఇస్తామంటున్న వారిని. పైగా అన్యాయం చేస్తామా అట.
“అమ్మాయీ! ఈ భీమనప్పది, పద్మప్పది మహర్జాతకం. వీరు కారణ జన్ములు. ఈ పృధ్వి ఉన్నంతకాలం వీరి యశస్సు నిలిచే ఉంటుది. వీరి కీర్తి తరతరాలుగా నిలిచిపోయేటట్లు ఉండడానికి, వీరు నమ్ముకున్న మతం, సిద్ధాంతం వ్యాప్తి చెందడానికి.. మీ కుటుంబంలోకి ఇంకొక కుమారుడు రావాలి. అదీ మా అమ్మాయి ద్వారానే.. నీ భర్తకి, తనకి పుట్టబోయే పాపడు పద్మప్పకి తోడుగా అతని కనుసన్నులలో ఉంటూ.. రాముడికి లక్ష్మణుడిలా వర్ధిల్లుతాడు.
బాబూ! భీమనప్పా.. నేటి కాల పరిస్థితులలో ద్వితీయ వివాహం అసాధారణమూ కాదు, నిషిద్ధమూ కాదు. త్వరలో రాజధాని వేములవాడకు మారబోతోంది. పిల్లలిద్దరూ అక్కడే పెరిగి పెద్దవారవుతారు. వారు చెయ్యదలచుకున్న కార్యాలు అక్కడే చేస్తారు. పద్మప్ప, రాజాశ్రయం పొంది.. చక్రవర్తికి ఇష్టుడై బిరుదులు పొందుతాడు. అతని సోదరుడు అవన్నీ భవిష్యత్తరాలకి తెలిసేలాగ చేస్తాడు.
ఇంకొక ముఖ్యమైన విషయం..” సింగన్న ఆపి భార్యాభర్తల మొహాలు చూశారు. ఇద్దరి మొహాల్లోనూ అనిశ్చిత స్థితి. నమ్మశక్యంగాని విషయం విటున్నట్లు.. కనుబొమలు పైకి లేపి సావధానులై వింటున్నారు. మంచినీరు తాగి, కండువాతో మొహం మీద చెమట అద్దుకుని మొదలుపెట్టారు. గ్రీష్మ తాపం అప్పుడే మొదలయిందనుకుంటూ..
“వీరశైవులు విజృంభించి, జైనులందర్నీ సామదాన భేద దండోపాయాలతో వైదిక మతానికి మార్చేస్తున్నారు. తప్పని సరై కొన్ని క్రతువులు తమ నిత్య జీవనంలోకి ఆహ్వానిస్తున్నారు జినేయులు. జిన ధర్మం, జిన సాహిత్యం కనుమరుగైపోయే ప్రమాదం పొంచి ఉంది. ముందుతరాల వారికి జైనమత ప్రాశస్థ్యం తెలుపడానికి భీమనప్పయ్య పుత్రులే నడుం కట్టాలి. అది మీరు సహకరిస్తేనే అవుతుంది. మీ కబురు కోసం ఎదురు చూస్తుంటాం.” సింగన్న దంపతులు లేచి బయటికి నడిచారు.
ఇంటికొచ్చిన అతిథులకి సత్కారం చెయ్యలేదు.. వారికి పానీయం ఏమీ ఇవ్వలేదు. మౌనంగా గోడనానుకుని నిలబడ్డారు భీమనప్పయ్య దంపతులు.
……………………..
“అమ్మా!” పద్మప్ప తల్లి దగ్గరగా వెళ్లబోయి ఆగిపోయాడు.
వంటింట్లో పొయ్యిలో కట్టెలు భగభగా మండుతున్నాయి. పొయ్యి మీద కొర్రబియ్యం కుతకుతా ఉడుకుతోంది. పొయ్యిముందు కూర్చున్న అమ్మ మొహం, కళ్లు కూడా ఆ మంటలాగే ఎర్రగా ఉన్నాయి. ఏమయిందమ్మకి? అరే.. ఏడుస్తోందా! అమ్మ ఏడవడమా! పద్మప్పకి ఏం చెయ్యాలో పాలుపోలేదు.
మాట్లాడకుండా వీధిలోకి వెళ్లి తండ్రిని వెతికి చెప్పాడు. తండ్రి మొహం కూడా ఏదో వింతగా అనిపించింది. ఏదో జరుగుతోంది.. తాను ఎడంగా ఉంటేనే నయం అని ఆ చిన్ని బుర్రకి తోచింది.
సింగన్న దంపతులు వచ్చి వారం రోజులయింది. ఈ వారం అంతా ఇల్లు మూగవోయినట్లయింది. భీమనప్పయ్య మంద్ర స్వరంలో పాడే పాటలు వినిపించడంలేదు.
పాఠశాల మాత్రం మామూలుగా నడుస్తోంది.
భీమనప్పయ్య తల పంకించి ఇంట్లోకి నడిచాడు. పద్మప్ప పెద్ద కళ్లేసుకుని చూస్తూ.. ఇసుకలో సంస్కృతం, కన్నడ, తెలుగు అక్షరాలు దిద్దుతున్నాడు.
“అమ్మీ! మౌనంగా ఉంటే సమస్య సర్దుకోదు. ఏదో సమాధానం చెప్పాలి మనం. నిర్ణయం ఒకసారి తీసుకున్నాక మనం వెనక్కి వెళ్లలేం. తీసుకునే ముందే గట్టిగా ఆలోచించుకోవాలి. ఏం చేద్దాం? ఏ నిర్ణయం తీసుకున్నా మంచీ చెడూ రెండూ ఉంటాయి. సింగన్నగారు చెప్పింది ఒక్కటి నిజం.. జిన ధర్మానికి చేటు కాలం మాత్రం వస్తోంది. జైన సాహిత్యాన్ని ఎక్కడా నిలువనీయట్లేదు. జైనులని బలవంతంగా మార్చేస్తున్నారు. ఇంక మిగిలిన సంగతులు.. అదే.. పద్మప్పకి సోదరుడు కలగడం, ఇద్దరూ ఖ్యాతి పొందడం.. అవన్నీ భవిష్యత్తులోకి చూడడమే.. ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు?”
“మీ అభిప్రాయమేమిటి?”
భార్య ప్రశ్నకి నిమేషన్మాత్రం ఆలోచించాడు.
“నాకు ఈ వివాహం మీద ఆసక్తి అయితే లేదు. కానీ ప్రజా సంక్షేమం కోసం, మత ధర్మాన్ని నిలపడం కోసం అయితే తప్పదనే అనుకుంటున్నాను. అదీ నువ్వు సమ్మతిస్తేనే సుమా!”
విరక్తిగా పెదవి విరిచిన భార్యని చూసి గట్టిగా నిట్టూర్చి వెనుతిరిగాడు భీమనప్పయ్య.
“ఆగండి.. సింగన్నగారికి మీ సమ్మతి తెలియజెప్పండి.”
“నిజంగానా? చాలా విషయాలు సర్దుకోవాలి సుమా!”
“అవన్నీ వారం రోజులుగా ఆలోచిస్తూనే ఉన్నాను. అపర బ్రహ్మ అని పేరు పొందిన సింగన్న జోస్యుల వారి భవిష్య వాణి మీద నాకెటువంటి సంశయమూ లేదు. నా స్వలాభం కంటే వంశ ప్రఖ్యాతి ముఖ్యం. పైగా వబ్బెణబ్బ చాలా మంచి అమ్మాయి. తండ్రి గారి వద్ద సకల శాస్త్రాలు చదివింది. నా కంటే మీకు తగిన ఇల్లాలు. “నేను” అనే భావాన్ని వదులుకుంటే ప్రపంచానికి మేలు జరుగుతున్నప్పుడు.. ఆ పని చెయ్యడమే ఉత్తమం. గృహం కంటే వంశమే ప్రాముఖ్యం కదా!” నాలుగు మాటల కంటే ఎప్పుడూ ఎక్కువ మాట్లాడని భార్యకి ఇంత అవగాహన ఉన్నందుకు ఆశ్చర్య పోయాడు భీమనప్పయ్య.
“ఇంట్లో, నా హృదయంలో నీ స్థానం సుస్థిరం. గృహమందు ఏం జరిగినా నీ అనుమతి తోనే జరుగుతుంది. కానీ ఇంటిలోకి కొత్తగా వచ్చే అమ్మాయిని ఇద్దరం మనస్ఫూర్తిగా ఆహ్వానించాలి. సరేనా!” భార్య దగ్గరగా వెళ్లి హృదయానికి హత్తుకున్నాడు.
“అయ్యో! మడి..”
“ఫరవాలేదు.. నేను కూడా మడే!”
అప్పుడే లోపలికొచ్చిన పద్మప్ప రెండు చేతులతో కళ్లు మూసుకున్నాడు.. ఏదో అర్ధమైనట్లు.

 
*————————*

Print Friendly

చిక్కని కవిత్వంతో చక్కని సంకలనం ”కవి సంగమం”

రచన: శైలజ మిత్ర                                                                                                  

 

”నువ్వొక పచ్చని చెట్టువైతే / పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను” అనే ఒక విలక్షణమైన, వాస్తవమైన, హృద్యమైన వాక్యాలతో మొదలయిన ఈ కవిసంగమం నేడు 144 మంది కవులతో  ఒక కవితా సంకలనం తీసుకుని రావడం బహుశా తెలుగు కవిత్వ వొరవడికి వినూత్నం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కవిత్వం కావాలంటున్నారు.  కవిత్వం పేరిట నినాదాలు, విషయాలు వద్దంటున్నారు. కవులంటే కవిత్వం రాయాలి. కానీ కవిత్వం రాస్తున్నామని ఎవరికి వారు ఆత్మవంచన చేసుకోకూడదని అభిప్రాయ పడుతున్నారు. ఆకాశం అందరికీ అందంగానే కనిపిస్తుంది. ఆకాశం హావభావాలను ఒక్క కవి మాత్రమే వర్ణించగలడు. ఆకాశం నీలంగా ఉంది. అనడానికి కవి అక్కర్లేదు,  ఎందుకంటే ఆ మాటను ఎవరైనా చెప్పగలరు. కానీ సముద్రపు నీలిరంగు ఆకాశంపై పడితే కనిపించే తాలూకు సౌందర్యం ఆ నీలాకాశం అని ఎవరు చెప్పగలరు? సముద్రం కెరటాలతో భయపెడుతుంది అందరికీ తెలుసు. కానీ సముద్రపు నేల మట్టంలో జరిగే కదలికల తాలూకు ఆవేదనే ఆ కెరటాలని కవులు మాత్రమే అభివర్ణించగలరు. అలా కవులను మాత్రమే ఎన్నికచేసి వారినుండి ఉత్తమ కవిత్వాన్ని ఒకచోట ప్రోది చేసి అవన్నీ ఒక సంకలనంగా తీసి వందమంది కవులలో మన కవిత్వ స్థానం ఏమిటి? అసలు మనర రాస్తున్నది కవిత్వమేనా? అని తెలిపేరీతిలో అందరికీ సరిసమానమైన స్థాయిని కలిగించి విని, ఎంతో ఆదరించి మరింత సాహితీ కృషి చేస్తున్న ప్రముఖ కవి యాకూబ్‌.

పత్రికల ద్వారా, రోజువారీ పేపర్లద్వారా అనేక కవిత్వాన్ని మనం చదువుతూనే ఉన్నాం. నేడు పత్రికలు కూడా వారి వారి గ్రూపులను ప్రోత్సహిస్తూ ఇచ్చినవారికే స్థానాల్ని కలుగజేసేవి కొన్నయితే, మరికొన్ని కులాలని, మతాలని, దళితులని, వాదాలని, వ్యక్తిగత విభేదాలని విభజించి వారికే పట్టం కట్టడం మన దృష్టిని దాటిపోలేదు. కానీ ఇలా ఎంతని రాస్తాం? ఎన్నాళ్ళని సహిస్తాం? ఉన్నంతవరకు రాస్తాము.  కానీ బంగారు పళ్ళానికి కూడా గోడ దాపు అవసరం అన్నట్లు ఎంత మంచి కవి అయినా ప్రోత్సాహమో, లేక ప్రముఖుల అభినందనో అవసరం. అవేవీ లేకుంటే కళాకారులలో నిర్లిప్తత చోటుచేసుకుని ఎందుకు రాయాలి అని నిరాశ చెందే కవులు లేకపోలేదు. . కవిత్వం రాసిన వారందరూ కవులు కాలేరు. ఎన్నో పుస్తకాలను రచించాను నేను గొప్ప కవయిత్రిని అంటే నమ్మే రోజులు పోయాయి. ఎందుకంటే కవిత్వం ఇపుడు రాను రాను మరింతగా చిక్కపడుతోంది. చక్కపడుతోంది కూడా. ఒక తరం కంటే మరో తరం కవిత్వాన్ని మరింత పదునుగా రాస్తున్నారు. ఎందుకంటే కవిత్వపు ఆత్మను వారు అందుకున్నారు. ఎలా ఉంటే కవిత్వం అవుతుందో అనే విషయాన్ని  తెలుసుకుని ప్రముఖ, వర్థమాన కవులతో పాటు ఇపుడిపుడే కలం అందుకున్న  యువ కవులను కూడా ప్రోత్సహిస్తున్నారు. మంచి కవిత్వమైతే వారికి సముచితమైన స్థానాన్ని అందజేస్తున్నారు.నేడు వస్తున్న కవిత్వం పోకడలు చాలా వరకు ఆశాజనకంగానే ఉన్నా చాలా వరకు నాలుగు గోడలు దాటడంలేదు. లేదా సమాజపు నాలుగు గోడలు అధిగమించడంలేదు. కానీ యువత నేడు ఆకాశమే హద్దుగా ప్రతి విషయాన్ని కూలంకుషంగా తెలుసుకుని మరీ రాస్తున్నారు. ఏ సంఘటన ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? ఎలా జరిగింది అనే అంచనాలను దృష్టిలో పెట్టుకుని మరీ రచించడం మూలంగా ఎన్నో వాస్తవ విషయాలను అలవోకగా అర్థం చేసుకునే అవకాశం వస్తోంది. అనుభూతి కవిత్వం, భావకవిత్వంతో పాటు సమాజంలో ఇపుడిపుడే జరుగుతున్న విషాదాలనే కాకుండా విషాదానికి మూలాలను కూడా తెలపడం అత్యాధునిక కవిత్వం లక్షణంగా మారింది. సమస్యలు పెరుగుతున్నాయి.  ఆవేదనలు గుండెను తాకుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు, అమానవీయ అంశాలు అనేకం జరుగుతున్నాయి. అయితే వాటికి సరైన స్పందన లభిస్తోందా? అంటే వస్తోంది కానీ ఎలా? పేపరు ప్రకటనల్లా, అరుపుల్లా, కేకల్లా వస్తున్నాయి. సందర్భానుసారం ప్రచురించాలనే దృక్పథంతో ఆయా పత్రికలు ప్రచురిస్తున్నాయి. ప్రచురించేరు కాబట్టి అది కవిత్వం అని కవులు అదే ధోరణిని అవలంబిస్తూ తాను ఒక కవిగా మొదలై తానూ ఒక కవిగా తయారై చివరికి తానుమాత్రమే కవిగా చెలామణి అవ్వడం జరుగుతోంది.

మరి ఆ విషయాలను ఎవరు ఎవరికి చెబుతారు? ఎవరికి చెప్పితే అర్థం చేసుకుంటారు? మీ కవిత్వంలోకాస్త కవిత్వం కనిపించనీయండి అంటే ఎవరు ఒప్పుకుంటారు? పక్కకు తప్పుకుంటారు తప్ప నిజమేదో గుర్తించి వారి తప్పుల్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయరు. ఇలాంటివి ఎన్ని చూసారో ఏమో యాకూబ్‌గారు తదితర కొందరు కవులు ఒకచోట చేరి కవి సంగమం అనే పేరుతో ఫేస్‌బుక్‌ గ్రూప్‌ ప్రారంభించేరు. ప్రారంబించిన సమయం ఏమిటో కానీ పుంఖాను పుంఖాలు కవిత్వం వచ్చి పడ్డాయి. ఎన్ని గ్రూపులున్నా దీనికే ఇంతటి ప్రాధాన్యత ఎందుకు కలిగింది? అంటే ఇక్కడ కవిత్వం కావాలంటున్నారు. కవిత్వంలో ఏమాత్రం లోపం ఉన్నా స్పందన ఉండటం లేదు. అంటే ఈ కవిత్వంలో కవిత్వం లేదన్నమాట అనే అవగాహనకు వచ్చి వారికి వారే సరిచేసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే ఇంతయిన తర్వాత ఇపుడు ఇందులో కవిత్వం ఎలా ఉంది? అనే విషయానికి వద్దాం!  కవిత్వం సమస్తం/ మొహర్రం రంజాన్‌ బక్రీద్‌” అంటారు  బారహమతుల్లా.్ల అంటే కవిత్వమనేది ఒక పండుగ. కవిత్వం మనల్ని అనుసరించే ఒక శుభమని చెప్పారు.

”మూరెడు మల్లెలూ/ మూడక్షరాలూ/ చెప్పి కథలన్నింటినీ కవిత్వీకరించుకుంటాను/ ఎంతో నిశ్శబ్దాన్ని మౌనంగా మోసే/ ఈ అక్షరాలే నా చిల్లర  దేవుళ్ళు” అని మౌనానికి మల్లెలకు మధ్య అక్షరాన్ని అందంగా అలంకరించిన శ్రీనివాస్‌వాసుదేవ్‌ గారి రచన నుండి ప్రారంభమైంది. కథకే కాదు కవిత్వానికి కూడా ప్రారంభం ఎంతో అవసరం. అదెలా అనుకుంటుంటే ఇక్కడ గమనించండి ” వెళ్లిపోతూ వెళ్ళిపోతూ మలుపు దగ్గర కాస్సేపు నిలబడి చూడు/రాయాలనుకున్నదేదో నీ చూపు చివర కదిలిపోతుంది” అంటున్న ఈ వాక్యాలు ఎంత సున్నితంగా ఉన్నాయో అంత సౌందర్యాన్ని ఒలకపోస్తున్నాయి. కవిత్వానికి బంధాలు, ప్రతిబంధకాలు అవసరంలేదు అన్నట్లు శీర్షికలోనే ”రాయలేనిదేదో” అనే సంశయాన్ని జతచేసి చివరిలో ”వెళ్ళిపోతూ మలుపు దగ్గర కాసేపు నిలబడి చూడు/ రాయలేనిదేదో ఒకటి దగ్డమయింది. రెప్పల తెల్లనవ్వు కింద” తెల్లని నవ్వు అంటే కంటి భాషను ఎంత చక్కగా మలిచారో కదా అనిపిస్తుంది ఈ కవి ఎవరో కాదు. కవిత్వాన్ని కవిత్వంలానే తీర్చిదిద్దే మన కవి ” అఫ్సర్‌ ”

కవిత్వానికి చిరునామా ఒక నవ్వు. ఒక నువ్వు అంతేనా అంటే కాదు. మనిషి నవ్వాలనంటే ఒక స్వచ్ఛమయిన నువ్వుండాలి. ఆ నువ్వు నా నువ్వు కావాలంటే నా నుండి స్వచ్ఛమయిన నవ్వు ఉండాలి. అనుకుంటాం ఒక నవ్వు ఒక నువ్వే కాదాని. కానీ ఈ రెంటి మధ్య ఎంతటి భావం ఉంటుందో గమనించండి ”యాకూబ్‌ గారి కవిత్వం చూడండి ” పూలతోటలోంచి పువ్వు కళ్ళు విప్పార్చి నవ్వుతున్నట్లు ఆమె నవ్వుతుంది/ గలగలపారే సెలయేటి మధ్య సుడులు తిరుగుతున్న నీళ్ళలా ఆమె నవ్వుతుంది/ మిట్టమధ్యాహ్నం నీడల్లోకి ప్రయాణం కట్టిన తెల్లటి మేఘంలా ఆమె నవ్వుతుంది/ నవ్వుకు నవ్వుల నడకలు నేర్పుతూ అలసినట్లు అపుడపుడూ కునుకు కూడా తీస్తుంది/ దాగిన దృశ్యాలకు, దాగని అర్ధాలకు నడుమ చేతనంలా కదులుతున్న భావాలేవో తచ్చాడుతుంటాయి” నవ్వు అయినా, నువ్వు అయినా రెండూ భావావేశాల చిత్రాలే! వాటికి అమరత్వం చిందించాలంటే ఒక కవిత్వంలాంటిది కావాలని అనుకోలేదు. ఏకంగా కవిత్వమే కావాలని చెప్పి మనకు అందించేరు. అభినందనలు.

కవిత్వం ఒక జ్ఞాపకాల అల్లిక. కవిత్వం ఒక అనుభవాల మాలిక అయితే కవిత్వం ఇలా ఉంటుందేమో చైతన్యశంకర్‌ కవిత్వాన్ని గమనించండి ” నాన్నిచ్చే డైరీకి / ఏడాది ఎదురుచూపు/ నీ పై నా ప్రేమను /తొలిసారి చెప్పింది ఆ డైరీకే/ చేజిక్కిన నీ తలవెంట్రుక / నా డైరీలో మెరుస్తూనే ఉంది/ డైరీలో పరిమళాలు /వాడిపోని జ్ఞాపకాలని” ఇలా సాగుతున్న వీరి కవిత చదవడానికి హాయిగా ఉంది. ఇదే దోరణిలో సాగిన చాంద్‌ ఉస్మాన్‌ ప్రేమ ఖరీదు కవితలో ” నువ్వు  మా ప్రాణంలా కన్నా/ నీకు నచ్చినదే చదువు/ కష్టాలు కన్నీళ్ళు.. అంత గొప్వవా/ నువ్వు ఎదగాలనే ఆశముందు మేమేది కోల్పోయినా / సంపాదించేది నిన్నేకదా”  అంటూ తల్లి తండ్రులకు బిడ్డలపై ఉన్న ప్రేమను వర్ణించిన తీరు ఎంతో హృద్యంగా ఉంది. నిశీధి అంటుందట నాకెవ్వరితోనూ సంబంధంలేదు. నా పాటికి నేను ఉంటాను. నాకోసం ఎవ్వరూ రారు. కనీసం నావైపు కూడా చూడరు. కానీ నాలోనూ ఎన్నో భయంకరమైన నిజాలుంటాయి. కీచుమని అరిచే కీచురాళ్ళ రొదలో కూడా కన్నీళ్ళుంటాయి. అది అర్థం చేసుకోకుండా అందరూ నన్ను వెలివేస్తారు అందట.  వాస్తవమనే వెలుగు లేకుంటే చీకటనే కనికట్టును మనిషి కనిపెట్టలేడు. చీకటంటే ఒక అవాస్తవం. అందులో ఏమి ఉంటాయో అనే అనుమానం ఉంటుంది. అందుకే నిశీధిలో నడవాలంటే ఒక వాస్తవం తోడుండాలి. ఆ తోడే వెలుగు. అలాగే సరిచేయలేని, మానలేని, అరచి గెలవలేని పాత్రలకు కవిత్వం ఎంతో అవసరం. జనాన్ని మనంగా మార్చుకోవాలంటే కవిత్వం కావాలి. ఆ కవిత్వం పదిమందికీ పంచే వెలుగులా ఉండాలి. అలాంటి వెలుగులు చిమ్మే

బివివి ప్రసాద్‌ గారి వర్దమాన కవికి అనే శీర్షికతో ”కవీ, నీ పాత్రలో కొద్దిపాటి నీరు చేరగానే/ దానినే గలగల లాడించి అది ఒక సెలయేరని భ్రమింపజేయకు/ నీ ముందు, నదుల్ని తాగి ఏమీ ఎరగనట్లు చూస్తున్నవారుంటారు” అంటారు బివివి ప్రసాద్‌గారు. తర్వాత ” నీ దగ్గర ఉన్న శబ్దాలను కొన్ని / కాగితం పేర్చడమే కవిత్వం అనుకున్నంతకాలం / నువ్వ ఒక్క కవితైనా చెప్పలేవు..”ఎంతటి జీవిత సత్యం దాగుంది? కవికి అంతకంటే సందేశం ఏంకావాలి? అనిపించక మానదు. ప్రసాద్‌గారు కవిత్వం ఏమిటో? అసలు కవిత్వ లక్షణాలేమిటో వర్దమానకవికి చెప్పడంలో కవిత్వంలోని వాస్తవాన్ని, కనపరిచే వెలుగును మన ముందుంచేరు. నిర్మొహమాటంగా  ముక్కుసూటిగా రచించే వీ కవిముందు వాస్తవాలన్నీ వర్ణచిత్రాలుగా మనకు కనబడటం విశేషం.

కవిత్వం కవిత్వమయ్యేవేళ మనకు కనిపించేవన్నీ కమనీయ దృశ్యాలే. మండుటెండలు సైతం పండువెన్నెలే. కాల్చే మంచు సైతం గిలిగింతలు పెట్టే పట్టెమంచమే!  దృశ్యాన్ని బట్టి ఏదీ అందగించదు. మనోస్థితిని అనుసరించి ప్రకృతి మనల్ని పలకరిస్తుంది. గుండె మంటతో పకక్షుల అరుపులను ఆలకిస్తే గోలగోలగా అనిపిస్తుంది. అదే సేదదీరే మనసుతో ఆలకిస్తే మనసుకు ఉల్లాసంగా అనిపిస్తుంది అలా హాయిగా సాగిపోయే మెర్సీ మార్గెరెట్‌ కవిత్వం మనం గమనిద్దాం ”అదంతా ఆకుపచ్చ సముద్రం/ ఎన్ని చెట్ల ఆకులు తెంచి సముద్రాన్ని సృష్టించారో/ ఎన్ని మ్రానులు నరికి ఎన్ని మొక్కలు నాటి నిర్మించారో/ ఆ సముద్రపు తీరానికి కొట్టుకొచ్చే అలలు/ సారం పోయి ప్రాణం లేని పండుటాకులు/ వాటిని/ సముద్రం తనలో ఉంచుకోదు/ గాలికి ఎప్పటికప్పుడు పనిచెప్పి/ శుభ్రం చేయిస్తూ ఉంటుంది” అంటూ సాగిపోతుంది. భావాల్ని బరువుగా రాతికి కట్టి వేల్లాడదీయడం కాదు కవిత్వమంటే అనే కవిత్వాలు ఇలా సాగిపోతాయి అలాగే మనసు చిత్రాల్ని కాచి వడబోసే కవిత్వం మన శ్రీకాంత కాంటేకర్‌ గారి కవిత్వం ”ఇపుడు కన్నీళ్లలో ఉప్పదనం తగ్గిపోయింది/ ప్రేమలో చిక్కదనం తగ్గిపోయింది/బంధాలలో గట్టిదనం తగ్గిపోయింది/వ్యవస్థలో గొప్పదనం తగ్గిపోయింది/ చివరాఖరుకు మానవత్వానికి విలువ  తగ్గిపోయింది ” అని నేటి జీవనగతులను  అర్థమయ్యేరీతిలో తెలియజేసారు.

కవిత్వంలో కేవలం కవిత్వాన్ని మాత్రమే ఎంచుకుని ఆస్వాదించే కవి మన రాళ్ళబండి కవితాప్రసాద్‌ గారు. నిరంతరం కవిత్వంతో మమైకమై కవిత్వానికి విత్తనాన్ని బీజాన్ని సూర్యతేజంతో కలిపి మన ముందుంచేది వీరే. అందుకేనేమో వీరంటారు శబ్ధం ఇపుడు నిద్రిస్తోందని.. కవిత్వం ఒక శబ్ధమని వీరి భావన. నిద్రిస్తున్నా సరే శబ్ధిస్తుంటాడు కవి అనేదే వీరి కవితలోని ఆంతర్యం. బావుంది. ”అతడొక అక్షరాగ్ని పర్వతం/ అతని జీవితం ఒక అపరిచిత స్వప్నం/ అవిచ్ఛిన్నంగా కురిసే కాల వర్షంలో తడిసిపోతున్న ఆత్మ/ హఠాత్తుగా వేసుకున్న గొడుగులా ఉంది వాడి శరీరం/ అందుకే లోపల తడిగా/ బయట పొడిగా బతుకు పంజరం! / నిశ్శబ్దాన్ని శబ్ధంతో చీల్చే ఆయుధం వాడి పాట” ఇలా వెళుతున్న వీరి కవిత్వంలో చిక్కదనంతో పాటు చక్కదనం కూడా ప్రయాణిస్తూనే కవిలోని కవిత్వాన్ని, కవిత్వంలోని కవి తత్వాన్ని , రెండింటి మధ్య భావచిత్రాన్ని తెలిపిన తీరు హర్షణీయం.

ఈ సంకలనంలో అనేకమంది సుప్రసిద్ద కవులున్నారు. వారి కలంనుండి వెలువడ్డ ఒక్కో కవిత్వం గురించి ఒక్కో పేజీ రాసినా సరిపోదు అనిపిస్తుంది. కాలమనేది కనికట్టుకాదు. కాలం కవి సొత్తు. కాలానికి కవిత్వానికి ఎంతో సామీప్యత ఉంది. ఎందుకంటే కవిత్వం రాస్తుంటే కాలం తెలియదు. కాలం కవిత్వానికి ఒక ఆయువు పట్టుగా ఎంచుకుంటే మరో అద్బుతమైన కవిత్వాలు మీ ముందు ఉంచుతాను. ” నేను శబ్ధ వనాల మంచు సంచారానికి తీసుకుపోతానా/అతను/ ఆమె ముళ్ళ వంకాయల గురించి మురిసిపోతుంటుంది/టాడు/ నేను సృజించిన రంగమాయల నగలు చెబుతుంటాను/అతడామె ఎనగర్రబూజు దులపడానికి కాసె పోస్తుంటుంది” అంటుంటే మరో కోణమయినా ఇదే తీరులో సాగిన కవిత రేణుకా అయోలా గారిది ” జ్ఞాపకం మజిలీలు తెరలు తెరలుగా కమ్ముకుంటున్నాయి/ జాకెట్టు వేసుకోవడం కోసం అమ్మమ్మ అమ్మ పోరాటం/తలమీద గుప్పెడు వెంట్రుకలకోసం తన్నులు తిని మంగలివాడిని తరిమి కొట్టిన గాయంఆ మూడురోజులు మూల గదిలో ముగ్గిపోతూ చీకటి రాత్రుళ్ళలో ఒంటిమీద పాకిన గొంగళీలు ” ఇలా తన అభివ్యక్తీకరణలో ఎక్కడా రాజీ పడని తత్వం మనకు గోచరిస్తుంది.

ఇంకా ఈ సంకలనంలో కొన్ని కవితలు మినహా దాదాపుగా అన్నీ అరుదైన, అద్భుతమైన. మళ్ళీ మళ్లీ చదవాలనిపించే కవితలే ఉన్నాయి వాటిలో కటుకోఝ్వుల ఆనందాచారి చెరగని సంతకం, బెడిదె నరేందర్‌ రాళ్ళు, డాక్టర్‌ డి.కామేశ్వరరావుగారి జీవితం జ్ఞాపకం కాదు, దాసరాజు శ్రీనివాస్‌ పిచ్చిలోకం, రావిరంగారావుగారి ఎటియం కార్డు, స్వాతి శ్రీపాద శబ్ధ చిత్రాలు, దాలినాయుడు  ఎదేమయినాయి , సాయి పద్మ అపరిచితా , వేంపల్లి గంగాధర్ ఈ రాత్రి నక్షత్రపులా చెట్టు కింద , జగద్ధాత్రి నూత్న సనాతనం , జయశ్రీ నాయుడు నేనే నా నౌక , జుగాష్ విలీ ఎవరి నిర్వచనాలు వారివి , కాశీరాజు తాటాకిల్లు , మామిడి హరికృష్ణ  కొత్త సాలు ముచ్చట , కిరణ్ గాలి యాంద్రాయిస్ , జ్వలిత కురుసభ నాటి గొంగళి , యశస్వి సతీష్ బొమ్మరాళ్ళు , కట్టా శ్రీనివాస్ గుచ్చుకునే చూపులు ,జ్యోతిర్మయి మళ్ళ మొదటి వర్షం , జాన్ హెడ్  ఒక పక్కటెముక కొన్ని ఆలోచనలు , శీలాలోలిత గారి చలన సూత్రాలు , సిరికి స్వామీ నాయుడి గారి అసలే నేనంటే అమ్మకు ప్రాణం , శోభారాజు నీ జీవితపు శిల్పి, ” ఇలా ప్రతి కవితా పేరు పేరునా విశదీకరించ దగినవే . అందరికీ అభినందనలు .  మరిన్ని మంచి కవితలతో ఇలాగే ప్రతి సంవత్సరం ఇంకా చిక్కనైన , చక్కనైన మనల్ని అలరించాలని కోరుకుంటూ ఈ ప్రయత్నానికి వారదులైన కవి యాకూబ్ గారికి , తదితర కార్య వర్గానికి అభినందనలు మరియు కృతజ్ఞతలు

Print Friendly

నిత్య జీవితంలో హాస్యం

     రచన: “ అష్టావధాని “

 డా. మాడుగుల అనిల్ కుమార్ 

తిరుపతి

       ఎవరో ఒక సినిమా పాటల రచయిత వ్రాసిన  పాట గుర్తుకు వచ్చింది ‘ సిరిమల్లె పూవల్లె నవ్వు , చిన్నారి పాపల్లె నవ్వ్వు , నవ్వు నవ్వు నవ్వు ….. ‘ అంటూ. పాట చాలా బాగుంది . అయితే నవ్వును గురించి ఒక వ్యాసం వ్రాస్తే బాగుంటుంది అనుకున్నాను. వెంటనే నా నోటి నుండి –

కం. నవ్వనివాడజ్ఞుండగు

నవ్వని సదసద్వివేక నాణ్యత తగ్గున్

నవ్వగ వలయును మనుజులు

నవ్విన రోగంబులెల్ల నయమగు తండ్రీ !

అంటూ పోతన రచించిన చదవని వాడజ్ఞుండగు అనే పద్యానికి అనుకరణ పద్యం ( పేరడీ ) ఆశువుగా వెలువడింది. ఆ వెంటనే –

ఉ.  నవ్వును జంతువుల్ నరుడు నవ్వును నవ్వులు చిత్తవృత్తికిన్

దివ్వెలు కొన్ని నవ్వులెటు తేలవు కొన్ని విష ప్రయుక్తముల్

పువ్వుల వోలె ప్రేమరసమున్ వెలిగ్రక్కు విశుద్ధమైన లే

నవ్వులు సర్వదుఃఖ దమనంబులు వ్యాధులకున్ మహౌషధుల్  ll

అంటూ మహాకవి గుఱ్ఱం జాషువా చెప్పిన పద్యం గుర్తుకు వచ్చింది. మనుషుల లాగానే జంతువులు కూడ నవ్వుతాయి. మనిషి మనఃప్రవృత్తికి అద్దం పట్టే దీపం నవ్వు. పువ్వుల లాగ వికసించి ప్రేమామృతాన్ని పంచేవి పరిశుద్ధమైన నవ్వులు. నవ్వులు దుఃఖాలను , రోగాలను కూడ దూరం చేసే మహౌషధం వంటివి.

నవ్వితే రోగాలన్నీ మటుమాయమౌతాయంటున్నారు శాస్త్రజ్ఞులు . అందుకే దేశ విదేశాల్లో లాఫింగ్ క్లబ్బులు , లాఫింగ్ థెరపీ లు పుట్టుకొచ్చాయి. మన పెద్దలు కూడ ఓ కాలం నాడే  ‘ నవ్వుతూ బతకాలిరా ‘ అన్నారందుకే. జగదీశ్ చంద్రబోస్ అనే మన శాస్త్రజ్ఞుడైతే చెట్లకు కూడ భయము , క్రోధము , దుఃఖము , ఆనందము మొదలైన భావోద్వేగాలున్నాయని , చెట్లు కూడ నవ్వుతాయని కనుగొన్నాడు. ‘ నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి ‘ అని మరో సినీ కవి అన్నాడు. ఇలా కన్నీళ్లు వచ్చేలా నవ్వడం కానీ  ఏడ్చడం కాని చేస్తే మానసిక వత్తిడి మాయమౌతుంది. ఐతే ఎవరూ కూర్చొని ఏడ్చాలనుకోరు. కావున నవ్వే అన్నింటికన్నా శ్రేష్ఠమైనది.

కొందరు ఛాదస్తులు నవ్వాటాన్ని న్యూనత్వంగా భావిస్తుంటారు. అది తప్పు.  నవ్వు అందరికీ అవసరమైనది. అందుకే ఒక ప్రాచీన కవి –

ఉ. వాసన లేని పువ్వు , బుధవర్గము లేని పురంబు , నిత్య వి

శ్వాసము లేని భార్య , గుణవంతుడుగాని కుమారుడున్ , సద

భ్యాసము లేని విద్య , పరిహాస ప్రసంగము లేని వాక్యముల్

గ్రాసము లేని కొల్వు , కొఱ గానివి పెమ్మయ సింగధీమణీ !

సుందరంగా వున్నా సువాసన లేని పువ్వు , అన్ని సౌకర్యాలు వుండీ మంచి బుద్ధులు చెప్పే పండితులు లేని పట్టణము , అందంగా ఉన్నప్పటికీ భక్తి , విశ్వాసాలు లేని భార్య , ఎంత గొప్పవాడైనా సద్గుణాలు లేని కొడుకు , ఎంత ఎక్కువ చదివినా మంచి ప్రవర్తన నేర్పని చదువు , ఎంత ఎక్కువ సమయం మాట్లాడినా కొంచెమైనా నవ్వించే గుణం లేని మాటలు , ఎంత సేవ చేసినా కూడు పెట్టని సేవ అనే ఇవన్నీ ప్రయోజనం లేనివి అన్నాడు.

“ శృంగార హాస్య కరుణ రౌద్ర వీర భయానకాః  l

బీభత్సాద్భుత శాంతాశ్చ కావ్యే నవరసాః స్మృతాః  ll “

శృంగారము , హాస్యము , కరుణ , రౌద్రము , వీరము , భయానకము , బీభత్సము , అద్భుతము , శాంతము అని శ్రవ్య కావ్యాలలో నవ రసాలు వున్నాయని భరతముని నాట్య శాస్త్రం లో తెలియజేశాడు.

“ రతిర్హాసశ్చ శోకశ్చ క్రోధోత్సహౌ భయం తథా  l

జుగుప్సా విస్మయశమాః స్థాయీభావాః ప్రకీర్తితాః  ll “

రతి , హాసము , శోకము , క్రోధము , ఉత్సాహము , భయము , జుగుప్స , విస్మయము , శమము  అని క్రమంగా  ఈ నవరసాలకు స్థాయి భావాలను కూడ తెలియజేశాడు. హాస్య రసానికి హాసము స్థాయి భావము. స్థాయి భావము అంటే మనుషుల హృదయాలలో స్థిరంగా ఉండేది. అది ఆయా సన్నివేశాలను చూసినప్పుడు బయటకు వెలువడుతుంది. చక్కెర తిన్నప్పుడు తీయగాను , పులుపు తిన్నప్పుడు పుల్లగాను ఎట్లనిపిస్తుందో అట్లే రసానుగుణంగా స్పందన ఉంటుంది. అదే స్థాయి భావము.

హాస్యం ఒక కళ.

“ వికృతాకృతి వాగ్వేషైరాత్మనోs థ పరస్య వా  l

హాసః స్యాత్ పరిపోషో s స్య హాస్యస్త్రి ప్రకృతిః స్మృతః  ll “

ధనంజయుని దశరూపకము.4.75

తమ వికృత వేష , భాషాదుల వలన కాని ; ఇతరుల ఆకార వేష , భాషాదుల వలన కాని కలిగెడు స్థాయి భావమే హాసము.

“ స్మితమిహ వికాసినయనం , కించిల్లక్ష్యద్విజం తు హసితం స్యాత్ l

మధురస్వరం విహసితం , సశిరఃకంపమిదముపహసితమ్   ll

అపహసితం సాస్రాక్షం , విక్షిప్తాంగం భవత్యతిహసితమ్  l

ద్వే ద్వే హసితేచైషా జ్యేష్ఠే మధ్యే s ధమే క్రమశః  ll “

ధనంజయుని దశారూపకము.4.76 , 77

పై శ్లోకాల వలన  1.స్మితము  2.హసితము  3.విహసితము  4.అవహసితము 5.అపహసితము 6.అతిహసితము అని నవ్వు ఆరు విధాలుగా వుందని తెలుస్తున్నది.

1.స్మితము :- దంతములు కానరాకుండా కన్నులను , చెక్కిళ్ళను వికసింపజేసి నవ్వుట.

2. హసితము :- కొద్దిగా దంతములు కనబడునట్లు నవ్వుట.

3.విహసితము :- కంఠగతముగా మధురధ్వని చేస్తూ ఓరకంట చూస్తూ నవ్వుట.

4.అవహసితము :-భుజాలు ఎగురవేస్తూ , తలను వంచి ముక్కుపుటాలు పెద్దగా చేసి నవ్వుట.

5.అపహసితము :- తగిన కారణం లేకుండానే అవయవాలు అదరునట్లు , కన్నీరు కారునట్లు నవ్వుట.

6. అతిహసితము :- చేతులలో డొక్కలు పెట్టుకొని , కన్నీరు కారుస్తూ గట్టిగా నవ్వుట.

హాస్యం అంటే నవ్వు పుట్టించేది ఏదైనా కావచ్చు. హాస్య రస సన్నివేశాలను చూడటం , హాస్యరసంతో కూడిన పుస్తకాలను చదవటంతో మానసిక వత్తిడిని దూరం చేసుకోవచ్చు. మన దేశ మాజీప్రధాని  కీ.శే. శ్రీ పి.వి.నరసింహారావు గారు కూడ మానసిక వత్తిడిలో వున్నప్పుడు తాను హాస్యనట నాయకుడు రాజేంద్ర ప్రసాద్ చిత్రాల విడియోలను చూస్తానని ఒక సభలో వెల్లడించారు.

ఇక హాస్య రసాన్ని పులిమే మొక్కపాటి లక్ష్మీనరసింహశాస్త్రి గారి ‘ బారిష్టర్ పార్వతీశం ‘  నవల చదివి నవ్వని వాడు ఎవడైనా ఉన్నాడంటే మనం వాడి వైపు విచిత్రంగా చూడవలసిందే. మొక్కపాటి లక్ష్మీనరసింహశాస్త్రి గారు ‘ బారిష్టర్ పార్వతీశం ’  నవలలోఅమాయకత్వం , గడుసుతనంతో కూడిన పార్వతీశం పాత్రను ఆద్యంతం హాస్యరసంతో చిత్రీకరించారు. తెలుగు హాస్య రచనకు ఉపక్రమించిన ‘ హాస్యకిరీటి ‘ మునిమాణిక్యం నరసింహారావుగారు ‘ మన హాస్యం ‘ అన్న పేరుతొ ఆరు ప్రకరణాల గ్రంథాన్ని రచించారు. వీరు రచించిన ‘ కాంతం కథలు ‘ ఆయన ప్రత్యేకతను తెలియజేస్తుంది.  పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు ‘ సాక్షి ‘ అన్న పేరుతో వ్యాస సంపుటిని కూర్చారు. వీరు రచించిన ఈ వ్యాసాలు గ్రాంథిక భాషలో వుండి అర్థం చేసుకొనుటకు కష్టమైనప్పటికీ అర్థం చేసుకున్న వారిని కడుపుబ్బ నవ్విస్తాయి. శ్రీ పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారికి వృద్ధాప్యం వల్ల మతిమరుపు వచ్చింది. ఆ సమయం లో కూడ వారి గొప్పతనం తెలిసిన ఒక సంఘం వారు వారికి  సన్మాన సభ  ఏర్పాటు  చేశారు. సన్మాన సభలో అధ్యక్షులు మాట్లాడుతూ పానుగంటి వారికి ఈ బహుమతులు అందజేస్తున్నాము అని అన్నారట. వెంటనే పానుగంటి వారు కల్పించుకుని ఉన్న ఒక్క మతి పోయి నేనేడుస్తుంటే వీరిచ్చే బహుమతులేల ? అని చమత్కరించారట. అప్పుడా సభంలోని వారంతా గొల్లున నవ్వారట. తెలుగు భాషలో ఎన్ని నవలలు ఉన్నప్పటికీ ‘ బారిష్టర్ పార్వతీశం ‘ ను  మించిన హాస్య నవల మరొకటి లేదని తెలియజేస్తూ –

కం. క్షితిలో బారిష్టరు పా

ర్వతీశమును చెప్పి పిదప పలుకవలె గదా

కితకితల కితరులను , భా

సిత సిత సుశ్లోకుడతడు సిరిసిరిమువ్వా  ll

అన్నాడు మహాకవి శ్రీశ్రీ.

మన పూర్వ కవుల కావ్యాలలో హాస్యరసం లేదనడానికి వీలు లేదు. వారు ధ్వని వ్యంగ్య రూపంగా , శబ్దవైచిత్రితో సందర్భశుద్ధిగా హాస్యాన్ని పండించి పండిత పాఠకుల మెప్పువడసినారు. ప్రాచీన నాటకాలలో విదూషకుని పాత్ర చాల ప్రధానమైనది. విదూషకుడు లేకపోతే నాటకమే లేదు. నాటకంలో నాయకుని వెంట విదూషకుడు తప్పకుండా వుండవలసినదే. “ హాస్యప్రాయో విదూషకః “ అని విదూషకుని లక్షణం. విదూషకునికి నాయకునితో ఎక్కువ చనువు వుంటుంది. అతడు రాజును ఒక్కొక్కసారి వేళాకోళం చేస్తాడు. ఒక్కొక్కసారి రాజు చేత తిట్లు తింటాడు. అప్పుడప్పుడు మంచి సలహాలు ఇస్తూ ఉంటాడు. ప్రధాన మంత్రి తరువాత స్థానం విదూషకునిదే. ఈ పరంపరనే ప్రస్తుతం మనం వెండితెర పై కూడ చూస్తున్నది.  వెండితెర విదూషకులంటే రాజబాబు , రేలంగి , పద్మనాభం , రమణారెడ్డి , మాడ, నగేష్ లను మొదలుకొని నేటికాలం హాస్యనటులు బ్రహ్మానందం , గుండు హనుమంతరావు మొదలైన వారి వఱకు. వీరు లేనిదే చిత్రాలు విజయవంతం కావు.

ప్రాచీన సంస్కృతాంధ్ర సాహిత్యం లో హాస్యాన్ని పండించే పద్యాలు లెక్కకు మిక్కిలిగా వున్నాయి.

ఒకసారి భోజ కాళిదాసుల మధ్య మనః స్పర్ధ వచ్చింది. తనను అవమానించిన భోజుడు మరల ఆహ్వానించే వఱకు రాజ్యంలో ఉండకూడదని ధారానగరాన్ని వదలి వెళ్ళిపోతాడు కాళిదాసు. కాళిదాసు లేకుండా కాలం గడపలేని భోజుడు ఆయనను వెదకడానికి గూఢచారులను పంపి పొరుగుదేశంలో సన్యాసి వేషంతో తిరుగుతున్నాడని తెలుసుకుంటాడు. మరుసటి రోజే భోజుడు మారువేషంతో కాళిదాసును వెదకడానికి పొరుగురాజ్యం వెళ్ళాడు. అక్కడ ఒక సన్యాసి భోజునికి కనిపించాడు. ఆయన కాళిదాసు లాగే వున్నాడు. అందువల్ల భోజుడు ఆయనను అనుసరించాడు.  ఇది గమనించిన మారువేషం లో వున్న కాళిదాసు భోజుని ఆట పట్టించాలనుకుని ఒక మాంసపు కొట్టులోనికి వెళ్లి మాంసాన్ని బేరం చేయసాగాడు. భోజుడు ఆశ్చర్యపోయి ఆ సన్యాసితో సంభాషించాడు. ఆ సంభాషణ ఒక శ్లోక రూపంగా మారింది –

శ్లో .  భిక్షో ! మాంస నిషేవణం కిముచితమ్ ? కిం తేన మద్యం వినా

మద్యంచాపి తవ ప్రియం ? ప్రియమిదం వారాంగనాభిస్సహ   l

వారస్త్రీ రతయే కుతస్తవ ధనం ? చౌర్యేణ ద్యూతేన వా !

చౌర్య ద్యూత పరిశ్రమోsస్తి  భవతః ? భ్రష్టస్య కా వా గతిః    ll

భోజుడు : అయ్యా ! నీకు మాసం తినడం ఇష్టమా ?

కాళిదాసు : మద్యం లేకుండా మాంసంతో లాభమేమిటి ?

భోజుడు: మద్యపానం కూడ నీకిష్టమా ?

కాళిదాసు: వేశ్యాస్త్రీలతో కూడ మద్యపానం నాకిష్టం .

భోజుడు: వేశ్యలతో పొందుకు నీకు డబ్బెలా లభిస్తున్నది ?

కాళిదాసు: దొంగతనం చేసి లేదా జూదమాడి సంపాదిస్తాను.

భోజుడు: నీకు చౌర్యంలోను , జూదం లోను కూడా ప్రవేశమున్నదా ?

కాళిదాసు: భ్రష్టుడైన వానికి ఇంతకన్నా వేరే వుపాయమేమున్నది.

ఇక్కడ భ్రష్టుడు అంటే దిగజారిపోయినవాడు అనే అర్థం వస్తుంది. నేను నీ రాజ్య భ్రష్టుడినైనాను. నేను ఎట్లా పోతే నీకెందుకు? అనే ధ్వని కూడ వుంది. ఈ సంభాషణలో కాళిదాసు చాతుర్యాన్ని పసిగట్టి యితడు పూర్తిగా కాళిదాసే అన్న నమ్మకానికి వచ్చాడు భోజుడు. వెంటనే కాళిదాసుకు క్షమాపణ చెప్పి ఆయనను బ్రతిమాలి మరల ధారానగారనికి పిలుచుకుపోయాడు భోజుడు.

మరొక హాస్య సంభాషణ ఎలా వుంటుందో చూస్తాము –

ఇద్దరు యువతులు చాల రోజుల తర్వాత కలుసుకొని తమ భర్తల గొప్పతనాన్ని గుఱించి చెప్పుకుంటున్నారు. అదీ ఒక శ్లోక రూప సంభాషణమే.

శ్లో . చతురస్సఖి మే భర్తా స యల్లిఖతి తత్ పరో న వాచయతి  l

తస్మాదపి చతురో మే స్వయమపి లిఖితం స్వయం న జానాతి  ll

అందులో మొదటి యువతి : ఓ సఖీ ! నా భర్త చాల నేర్పరి. అతడు ఏమి వ్రాసినా దానిని మరొకడు చదవలేడు.

రెండవ యువతి : సఖీ ! ఇంత మాత్రమేనా . నా భర్త అంతకంటే చాలా నేర్పరి , ఆయన తాను వ్రాసినది తానే చదవలేడు.

ఇది ఎంత చమత్కార జనకమైన సంభాషణో చాశారా ? మఱొకటి -

ఒకానొక పండితుడు ఒక గ్రామాధికారి దగ్గరకు వెళ్లి తనకు ఏదైనా  ఉద్యోగం ఇవ్వమని అడిగాడు. అందుకా గ్రామాధికారి పండితుని కసురుకొని పంపివేశాడు. ఐతే ఆ పండితుడు రాజధానికి వెళ్లి ఏదో విధంగా కష్టపడి రాజదర్శనం చేసుకుని తన ప్రతిభ చూపి రాజాస్థానంలో ఉద్యోగం సంపాదించాడు.

ఒకరోజు రాజుకు వసూలైన  కప్పం కట్టడానికి వెళ్ళిన గ్రామాధికారికి పండితుడు ఎదురుపడ్డాడు. అప్పుడా గ్రామాధికారి ‘ నీవు ఇక్కడ కూడ వచ్చావా ? ‘ అని ప్రశ్నించాడు.  అప్పుడా పండితుడు –

కం. పెక్కావులిచ్చుచుండగ

బక్కావొకటివ్వకున్న పాడికి కొదవా ?

పెక్కుదొరలివ్వగానొక

కుక్కలకొడుకివ్వకున్న కూటికి కొదవా ?

అని పద్యం చెప్పాడు. ఈ పద్యం లో పండితుని చమత్కారమే కాదు ఆత్మవిశ్వాసం కూడ తొణికిసలాడుతోంది. ‘ నారు పోసిన వాడు నీరు పోస్తాడు ‘ అని నానుడి. తెలివి వున్నప్పటికీ బ్రతుకు దెరువు దొరకలేదని  బాధపడే వారికి ఈ పద్యం నిండైన ఆత్మవిశ్వాసాన్ని కలుగజేస్తుంది. అంతే కాక ఇందులో సున్నితమైన హాస్యం కూడ మిళితమై వుంది. ఇక తెనాలి రామకృష్ణుని హాస్య పద్యాలకు కొదవే లేదు. హాస్యానికి తెనాలి రామలింగని పేరు చెప్పడం పునరుక్తే అవుతుంది.

తెలుగు భాషలో జోకులకు కొదవలేదు.

ఒక విద్యాశాఖాధికారి ఒక పాఠశాలకు పర్యవేక్షణకు వెళ్ళాడు. ఒక తరగతిలోని విద్యార్థులను “ మన జాతీయ పక్షి ఏది ? “ అని ప్రశ్నిస్తూ ఒకరైన తర్వాత ఒకరిని చెప్పనివారిని నిలబెట్టుతూ వెళ్ళాడు. చివరి వరుసలో ఒక విద్యార్థి నిద్రపోతూవుండటం గమనించిన అధ్యాపకుడు త్వరగా వెళ్లి ఆ విద్యార్థి జుట్టు పట్టుకొని గట్టిగా లాగాడు. ఆ విద్యార్థి నొప్పి తాళలేక పీకాకు పీకాకు ( నెమలి ) అని గట్టిగా అరిచాడు. ఇక్కడ పీకాకు అంటే జుట్టు పీకవద్దు అనే అర్థానికి బదులు నెమలి అనే అర్థం కూడ సందర్భోచితంగా వచ్చింది. చివరి వరుసలో నుండి ఈ మాట వినపడి  విద్యాశాఖాదికారికి చాలా సంతోషమైంది. ఆ బాలుని పిలచి అభినందించాడు.

మరొక చోట విద్యాశాఖాధికారి పర్యవేక్షణకు వెళ్ళాడు. తరగతిలో విద్యార్థులను

“ దశరథుని చిన్న భార్య పేరు ఏమి ? “ అని ప్రశ్నించాడు. ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఒక్కొక్కరిని నిలబెడుతూ పోతున్నాడు. ఇది వరకు లాగానే చివరి వరుసలో ఒక ముస్లిం విద్యార్థి నిద్ర పోతున్నాడు. అధ్యాపకుడు అది గమనించి అతని దగ్గరికి వెళ్లి గట్టిగా తట్టి లేపాడు. ఆ ముస్లిం విద్యార్థి ఉలిక్కిపడి లేచి నిద్రలోనే “ కైకా “ అని గట్టిగ అరిచాడు. కైకా అంటే ఎందుకు నన్ను తట్టి లేపావు అని , దశరథుని చిన్నభార్య పేరు కైకా అని  రెండర్థాలు వస్తుంది. వెంటనే విద్యాశాఖాధికారి అతనిని అభినందించాడు. ఇక్కడ కూడ సందర్భోచితమైన హాస్యం ఉట్టిపడింది.

ఇలా హాస్యం మానవ ప్రాణికి జీవనౌషధం. తాను నవ్వుతూ , ఇతరులను నవ్విస్తూ వుండటం ఒక కళ. అది అందరికీ అంత సులభ సాధ్యమైనది కాదు. ఏడుస్తూ పుట్టిన మానవుడు చనిపోయే వఱకు నవ్వుతూ , నవ్విస్తూ బ్రతకాలి. అదే జీవిత పరమావధి.

 

జై హింద్

 

Print Friendly

నల్లమోతు శ్రీధర్ చానెల్: ఆన్లైన్ డిస్కౌంట్లని ఉపయోగించుకోవటం ఎలా?

ప్రస్తుత కాలపు వ్యాపారపు చిట్కాల్లో అతి ముఖ్యమయినది వినియోగదారులకు వ్యాపారులిచ్చే డిస్కౌంటు. కొత్త స్టాకు/ఇన్వెంటరీ కోసమో, ప్రచారం కోసమో లేక త్వరగతిన రెవెన్యూ సాధించటం కోసమో వ్యాపారవేత్తలు తరచుగా తగ్గింపు ధరలు ప్రకటిస్తూ ఉంటారు. వాడికి సంబంధించిన క్యూపోన్లు ఈ మధ్య ఇంటర్నెట్లో కూడా లభ్యమవుతున్నాయి. వాటిని ఎలా పొందవచ్చో తెలిపేదే ఈ వీడియో.

 

 

Print Friendly

శ్రీ శాకంబరి అంతర్జాల అష్టావధానం

చింతా రామకృష్ణ: ఓం శ్రీ గురుభ్యోనమః.

అంతర్జాల అష్టావధాన కార్యక్రమమున పాల్గొనుచున్న అవధానిగారికి, పృచ్ఛకమహాశయులకు, నిర్వాహకులకు, మాలిక పత్రిక ద్వారా ఆశ్వాదించుచున్న మహనీయులందరికీ హృదయ పూర్వకనమస్కారములు.

నా పేరు చింతా రామకృష్ణా రావు. విశ్రాంత ఆంధ్ర ఉపన్యాసకుడను. చిత్ర, బంధ, గర్భ కవితాసక్తి కలవాడను. ” ఆంధ్రామృతము’( http://andhraamrutham.blogspot.com ) అనే బ్లాగును నిర్వహించుచున్నాను.ప్రస్తుతము నేను భాగ్యనగరమున నివసించుచున్నాను.

ఈ కార్యక్రమ నిర్వాహకులు ఈ అంతర్జాల అవధానమున అధ్యక్షునిగా, సంచాలకునిగా మరియు నిషేధాక్షరి పృచ్ఛకునిగా బాధ్యతలు అప్పగించియున్నారు. నా బాధ్యతలను సక్రమముగా నిర్వహించుటలో నాకు మీ అందరి పరిపూర్ణ సహాయ సహకారములు అందించ గలందులకు మనసారా కోరుకొనుచున్నాను.

ఇక మీ అందరి అనుమతితో ఈ కార్యక్రమ నిర్వహణకు శ్రీకారము చుట్టుచున్నాను.

అనిల్ కుమార్ గారూ! మీ పరిచయము చేసుకోండి.

డా.మాడుగుల అనిల్ కుమార్ : సాధారణ నామ సంవత్సర వైశాఖ బహుళ అమావాస్య అనగా 1970 జూన్ 3 వ తేది శ్రీమతి సరోజమ్మ కీ.శే . బ్రహ్మశ్రీ మాడ్గుల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి అను పుణ్యదంపతులకు అనంతపూర్ లో జన్మించాను. తండ్రి గారు వేదపండితులు మరియు పురోహితులుగా ఉండిరి.తల్లి సంస్కృతాంధ్ర భాషలలో పండితురాలు,సంగీత విద్వాంసురాలు. పెద్దనాన్న గారు బహుగ్రంథకర్త వేదమూర్తులు కీ.శే.బ్రహ్మశ్రీమాడ్గుల వేంకటశివశాస్త్రిగారు,అనంతపురం. శ్రీ విద్యారణ్య ప్రాచ్యోన్నత పాఠశాల,అనంతపూర్ లో ఒకటవ తరగతి నుండి 10 వ తరగతి వరకు చదివాను. అనంతపూర్ లోని గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదివాను. 1987 నుండి 1991 వరకు శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో సంస్కృత సాహిత్య శిరోమణి అభ్యసించాను. శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ లో సంస్కృతం లో యం.ఎ చేశాను.కేంద్రీయ విద్యా పీఠం, తిరుపతి లో బి.ఎడ్ చేసి హిందూపురం లో సంస్కృత అధ్యాపకుడుగా కొంత కాలం పనిచేశాను. శ్రీవేంకటేశ్వర వేద విశ్వ విద్యాలయం భూతపూర్వ ఉపకులపతి శ్రీ సన్నిధానం సుదర్శన శర్మగారి పర్యవేక్షణలో 1994 నుండి 2001 వరకు రఘువంశ మహాకావ్యం పై పిహెచ్.డి చేశాను. అవధాన పితామహులు శ్రీ సి.వి.సుబ్బన్నగారి “అవధాన విద్య“ గ్రంథాన్ని చదివి అవధానం చేయడం నేర్చుకున్నాను. అలాగా 1994 నవంబర్ 1న మొదటి అవధానం ప్రారంభించాను. అనేక పత్రికలలో వ్యాసాలు, పద్యాలు ప్రచురితమైనవి.సెమినార్లలో పత్రసమపత్రసమర్పణ చేయటం జరిగినది. ప్రసిద్ధ అవధానుల అవధానాలలో నిషిద్ధాక్షరి , సమస్య అంశాలకు పృచ్ఛకత్వము వహించాను. 1997 నుండి తిరుమల తిరుపతి దేవస్థానం విద్యాసంస్థలలో సంస్కృత అధ్యాపకునిగా చేరి పదోన్నతులతో ప్రస్తుతం శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో అనగా చదివిన కళాశాలలోనే సంస్కృత ఉపన్యాసకునిగా పనిచేస్తున్నాను. ఇంత వరకు 13 అవధానాలు తెలుగులోనూ, ఒక అవధానము సంస్కృత ఆంధ్రములలోను, ఒక అవధానం అంతర్జాలంలోను మొత్తం 15 అవధానాలు చేశాను. సంస్కృతాంధ్ర భాషలలో 13 పుస్తకముల రచన జరిగింది. నా రచనలు :- 1 . శ్రీ వేంకటేశ్వర అక్షరమాలా స్తోత్రము 2. శ్రీ రాఘవేంద్ర అక్షరమాలా స్తోత్రము 3. అమందానంద మందాకిని 4. శ్రీ వేంకట రమణ శతకము 5.అనిల కుమార శతకము 6. భావాంజలి 7.వసంత కుసుమాంజలిః ( సంస్కృతం లో వివిధ దేవతలపై విభిన్న వృత్తాలలో అష్టకాలు నవరత్నాలు ) 8.రఘువంశ మహాకావ్యే సాదృశ్య విన్యాసః (పిహెచ్ .డి పరిశోధన ప్రబంధము )9. భోజ చరిత్ర (సంస్కృత మూలమునకు అనువాదము ) 10. విక్రమార్క చరిత్ర ( సంస్కృత మూలమునకు అనువాదము) 11. వాల్మీకి( సంస్కృత మూలమునకు అనువాదము) 12. శ్రీ రామనామ రామాయణము ( నామ రామాయణము లోని నామములకు సందర్భసహిత వ్యాఖ్యానము)13. శ్రీ వరసిద్ధి వినాయక వ్రత కల్పము ( పురుష సూక్తానుసారము సంకలనము).

 

ఇది వరకు జరిగినఅంతర్జాల అష్టావధానాన్ని చూసిన దేశ, విదేశాలలోని సామాన్యజనులు సైతం అష్టావధానం అంటే ఏమో ,ఎట్లుంటుందో ఒక అవగాహనానికి రాగలిగారు. అందువల్ల అంతర్జాల అష్టావధానం పూర్తిగా సంతృప్తినిచ్చింది. నిషిద్ధాక్షరి జరుగునపుడు ప్రేక్షకుల ఉత్సాహాన్ని చూసి ఈ మారు రెండు నిషిధ్ధాక్షరులు ఉండేలా చూసుకున్నాను. అవధానం పైప్రేక్షకులు పూర్తిగా అవగాహనకు రాగలిగితే ఎందఱో అవధానులు కాగలిగే అవకాశం మెండుగా ఉంది. తెలుగు పద్య కవిత్వాన్ని రక్షించాలనే సదాశయం తో అంతర్జాల అవధానాన్ని చేస్తున్నాను. ఈ అవధానానికి మహామహులైన పండితుల ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. ఈ అవకాశాన్ని , ఆలోచనను నాకందించిన శ్రీ మాలిక అంతర్జాల పత్రికా సంపాదకులు శ్రీమతి వలబోజు జ్యోతిగారికి , సాంకేతికంగా ఈ అంతర్జాల అవధానాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న సాంకేతిక నిపుణులు శ్రీ భరద్వాజ్ వెలమకన్ని గారికి సదా కృతజ్ఞుడను. శ్రీ చింతా రామకృష్ణారావు గారు నాకు అందజేయుచున్న ప్రోత్సహకానికి కృతజ్ఞత ప్రణామాంజలులు.

 

అవధాని శ్రీ మాడుగుల అనిల్ కుమార్. గారూ!శాకంబరి నామక అంతర్జాల అష్టావధానమునకు అవధానిగా మిమ్ములను మనసారా ఆహ్వానిస్తున్నాను.

చింతా రామకృష్ణ:

మాడుగులాన్వయా! కవిత, మార్దవ మేదుర భావ రమ్యమై,

చూడగ నాలకింపగను సుందరమై, జన రంజకంబునై,

నేడిది జాల మార్గమున నిత్యులు గాంచుచు మెచ్చునట్టిదై,

వాడల, పల్లెలందును ప్రభావముతో విలసిల్ల చెప్పుడీ!

శాకంబరీ కృపా కటాక్ష లబ్ధ అవధాన నైపుణ్యము ఒప్పారగా మీరు సభా రంజకముగా అవధానమును హృదయోల్లాస జనకముగా చేసి, మీ ధారణా పటిమతో కవుల హృదయాకాశాలలో నిరంతరం విహరించ గలరని ఆశిస్తూ మనసారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ముందుగా పృచ్ఛకులకు స్వాగతం తెలిపి తదనంతరం మీ ప్రార్థన, తదనంతరం పృచ్ఛకుల ప్రశ్నలు క్రమముగా సుధారస ధారగా పెల్లుబికే మీ ఆసుధార నాలుగు ఆవృత్తులలో మేము గ్రోలనున్నాము.

ముందుగా పృచ్ఛకుల స్వపరిచయము, వారికి స్వాగతము పలుకుట.1.మొదట నిషేధాక్షరి నేనే నిర్వహిస్తున్నందున వేరే స్వాగతము, పరిచయము ముందే చేశాను.

ఇప్పుడు రెండవ పృచ్ఛకుల స్వపరిచయము.

2. నిషిద్ధాక్షరి :  శ్రీ ముక్కు రాఘవ కిరణ్ ! శాకంబరి నామక అంతర్జాల అష్టావధానమునకు నిషిద్ధాక్షరి పృచ్ఛకునిగా మిమ్ములను మనసారా ఆహ్వానిస్తున్నాను.

నమస్సభాయై. అవధానిగారికి, నిర్వాహకులకు నమస్సులు.

రాఘవ: నా పేరు ముక్కు శ్రీరాఘవకిరణ్. ప్రస్తుత నివాసస్థానం అమలాపురం. నేటి అవధానంలో నిషిద్ధాక్షరి అంశానికి పృచ్ఛకునిగా వ్యవహరించబోతున్నాను.

శ్రీ శాకంబరీ అవధాన నిర్వాహకులు అయిన ‘ మాలిక ‘ వారికి, రూపక కర్తశ్రీమతి వలబోజు జ్యోతి గారికి , అనుసంధాన కర్త శ్రీ చింతా రామ కృష్ణారావు గారికి, అవధాని గారు శ్రీ అనిల్ కుమారు గారికి, ఇతర కవి పండితులకునమస్సులు.

రాఘవేతి విజానన్తి కేచిచ్చ కిరణేతి మామ్,

అస్మి ప్రబన్ధవిద్యాయాః పట్టభద్రశ్చ సంప్రతి.

 

పితా త్రినాథశర్మాఖ్యో మాతా కామేశ్వరీ మమ,

పితృభ్యాం పదయోర్భక్త్యా తాభ్యాం పద్యోऽయమర్ప్యతే.

 

ఉపద్రష్టాహ్వయే మణ్డితే పణ్డితై

ర్జగన్నాథాదిభిర్జాతవానస్మ్యహమ్,

కృపారత్నాకరో రామచంద్రో హరిః

కులర్భుష్షోడశీ చేష్టదేవీ మమ.

 

పూర్వపుణ్యవశాద్రక్తిరాన్ధ్రసంస్కృతభాషయోః,

సఙ్గీతే చైవ మాం వక్తుం కిఞ్చిన్నాస్తి త్వితఃపరమ్.

 

చింతా రామకృష్ణ:

మక్కువతో నిషిద్ధమున మంత్ర విముగ్ధుల జేసి శ్రోతలన్,

ప్రక్కన నిల్చి, మాడ్గుల ప్రభావము పెంచ, వధాన వేళలో

చిక్కులు లేక సాగునటు చేయుము నా యభిమాన పుత్రుఁడా!

ముక్కు మహాబ్ధి చంద్ర! గుణ పూజ్యుఁడ! రాఘవ! సత్ కిరణ్ సుధీ!

చిరంజీవి రాఘవా! పిన్నవాడివయ్యు విజ్ఞాన మున్నవాడవు. నీ నిర్వహణలోని నిషిద్ధాక్షరి సభారంజకము కాగలదని ఆశిస్తూ మనసారా అభినందిస్తున్నాను.

ఇప్పుడు మూడవ పృచ్ఛకుల స్వపరిచయము.

 

3. దత్తపది   :  శ్రీ గోలి హనుమచ్ఛాస్త్రి గారు!

గోలి హనుమచ్ఛాస్త్రి:

నమస్కారములు.

నా పేరు : గోలి హనుమచ్ఛాస్త్రి.నివాసం : గుంటూరువృత్తి : సహాయ సాంకేతిక అధికారి ( ఆం.ప్ర. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ )ప్రవృత్తి : సమస్యలను వెతుక్కొని  పూరించుట,  పద్యములల్లుట.శ్రీ కంది శంకరయ్య గారి ” శంకరాభరణం ” బ్లాగునందు గత రెండు సంవత్సరములుపైగా దాదాపు వారు ప్రతి రోజూ ఇచ్చు చున్నటువంటి సమస్యలను పూరించుచు వారిద్వారా పద్య రచనకు మెరుగులు దిద్దుకొను చున్నాను.

నా బ్లాగులు : సమస్యల ‘ తో ‘ రణం ( ‘ పూ ‘ రణం ),

కవి ‘ తల ‘  అలలు

చింతా రామకృష్ణ:

శాకంబరి నామక అంతర్జాల అష్టావధానమునకు దత్తపది ౧ పృచ్ఛకునిగా మిమ్ములను మనసారా ఆహ్వానిస్తున్నాను.

గ్రోలితి మీ కవిత్వ సుధ, గోలి సుధాబ్ధిజ! శాస్త్రి మిత్రమా!

జాల బృహద్వధానమున చక్కని దత్త పదంబులిచ్చి, సం

చాలక వృత్తినున్న నను, సాత్విక పూర్ణు లనిల్ కుమారులన్

తేలగ జేయుఁడయ్య మణి దీపముగా వెలుగొందుడిత్తరిన్.

హనుమచ్ఛాస్త్రి గారూ! మీరు ఇచ్చే దత్తపదితో కవి అసాధారణ పటిమను చూపుతూ అద్భుతమైన పూరణ చేయ గలిగి, ఈ కార్యక్రమానికే వన్నె తేగలగాలని ఆశిస్తూ మిమ్ములను మనసారా అభినందిస్తున్నాను.

ఇప్పుడు నాలుగవ పృచ్ఛకుల స్వపరిచయము.

4. దత్తపది2  డా . శ్రీ కొరిడె విశ్వనాథ శర్మ గారు

నమః సభాయై. నమస్కారములందరికి..ఈ అవధానమున దత్తపది పృచ్ఛకుడుగా నేను ఆహ్వానింపబడియున్నానునా నామధేయము:-కొరిడె విశ్వనాథ శర్మ, నా బ్లాగ్ http:// koride-vishwanathasharma.blogspot.comనా నివాసము:- ప్రిన్సిపాల్, శ్రీ లక్ష్మీ నరసింహ సంస్కృతాంధ్ర కళాశాలా ధర్మపురి. జిల్లా కరీంనగర్ (ఆంధ్ర ప్రదేశ్ )

నా సాహితీ కృషి:- (1978 నుండి) 35 సంవత్సరములు గా సంస్కృతోపన్యాసకుడను.

ప్రత్యేకతలు* PHD :లింగపురాణము – విమర్శనాత్మక పరిశీలనమ్విశ్వవిద్యాలయం : పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయం.సాహిత్య సేవ : -రచయితగా: భర్తృహరి సద్భావ లహరి, (సంస్కృత భాషా ప్రచారసమితి Hyd వారిచే ప్రచురితం)కావ్యము : ధర్మపురీ వర్ణనమ్ { అసంపూర్తి / క్రియమాణ లఘుకావ్యమ్}సుప్రభాతములు : శ్రీ ధర్మపురీ రామలింగేశ్వరస్వామి సుప్రభాతమ్ ,,శ్రీ పెద్దాపురం లక్ష్మీనరసింహస్వామి సుప్రభాతమ్ {CD Released }అనువాదములు : (1)”లింగపురాణము” {కీ.శే. డా. వి. హన్మాన్ శర్మ గారి తో పాటు}(2) ”గోదావరీమహాత్మ్యము” ( బ్రహ్మపురాణాతర్గతమైన 108 అధ్యాయములకు తెలుగు అనువాదము){కీ.శే. డా. వి. హన్మాన్ శర్మ గారి తో పాటు}వ్యాఖ్యానములు : (1) శ్రీ ధర్మపురీ లక్ష్మీనరసింహస్వామి సుప్రభాతమ్ { మానాన్న గారి రచన } తెలుగు వ్యాఖ్యనము(2)కాదంబరీ సంగ్రహం ~కీ.శే. బ్ర,శ్రీ తుంగూరి శివరామ శర్మ గారి అసంపూర్తి పద్యకావ్యమునకు తెలుగు వ్యాఖ్యానము(3)భర్తృహరి విజ్ఞాన శతకము తెలుగు వ్యాఖ్యానము.సంపాదకుడుగా: డా. వి హన్మాన్ శర్మ గారి పదవీవిరమణ అభినందసంచికసన్మాన సంఘప్రచురణ 31-08-2009ముందుమాటలు : 1) బహుముఖప్రజ్ఞాశాలి డా. కే. రాజన్నశాస్త్రి.{”మంజూష” ~ డా. కే. రాజన్నశాస్త్రి}2) ”కవితా శ్రీశిలశ్రీనివాస్“తీరుమారాలి ~ శ్రీనివాస్ {విద్యార్థి} కవితల సంపుటి,,AIR Hyd ద్వారా 15 కు పైగా సాహిత్య ప్రసంగాలు ప్రసారితములు.సప్తగిరి, ఆరాధన హనుమ పత్రికల ద్వారా కొన్ని వ్యాసములు ముద్రితములు.భావ కవిత్వాలు కొన్ని ముద్రితాలు. FB ద్వారా కొన్ని ప్రదర్శితాలు.ఆల్ ఇండియా ఓరియంటల్ కాన్ఫరెన్స్ లందు కొన్ని పత్రికా సమర్పణలు.

చింతా రామకృష్ణ:

శ్రీ కొరిడె విశ్వనాథ శర్మ గారు! శాకంబరి నామక అంతర్జాల అష్టావధానమునకు దత్తపది౨ పృచ్ఛకునిగా మిమ్ములను మనసారా ఆహ్వానిస్తున్నాను.

కొరిడె సుధాబ్ధి చంద్ర! వర కోవిద గణ్యుఁడ విశ్వనాధుఁడా!

మురియగ పాఠకాళి కడు ముచ్చట దత్త పదంబులిచ్చి, స

ద్వరుఁడగు మాడ్గులాన్వయుని ప్రజ్ఞ బహిర్గతమై రహింపగా

సరసతఁ జేయ కోరెదను, సజ్జన పండితపాళి మెచ్చగా.

విశ్వనాధశర్మగారూ! మీరు ఇచ్చే దత్త పది అవధాని పూరణలో అద్భుతమైన పద్య రాజము వెలువడాలని ఆశిస్తూ మిమ్ములను మనసారా అభినందిస్తున్నాను.

ఇప్పుడు ఐదవ పృచ్ఛకుల స్వపరిచయము.

5. సమస్య  : శ్రీ యం.నాగగురునాథశర్మగారు

అవధాని గారికి,అధ్యక్షుల వారికి,విద్వద్బృందమునకు నమస్కారములు.నా పేరు నాగగురునాథశర్మ.ఇప్పుడిప్పుడే కవితావ్యాసంగాన్ని కొనసాగించుటనారంభించాను. ప్రస్తుతం అనంతపురములో విద్యాభ్యాసం చేస్తున్నాను.ఈ బృహత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జ్యోతి గారికి నమస్కార సహిత శుభాభినందనలు.

చింతా రామకృష్ణ:

శాకంబరి నామక అంతర్జాల అష్టావధానమునకు సమస్యా పూరణము౧ పృచ్ఛకునిగా మిమ్ములను మనసారా ఆహ్వానిస్తున్నాను.

నయ గుణ భాస! నాగ గురు నాధ! సమస్య నొసంగి, జాల త

న్మయులుగ సద్వధాన పర మాధురులన్, బొనరింప శ్రోతలన్

నయమున జేయు మీ కవికి, నాకును, యీ యవధాన వేళలో

శ్రియమును గూర్చి వెల్గుమిట. శ్రీకర మాడ్గుల వంశ వర్ధనా!

చిరంజీవీ! గురునాధశర్మా!  ఈ నాటి యీ కార్యక్రమంలో పూరణార్థము నీవొసగే సమస్య మహామహా కవుల మనసులనాకట్టుకోవడంతో పాటు అవధాని నోట ఆణిముత్యములవంటి అక్షర జాలంతో ఒప్పిదమైన పద్యరచనావకాశంతో కడుంగడు రమ్యమై ఒప్పి ఉండాలని ఆశిస్తున్నాను. నీకు నా హృదయపూర్వక అభినందనలు.

ఇప్పుడు ఆరవ పృచ్ఛకుల స్వపరిచయము.

6. సమస్య  : శ్రీ నారుమంచి వెంకట అనంత కృష్ణ గారు

శాకంబరి నామక అంతర్జాల అష్టావధానమునకు సమస్యా పూరణము౨ పృచ్ఛకునిగా మిమ్ములను మనసారా ఆహ్వానిస్తున్నాను.

నారుమంచి వెంకట అనంత కృష్ణ: నా గురించిః     నన్ను నారుమంచి వెంకట అనంత కృష్ణ అంటారు. హైదరాబాదు నివాసిని.ప్రస్తుతం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయవాద వృత్తిలో ఉన్నాను.సాహిత్య కృషిః  చెప్పుకోవటానికేమీ లేదు. పుస్తక పఠన వ్యసనపరుణ్ణి. గురుదేవుల వేనోళ్ల పలకరించి, అమ్మకి అర్చన, అన్నకి (గణపతికి)  ఆరాధన శతకరూపం లో చేసుకున్నాను. ప్రస్తుతం శతపత్రమిత్రుని సూర్యనారాయణ పరబ్రహ్మగా శతపద్యార్చ సేవ జరుగుతున్నది. మహానివేదన మిగిలింది. నా ప్రత్యేకతలుః   నన్ను నేను తెలుసుకునే కృషిలో ‘నాకేమీ తెలియదు’ వరకు తెలుసుకున్నాను.

జటిలంబన్నది కానక

తృటిలో ముడివిప్పివైచు తెరవున్ గాంచన్

ఘటికుండనిలకుమారున

కిటనిత్తు సమస్యనిట్లునిదిగోనయ్యా

 

మహిత యనంత కృష్ణ! కవి మాన్యుఁలు మెచ్చు సమస్యనిచ్చి, స

న్నిహితులు, పండితాళి విని నేర్పరి యీ యవధాని యంచు యీ

మహిని ప్రశంస చేయఁబడ మాన్యతఁ జేయుమ! మాననీయుడా!

సుహితము గూర్చ నీకు సరి చూడగ లేరన తప్పు కాదుగా!

శ్రీమాన్! అనంత కృష్ణ శర్మ గారూ! అనంత ఆకాశంలో ప్రస్తుతము అంతర్జాలం ద్వారా విరాజిల్లుచున్న ఈ అవధానంలో మీరు సమస్యా పూరణ్ము కొఱకు ఇచ్చే సమస్య మహనీయులైన పండితమ్మన్యుల మన్ననలనండమే కాకుండా అవధాని వరుల పూరణతో అది ఈ అవధానానికే వన్నె తేవాలని ఆశిస్తూ మిమ్ములను మనసారా అభినందిస్తున్నాను.

 

 

ఇప్పుడు ఏడవ పృచ్ఛకుల స్వపరిచయము.

జ్యోతి: నమస్కారం.. అవధానం గురించి ఎక్కువగా తెలీకున్నా అనిల్ గారి సహకారంతో మాలిక పత్రిక తరఫున మొట్టమొదటిసారి అంతర్జాల అవధాన ప్రక్రియ మొదలుపెట్టాను. అది విజయవంతమైనందుకు సంతోషంగా ఉంది.

నా గురించి.. నేను బ్లాగర్ ని, ప్రీలాన్స్ జర్నలిస్టును. మాలిక పత్రికకు కంటెంట్ హెడ్ గా ఉన్నాను..నాకు ఇష్టమైన ఆహారం , పద్యాల గురించి అవధానం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది.శుభం.

శాకంబరి నామక అంతర్జాల అష్టావధానమునకు వర్ణనము పృచ్ఛకులుగా మిమ్ములను మనసారా ఆహ్వానిస్తున్నాను.

కర్ణామృతముగ కూర్చగ

వర్ణననిడి సభను నేడు వర్ధిల గనుమో

పూర్ణోజ్వల జ్యోతీ! సం

పూర్ణంబుగ సద్వధాని పూజింపఁబడన్.

అమ్మా! జ్యోతీ! అకుంఠిత దీక్షతో అనంత ఆకాశంలో అతర్జాలంలో మహనీయమైన అవధానమును జరిపించాలనే మీ పట్టుదలను మనసారా అభినందిస్తున్నాను. మీరు నిర్వహించుచున్న వర్ణనాంశము సజ్జన సతక్విరంజకమై అవధాని కంఠమునుండి అమృత ధారవలె వర్ణము స్రవించాలని మనసారా ఆశిస్తున్నాను.

ఇప్పుడు ఎనిమిదవ పృచ్ఛకుల స్వపరిచయము.

8.అప్రస్తుత ప్రసంగం :     శ్రీ నల్లాన్ చక్రవర్తుల కిరణ్ గారు!

కవిపండితులకు నమస్సులు!

నా పేరు కిరణ్, కలం పేరు నల్లాన్ చక్రవర్తుల కిరణ్ అన్న నా పూర్తి పేరుని పొడి అక్షరాలుగా కుదించి “నచకి”. తెలుగు భాష మీద ఆసక్తితోనూ, (పద్యాలు వ్రాసే) మా అమ్మ నుంచి స్ఫూర్తి పొందగానూ, పెద్దల ప్రోత్సాహంతో 2001లో “ఛందస్సు” అన్న యహూ కూటమినేర్పఱచిన పిమ్మట సుప్రభ, మోహనరావు, కామేశ్వరరావు తదితరుల వలననూ పద్యరచన మీద యిప్పుడిప్పుడే పట్టు సాధిస్తున్నాను, గత పది పదిహేనేళ్ళ కృషితో. గతంలో ఱాళ్ళబండి వారికి (2009లో), మేడసాని వారికి (2011లో) న్యస్తాక్షరికి పృచ్ఛకుడిగా ఉన్నాను. సొంత ఊరంటూ ఒకటని చెప్పుకోలేని ద్రిమ్మరిగా గడిపినా రాయలసీమని స్వక్షేత్రంగా భావిస్తాను, నివాసం హైదరాబాదులో. ఉద్యోగరీత్యా హైదరాబాదులోని వి.ఎన్.ఆర్. విజ్ఞానజ్యోతి కర్తృజ్ఞానిక, సాంకేతిక విద్యాసంస్థలో సహ్యాకృతాచార్యుడిగా (Associate Professor VNR , Vignan Jyothi Institution of Engineering and Technology )ఉన్నాను.విజయనామ యుగాది సందర్భంగా నిర్వహించబోతున్న “శ్రీ శాకంబరి” అంతర్జాల అవధానంలో భాగమవుతున్నందుకు సంతోషంగా ఉంది.

 

దీటగు యవధానములో

మాటలె యప్రస్తుతములు, మధురపు పద్యాల్

పోటీగా పఱుగులిడగ

చోటేదీ నాకునిచట, చోద్యము కాదా! :-)

నచకి

శాకంబరి నామక అంతర్జాల అష్టావధానమునకు అప్రస్తుత ప్రసంగము పృచ్ఛకునిగా మిమ్ములను మనసారా ఆహ్వానిస్తున్నాను.

అవధానంబున చక్రవర్త్యనిలుకా నప్రస్తుతంబందు నీ

యవధానంబున చక్రవర్తి కిరణే. హా! యేమి భాగ్యంబు! నీ

కవకాశంబు రహింప జేయ ననిలున్. కల్యాణ సంధాయివై

భువిలో వెల్గుము జాల మార్గ సుగతిన్.పూజ్యంబుగా మిత్రమా!

 

కిరణ్మహనీయా! చదివే వారికి, వినే వారికి అవధాని వరుల అసాధారణ ప్రతిభా పాటవాలు వ్యక్తం చేయ గలిగిన చక్కని అర్థవంతమైన మనోరంజకమైన మీ ప్రసంగమే అవధానమున శాకంబరీ దేవికి అలంకరించు మణిమాల అనుటలో ఏమాత్రము సందేహము లేదు. మీ విశాల హృదయంతో ఈ కార్యక్రమము రక్తి కట్టే మార్గంలో అవధానివరులను నడుపుటతో పాటు నా అధ్యక్ష స్థానమునకూ వన్నె కూర్చగలరని ఆశిస్తూ ,మనసారా మిమ్ములను అభినందిస్తున్నాను.

ముందుగా.

మొదటి పృచ్ఛకులు  మీకు పూరణాంశమును సూచింతురు. తదనుకూల మైన పూరణమున మొదటి పాదమును వెన్వెంటనే మీరు చెప్పుదురు, తదనంతరము రెండవ పృచ్ఛకులు… ఈవిధముగా కొనసాగ గలదని తెలియజేస్తున్నాను.

ఇక మీరు  ప్రారంభించండి.

అనిల్:

శ్రీ శాకాంబర్యై నమః

శ్రీ శాకాంబరీ అష్టకమ్

జ్ఞానం సమస్తం అశనే నివేశ్య

శాకైశ్చ సర్వైస్సమలంకృతాంబ!

పద్మాక్షి! లోకేశ్వరి ! పార్వతి ! శ్రీ

శాకాంబరి! త్వాం శరణం ప్రపద్యే   ll 1 ll

భావం  :- సమస్త జ్ఞానాన్ని ఆహారంలో ఉంచి ఆకుకూరలతో అలంకరింపబడిన , పద్మాక్షివి , లోకేశ్వరివి , పార్వతివి అయిన ఓ తల్లీ ! నిన్ను శరణుగోరుచున్నాను.

జ్ఞాత్వా శిశూన్ తే పరితః క్షుధార్తాన్

క్షామం క్షమాయామవలోక్య సద్యః    l

ఆహార రూపేణ సమాగతా శ్రీ

శాకాంబరి! త్వాం శరణం ప్రపద్యే    ll  2  ll

భావం:- భూమిపై ఉన్న కరువును , ఆకలిగొన్న నీ బిడ్డలను చూసి ఆహార రూపంగా వచ్చిన ఓ శాకాంబరి ! నిన్ను శరణుగోరు చున్నాను.

త్వమన్నపూర్ణా చ త్వమేవ దుర్గా

త్వమేవ లక్ష్మీశ్చ సరస్వతీ చ  l

శక్తిత్రయోపేత సుమంగళీ శ్రీ

శాకాంబరి! త్వాం శరణం ప్రపద్యే  ll  3  ll

భావం:- అన్నపూర్ణ , దుర్గ , లక్ష్మి ,సరస్వతి ఇట్లా ఎన్ని పేర్లతో పిల్చినా నీవే ముగ్గురమ్మల మూర్తిగా ఉన్నావు. కావున ఓ శాకంబరి !నిన్ను శరణుగోరుచున్నాను.

త్రిలింగభాషా సురభారతీ వత్

ఆవిష్కరోత్యాశు సమస్త భావాన్  l

పాండిత్యమస్యామపి దేహి మాతః !

శాకాంబరి! త్వాం శరణం ప్రపద్యే  ll 4  ll

భావం:- ఈ భూమి మీద తెలుగు భాష అనేది ఒకటి ఉన్నది. ఇది కూడా సంస్కృత భాష లాగా వేగంగా మనలోని భావాలను యథా తథంగా వ్యక్తం చేయడానికి అనువైనది. కావున సంస్కృతం కొంత తెలిసిన నేను తెలుగు భాషలో కూడా పాండిత్యాన్ని సంపాదించదలచి తల్లివైన నిన్ను శరణుగోరుచున్నాను.

గీర్వాణ కావ్యాని మనోహరాణి

అనూదితాన్యాంధ్ర వచస్సు మాతః !

జిఘ్రుక్షయా తాని సుబోధకాని

శాకాంబరి! త్వాం శరణం ప్రపద్యే   ll 5 ll

భావం:- మనోహరమైన సంస్కృత కావ్యాలను తెలుగు లోనికి అనువదించారు. వాటిని అర్థం చేసుకొనే శక్తి సంపాదించడానికి నిన్ను శరణువేడుతున్నాను.

కవిత్రయం నన్నయ తిక్కయజ్వా

శ్రీ ఎఱ్ఱనేత్యాహురమూన్ త్రిలింగే   l

జిజ్ఞాసయాహం తు జయం అమీషాం

శాకాంబరి ! త్వాం శరణం ప్రపద్యే   ll 6  ll

భావం:- తెలుగు భాషలో నన్నయ , తిక్కన , ఎఱ్ఱన అను ముగ్గురినీ కవిత్రయం అంటారు. వారు జయ అను మారు పేరు గల శ్రీమన్మహాభారతాన్ని రచించారు. వీరి జయ కావ్యాన్ని అర్థం చేసుకొనే శక్తి పొందడానికి నిన్ను శరణుగోరుచున్నాను.

అష్టావధానం హి త్రిలింగభాషా

కళా చమత్కార కవిత్వయుక్తా  l

తస్మిన్ సువర్ణాశ్రిత శ్లోకహారైః

శాకాంబరి ! త్వాం శరణం ప్రపద్యే    ll 7  ll

భావం:- తెలుగుభాషలో అష్టావధానం అనే చమత్కారమైన సారస్వత పద్య కళ ఒకటి ఉంది. ఇందులో మంచి అక్షరాలతో కూర్చిన పద్యహారములతో నిన్ను పూజిస్తూ శరణుగోరు చున్నాను.

అష్టావధానం మధురం చ క్రీడాం

త్వదీయ నామ్నా పరికల్ప్య పాకమ్

నివేదయన్ తేంబ కవిత్వ రూపం

శాకాంబరి ! త్వాం శరణం ప్రపద్యే  ll  8  ll

భావం:- మధురమైన అష్టావధాన క్రీడ అను పాకాన్ని నీ పేరిట కల్పించి ఆ కవిత్వరూప పదార్థాన్ని నీకు నైవేద్యం చేస్తూ నిన్ను శరణుగోరు చున్నాను.

ఇతి శ్రీ మాడుగుల వంశ పారావార సుధాకరేణ అనిల కుమార శర్మణా విరచిత శ్రీ శాకాంబరీ అష్టకం సంపూర్ణమ్.

//ఓం తత్సత్//

హరిఃఓమ్

శ్రీగురుభ్యో నమః

శ్రీమహా గణాధిపతయే నమః

శ్రీశారదాంబాయై నమః

నమస్సభాయై

సభయందాసీనులైనసభాధ్యక్షులవారికి , మాలికా అంతర్జాల పత్రిక నిర్వాహకులకు , పృచ్ఛక కవిమిత్రులకు సవినయ నమస్కారాలు. శ్రీ శాకాంబరీ అష్టావధాన సందర్భంగా పై విధంగా అమ్మవారిపై అష్టకాన్ని రచించి స్తోత్రం అందజేయుచున్నాను. ముందుగా శ్రీ గణపతి స్తోత్రం తో అవధానాన్ని ప్రారంభిస్తున్నాను.

ఉ. వ్యాసుని లేఖకుండగుచు భారత భవ్య కథాస్రవంతి ను

ద్భాసిత శ్వేత దంతమున వ్రాసె రయమ్ముననేకదంతుడై

దోసములెల్లఁ ద్రోయదగు తొండముగల్గిన తద్గజాస్యుకున్

దాసుడనై కవిత్వము సుధారసమొల్కగనివ్వ గొల్చెదన్            ll

శ్రీసరస్వతీ స్తుతి :

మ. భవదీయాద్భుత పాదపంకజములన్ బంధించి చిత్తంబునన్

కవితాధార సుధారసమ్ము నొసగంగా గొల్తు సద్భక్తితో

అవధానమ్మున జ్ఞాన నేత్రమున నుద్యద్భాను సంకాశవ

వ్వవె కావ్యాత్మ ! సరస్వతీ ! జనని ! వాగ్వ్యాపారమందింపుమా   ll

 

పూర్వఅవధానుల స్తుతి :

చం. అరుదగు ఈ వధానమను అద్భుత క్రీడ తెలుంగు భాషలో

చొరబడె తొల్త మెచ్చగ యశోధనులైరి కవీంద్రులెందరో

నిరుపమ ధారణాన్వితులు , నేర్పరులాద్యవధాన ధీరులం

దరిని నమస్కరించెద ప్రధానమటంచవధాన వేదికన్   ll

 

మాగురువులు కీ.శే. శ్రీ కలపటపు భాస్కర రావుగారిని గురించి :

మ. తలతున్ మద్గురు భాస్కరాఖ్యుడను విద్వాంసున్ మహా తాంత్రికున్

లలితాపాద సరోజ భృంగు కవితా లాలిత్య సంశోభితున్

చలదుత్తుంగ తరంగ సంగత వచస్సంరంభ సంక్షోభితా

ఖిల శాస్త్రార్థ విచార భావనిలయున్ క్షేమార్థినై మ్రొక్కుచున్   ll

మరొకగురువులు మహా మహోపాధ్యాయ శ్రీ సముద్రాల లక్ష్మణయ్య గారి గురించి :

చం. అలరగ సంస్కృతాంధ్రములయందవలీలగ పద్యగద్యముల్

ఒలకగ వాక్సుధారసములొప్పగురీతి రచింపజాలుచున్

పలువురు మెచ్చునట్లుగ సభాస్థలమందునుపన్యసించు ధీ

రులయిన లక్ష్మణయ్యను గురూత్తము నే నుతియింతునియ్యెడన్      ll

శ్రీమతి వలబోజు జ్యోతి గారికి :

కం. పలుకులవి తల్లి ప్రేమను

తలపించును పరిగణింప , దాతృత్వముకున్

నెలవై వెలుంగు శ్రీమతి

వలబోజు జ్యోతిగార్కి వందనమిడెదన్      ll

శ్రీచింతా రామకృష్ణా రావు గారికి :

శా. ప్రాచీనాంధ్రకవిత్వ తత్వవిదుడై ప్రజ్ఞా ధురీణుండుగా

నౌచిత్యంబగు చిత్రబంధ కవిగానాశల్ యశోపేతుడై

తా చింతామణియౌచు మిత్రులకు చింతా రామకృష్ణాహ్వయుం

డే చేరన్ సభ చాలకుండగుచు యేనింపారగా మ్రొక్కెదన్  ll

శ్రీకొరిడె విశ్వనాథ శర్మ గారికి :

ఆ.వె. కొరిడె విశ్వనాథ సురభారతీబుధ

సత్తమా! కవీ ! యశస్వి ! మాన్య

చరిత ! నా నవీన శాకాంబరి వధాన

మలర మునుపు మీకునంజలింతు.

శ్రీయుతులుగోలి హనూమచ్ఛాస్త్రి గారికి :

తే.గీ. శ్రీయుతులు హనూమచ్ఛాస్త్రి శ్రీ సరస్వ

తీ కృపన్ గొని నిరతము తేజరిల్లు

పద్యరచనా ప్రసక్తుడై ప్రతిభజూపి

పండితోత్తము నతనికి ప్రణతులిడెద.

శ్రీనారుమంచివేంకట అనంతకృష్ణ గారికి :

ఆ.వె. శ్రీ అనంతకృష్ణ ! శ్రేయస్కరంబైన

న్యాయవాదవృత్తినలరుచుండి

తనరజేయుదు కవితా కన్యకవరింప

మాన్యచరిత ! మిము నమస్కరింతు.

శ్రీముక్కురాఘవకిరణ్ గారికి :

ఆ.వె. వయసునందు చిన్న పాండిత్యమున్ మిన్న

రాఘవ కిరణుడు విరాజమాన

పృచ్ఛకుండునౌచు వేదికనలరించె

వందనమ్ముజేతు ప్రజ్ఞగాంచి.

శ్రీ చక్రవర్తుల కిరణ్ గారికి:

తే.గీ. నోట గఱపెను యాంగ్లమ్ము , తేట తెనుగు

కమ్మనైన పద్యముంగూర్చు కలముఁ బట్టి

చక్రవర్తుల కిరణు విస్తార కీర్తి,

వేంకటేశ్వరుడితని దీవించుగాత!

శ్రీ యం.నాగగురునాథ శర్మ గారికి :

తే.గీ. చదివె సాంకేతవిద్యల నదనుజూచి

సంస్కృతాంధ్రములను నేర్చి చతురుడయ్యె

నాగగురునాథ శర్మ స్వర్ణాక్షరార్చ

నారతునితనిన్ శుభము చేకూరుగాత!

శ్రీ భరద్వాజ్ వెలమకన్ని గారికి:

తే.గీ. శ్రీ భరద్వాజు గారు తంత్రీ ప్రసార

మగ్నులై అవధాన సన్మార్గమెల్ల

విజయవంతముగాగ కావింత్రు కృషిని

వారికొనరింతు మనసార వందనమ్ము

 

1. నిషేధాక్షరి :  శ్రీ చింతా రామ కృష్ణారావు

అవధానిగారూ! శాకంబరీ జగజ్జననినుద్దేశించి “ఉ ఊ ఒ ఓ  ప ఫ బ భ మ వ” వర్ణములు లేని

కందము (నిరోష్ఠ్య కందము) చెప్పండి.  (ఓష్ఠ్యములు నిషేధిస్తున్నాను.)

నాలుగు ఆవృత్తులలో నాలుగు పాదములు చెప్ప గలరు.

కిరణ్: అవధాని గారూ, గణేశప్రార్థన ప్రశస్తమైనదే కానీ ఏకదంతుడే అయిన గణేశుడు శాకంబారీ దేవి పేరిట జరుగుతున్న అవధానాన్ని ఆస్వాదించగలడంటారా?

అనిల్ : గణేశునికి గడ్డి ( గరక ) ఇష్టమైనప్పుడు శాకంబరీ అవధానానికి వచ్చి ఆస్వాదించడం ఉచితమైనదే కదా !

అనిల్ కుమార్: ఆర్యా ! శాకంబరి బ మినహాయింపు ఉండాలి.

చింతా రామకృష్ణ: సరే కానివ్వండి ఏకోహిదోషో గుణసన్నిపాతఃః

అనిల్ కుమార్:    దో శక్తి గల్గియుడుదు

Kiran: అవధాని గారూ, దోశక్తి అంటే దోశెల పట్ల ఆసక్తి అనుకోవాలా? ఏకదంతుని సంగతి కూడా తేల్చండి. (మీరేదో ఏక్ దో తీన్ పాట పాడుతున్నట్టున్నారు!)

అనిల్ : ఎండాకాలం కదండీ ! దోశ తింటే దప్పిక ఎక్కువ అవుతుందని .

అనిల్ కుమార్: మొదటి పాదం పూర్తీ అయినది.

 

Ragava Kiran Mukku: అయ్యా అవధానిగారూ,

రెండవ నిషిద్ధాక్షరి అంశం. ఇప్పుడు మన చక్రవర్తులవారు తీసుకువచ్చారే ఏకదంతుడు… ఆ వినాయకుడు తన మేనమామగారైన విష్ణుమూర్తిగారి ఇంటికి వెళితే, ఆయింటనున్న అత్తాకోడళ్లు (లక్ష్మీసరస్వతులు) ఆయనకు ఏ విధమైన వంటలతో సంతృప్తుని చేస్తారో మా అందిరికీ చవులూరించేలాగ ఒక కందంలో చెప్పగలరు.

తొలి అక్షరమునకు నిషేధములేదు.

అనిల్ కుమార్:  శ్రీ

Narumanchi Anathakrishna:అవధానిగారు నా సమస్యని అందుకోండి“అండమ్ముల్ ధరియించు హే జనని కామ్యంబిమ్ము శాకంబరీ”

అనిల్ కుమార్:  శ్రీ

శ్రీరాఘవ : వా నిషిద్ధం

అనిల్ కుమార్:  గీ

రాఘవ : ర్వ నిషిద్ధం.

అనిల్ కుమార్: లు

రాఘవ : తరువాతి అక్షరం మీరే పూరించండి.

అనిల్ కుమార్: నిం

చింతా రామకృష్ణ: నాన్నా! రాఘవా! మొదటి పాదం పూర్తయిందా?

రాఘవ : డ నిషిద్ధం.

అనిల్ కుమార్: ట

రాఘవ : ల నిషిద్ధం.

అనిల్ కుమార్: నుం

రాఘవ : డ నిషిద్ధం.

అనిల్ కుమార్: టే ….. మొదటి పాదం పూర్తీ అయినది.

కిరణ్: అవధాని గారూ, గణేశప్రార్థన ప్రశస్తమైనదే కానీ ఏకదంతుడే అయిన గణేశుడు శాకంబరీ దేవి పేరిట జరుగుతున్న అవధానాన్ని ఆస్వాదించగలడంటారా?

అనిల్ : గణేశునికి గడ్డి ( గరక ) ఇష్టమైనప్పుడు శాకంబరీ అవధానానికి వచ్చి ఆస్వాదించడం ఉచితమైనదే కదా !

అవధాని గారూ, దోశక్తి అంటే దోశెల పట్ల ఆసక్తి అనుకోవాలా? ఏకదంతుని సంగతి కూడా తేల్చండి. (మీరేదో ఏక్ దో తీన్ పాట పాడుతున్నట్టున్నారు!)

అనిల్ : ఎండాకాలం కదండీ ! దోశ అంటే దప్పిక ఎక్కువ అవుతుందని . గణపతి పప్పు తినడం మనం చూడలేదు కదండీ . ఆయన గడ్డి తినేటప్పుడు శాకంబరి కి రావడం ఉచితమే.

చింతా రామకృష్ణ: మొత్తం పాదం చదివే భాగ్యం మాకు కలిగించండి అవధానివర్యా!

అనిల్ కుమార్: శ్రీ గీలు నింటనుంటే

చింతా రామకృష్ణ: ఇప్పుడు దత్తపది1 పృచ్ఛకులు  శ్రీ గోలి హనుమచ్ఛాస్త్రి  తన ప్రశ్నము తెలియ జేస్తారు.

కిరణ్: సంచాలకా, అవధాని గారు మొదట నా ప్రశ్నల గడప దాటితే… నాకూ కాస్త మనశ్శాంతి, ఆత్మారామునికి అన్నశాంతి! :)

అనిల్ కుమార్: గణపతి పప్పు తినడం మనం చూడలేదు కదండీ . ఆయన గడ్డి తినేటప్పుడు శాకంబరి కి రావడం ఉచితమే.

గోలి హనుమత్ శాస్త్రి: శాకమునీయుము తల్లీ !

శాకంబరి మాత ! నీకు సాగిల బడుదున్

మాకవితల కూరల గొని

చేకూరగ మాకు రక్ష చేయందిమ్మా !

అంతర్జాలంబందున

వింతగ ‘నవ’ ధాన ” జ్యోతి ” వెలిగించంగా

నెంతయు శోభను గూర్పెడి

పంతులగు ‘అనీల్కుమార ‘ వర్యా ! జే ! జే !

శ్రీ శాకంబరి మాత పేరున జరుగు చున్న ఈ అవధానమున  దత్తపదికి కూరలనేయెంచుకొన్నాను. పద్యము కూడా కందము లో అడుగుటయే సముచితమనిభావించుచున్నాను.కనుక శ్రీ అవధాని గారిని ఈ క్రింది కూరలతో కందపద్యమును రామాయణార్థములోచెప్పవలసినదిగా కోరుచున్నాను

దత్తపది ; బీర- దోస- నిమ్మ-  వంగ

కిరణ్: గోలీ (వారి) కూర పద్యమెలా ఉండబోతోందో! :)

అనిల్ కుమార్:  తినబోతూ రుచి అడుగుతారే నచకి గారూ

కిరణ్: ”దోశక్తి” అనేసి దోశెల పట్ల మా ఆసక్తిని వెళ్ళ”గక్కించారు” కానీ… మీరు చెప్పనేలేదు, అవధానివర్యా! :)

అనిల్ కుమార్: ఎండా కాలం కదా ! దోశలు తింటే దప్పిక అవుతుందని.

కిరణ్: గణపతి గడ్డి తిన్నా గాలి తిన్నా విఘ్నాలను తొలగించేవాడే! :) ఈ లెక్కన నేటి నా సంవాదం ఆయనతోనే! :)

అనిల్ కుమార్:  అంతే లెండి ఆయన తోనే సంవాదం జరపవచ్చు  వివాదాలు ఉండవు.

అనిల్ కుమార్: దోసములెన్నడు కైకలొ

చింతా రామకృష్ణ:

కిరణము తాకిన సోలుట

మరచిన కిరణుండు పల్కు మరిమరి పెరిగెన్

పరువిడు కవితల ఝరికిది

వరముగ మారంగ దగును వర్ధిలజేయన్.

ఆర్యా! అవధాని గారూ! మీ పూరణ పద్య పాదం మాకు వ్రాసి చూపిస్తే అది పూర్తయినదని భావించడానికి వీలుంటుంది.

అనిల్ కుమార్: దోసము లెన్నడు కైకలొ     ….

100 టపాలా టపాకాయలా ?

కిరణ్: పేలితే టపాకాయలు, రాలితే టపాలు! :)

విశ్వనాధ శర్మ కొరిడె: అవధాని గారికి నమస్కారములు.

దత్తపది : పదములు: టమాట. దోస(కాయ) బీర (కాయ), ఆలు.క్షమించండి ఇద్దరివి ఒకటె ఐనవి. ఐనా చంపకమాలవృత్తం . విషయము : రామాయణమున యుద్ధకాలవర్ణన

గోలి హనుమత్ శాస్త్రి: నిజమే టపాకాయలు లో కాయ రాలితే టపాలు.

అనిల్ కుమార్: అతడట మాట మాట కునునంజలి బట్టకనాయుధంబులన్

విశ్వనాధ శర్మ కొరిడె: ధన్యవాదములు. చాలా చక్కగా టమాట ను ప్రయోగిస్తూ చెప్పారు.

ఇప్పుడు సమస్య1 పృచ్ఛకులు శ్రీ యం. నాగ గురునాథ శర్మతన ప్రశ్నము తెలియ జేస్తారు.

నాగ గురునాధశర్మ మాడుగుల:

సమస్య: పరమాన్నము తిన్నవాడు పాపమునొందున్.

కిరణ్: అన్నం తింటే ఆపం, పరమాన్నం తింటే పాపం… తప్పవు కాబోలు! :)

అనిల్ : మరొకరికి పెట్టకుండా తింటే పాపమేగా వచ్చేది .

అనిల్ కుమార్: అతడట మాట మాటకును నంజలి బట్టక నాయుధంబులన్

కిరణ్: తిప్పలంటే గుర్తుకొచ్చింది, అవధాని గారూ, అప్పాలు ఆవపిండి కలిపి చేస్తే యెలా ఉంటాయంటారు?

అనిల్ కుమార్: అప్పాల ఊరగాయ  మీకు సరిపోయేలా ఉంటుంది.

అనిల్ కుమార్: కరి వేపాకున్ దొరకని

రాఘవ : “కరివేపాకున్ దొఱకని” అయ్యుండవచ్చునండీ!

అనిల్ కుమార్: టైపింగ్ ప్రాబ్లం

చింతా రామకృష్ణ: ఇది నారుమంచి అనంత్ కృష్ణగారి సమస్య2. (అంతర్జాల సమస్యవలన నాకు పంపించారు )

”అండమ్ముల్ ధరియించు హే జనని కామ్యంబిమ్ము శాకంబరీ”

చింతా రామకృష్ణ: మీరు మొదటి పాదం వ్రాసి ఉంటే మరో పృచ్ఛకులదగ్గరకు వెళ్తాను.

అనిల్ కుమార్: దండాలమ్మ ! పవిత్ర మాత ! దురమున్ తాడించిపీడించుచున్

కిరణ్: ఈ అప్పాల ఊరగాయ సంగతేమిటండోయ్, కొత్తగా వింటున్నాను!

అనిల్ కుమార్: అది మీరు చేసినదే కదా ! అప్పాలకు ఆవపిండి కలిపారు.

చింతా రామకృష్ణ:

ఇప్పుడు వర్ణన  పృచ్ఛకులు శ్రీమతి వలబోజు జ్యోతిగారు

జ్యోతి : అదేంటోగాని  ఎప్పుడు  ఏ పండగొచ్చినా, ఇంట్లో ఏ పూజ చేసినా ముందుగా గుర్తొచ్చేది. చేసే ప్రసాదం పులిహోర. నాకు చిన్నప్పటినుండి ఈ పులిహోరకు, పులికి సంబంధమేంటబ్బా అని సందేహంగా ఉండేది. ఇంకా తీరలేదు.. అవధానిగారు, కాస్త ఈ పులిహోరకు, శార్దూలానికి గల సారూప్యం వివరించగలరా??

అనిల్ కుమార్: వృత్తం అడగలేదే మీరు.

కిరణ్: అవధాని గారూ, వృత్తమంటే గుర్తొచ్చింది. మన పిండివంటల్లో యెక్కువగా రౌండుగానే ఉంటాయేమిటండీ? ఎంచక్కా దీర్ఘచతురస్రపు ఇడ్లీలో, త్రికోణపు వడలో చేసుకోవచ్చుగా! శాకంబరిని అడిగి సమాధానం చెప్పండి! :)

అనిల్ కుమార్: గొంతుకు అడ్డం పడితే ఊపిరాడక చస్తారని  అన్నీ రౌండుగా ఉండేలా చేస్తారులెండి .

చింతా రామకృష్ణ: మీకు నచ్చిన అత్యద్భుతమైన వృత్తంలో వ్రాస్తారని చూస్తున్నామండి.

జ్యోతి : నా ప్రశ్నలోనే వృత్తం వివరాలు ఉన్నాయి కదా..

అనిల్ కుమార్: మీకా దుర్గ యటన్న నెన్న మిగులన్ మేలైన భక్తౌ గదా !

 

చింతా రామకృష్ణ:

అవధానములో 1వ ఆవృత్తి ఇంతటితో పూర్తయింది.

ఇప్పుడు 2 వ ఆవృత్తిలోకి అడుగు పెడుతున్నాము.

2 వ ఆవృత్తి

అనిల్ కుమార్: కాశీనాథుని సతికిని  కరుణా యుతకున్

రాఘవ : మీరే ప్రారంభించండి.

అనిల్ కుమార్: త్యాగుల్

కిరణ్: అయ్యా అవధాని గారూ, కూరలో కరివేపాకు ఆరోగ్యానికి మంచిది… అంత కన్నా రుచికరము, ఆరోగ్యకరము అవధానంలో అప్రస్తుతప్రసంగం అంటాను. మీరేమంటారు?

అనిల్ కుమార్: నచకి గారిని అందునేమో శాకంబరికి అప్రస్తుతానికి కేటాయించారు . నచకి అంటే కిచన్ గుర్తుకు రావాలని . నిజమే కదా ! మీ అప్రస్తుత ప్రసంగం కరివేపాకును మించినదే. కరివేపాకును వాడుకొని పారేస్తారు. మిమ్మల్ని అలా చేయలేదు.

రాఘవ : కొనసాగించండి.

అనిల్ కుమార్: గు

రాఘవ : ర నిషిద్ధం.

కిరణ్: మీ సమాధానాలు రాక నేలచూపులు చూసే మా కళ్ళకి, మా ఆకళ్ళకి మా కాళ్ళే కనిపిస్తున్నాయి. :)

అనిల్ కుమార్: ఎప్పుడూ తమ కాళ్ళను మొక్కు కునే వారికి తమ కాళ్ళు కాక ఇంకేమి కనిపిస్తుంది.

అనిల్ కుమార్: ప్త

రాఘవ : ర్థ నిషిద్ధం.

అనిల్ కుమార్: మ్ము

చింతా రామకృష్ణ:

నేల చూపులు చూడగా జాలి వేయు

నింగినున్నది యవధాన భంగిమ, గని

వలయునట్టిది కోరిన వరల నిచ్చు

ననిలు మిత్రులు కిరణుడా! కనుము కృపను.

కిరణ్: మ్రొక్కిన వరమీని వేల్పు గుఱించి చెప్పారు కానీ అప్రస్తుతప్రసంగానికి సమాధానమీని అవధాని గుఱించి శతకకారులు చెప్పినట్టు లేదు!

అనిల్ : అప్పటికి వారికి తెలిసి ఉండదు లెండి . మీరు క్రొత్తగా కనిపెట్టాల్సిందే . ఈ అవధాని అయితే మ్రొక్కకుండానే వరాలు కురిపిస్తాడు.

రాఘవ : కొనసాగించండి.

అనిల్ కుమార్: గా

చింతా రామకృష్ణ:

ఠక్కున పట్టితివయ్యా!

నిక్కముగనీయవస్థ నింగికి నెగసెన్

చక్కగ వేచిన యనిలుడు

నిక్కంబుగ నీకు చెప్పు నిరుపమగతితో.

రాఘవ : ర నిషిద్ధం.

అనిల్ కుమార్: క

అనిల్ కుమార్: ద

రాఘవ : క తీసుకోమంటారా ద నా?

కిరణ్: నిరుపమమో గాదో గతి

సరిగా వీయదిటు గాలి, సరసంబలరన్!

కిరణమునకు యనిలమునకు

త్వరితమ్ముగ తెమలదు యని, పలకరు వారే!

అనిల్ కుమార్: యతి అందువల్ల కద రెండు అక్షరాలు.

రాఘవ: ఓహో, నిజమేనండీ. య నిషిద్ధం.

అనిల్ కుమార్: అప్రస్తుత ప్రసంగులు పద్యాలతో వస్తే నేను పరదా వేసుకోవాలా మీకు పరదా వేయాలా ?

అనిల్ కుమార్: గ

రాఘవ : వ నిషిద్ధం.

అనిల్ కుమార్: గ

కిరణ్: అవధాని గారికి పద్యాలకు మాత్రమే పలుకుతారేమోనని ప్రయత్నించాను లెండి…! పద్యానికి మాత్రమే పలికారు… ప్రశ్నలు అలాగే వదిలేసారు! ప్రశ్నలకు పరదాలు తీసి సరి దాఱిని సమాధానాలు చెప్పేస్తే సరదాగా సాగుతుందని నా ఊహ. :)

చింతా రామకృష్ణ:అప్రస్తుతము సరళ సుందర సరస సంభాషణా రూపంలో అవధానిగారినలరించేలాగ వ్రాయ వలసినదిగా కిరణ్ గారికి మనవి.

అనిల్ కుమార్: దగగ

చింతా రామకృష్ణ: నిషిద్ధాక్షరి రెండవ పాదం పూర్తయితే నిషేధాక్షరి నిరోష్ఠ్య కందం మొదటి రెండు పాదాలు చెప్పవలసి ఉన్నదండి.

రాఘవ : డ నిషిద్ధం.

అనిల్ కుమార్: ర

రాఘవ : మ నిషిద్ధం.

అనిల్ కుమార్: కన్

కిరణ్: డ వద్దంటే ర వేస్తే గుర్తుకు వచ్చింది: రడయోరభేదః అన్నారు కదా… మఱి “ఆవకాయ ఊరింది” అనడానికి “ఆవకాయ ఊడింది” అనవచ్చునా, అవధాని గారూ?

అనిల్ కుమార్:  ఆవకాయ ఊడింది అంటే పండ్లూడగొట్టేలా ఉంది అని అర్థం వస్తుంది . ( ఇంకా ఊరాల్సి ఉందని )

చింతా రామకృష్ణ: మీరు ప్రతీ పృచ్ఛకుని యొక్క ప్రశ్నానుకూలముగా పూరించిన నాలుగు పాదాలు వ్రాసి మీ ధారణా పటిమతో సభను రంజింప చేయవలసి యున్నది. వేగము పెంచ వలసినదిగా మనవి.

అనిల్ కుమార్:  మే

అనిల్ కుమార్: నిషిద్ధాక్షరి రెండవ పాదం పూర్తీ అయినది.

విశ్వనాధశర్మ కొరిడె: బాగుంది మీ ప్రశ్న

రాఘవ : అయ్యా అవధానిగారూ, ఇప్పటివఱకూ మీరు పూరించిన రెండవ పాదంలోని అక్షరాలు సెలవిస్తారా? కొంచెం గందరగోళంగా ఉంది. కన్ తరువాత నేను ఇంకా ఏమీ నిషేధించలేదండీ.

అనిల్ కుమార్: మొదటి దత్తపది. రెండవ పాదం : ఆసక్తిగ బీరములను ననకన్ వనముల్

అనిల్ కుమార్: అయితే నిషేధం చేయండి. మీరు నిషేధం చేశారను కున్నాను. వీరు రెండు లైన్ లు నాకే ఇచ్చారు.

రాఘవ : అవధానిగారూ, రెండవ నిషిద్ధాక్షరిలో రెండవపాదపు పూర్తి పూరణ సెలవియ్యగలరు.

అనిల్ కుమార్: వ నిషిద్ధం చేశారు మీరు . తర్వాత మే

అనిల్ కుమార్: త్యాగుల్ గుప్తమ్ముగాక దగ గరకన్ మే

గోలి హనుమత్ శాస్త్రి: అమ్మయ్య … ఇప్పటికి బీర్ కాయలందుకున్నారు. (ఆసక్తిగ బీరములను ననకన్ వనముల్)

విశ్వనాధశర్మ కొరిడె: నా దోసములను ఎంచుతున్నారా?

కిరణ్: శాకంబరి కదా… మధ్యే మధ్యే పానీయమ్ సమర్పయామి అన్నట్టు… కాస్త నాకు కూడా మీ కృపనీయమని వినతి, అవధాని గారూ!

అనిల్ : కృప యిస్తున్నాను తీసుకోండి .

అనిల్ కుమార్: ప్రతిగ నొసంగె బీరముల పద్ధతి కాదని రామచంద్రుడై

అనిల్ కుమార్: సమస్య రెండవ పాదం : కరువౌ ప్రాంతమ్ము నందు కడు ధనికుడునై.

విశ్వనాధశర్మ కొరిడె: దోసములను ఇప్పుడు లెక్కించరా? బాగున్నది 2వ పాద

అనిల్ కుమార్: సమస్య రెండవ దానికి రెండవ పాదం : చండాడందగినావు గాదె నిజమౌ చండీ ప్రసన్నంబుగా

గోలి హనుమత్ శాస్త్రి: అవధాని గారూ ! మా కూరల దరికి వచ్చి వాడకముందే వాడి‘ తరిగి ‘పోయేట్లు చేయండి…

అనిల్ కుమార్: ఆ కోర్కెల్ పులిహోరయందు గనుచున్ వ్యాఘ్రాసనాసీననే

చింతా రామకృష్ణ: అవధాని గారూ! మీ మాటలలో చురుకుదనం కనబడేలాగ వేగంగా పూరించి అందరినీ అబ్బురపరచండి.

అనిల్ కుమార్:

నా శక్తి కొలది కొలతున్

శ్రీ శాకంబరి దయఁ గన జేజేలిడుచున్.

చింతా రామకృష్ణ: ఇక మిగిలినవారి ప్రశ్నలకు కూడా మీ పూరణములను పూర్తి చేసిధారణ కనబరచగలరని ఆశిస్తున్నానండి.

“ఉ-ఊ-ఒ-ఓ-ప-ఫ-బ-భ-మ-వ” నిషేధమన్నాను. మీరు బ అనే హల్లు తప్పదన్నారు. సరే అన్నాను.

మీ పూరణ రెండు పాదములు. నేను కోరిన విధంగా వ్రాసే ఉంటారు ధన్యవాదములు.

అనిల్ కుమార్:

తై గణపతికి నొసంగగ

యే గొడవది లేక పోయె యెన్నిక యగుచున్.

చింతా రామకృష్ణ:

పూరణ ధారణ కలిపి చేసెయ్యండి.

అనిల్ కుమార్:

దత్తపది 3,4 పాదాలు :

ధ్యాసన్ ఆనతినిమ్మని

వాసిన్ కావంగ రామ భద్రుడు వెడలెన్ ll

అనిల్ కుమార్:

దత్తపది కొరిడే గారిది :

కుతకుత దోస పూర్ణుడగు కుత్సితు డా దశ కంఠుడక్కటా

వెతలతొనాలు బిడ్డలను వీడి చనెన్ యమలోకమంతటన్ ll

కొరిడె:

ధన్యవాదములు, బహు సుందరముగా నింపినారు. నా పద్య రచన కూడ చూడండి.

చం కదనము నీటమాట సరికాదు దశాస్యునితో, కపీంద్రులా

ర! దితిజు( వంటి దోసముల రాజును ముట్టడి సేసి, నంతమొం

దు దనుక సేదదీర్చదగదుర్విన బీరము నుప్పరిల్లగన్

మదిని దయాలు  రామవిభుమాత్రమునిండుగ జేసి రండికన్

 

చింతా రామకృష్ణ:

మీ సహనంబు మెచ్చెదను. మీ కవితా మహిమంబు మెచ్చెదన్

మీ సుమ పేశలాన్విత సుమేధను మెచ్చెద, మిమ్ము మెచ్చెదన్

మీ సుగుణాశ్రితంబులగు మేల్పలుకుల్మది నుంచి మెచ్చెదన్.

మీ సములెవ్వరయ్య.తరమే మిము నెంచ ననిల్ కుమారుడా!

దత్తపది :

మూడవ, నాల్గవ పాదాలు.:

కుతకుత దోస పూర్ణుడగు కుత్సితు డా దశకంఠుడక్కటా

వెతలతొ నాలు బిడ్డలను వీడి చనెన్ యమలోక మంతటన్ ll

సమస్య : పరువున్ బోయెడు రీతిగ

పరమాన్నము తిన్న వాడు పాపము బొందున్ ll

6. సమస్య : నండంగా నుతియించు భక్తులకు నిత్యానందవై యుండు , కూ

ష్మాండంబుల్ ధరియించు హే జనని ! కామ్యంబిమ్ము శాకంబరీ ll

విశ్వనాధశర్మ కొరిడె:

చం.    అనిలకుమార! నీ యనుపమాన వచః ప్రవిముక్త పద్యముల్

ననితరసాధ్యహృద్యములు నై నవధానబుధేంద్ర! పృచ్ఛకా

గ్రణుల మనో విలాసముల రంజిలజేసి సరోజగంధ వీ

చినివృతసాంద్రమాలికలచే నలరింపగ జేసినాడవే!

చింతా రామకృష్ణ:

వయసు మీద పడగ వడలిన వృద్ధుడ.

జాలమందు నిలిపి చాలదనక

జాలమెన్ని చేసి జడిపింప తగదయ్య.

వేగ పూర్తి చేసి వెలయుమయ్య.

గోలి హనుమత్ శాస్త్రి:

ధన్యవాదములు.

దోసంబది లేదింతయు

చేసిరి యవధాన మిట్లు ఘనమవ్వంగన్

ధ్యాసగ నిమ్మహి మెచ్చెడు

గ్రాసంబీ రాత్రి వేళ కమ్మగ దొరకెన్.

చింతా రామకృష్ణ:

రెండవ తీగలో నడచి రేయిని మమ్ముల త్రిప్పుటొప్పునా

పండితవర్యుడా! సరస పాండితి మాకపురూపు జేయుదే?

కొండొకతీగమీ కొరకు కోరికతో సృజియించి యుంచగా

దండము పెట్టి మ్రొక్కెదను దారిని మాకు కనంగ జేయుడీ!

ఆర్యా! వర్ణనతో సహా అన్నీ పూరణలు పూరయ్యాయా?

పూర్తి చేసితిరేని పూజ్యుడా భరతవాక్యమ్ము పల్కవచ్చు కమ్మగాను.

జాగు చేయు కొలది ప్రేగులో మాండుట

కనుట తప్పదయ్య కరుణ గనుడి!

స్పందనలేదదేలొ? ఘన సత్కృతితో నవధానమందునన్

ముందుగనున్న మీరు కనుముందర గానగ రారదేలనో?

సుందర భావనామృత ప్రశోభిత సత్కవనాభిరామ! మీ

ముందరనుంటిమా?కనుచు. పూజ్యుడ కానగ రావదేలనో?

పూజ్యులైన అవధానిగారు పూరణ ధారణ కూడా పూర్తి చేసే ఉంటారు.

నా ప్రశ్నకు సమాధానముగా నాపూరణమును మీ ముందుంచుచున్నాను.

జగదాశ్రిత జననీ! నీ  -

యగణిత సజ్జన కటాక్ష హృదయ నిజార్తిన్

జగతిన్నెన్నగనగునా?  -

నిగనిగ కలిగించనేది నేర్చితి నిధిగా!

అనిల్ కుమార్:

ధారణ జరుగుతున్నది.

1. దోశక్తి గల్గి యుండుదు

కాశీ నాథుని సతికిని కరుణా యుతనున్

నా శక్తికొలది గొలతును

శ్రీ శాకంబరి దయఁ గన జేజే లిడుచున్ ll

అమ్మ వారి పేరు నిషిద్ధం లేదు . కావున నిరోష్ఠ్యము స్వీకరించలేదు.

2.నిషిద్ధాక్షరి

శ్రీ గీలు నింట నుంటే

త్యాగుల్ గుప్తమ్ము గాక దగఁ గరకన్ మే

తై గణపతికి నొసంగగ

యే గొడవది లేక పోయె యెన్నికయగుచున్ ll

3.దత్తపది :

దోసము లెన్నడు కైకలొ

ఆసక్తిగ బీరములనుననకన్ వనముల్

ధ్యాసన్ ఆసతి నిమ్మని

వాసిన్ కావంగ రామ భద్రుడు వెడలెన్ ll

4. దత్తపది ;

అతడట మాట మాటకునుయంజలి బట్టక నాయుధంబులన్

ప్రతిగనొసంగె బీరముల పద్ధతి కాదని రామచంద్రుడై

కుత కుత దోసపూర్ణుడగు కుత్సితుడా దశకంఠుడక్కటా

వెతలతొనాలుబిడ్డలను వీడి చనెన్ యమలోక మంతటన్ ll

5.సమస్య :

కరివేపాకున్ దొరకని

కరువౌ ప్రాంతంబునందు కడు ధనికుడునై

పరువున్ బోయెడు రీతిగ

పరమాన్నము తిన్నవాడు పాపము బొందున్ ll

6.సమస్య :

దండాలమ్మ ! పవిత్రమాత ! దురమున్ తాడించి పీడించుచున్

చండాడందగినావు గాదె  నిజమౌ చండీ ! ప్రసన్నంబుగా

నండంగా నుతియించు భక్తులకు నిత్యానందవై యుండు , కూ

ష్మాండంబుల్ ధరియించు హే జనని ! కామ్యంబిమ్ము శాకంబరీ ll

7.వర్ణన :

మీకాదుర్గయటన్ననెన్న మిగులన్ మేలైన భక్తౌ గదా !

ఆ కోర్కెల్ పులిహోరయందుగనుచున్ వ్యాఘ్రాసనాసీననే

చేకొల్వం దగియుంటివమ్మ పుడమిన్ , చిత్తంబునన్ దల్చగా

వీకన్ తా పులిహోర వ్యాఘ్రములు తావివ్వంగ పబ్బంబులన్ ll

చం. సరస కవిత్వయుక్త సువచస్సముపేతులు పృచ్ఛకోత్తముల్

ధరణి ప్రజాళి మెచ్చెడు విధంబుగ సత్సహకారమివ్వగా

వరమొసగంగ శాంభవి శుభంబగునంచు జయమ్ముగల్గెగా

విస్తరమతులైన మీకు మనసార కృతజ్ఞతలందజేసెదన్  ll

 

శ్రీ శాకంబరి అష్టావధానం చేయడానికి అవకాశమిచ్చిన మాలిక అంతర్జాల పత్రిక సంపాదకులు శ్రీమతి వలబోజు జ్యోతి గారికి , మఱియు శ్రీ భరద్వాజ్ వెలమకన్ని గారికి , పృచ్ఛకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

విశ్వనాధశర్మ కొరిడె:

అవధాని గారికి , అధ్యక్షులు శ్రీ చింతా వారికి ,నిర్వాహకురాలైన శ్రీమతి జ్యోతి గారికి భరద్వజ గారికి నన్ను పృచ్ఛకునిగా నెంచుకొన్నందులకు కృతజ్ఞుడను. ధన్యవాదములు.ఒక మంచి కార్యక్రమమున ఆహ్వానించబడినందులకు ఎంతో సంతోషముగానున్నది. నజముగా సరసపద్యరసస్వాదనలచే మృష్టాన్న భోజనముచేసినట్లున్నది. మరొకమారు ధన్యవాదములు.

గోలి హమనుత్ శాస్త్రి:ధన్యవాదములు.

దోసంబది లేదింతయు

చేసిరి యవధాన మిట్లు ఘనమవ్వంగన్

ధ్యాసగ నిమ్మహి మెచ్చెడు

గ్రాసంబీ రాత్రి వేళ కమ్మగ దొరకెన్.

చింతా రామకృష్ణ:అంతర్జాల అష్టావధానమున ఈ నాడు మన అందరి ప్రశంసార్హంగా అవధానిగారు తనకు గల అవధాన నైపుణ్యమును ప్రదర్శించి, ఆబాల గోపాలమును ఆనంద పారవశ్యులను చేశారు. ఆ శాకంబరీ జగజ్జనని యొక్కయు, పద్మావతీ అలమేల్మంగా సమేతుడైన ఆ శ్రీమద్వేంకటేశ్వరులవారి యొక్కయు మహదాశీస్సులనెల్లప్పుడూ కలిగి యుందురు గాక. వారికి నా హృదయ పూర్వకమైన అభినందనలు.

నాతో సహకరించిన పృచ్ఛకాళికి నా కృతజ్ఞతాంజలి. మాలిక పత్రిక యాజమన్యానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.ఈ కార్యక్రమ నిర్వహణలో గుణ దోషములుండక మానవు. గుణములు మీకు తోచెనేని అవి ఈ కార్యక్రమమున పాల్గొనిన అందరి యొక్క సహాయ సహకారములవననే యని మనవి చేయుచున్నాను. ఒకవేళ దోషములే దొర్లినట్లుగా మీదృష్టికి వచ్చినట్లైతే అవి కేవలము నా అజ్ఞానమునకు అనుభవశూన్యతకు గుర్తుగా గమనించి, సహృదయముతో మన్నింతురని ఆశించుచున్నాను. “యత్సారభూతం తదుపాసితవ్యం హంసో యథాక్షీరమివాంబు మిశ్రం”.క్షీర నీర న్యాయమున దొర్లిన గుణ దోషములలో గుణ గ్రహణ పారీణులైన రాజహంసలందరికీ నా కైమోడ్పులు.

నమస్తే.

శుభమస్తు

ధారణ:

శ్రీ రామ

శ్రీ శాకాంబర్యై నమః

శ్రీ శాకాంబరీ అష్టకమ్

జ్ఞానం సమస్తం అశనే నివేశ్య

శాకైశ్చ సర్వైస్సమలంకృతాంబ !

పద్మాక్షి ! లోకేశ్వరి ! పార్వతి ! శ్రీ

శాకాంబరి ! త్వాం శరణం ప్రపద్యే ll1ll

భావం :- సమస్త జ్ఞానాన్ని ఆహారంలో ఉంచి ఆకుకూరలతో అలంకరింపబడిన , పద్మాక్షివి , లోకేశ్వరివి , పార్వతివి అయిన ఓ తల్లీ ! నిన్ను శరణుగోరుచున్నాను.

 

జ్ఞాత్వా శిశూన్ తే పరితః క్షుధార్తాన్

క్షామం క్షమాయామవలోక్య సద్యః l

ఆహార రూపేణ సమాగతా శ్రీ

శాకాంబరి ! త్వాం శరణం ప్రపద్యే ll2ll

భావం :- భూమిపై ఉన్న కరువును , ఆకలిగొన్న నీ బిడ్డలను చూసి ఆహార రూపంగా వచ్చిన ఓ శాకాంబరి ! నిన్ను శరణుగోరు చున్నాను.

 

త్వమన్నపూర్ణా చ త్వమేవ దుర్గా

త్వమేవ లక్ష్మీశ్చ సరస్వతీ చ l

శక్తిత్రయోపేత సుమంగళీ శ్రీ

శాకాంబరి ! త్వాం శరణం ప్రపద్యే ll3ll

భావం :- అన్నపూర్ణ , దుర్గ , లక్ష్మి ,సరస్వతి ఇట్లా ఎన్ని పేర్లతో పిల్చినా నీవే ముగ్గురమ్మల మూర్తిగా ఉన్నావు. కావున ఓ శాకంబరి !నిన్ను శరణుగోరుచున్నాను.

 

త్రిలింగభాషా సురభారతీ వత్

ఆవిష్కరోత్యాశు సమస్త భావాన్ l

పాండిత్యమస్యామపి దేహి మాతః  !

శాకాంబరి ! త్వాం శరణం ప్రపద్యే ll4ll

భావం :- ఈ భూమి మీద తెలుగు భాష అనేది ఒకటి ఉన్నది. ఇది కూడా సంస్కృత భాష లాగా వేగంగా మనలోని భావాలను యథా తథంగా వ్యక్తం చేయడానికి అనువైనది. కావున సంస్కృతం కొంత తెలిసిన నేను తెలుగు భాషలో కూడా పాండిత్యాన్ని సంపాదించదలచి తల్లివైన నిన్ను శరణుగోరుచున్నాను.

 

గీర్వాణ కావ్యాని మనోహరాణి

అనూదితాన్యాంధ్ర వచస్సు మాతః !

జిఘ్రుక్షయా తాని సుబోధకాని

శాకాంబరి ! త్వాం శరణం ప్రపద్యే ll5ll

భావం :- మనోహరమైన సంస్కృత కావ్యాలను తెలుగు లోనికి అనువదించారు. వాటిని అర్థం చేసుకొనే శక్తి సంపాదించడానికి నిన్ను శరణువేడుతున్నాను.

 

కవిత్రయం నన్నయ తిక్కయజ్వా

శ్రీ ఎఱ్ఱనేత్యాహురమూన్ త్రిలింగే l

జిజ్ఞాసయాహం తు జయం అమీషాం

శాకాంబరి ! త్వాం శరణం ప్రపద్యే ll6ll

భావం :- తెలుగు భాషలో నన్నయ , తిక్కన , ఎఱ్ఱన అను ముగ్గురినీ కవిత్రయం అంటారు. వారు జయ అను మారు పేరు గల శ్రీమన్మహాభారతాన్ని రచించారు. వీరి జయ కావ్యాన్ని అర్థం చేసుకొనే శక్తి పొందడానికి నిన్ను శరణుగోరుచున్నాను.

 

అష్టావధానం హి త్రిలింగభాషా

కళా చమత్కార కవిత్వయుక్తా l

తస్మిన్ సువర్ణాశ్రిత శ్లొకహారైః

శాకాంబరి ! త్వాం శరణం ప్రపద్యే ll7ll

భావం :- తెలుగుభాషలో అష్టావధానం అనే చమత్కారమైన సారస్వత పద్య కళ ఒకటి ఉంది. ఇందులో మంచి అక్షరాలతో కూర్చిన పద్యహారములతో నిన్ను పూజిస్తూ శరణుగోరు చున్నాను.

 

అష్టావధానం మధురం చ క్రీడాం

త్వదీయ నామ్నా పరికల్ప్య పాకమ్ l

నివేదయన్ తేsoబ కవిత్వ రూపం

శాకాంబరి ! త్వాం శరణం ప్రపద్యే ll8ll

భావం :- మధురమైన అష్టావధాన క్రీడ అను పాకాన్ని నీ పేరిట కల్పించి ఆ కవిత్వరూప పదార్థాన్ని నీకు నైవేద్యం చేస్తూ నిన్ను శరణుగోరు చున్నాను.

 

ఇతి శ్రీ మాడుగుల వంశ పారావార సుధాకరేణ అనిల కుమార శర్మణా విరచిత శ్రీ శాకాంబరీ అష్టకం సంపూర్ణమ్.

//ఓం తత్సత్//

హరిః ఓమ్

శ్రీ గురుభ్యో నమః

శ్రీ మహా గణాధిపతయే నమః

శ్రీ శారదాంబాయై నమః

నమస్సభాయై

సభయందాసీనులైన సభాధ్యక్షులవారికి , మాలికా అంతర్జాల పత్రిక నిర్వాహకులకు , పృచ్ఛక కవిమిత్రులకు సవినయ నమస్కారాలు. శ్రీ శాకాంబరీ అష్టావధాన సందర్భంగా పై విధంగా అమ్మవారిపై అష్టకాన్ని రచించి స్తోత్రం అందజేయుచున్నాను.  ముందుగా శ్రీ గణపతి స్తోత్రం తో అవధానాన్ని ప్రారంభిస్తున్నాను.

 

ఉ. వ్యాసుని లేఖకుండగుచు భారత భవ్య కథాస్రవంతి ను

ద్భాసిత శ్వేత దంతమున వ్రాసె రయమ్ముననేకదంతుడై

దోసములెల్లఁ ద్రోయదగు తొండముగల్గిన తద్గజాస్యుకున్

దాసుడనై  కవిత్వము సుధారసమొల్కగనివ్వ గొల్చెదన్ ll

 

శ్రీ సరస్వతీ స్తుతి :

మ. భవదీయాద్భుత పాదపంకజములన్ బంధించి చిత్తంబునన్

కవితాధార సుధారసమ్ము నొసగంగా గొల్తు సద్భక్తితో

అవధానమ్మున జ్ఞాన నేత్రమున నుద్యద్భాను సంకాశవ

వ్వవె కావ్యాత్మ ! సరస్వతీ ! జనని ! వాగ్వ్యాపారమందింపుమా ll

 

పూర్వ అవధానుల స్తుతి :

చం. అరుదగు ఈ వధానమను అద్భుత క్రీడ తెలుంగు భాషలో

చొరబడె తొల్త మెచ్చగ యశోధనులైరి కవీంద్రులెందరో

నిరుపమ ధారణాన్వితులు , నేర్పరులాద్యవధాన ధీరులం

దరిని నమస్కరించెద ప్రధానమటంచవధాన వేదికన్ ll

 

మా గురువులు కీ.శే. శ్రీ కలపటపు భాస్కర రావుగారిని గురించి :

మ. తలతున్ మద్గురు భాస్కరాఖ్యుడను విద్వాంసున్ మహా తాంత్రికున్

లలితాపాద సరోజ భృంగు కవితా లాలిత్య సంశోభితున్

చలదుత్తుంగ తరంగ సంగత వచస్సంరంభ సంక్షోభితా

ఖిల శాస్త్రార్థ విచార భావనిలయున్ క్షేమార్థినై మ్రొక్కుచున్ ll

 

మరొక గురువులు మహా మహోపాధ్యాయ శ్రీ సముద్రాల లక్ష్మణయ్య గారి గురించి :

చం. అలరగ సంస్కృతాంధ్రములయందవలీలగ పద్యగద్యముల్

ఒలకగ వాక్సుధారసములొప్పగురీతి రచింపజాలుచున్

పలువురు మెచ్చునట్లుగ సభాస్థలమందునుపన్యసించు ధీ

రులయిన లక్ష్మణయ్యను గురూత్తము నే నుతియింతునియ్యెడన్ ll

 

శ్రీమతి వలబోజు జ్యోతి గారికి :

కం. పలుకులవి తల్లి ప్రేమను

తలపించును పరిగణింప , దాతృత్వముకున్

నెలవై  వెలుంగు శ్రీమతి

వలబోజు జ్యోతిగార్కి వందనమిడెదన్ ll

 

శ్రీ చింతా రామకృష్ణా రావు గారికి :

శా.  ప్రాచీనాంధ్రకవిత్వ తత్వవిదుడై ప్రజ్ఞా ధురీణుండుగా

నౌచిత్యంబగు చిత్రబంధ కవిగానాశల్ యశోపేతుడై

తా చింతామణియౌచు మిత్రులకు చింతా రామకృష్ణాహ్వయుం

డే చేరన్ సభ చాలకుండగుచు యేనింపారగా మ్రొక్కెదన్ ll

 

శ్రీ కొరిడె విశ్వనాథ శర్మ గారికి :

ఆ.వె. కొరిడె విశ్వనాథ సురభారతీబుధ

సత్తమా! కవీ ! యశస్వి ! మాన్య

చరిత ! నా నవీన శాకాంబరి వధాన

మలర మునుపు మీకునంజలింతు.

 

శ్రీయుతులు గోలి హనూమచ్ఛాస్త్రి గారికి :

తే.గీ. శ్రీయుతులు హనూమచ్ఛాస్త్రి శ్రీ సరస్వ

తీ కృపన్ గొని నిరతము తేజరిల్లు

పద్యరచనా ప్రసక్తుడై ప్రతిభజూపి

పండితోత్తము నతనికి ప్రణతులిడెద.

 

శ్రీనారుమంచి వేంకట అనంతకృష్ణ గారికి :

ఆ.వె.  శ్రీ అనంతకృష్ణ ! శ్రేయస్కరంబైన

న్యాయవాదవృత్తినలరుచుండి

తనరజేయుదు కవితా కన్యకవరింప

మాన్యచరిత ! మిము నమస్కరింతు.

 

శ్రీముక్కు రాఘవకిరణ్  గారికి :

ఆ.వె.    వయసునందు చిన్న పాండిత్యమున్ మిన్న

రాఘవ కిరణుడు విరాజమాన

పృచ్ఛకుండునౌచు వేదికనలరించె

వందనమ్ముజేతు ప్రజ్ఞగాంచి.

 

శ్రీ చక్రవర్తుల కిరణ్ గారికి :

తే.గీ.  నోట గఱపెను యాంగ్లమ్ము , తేట తెనుగు

కమ్మనైన పద్యముంగూర్చు కలముఁ బట్టి

చక్రవర్తుల కిరణు విస్తార కీర్తి ,

వేంకటేశ్వరుడితని దీవించుగాత !

 

శ్రీ యం.నాగగురునాథ శర్మ గారికి :

తే.గీ.  చదివె సాంకేతవిద్యల నదనుజూచి

సంస్కృతాంధ్రములను నేర్చి చతురుడయ్యె

నాగగురునాథ శర్మ స్వర్ణాక్షరార్చ

నారతునితనిన్ శుభము చేకూరుగాత !

 

శ్రీ భరద్వాజ్ వెలమకన్ని గారికి :

తే.గీ. శ్రీ భరద్వాజు గారు తంత్రీ ప్రసార

మగ్నులై అవధాన సన్మార్గమెల్ల

విజయవంతముగాగ కావింత్రు కృషిని

వారికొనరింతు మనసార వందనమ్ము .

 

శ్రీ శాకంబరీ అంతర్జాల అష్టావధానం

1. నిషిద్ధాక్షరి : నిరోష్ఠ్యముతో అనగా పెదవులు తగులు అక్షరములు ఉ , ఊ, ఒ , ఓ , ప , ఫ , బ , భ , మ , వ వర్ణములు లేని కంద పద్యంలో శ్రీ శాకంబరిని స్తుతిస్తూ పద్యం చెప్పాలి.

కం. దోశక్తి గల్గియుండుదు

కాశీ నాథుని సతికిని కరుణాయుతనున్

నాశక్తి కొలది కొలతున్

శ్రీ శాకాంబరి దయఁగన జేజేలిడుచున్ ll

భావము :- బాహుబలము కలదియు ,  కాశీనాథుని భార్యయు  , కరుణగలిగియుండునదియు అయిన శ్రీ  శాకంబరిని నన్ను దయతో చూడమని నా శక్తి కొలది జేజేలు పలుకుతూ కొలుస్తాను. ( అమ్మ వారి పేరుకు మినహాయింపు ఇమ్మని అవధాని కోరాడు )

 

2.నిషిద్ధాక్షరి :- వినాయకుడు తన మామ ఐన శ్రీ మహావిష్ణువు ఇంటికి వెళ్ళాడు.అప్పుడు అత్తాకోడళ్ళయిన లక్ష్మీ సరస్వతులు వంట ఎట్లు వండి పెడతారు?
కం.శ్రీ గీలు నింట నుంటే

త్యాగుల్ గుప్తమ్ము గాక దగ గరకన్ మే

తై గణపతికి నొసంగగ

యే గొడవది లేక పోయె యెన్నికయగుచున్ ll

భావము :- శ్రీ గీలు = త్యాగ గుణము గల లక్ష్మీ సరస్వతులు ( అత్తాకోడళ్ళు )  ఎటువంటి రహస్యము లేకుండా ఇంట్లో ఉండే గరకను గణపతికి ఆహారంగా ఇచ్చినారు. ఇప్పుడు అత్తాకోడళ్ళు వంట చేస్తే ఉప్పూ కారాలలో వికారాలు వచ్చి రుచులు తారుమారైంది అనే దోషం పోయింది. గరకను వండే పని లేనందువల్ల ఎటువంటి గొడవ లేకపోయింది.

 

3.దత్తపది : బీర , దోస , నిమ్మ , వంగ పదాలతో , కందపద్యంలో రామాయణార్థం  వచ్చేలా పద్యం చెప్పాలి.

కం. దోసము లెన్నడు కైకలొ

ఆసక్తిగ బీరములనుననకన్ వనముల్

ధ్యాసన్ ఆనతి నిమ్మని

వాసిన్ కావంగ రామ భద్రుడు వెడలెన్ ll

భావం :- రామునికి కైక అంటే భక్తి ఉంది. అందుకే ఆమె అడవులకు పొమ్మన్నప్పుడు తప్పుగా అనుకోలేదు. ఆమెను ఏమైనా దండించాలనే బీరాలు పలక లేదు. ఆమె అడవికి వెళ్తే అనుమతి ఇవ్వు వెళ్తున్నాను అని అందరినీ రక్షించేందుకు అడవికి వెళ్ళాడు. కైకకు రాముడు భగవత్ స్వరూపము అని తెలుసు. రాక్షస సంహారం జరిగి అందరినీ రక్షించాలని రాముని అడవికి పంపినది.

 

4. దత్తపది ; టమాట , దోస , బీర , ఆలు అనే పదాలతో రామాయణార్థం లో , యుద్ధ వర్ణనతో , చంపక మాల వృత్తంలో పద్యం చెప్పాలి.

చం.  అతడట మాట మాటకునుయంజలి బట్టకనాయుధంబులన్

ప్రతిగనొసంగె బీరముల పద్ధతి కాదని రామచంద్రుడై

కుత కుత దోసపూర్ణుడగు కుత్సితుడా దశకంఠుడక్కటా

వెతలతొనాలుబిడ్డలను వీడి చనెన్ యమలోక మంతటన్ ll
భావము :-  యుద్ధం చేస్తే టప్పుడు పరస్పర దూషణలు ఉంటాయి. రావణుడు ప్రగల్భాలు పలుకుతున్నా బీరాలు పలకక  శ్రీరాముడు ఆయుధాలతోనే అందుకు సమాధానం చెప్పాడు. అప్పుడు కుత్సితుడైన రావణాసురుడు కుతకుత కోపంతో ఉడుకుతూ రామ బాణానికి బలియై ఆలు , బిడ్డలను వదలి చనిపోయాడు.

 

5.సమస్య :- పరమాన్నము తిన్నవాడు పాపము బొందున్ ll

కం. కరివేపాకున్ దొరకని

కరువౌ ప్రాంతంబునందు కడు ధనికుడునై

పరువున్ బోయెడు రీతిగ

పరమాన్నము తిన్నవాడు పాపము బొందున్ ll
భావము :- కరివేపాకు కూడా దొరకని కరువు ఉన్న ప్రాంతంలో ధనికుడైన వాడు దూర ప్రాంతాల నుండి ఆహార పదార్థాలను తెప్పించుకోగలిగి , దానము చేయలేదనే పరువు పోయే విధంగా పాయసం చేసుకొని తింటే వాడు తప్పక పాపాన్ని పొందుతాడు.

 

6.సమస్య : అండమ్ముల్ ధరియించు హే జనని ! కామ్యంబిమ్ము శాకంబరీll

శా . దండాలమ్మ ! పవిత్రమాత ! దురమున్ తాడించి పీడించుచున్

చండాడందగినావు గాదె నిజమౌ చండీ ! ప్రసన్నంబుగా

నండంగా నుతియించు భక్తులకు నిత్యానందవైయుండు , కూ

ష్మాండమ్ముల్ ధరియించు హే జనని ! కామ్యంబిమ్ము శాకంబరీ ll

భావము :-  అమ్మా ! శ్రీ శాకంబరీ ! నీవు యుద్ధంలో శత్రువులను తాడించి , పీడించి క్రోధమూర్తిని వై ఉన్నావు. అటువంటి నీవు నిన్ను భక్తితో ప్రార్థించే వాళ్లకు అండగా ఉంటూ  ఎల్లప్పుడూ ఆనందంతో కనిపించు. కూష్మాండాలను అలంకారంగా కలిగిన ధరించిన ఓ తల్లీ ! కోర్కెలు ఈడేర్చుము.

 

7.వర్ణన :-  పండగలు అంటే పులిహోర గుర్తుకు వస్తుంది.  పులిహోరాకు , శార్దూలానికి ఉన్న సారూప్యాన్ని శార్దూల పద్యం లో చెప్పాలి.

శా. మీకాదుర్గయటన్ననెన్న మిగులన్ మేలైన భక్తౌ గదా !

ఆ కోర్కెల్ పులిహోరయందుగనుచున్ వ్యాఘ్రాసనాసీననే

చేకొల్వం దగియుంటివమ్మ పుడమిన్ , చిత్తంబునన్ దల్చగా

వీకన్ తా పులిహోర వ్యాఘ్రములు తావివ్వంగ పబ్బంబులన్ ll
భావము :- అమ్మా ! మీకు దుర్గాదేవి అంటే భక్తి ఎక్కువగా ఉంది. అందవల్ల వ్యాఘ్రం (పులి ) పై కూర్చొని యున్న అమ్మవారిని తలచుకొంటూ పులిహోర వండుతారు. అందువల్ల అమ్మవారి వాహనమైన పులి , పండుగలకు తగిన నైవేద్యమైన పులిహోర మీ వంటలో సారూప్యాన్ని పొందుతూ ఉంటుంది.

 

శ్రీ గోలి హనుమచ్ఛా స్త్రి:

దోసంబది లేదింతయు

చేసిరి యవధాన మిట్లు ఘనమవ్వంగన్

ధ్యాసగ నిమ్మహి మెచ్చెడు

గ్రాసంబీ రాత్రి వేళ కమ్మగ దొరకెన్ ll

 

శ్రీ చింతా రామకృష్ణ రావు గారు :

మీ సహనంబు మెచ్చెదను. మీ కవితా మహిమంబు మెచ్చెదన్

మీ సుమ పేశలాన్విత సుమేధను మెచ్చెద, మిమ్ము మెచ్చెదన్

మీ సుగుణాశ్రితంబులగు మేల్పలుకుమది నుంచి మెచ్చెదన్.

మీ సములెవ్వరయ్య.తరమే మిము నెంచ ననిల్ కుమారుడా!

 

శ్రీ కొరిడె విశ్వనాథ శర్మ గారు :

చం.    అనిలకుమార! నీ యనుపమాన వచః ప్రవిముక్త పద్యముల్

ననితరసాధ్యహృద్యములు నై నవధానబుధేంద్ర! పృచ్ఛకా

గ్రణుల మనో విలాసముల రంజిలజేసి సరోజగంధ వీ

చినివృతసాంద్రమాలికలచే నలరింపగ జేసినాడవే!
డా.మాడుగుల అనిల్ కుమార్ శర్మ :

చం. సరస కవిత్వయుక్త సువచస్సముపేతులు పృచ్ఛకోత్తముల్

ధరణి ప్రజాళి మెచ్చెడు విధంబుగ సత్సహకారమివ్వగా

వరమొసగంగ శాంభవి శుభంబగునంచు జయమ్ముగల్గె , వి

స్తరమతులైన మీకు మనసార కృతజ్ఞతలందజేసేదన్ ll

 

శ్రీ శాకంబరి అష్టావధానం చేయడానికి అవకాశమిచ్చిన మాలిక అంతర్జాల పత్రిక సంపాదకులు శ్రీమతి వలబోజు జ్యోతి గారికి , మఱియు శ్రీ భరద్వాజ్ వెలమకన్ని గారికి , పృచ్ఛకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

 

//ఓం తత్సత్//

 

 

 

Print Friendly

శ్రీ శాకంబరీ అంతర్జాల అష్టావధానం

 

మాలిక పత్రిక తరఫున రేపు సాయంత్రం భారతీయ కాలమానం ప్రకారం 6 గంటలనుండి రాత్రి 9 గంటల వరకు రెండవ అంతర్జాల అష్టావధానం నిర్వహించబడుతుంది. ఇదే శ్రీ శాకంబరీ అంతర్జాల అష్టావధానం. ఈసారి అవధాన కార్యక్రమం మొత్తం ఆహారానికి సంబంధించినదై ఉంటుంది. చూడాలి మరి ఎంత రసవత్తరంగా సాగుతుందో…. ఈ అవధానం మొత్తం లేఖనా రూపంలో జరుగుతుంది. దీనికోసం ప్రత్యేకంగా శ్రీ శాకంబరీ పేరిట ఒక గ్రూపు ప్రారంభించబడి అందులోనే చర్చలు జరుపుకుంటూ కార్యక్రమాన్ని ఒక తుది రూపానికి తీసుకురావడం జరిగింది. అందులో అవధానిగారు, పృచ్ఛకులు, మాలిక ప్రతినిధులు పాల్గొని అవధాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.. ఈ అవధాన కార్యక్రమంలోని ముఖ్య అంశాలు, పృచ్ఛకుల వివరాలు:

మొదట నిర్వాహకుల స్వాగత వచనాలు. తరువాత అవధాని గారి స్వపరిచయం, వరుసగా పృచ్ఛకుల స్వపరిచయం, అతిథుల స్వపరిచయం… అవధాన ప్రారంభం అవధానిగారి చేత దైవ ప్రార్థన, స్వవిషయం, (అవసరమనుకుంటే) అవధాన ప్రక్రియా పరిచయం, ప్రాశస్త్యాలు పద్యాలలో… నాలుగు ఆవృత్తుల వరుసక్రమం ఇలా ఉంటుంది.

1.నిషిద్ధాక్షరి

2. నిషిద్ధాక్షరి 2

3.మొదటి దత్తపది

4.రెండవ దత్తపది

5.మొదటి సమస్య

6.రెండవ సమస్య

7.వర్ణన

8. అప్రస్తుత ప్రసంగం నిర్వహించే పృచ్ఛకులకు ఎప్పుడైనా మాట్లాడే, ప్రశ్నించే స్వేచ్ఛ ఉంది. నిరంకుశులు కదా!

చివర అవధాని గారు, నిర్వాహకుడు ధన్యవాదాలు తెలుపడంతో అష్టావధాన కార్యక్రమం ముగుస్తుంది.

 

అష్టావధాని : డా . మాడుగుల అనిల్ కుమార్ గారు, ఎం .ఎ ; బి.ఎడ్ ; పీహెచ్ .డి. (సంస్కృతోపన్యాసకులు , శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాల , తిరుపతి)

అధ్యక్షులు మఱియు సంచాలకులు : శ్రీ చింతా రామ కృష్ణారావుగారు, భాషా ప్రవీణ , ఎం .ఎ

పృచ్ఛకులు :

1. నిషిద్ధాక్షరి : శ్రీ చింతా రామ కృష్ణారావు గారు

2. నిషిద్ధాక్షరి : శ్రీ ముక్కు రాఘవ కిరణ్ గారు

3. దత్తపది : శ్రీ గోలి హనుమచ్ఛాస్త్రి గారు

4. దత్తపది డా . శ్రీ కొరిడె విశ్వనాథ శర్మ గారు

5. సమస్య : శ్రీ యం.నాగగురునాథశర్మగారు

6. సమస్య : శ్రీ నారుమంచి వెంకట అనంతకృష్ణ గారు

7. వర్ణన : శ్రీమతి వలబోజు జ్యోతిగారు

8.అప్రస్తుత ప్రసంగం : శ్రీ నల్లాన్ చక్రవర్తుల కిరణ్ గారు

 

మరో ముఖ్యమైన విషయం: ఈ అవధాన కార్యక్రమాన్ని ఆస్వాదించి, ఆనందించాలనుకునే వారికోసం ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. అది మాలిక పత్రికలో రేపు సాయంత్రం ఆరునుండి మొదలవుతుంది. తప్పుకుండా చూడండి మరి.. ప్రతీ ఐదు నిమిషాలకోసారి ఈ పేజిన్ Refresh / Reload చేస్తుండాలి. ఈ ప్రత్యక్షప్రసార బాధ్యతలు నిర్వహిస్తున్నది భరద్వాజ్ వెలమకన్ని..

మాలిక పత్రిక : http://magazine.maalika.org  (ఇక్కడే)

Print Friendly

ఆలోచనలకే అక్షరరూపమిస్తే…

అబ్బబ్బబ్బా! ఈ ఆడాళ్ళు ఎప్పుడూ ఏదో ఒకటి వాగుతూనే  ఉంటారు. ఒక్క ఐదు నిమిషాలు నిశ్శబ్దంగా ఉండలేరు కదా. నలుగు ఆడవాళ్లు కలిసారంటే చాలు ఇక వాళ్ల ముచ్చట్లకు అంతే ఉండదు. బ్రహ్బాండం బద్ధలైనా, సముద్రాలు పొంగి  పొర్లినా వాళ్లకు అక్కరలేదు. ఐనా  ఈ ఆడాళ్లు ఎంత తొందరగా మాట కలిపేస్తారు, స్నేహం చేసేస్తారు. అసలు వీళ్లకు మాట్లాడడానికి ఒక అంశం అంటూ  ఇచ్చే పనే లేదు… పరిచయమైన రెండు నిమిషాలలోనే ఏదో ఒక అంశం మీద మొదలైన ముచ్చట ఎప్పటికి తెగెనో?  ఆవకాయ నుండి అణుబాంబు వరకు, పాలకూర నుండి ప్రైమ్ మినిస్టర్ వరకు మాట్లాడుకోవడానికి అసలు అక్కరలేని, మాట్లాడటానికి అవకాశం లేని అంశమే లేదు వాళ్లకు..

ఈ డైలాగులన్నీ మీరు అన్నవో, విన్నవో అనిపిస్తుందా??

సాధారణంగా ఆడవాళ్లు పనికిరాని మాటలు, ఊసుపోలు కబుర్లే చెప్పుకుంటారనిపిస్తుంది చాలా మందికి . కాని వాళ్లు నిశ్శబ్దంగా ఉంటే కూడా భరించలేరనేది జగమెరిగిన సత్యం. ఆడవాళ్లకు ఇంటిపని, వంటపని, పిల్లల పని తర్వాత టీవీ, షాపింగ్ తప్ప వేరే ఆలోచనలు ఏముంటాయి?? ఉండడానికి వీలు లేదనే పెద్దమనుషులెందరో ..  అది అబద్ధమని ఇప్పుడు నిరూపితమవుతుంది.  వృత్తి, ప్రవృత్తులతో పాటు తమ మనసులో కదలాడే  ఇతర భావనలకు, ఆలోచనలకు అక్షర రూపమిస్తే అవి అందమైన కవితలుగా మారతాయో, మనసులను కదిలించే కథలే అవుతాయో తెలీదు. కొన్నేళ్ల  క్రితం ముందు మగవాళ్లు చదువుకుని, ఉద్యోగమో, వ్యాపారమో చేసి కుటుంబ పోషణ చూసుకోవాలి, ఇల్లాలు ఇల్లు, పిల్లలు, కుటుంబ నిర్వహణ బాధ్యత చూసుకోవాలని నిర్దేశించారు. కాని కాలానుగుణంగా ఎన్నో మార్పులు వచ్చాయి. ఈనాడు స్త్రీలు కూడా ఉన్నత విద్యలను అభ్యసిస్తూ పురుషులతో పాటు సమానంగా అన్ని రంగాలలో తమదైన ప్రతిభతో రాణిస్తున్నారు.  కాని ఇంకా తమలో దాగి ఉన్న అంతర్గత శక్తిని గుర్తించని స్త్రీలెందరో ఉన్నారు. అది గుర్తించి, మెరుగుపరుచుకున్నప్పుడు వారిని మరింత అందంగా, తేజోవంతంగా చేస్తుంది. అన్ని రంగాలలో మాదిరిగానే నేడు మహిళలు రచనా రంగంలో కూడా ఉత్సాహంగా ముందుకు దూసుకెళ్తున్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక విజ్ఞానం కూడా ఎన్నో వెసులుబాట్లు, అవకాశాలు ఇస్తుంది. వాటిని కూడా అందిపుచ్చుకున్న స్త్రీలు తమ ఆలోచనలను, సంఘర్షణలను, భావాలను అక్షరరూపంలో వెలువరిస్తున్నారు. గుండు సూది తయారి నుండి.. అంతరిక్ష ప్రయాణంలో వరకు.. స్త్రీ పని భాగస్వామ్యం లేకుండా..ఏ పని జరగడం లేదు. ఐనా కూడా ఎన్నో ఆంక్షలు. అడ్డంకులు, ఆక్షేపణలు తప్పవు. ఆడవాళ్లకు రాయడానికి, చర్చించుకోవడానికి ఇల్లు, వంట, పిల్లలు, పచ్చళ్లు, తప్ప ఇంకేం విషయాలు ఉంటాయి అని గేలి చేసే స్త్రీ పురుషులెందరికో మా ఆలోచనలను అంతవరకే పరిమితం చేయవద్దు అని తమలోని బెరుకు, భయాన్ని వదిలేసి తమ ఊహలకు రెక్కలు తొడిగి వాటిని అక్షరాలుగా మారుస్తున్నారు మహిళలు. కసవు ఊడ్చే చేతులతోనే  కలం పట్టి  తమ ఆలోచన తరంగాలను అద్భుతమైన కవితలుగా, కావ్యాలుగా, కధలు, నవలలుగా,హాస్య గుళికలుగా మార్చి   చదువరులను అలరిస్తున్నారు.. కొందరి రాతలు మనసుకు సాంత్వన నిస్తే కొందరి రాతలు గుండెలను మండిస్తాయి, కత్తులతో ముక్కలుగా చీల్చేస్తాయి.   వైద్యం, నాట్యం, న్యాయం, సంగీతం,నటనతో పాటు రచనా రంగంలో కూడా తమదైన ముద్రతో  రాణిస్తున్న మహిళలకు   రాబోయే మహిళా దినోత్సవ సంధర్భంగా మాలిక పత్రిక తరఫున మనఁపూర్వక అభినందనలు,

నా ఆలోచనలకు తగినట్టుగా అద్భుతమైన చిత్రాన్ని వేసి ఇచ్చిన ఉదయ్ కుమార్ గారికి ధన్యవాదాలు..

Print Friendly

జ్యోతిష్యం – బొమ్మలకధ

రచన: డి.సునీల

మామిడి పిందెలు ఇంకా ముదరలేదు , వేప మాత్రం విరగ బూసింది ,వేసవి తన  ప్రతాపాన్ని చూపడానికి తయారవుతుంది. కోయిల తన సంగీతాన్ని కసరత్తు చేస్తున్న వేళ ఉగాది రానే వచ్చింది. పొద్దున్నే పనులన్నీ ముగించుకొని , రావాల్సిన బాకీలు లెక్కచూసుకున్నాడు అప్పారావు . వచ్చే సంవత్సరం ఎలా ఉంటుందో , ఎలా జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నాడు . అహా నా పెళ్లంట లో కోటా శ్రీనివాస్ కంటే 2 ఆకులు ఎక్కువే చదివిన అప్పారావు . నయా పైసా ఖర్చుకాకుండా పనులన్నీ జరిగి పోవాలనుకుంటాడు .         జ్యో్తిష్యంపై ఇంగిత ఙ్ఞానం కూడా లేని అప్పారావు పక్క వీధిలో ఉన్న శంకర శాస్త్రి దగ్గరకు వెళ్లి  తన రాశి ఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకోవానుకున్నాడు . సాయంత్రం 6 గంటలకు గొడుగు , చేతి సంచి తీసుకుని బయలు దేరాడు. భార్యతో  గడి సరిగ్గా వేసుకో కాసేపట్లో వచ్చేస్తాను అన్నాడు , సరే అన్నట్టు తలూపింది కాంతం.

“ఈ సారి కుంభరాశివారికి ఎలా ఉందో చూద్దాం “అంటూ మొదలెట్టాడు . శంకరశాస్త్రి  ఏకం ద్వే త్రీణి .. అని వేళ్లు లెక్క పెడుతూ చెప్పసాగాడు..  “అప్పారావు!!   మంగళుడు భారీగా ఉన్నాడు , కన్య ఇంట్లో బుధుడు తిష్ట  వేసాడయ్యా, చంద్రుడేమో  ఎనిమిదింట ఉన్నాడు , సూర్యుని పైన శని ఏడో ఇంట ఉన్నాడు , అదాయం ఒకటి వ్యయం రెండు “అన్నాడు తాపీగా..

“ఏమిటి శాస్త్రి గారు ! నా కొడుకు పేరు సర్వమంగళుడు , వాడు భారీ అవ్వడం ఏంటి ?. రోజు వాడికి  ఎంత తిండి తినిపించినా ఒక్క ఇంచు కూడా లావవ్వట్లేదు . కన్య  మా పక్కింటావిడ,  ఈ బుధ మహరాజ్ వాళ్ళింట్లో  ఏం చేస్తున్నాడు ? సూర్యుడు చంద్రుడు ఆకాశంలో ఉన్నారు .ఎనిమిదో ఇంట్లో ఉన్న శని శంకర్  ఒక్క సారి పైకి ఎదిగే  అవకాశమే  లేదు . ఎందుకూ పనికి రాడు వట్టి వెధవన్నర వెధవ ! నేనెవ్వరికీ ఒక్క పైసా కూడా ఇవ్వను. నాకు  వ్యయం ఏంటి?“ అంటూ బుకాయించి  ఇంటికి బయలుదేరాడు అప్పారావు. అయినా శంకరశాస్త్రి అతన్ని ఏమి అనలేదు పైగా మనసులో నవ్వుకున్నాడు.

అన్నీ గమనిస్తున్న శాస్త్రిగారి భార్య సుబ్బలక్ష్మి రాత్రి భర్త కు భోజనం వడ్దిస్తూ  కడుపులో ఉన్న మాట అడిగేసింది . “ఏమండీ ఆ అప్పారావు ఒక్క పైసా కూడా దక్షిణా ఇవ్వకుండా బయలుదేరాడేంటండి “అంది . దానికి  శంకరశాస్త్రి నవ్వుతూ, చెప్తే విన్నాడా?  ఒకటి ఆదాయం వ్యయం అంటే .. ఇందాకే వాళ్లవిడ వచ్చి రాశి ఫలం అడిగి అయిదు వందలు ఇచ్చి వెళ్లింది అసలు విషయం చెప్పాడు శంకర శాస్త్రి .

 

**************************************************

 

 

 

 

 

 

 

 

Print Friendly

పాటే (మాటే) మంత్రము

రచన: వెంకట్ హేమాద్రిబొట్ల

ఇంద్రధనస్సు లో ఏడు రంగులు ఉంటాయి.  కలైడోస్కోప్ లో ఎన్నో రంగులు మారుతూ ఉంటాయి.  చిన్నప్పుడు బయోస్కోపు అనే ఈ బండి అద్దం ముందు, ఒక చేయి కంటి దగ్గిర గొట్టంలా పెట్టుకుని చూస్తుంటే, ఆ బండి అతను హాండిల్ తిప్పుతూ ఉంటే, ఒకట తరువాత ఒకటి  చిత్రాలు వచ్చేవి.  అవి ఎన్నో రంగులు మారుతూ,  దగ్గిరగా దూరంగా, పెద్దగా చిన్నగా వివిధ ఆకారాలుగా మారుతూ ఉండేవి.  అలా చూస్తూ అబ్బురపడేలోపు ఆ చిత్రం అయిపోయేది.  “మళ్ళీ చూపించు” అంటే “మళ్ళీ డబ్బులు” అనేవాడు అతను.

అందరూ అలా ఆసక్తిగా చూసే ఆ యంత్రంలో ఎలా అయితే రంగులు మారుతాయో, అదే విధంగా, ప్రతీ ఒక్కరి పయనంలో కూడా అలా అనుభవాలు మారుతూ ఉంటాయి అన్న మాట.

“ఆహ, అలాగా”? – అవును అలాగే.

ఈ విషయంలో నేను చాలా చాలా పరిశోధనలు చేసాను.  ఇప్పుడు అవన్నీ చెపితే మీరు చదవరు కానీ, దాదాపు అందరి జీవితంలో జరిగే సంఘటనలను, అనుభవాలని రంగరించి, వాటిని అధ్బుతమైన గేయాలుగా మలిచి, ఎంతో మంది కవులు తెలుగు చలన చిత్రాలలో అందించిన పాటల గురించి ఇవాళ తెలుసుకుందాం.  ఈ గేయాలకు తమదైన శైలి లో బాణీలు సమకూర్చి జనరంజకంగా అందచేసారు సంగీత దర్శకులు.  వెరసి, అవి అందరినీ అలరించే ఆణిముత్యాలుగా వెలుగొందాయి.

ఈ గేయాలు ఎన్నో గాయాలు మానేందుకు దోహద పడ్డాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

ప్రతీ ఒక్కరూ వారి ప్రయాణంలో ఎప్పుడో ఒకప్పుడు ఒడిదుడుకులు ఎదురుకునే ఉంటారు.  అలా జరిగినప్పుడు, కొంత మంది పదే పదే వాటి గురించి ఆలోచిస్తూ, క్రుంగి పోతూ ఉంటారు.  అలాంటప్పుడు వారికి కావలసినది అండగా నిలిచేవారు, వారు చెప్పే ఒక మంచి మాట.  సరిగ్గా, అటువంటి అండగా నిలుస్తూ, ధైర్యాన్ని నూరిపోసి, ఉత్తేజపరిచే పదాలను రంగరించి, వాటిని ఉల్లాసమైన రీతిలో అందించే అద్బుతమైన ఔషదం పేరే “పాట”.

ఆత్మన్యూన్యత, అలసట, వేదన, ఆవేదన, దుఖం అనేవి పటాపంచలం అయిపోయేలా ఈ పాటలు వినేవారిలో ఉత్సాహం నింపుతాయి.  నిరాశగా కూర్చున్న వారిని తట్టి లేపుతాయి, ముందుకు నడవమని ప్రభోదిస్తాయి, అందుకు కావలసిన శక్తిని కలిగిస్తాయి.

అవునండి – పాట – కేవలం వినిపించేది, మురిపించేదే కాదు, ముందుకు నడిపించేది కూడా.  ఈ రోజు అలాంటి పాటలలో కొన్నింటిని చూద్దాం,

నిరాశ నిస్పృహల తో కొట్టు మిట్టాడుతున్న వారికి  మొట్ట మొదట నీవు తెలుసుకోవాల్సిన విషయం “కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు” అని ఒక  పాట చెప్తుంది.  చీకటి అలుముకున్నదని బాధ పడుతూ, కలతలకే లొంగిపోయి కలవరిస్తూ కూర్చునే కంటే – సాహసమనే జ్యోతిని చేకొని సాగు అని చెప్పే అధ్భుతమైన పాట ఇది.   అలా చేసిననాడు, ఆ చీకటి ఉండదు, కలతలు ఉండవు.  అగాధమైన జలనిధి లో ఆణిముత్యము ఎలా అయితే దాగి ఉంటుందో, సుఖం అనేది కూడా శోకాల మరుగున దాగి ఉంటుంది.  అయితే, ఏది నీకు “ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను” అంటూ రాదు, దానిని శోధించి సాధించాలి, అదే ధీరుని యొక్క గుణం అని చెప్పే పాటతో ఈ వ్యాసం మొదలు పెడదాం.

అలాగే, ఇంకొక అధ్భుతమైన పాట – “ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం”.  వింటూనే నర నరాలలో ఉత్తేజం నింపే పాట.  నిరాశను పూర్తిగా పారద్రోలే పాట.  “గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు, బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు”.   నీ గమ్యం చేరే దాకా ఎక్కడా అగొద్దు, అసలు అలుపు అనే మాట రావొద్దు అని భుజం తట్టి ముందు నడిపే పాట.  కష్టాలు కన్నీళ్లు రానీ ఏమైనా కానీ, ఎదురు ఏదైనా రానీ, ఒడి పోవొద్దు, ఎట్టి పరీస్తితులలో రాజి పడొద్దు, నీ గమ్యం చేరేవరకు నిదుర పోవొద్దు, ఆ నింగే నీ హద్దుగా సాగు అని దిశా నిర్దేశం చేస్తుంది ఈ పాట.  అలా సాగిన నాడు ఆ వచ్చే “విజయాన్ని నీ పిడికిలి లో చూడాలి, ఆ గెలుపు చప్పట్లు గుండెల్లో మ్రోగాలి” అంటూ నుదుటిపై సంతకం చేసి, యెదలో చిరునవ్వు చిరునామాగా నిండి, వీడని నీడలా నీ వెంటే ఉంటా నేస్తం, పద ముందుకు అని ప్రోత్సహించే ఆ పాట నిజం గా అద్భుతం.  “నమ్మకమే మనకున్న బలం”, ఆ బలం తో “నీలి కళ్ళల్లో మెరుపు మేరవాలి, కారు చీకటిలో దారి వెతకాలి, గాలి వానలో ఉరుమి సాగాలి” అని చెప్పే ఈ పాట, ఈ గమనం లో తగిలే గాయాలలో నీ ధ్యేయం పొందు అంటుంది.  ఈ పాట ఒక్కటి ఉంటే చాలు, దానినే నేస్తం గా చేసుకుని, ఆ పలుకులే మననం చేసుకుంటూ, నిరాశా నిసృహలలో నుండి బయటపడి, తమ గమనం వైపు ఎంతో మంది దూసుకెళ్లారు అనేది నిజం.

 

ఎక్ల చొలో… ఎక్ల చొలో… ఎక్ల చొలోరే!  అన్నాడు విశ్వకవి రవీంద్రనాథ్‌ టాగోర్.  నీవు సరియైనదని నమ్మి, సాగిస్తున్న బాటలో ముందుగా ఎవరూ నీతో కలిసి నడవక పోవచ్చు.  అంతే కాక, నిన్ను ఎన్నో సూటి పోటీ మాటలతో నిరుత్సాహ పరచడానికి కూడా ప్రయత్నిస్తారు కొందరు.  అయితే, ఇవేవి లెక్క చేయక పట్టుదలతో ముందుకు సాగిననాడు క్రమంగా ఎంతో మంది నీతో కలిసి వస్తారు.  అంతకు ముందు విమర్శించిన వారు, అదే నోటితో నీకు జేజేలు పలుకుతారు.  ఇదే అర్ధం స్పురించే పాట, “ఎవరేమ్మనను, తోడురాకున్ననూ పోరా బాబు పో, నీ దారి నీదే, సాగి పోరా నీ గమ్యం చేరుకోరా” అని.  “నీకు వంద మంది కనపడుతూ వుండొచ్చు, నాకు మాత్రం ఒక్కరే కనపడుతున్నారు, యుద్ధం అంటూ స్టార్ట్ చేసాక నీకు కనపడాల్సింది టార్గెట్ మాత్రమే”  అని ఒక హీరో ఈ మధ్య అన్నట్టుగా, సూటిగా నీ గమ్యం వైపు సాగిపో అని చెప్పే పాట ఇది.   అలాగే  “బ్రహ్మపట్నం పోదమంటే దారి తెలియదు అన్నయ్య” అని ఒక చెల్లి అడిగినప్పుడు “సూటిగా చుక్కాని పట్టి నావ నడపవే చెల్లెలా” అని సమాధానం చెప్పాడు ఆ అన్నయ్య.   ఎపుడైనా ఒంటరిగా ఫీల్ అవుతుంటే “జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాదే, సన్యాసం సూన్యం నాదే” పాట గుర్తు తెచ్చుకుంటే ఎక్కడి ఒంటరితనం అక్కడ ఎగిరిపోతుంది.  ఈ మహా విశ్వం లో మనం కూడా భాగము అన్న భావన కలుగుతుంది.

“మౌనం గానే ఎదగమని మొగ్గ నీకు చెపుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్ని రాలినచోటే కొత్త చిగురు కనిపిస్తుంది” – ఇంక ఇంత కంటే క్లియర్ గా ఏమి చెప్పనక్కరలేదు అనుకుంటాను?  “చెమటనీరు చిందగా నుదిటి రాత మార్చుకో మార్చలేనిది ఏదీ లేదని గుర్తుంచుకో, పిడికిలే బిగించగా చేతిగీత మార్చుకో మారిపోని కథలే లేవని గమనించుకో” అంటూ పట్టుదలతో శ్రమిస్తే ఫలితం ఉంటుంది అని చెప్పిన పాట ఇది.  మొదట్లో ఆ బ్రహ్మ అందరి రాతలు సరిగ్గా రాసేవాడు.  తరువాత తరువాత జనాభా ఎక్కువైపోయి, ఆయనకీ టైం దొరక్క, ఎడా పెడా ఇష్టం వచ్చినట్టు రాసి బూమ్మీదకి పంపేయడం మొదలు పెట్టాడు.  అందుకు చక్కటి సూచన ఉంది ఈ పాటలో.  “తోచినట్టుగా అందరి  రాతలు బ్రహ్మే రాసాడు, నీకు నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి” అని.

“మనిషై పుట్టిన వాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ” అని “కృషి ఉంటే మనుషులు ఋషులుతారు, మహా పురుషులౌతారు” అని ఎలుగెత్తి చాటిన గీతం ఎంతో మందికి స్ఫూర్తి దాయకంగా నిలుస్తుంది అనడం లో సందేహం లేదు.

ఇందాక “మౌనం గురించి మాట్టడుకున్నాం” కదా – అదే విషయం చెప్పిన ఒక అధ్భుతమైన వాక్యం “గోరంత దీపం కొండంత వెలుగు చిగురంత ఆశ జగమంత వెలుగు” అన్నపాటలో ఉంది.  ఆ వాక్యమే – “కారు చీకటి ముసిరే వేళ వేగు చుక్కే వెలుగు, మతి తప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు, దహియించే బాధల మధ్యన సహనమే వెలుగు”.  అనవసరంగా మాట్లాడడం, గట్టి గట్టిగా అరిచి ఆయాసం తెచ్చుకోవడం, తద్వారా ఎన్నో జబ్బులను “కొని” తెచ్చుకోవడం – ఇవన్నీ అవసరమా?  అందుకే అంటాను నేను – “పేషన్స్ ఉన్నవాడు పేషెంట్ కాడు” అని.  ప్రతీ దానికి ఓ తెగ ఫీల్ అయిపోయి బి.పి. తెచ్చేసుకునే బదులు ఓర్పు, సహనం అలవరచు కోవాలి అని ఎంత చక్కగా చెప్పారు ఈ పాటలో.   అలాగే, ఈ పాటలో ఇంకో వాక్యం లో,  ప్రపంచం లో అదరూ మోసం చేసే వారే అని మీకనిపించినప్పుడు, నిజమే, అయితే,  అ సంగతి పక్కన పెట్టి, ఎక్కడైనా చిన్న పాజిటివ్ ఉంటే అది చూడు అని చెప్తుంది – “జగమంతా దగా చేసినా చిగురంత ఆశను చూడు”.   నిజంగా అమూల్యమైన మాట కదా!

“ఏ సిరులేందుకు, ఏ సౌఖ్యములెందుకు ఆత్మశాంతి లేనిదే” – ఈ వాక్యం ఒక్కటి చాలు, ఇంక ఈ వ్యాసం ఆపెయొచ్చు.  “జానకి సహనము రాముని సుగుణము ఇలలో ఆదర్శము” అని చాటి చెప్పే ఈ పాట “చీకటి ముసిరినా వేకువ ఆగునా”? అని ప్రశ్నిస్తుంది.  “కలిమి లోన లేమి లోన పరమాత్ముని తలుచుకో” అని భార్య చెప్పిన మాటలు విని అప్పటి వరకు “చిరాకులు, అసహనాలు“ గా ఉన్న ఆ హీరో అవన్నీ మర్చిపోయి హాయిగా నిద్రపోతాడు.  ఇంతకంటే వేరే కోన్సేల్లింగ్ సెషన్స్ ఎందుకండి?  మీరే చెప్పండి?  ఏవేవో డిగ్రీలకి, మానసిక రోగ నిపుణులకు కూడా అందని జ్ఞానం ఎంతో ఈ పాటలో ఉంది అంటే కాదంటారా?

జీవన సారం అంతా నింపుకుని ఉన్న ఇలాంటి పాటలు ఎన్నో ఎన్నెన్నో!

ఈ మధ్య వచ్చిన “వైశాలి, ఐ అం వెరీ వెరీ సారీ”  పాటలో “సిన్న సిన్న వాటికే శివాలెత్తేస్తే సుఖపడే యోగం లేనే లేనట్టే” అని హితవు చెప్తాడు హీరో.   “నలుగిరితో కలవందే బరువేగా బ్రతుకంతా, గిరి గీసి కూర్చుంటే వదిలేయరా జనమంతా” అని హీరోయిన్ కి మంచి చెప్తాడు.  పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతున్నట్టు, ఆస్ట్రిచ్ పక్షి భూమిలో తల దాచేసుకుని తనని ఎవరూ చూడట్లేదు అనుకునేటట్టు, “కళ్ళ కేమో గంతలేసి లోకమంతా చీకటంటే ఎలా లెద్దూ ఒసే మొద్దు” అన్న ఒక వాక్యం ఉంది ఈ పాటలో.  మన ఆటిట్టుడ్, మన దృక్పధం ఎలా ఉందో మనకి లోకం అలా కనపడుతుంది. మనం పాజిటివ్ గా ఉంటే మన చుట్టూ పక్కల కూడా అలాగే ఉంటుంది,  మన దృక్పధమే నెగటివ్ గా ఉంటే అంతా నెగటివ్ గా కనపడుతుంది.  అదే విధంగా “తగువెప్పుడు తెగే దాకా లాగావంటే లాస్ అయిపోతావే” అని హెచ్చరించి, “అపుడపుడు సరేనంటూ సర్దుకుపోతూ ఐస్ అయిపోవాలే” అన్న వాక్యాలు నిజంగా ఆలోచించవలసినవి.  ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలకి, అంటే – కూర మాడింది అని, చీర కొనలేదని, సినిమాకి తీసుకెళ్ళలేదని, కాఫీ వేడిగా లేదని – విడాకులు వరకు వెళుతున్న యంగ్ కపుల్స్ కి ఇవి కనువిప్పు కలగించక మానవు.   “ఉన్నదోకటే కదా ఎదవ జిందగీ, దాన్ని ఏడిపించకు మాటి మాటికి” అని  చెప్తుంది ఈ పాట.

“సత్తె ఏ గొడవా లేదు, సత్తె ఏ గోలా లేదు పుట్టే పతీవోడూ సత్తాడొయ్” ఇది నేను అంటున్నది కాదు, ఒక పాట పల్లవి.  “కలకాలం కాకులా ఉంటే ఏమొస్తుంది, హంసల్లె దర్జాగుండాలోయ్” అని ప్రభోదించే ఈ పాట,  కష్టాల్, నష్టాల్ వచ్చాయ్ అంటే, రానీ, వాటి గురించి ఆలోచించకు అంటుంది.  “అందమైనది ఈ లోకం, అది చూడకుంటే నీ లోపం, పగలు రేయి లేకుండా రోజే అవదు, ఏ కష్టం నష్టం రాకుండా లైఫే అనరు” అని క్లియర్ గా చెప్తుంది.   అంతే కాదు.  మనం ఏదైనా పని మొదలు పెడతాము అనుకోండి. వెంటనే ఆ పని అవదు.  లేకపోతే ఏదో పొరపాటు అవుతుంది.  అంతే, ఇంక ఆ పని మానేసి కూర్చుంటాము.  అలా కాదు, అలా మానకూడదు, వైఫల్యాలే విజయానికి సోపానాలు అని చెప్పే వాక్యాలు ఈ పాటలో  - “చేయాలి రోజుకో తప్పు, అవ్వాలి నీకు కనువిప్పు, చేసిన తప్పు మళ్ళీ చేస్తే అది తప్పు, ఏ తప్పు చేయకపోతే ఇంకా తప్పు”.

జీవితం.  ఈ పదం చాలా సామాన్యం గా ఉపయోగించేస్తాం.  అయితే, జీవితం పదంతో ఎన్నో మంచి పాటలు ఉన్నాయి.   “జీవితమంటే పోరాటం, పోరాటంలో ఉంది జయం, ఎక్కు తొలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగ పట్టె నువ్వు పట్టు గమ్యం చేరేట్టు” అన్న పాట వింటుంటే ఎవరికైనా ఉత్సాహం కలుగక మానదు.  “పలుగే చేపట్టు, కొట్టు చెమటే చిందేట్టు, బండలు రెండుగా పగిలేట్టు తలపడు నరసింహ” అని సాగే ఈ పాటలో ఆశావహ దృక్పధం ప్రతీ పదం లోనూ కనిపిస్తుంది.  ఎంతటి కష్టం అయినా, ఎదిరించి పోరాడితే విజయం నీకు తప్పక దక్కుతుంది అని తెలుపే పాట ఇది.

“జీవితం సప్తసాగర గీతం, వెలుగు నీడల వేదం సాగని పయనం” ఒక్క వాక్యం లో ఎంతో అర్ధం దాగి ఉంది కదా!

ఆఫీస్ లో అందరూ మీటింగ్ పెట్టుకుని కూర్చుని ఆలోచిస్తున్నారు.  గంటలు గంటలు.  ఇంతలో లంచ్ టైం అయ్యింది.  లంచ్ అయ్యాకా మళ్ళీ సమావేశం అవుదామని అనుకునేంతలో ఒకరు లేచి “ఎవరో ఒకరూ ఎపుడోఅపుడు నడవరా ముందుగా ఆటో ఇటో ఎటో వైపు” అన్న పాట చెప్పి, తను ఇంక మీటింగ్ కి రానని ఆ సమయం లో అయ్యే పనులు ఏమైనా ఉంటే అవి పూర్తి చేస్తానని వెళ్ళిపోయాడు.   ఎంత సేపూ తర్జన బర్జనులు అర్జున గర్జనులతో, ఇలా చేస్తే బావుంటుందా, అలా చేస్తే ఏమవుతుంది అనుకునే బదులు కొంచెం పని కూడా చేస్తే బాగుంటుంది, ఒక నాంది ఇంకా ఎంతో పురోగతికి హేతువు అవుతుంది  అని చెప్పే పాట ఇది.  “మొదటివాడు ఎప్పుడూ ఒక్కడే మరి, మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరి, వెనుక వచ్చు వాళ్ళకు బాట అయినదీ”, “కదలరు ఎవ్వరూ వేకువ వొచ్చినా అనుకోని కోడి కూత నిదరపోదుగా,  జగతికి మేలుకొల్పు మానుకోదుగా,  మొదటి చినుకు సూటిగా దూకిరానిదే, మబ్బు పొంగు చాటుగా వొదిగి దాగితే వాన ధార రాదుగా నేల దారికీ, ప్రాణమంటు లేదుగా బ్రతకడానికీ”  లాంటి వాక్యాలు నిండి ఉన్న పాట ఇది.  ప్రతీ ఒక్కరు ఆద్యంతం చదవాల్సిన పాట ఇది.

“ఇది నా ప్రియ నర్తన వేళ తుది లేనిది జీవన హేలా ఆఆ” – నాకు ఎంతో ఇష్టమైన ఇంకొక పాట..  అనుకోని సంఘటనలో కాలు పోగొట్టుకుని నడవడమే కష్టమైన ఒక నర్తకి యదార్ధ గాధ ఇది.  చివరికి ఎలాగో కృత్రిమ కాలు అమర్చి నడవడం వరకు చేయగలిగిన వైద్యులతో ఆమె అన్న మాటలు – “నేను తిరిగి నృత్యం చేయాలి”, అని.  దానిని ఆ వైద్యులు కూడా సవాలు గా తీసుకుని అటువంటి కాలు అమర్చడం, ఆ నర్తకి అకుంఠిత దీక్ష తో సాధన చేసి తిరిగి నృత్య ప్రదర్సన ఇవ్వడం నిజంగా అందరికీ స్పూర్తిదాయకం.  తానూ కష్టాల్లో ఉన్నప్పుడ్డు వదిలి వెళ్ళిపోయిన మనిషి ఇదంతా చూసి స్వార్ధం తో తిరిగి వచ్చినప్పుడు వచ్చే పాట ఇది.  ఇక తనకి ఎవ్వరి ఆసరా, సానుభూతి అవసరం లేదని,  నృత్య సాధన చేస్తూ సాగే పాటలో ఈ వాక్యాలు చూడండి – “నాలుగు దిక్కుల నడుమ పుడమి నా వేదిక గా నటన మాడనా, అనంత లయతో నిరంత గతితో జతులు ఆడనా పాడనా” – ఈ అనంత ప్రపంచం జయించినంత ఉత్సాహం అంతా ఆ వాక్యాల్లో ప్రతిబంబిస్తుంది.

ఒక పని చేయాలి అని నిశ్చయించుకున్న తరువాత, అదే అయిపోతుందిలే అని కూర్చుంటే ఆ పని అవుతుందా?  ముమ్మాటికి కాదు.  నిరంతర శ్రమ, సాధనతో మాత్రమే అది సాధ్యమవుతుంది.  అది ఎలా ఉండాలి అంటే “చెయ్ జగము మరిచి జీవితమే సాధన, నీ మదిని తెరిచి చూడటమే శోధన” అన్న పాట మనకి దారి చూపుతుంది. “ఆశయమన్నది నీ వరమైతే, ఆ అంబరమే తలవంచుతుంది, నీ కృషి నీకు ఇంధనం లా పని చేస్తుంది, అది కావాలి సాగర బంధనం” అని చెప్పే ఈ పాట ఎంతో స్ఫూర్తిదాయకం.

మంచి పాటకి భాష తో సంబంధం లేదని మన అందరికీ తెలుసు కదా.  కొన్ని హిందీ పాటలు కూడా చూద్దాం.  “జిందగీ తో బేవఫా హైన్ ఎక్ దిన్ టుక్రాయేగి, మవుత్ మెహబూబా హై అప్ని సాత్ లేకర్ జాయేగీ” – జీవితం మోసగత్తె ఒక రోజు నిన్ను వదిలేస్తుంది, చావు నీ ప్రియురాలు లాంటిది తనతో పాటు నిన్ను తీసుకెళ్తుంది.  “రోతే హుయే ఆతే హాయ్ సబ్ హస్తా హు జో జాయేగా వొహ్ ముకద్దర్ కా సికందర్ జానేమన్ కేహ్లాయేగా” – అందరూ ఏడుస్తూ ఈ ప్రపంచం లోకి వస్తారు, నవ్వుతు వెళ్ళేవాడే అసలైన హీరో.    ఏవంటారు, కాదంటారా?

“జిందగీ ఎక్ సఫర్ హై సుహానా యహ కల్ క్యా హో కిస్నే జానా”  – జీవితం ఒక అందమైన ప్రయాణం లాంటిది, ఈ ప్రయాణం లో రేపు ఏం జరుగుతుందో ఎవరు తెలుసుకోగలిగారు చెప్పండి? అన్న పాట ఇది.  సరే, రేపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియక పోయి ఉండొచ్చు, కానీ ఇవాల్టి సంగతి ఏంటి?  ఎప్పుడో సంగతి ఎందుకు?  ఈ రోజు ఏం చేయాలో ఆ సంగతి ఆలోచించచ్చు కదా!  అలాగే, ఈ పాటలో “సఫర్” అనే పదాన్ని హిందీ లో కాక ఆంగ్లం లో అర్ధం చేసుకుని, సఫర్ అని ఓ బాధ పడిపోయి, ఇతరులను బాధపెట్టి   మధన పడిపొయే వారి గురించి ఏం చేస్తాం చెప్పండి.  బాబు, భాషని, అందులోని భావాన్నీ సరిగ్గా అర్ధం చేసుకోండి అని చెప్పగలం అంతే.

“జిందగీ కైసి హైన్ పహేలీ హాయ్, కభి ఏ హసాయే కభి ఏ రులాయే” – జీవితం అనేది ఒక చిక్కుముడి, అంతుపట్టని ప్రహేళిక, ఒక సారి నవ్విస్తుంది, ఇంకోసారి ఏడిపిస్తుంది.  “సుఖ్ కే సబ్ సాతి, దుఃఖ మే నా కోయి” – నువ్వు బావున్నప్పుడు అందరూ నీ చుట్టూ ఉంటారు, నీతో మాట్టాడుతారు.  అదే నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడ్డు ఒక్కరూ నీ మొఖం చూడరు.  “మేరే రాం, మేరే రాం, తేరా నామ్  ఏక్ సాచ దూజ న కోయి” – రామా – నీ నామమోకటే సత్యం, నీ కన్నా నాకెవ్వరు దిక్కు, నిన్ను తలుచుకుంటే కష్టాలన్నీ తొలగిపోతాయి.  అవును, నిజం.

“చాహత్ కే ధో పల్ భి మిల్ పాయె దునియా మే ఏ భి కం హై క్యా?” – ఇటీవలి “సేనోరిటా”  పాట ఇది.   సంతోషం  ఏదో ఎక్కడో ఉంది, దాన్ని వెదకాలి, అలా వెదకడం అనే ఎండమావి వెనక పరుగెత్తాలి అని కాకుండా, నువ్వున్న చోటులోనే ఒక క్షణం హాయిగా ఉంటే చాలదా అని అడుగుతోంది ఈ పాట.

ఇక మళ్ళీ మన తెలుగు పాటల్లోకి వస్తే -

“ఏరువాక సాగారో” పాట.  ఆనాటికి, ఈనాటికి “కల్లా కపటం ఎరుగని వాడు, లోకం పోకడ తెలియని వాడు” ఎవరంటే రైతన్న.  ఎన్నో దశాబ్దాల నాటి పాట ఈ రోజుకీ అప్లై అవుతుంది.  “పొలాలమ్ముకొని పోయేవారు టౌనులో మేడలు కట్టేవారు బ్యాంకులో డబ్బును దాచేవారు ఈ చట్టిని గమనించరు వారు”, అలాగే “పల్లెటూళ్లలో చెల్లనివాళ్లు, ఎందుకు కొరగాని వారు ఏంచేస్తారు అంటే పాలి“ట్రిక్స్” తో బ్రతుకుతారు.  “పెజా సేవ, పెజా సేవా” అని పగలు లేచినప్పటి నుంచి అరిచే వీరు, మరి పని చేయండి అంటే మాత్రం “వొళ్లు వంచి చాకిరికి మళ్లరు” అని చెళ్ళున కొట్టే పాట ఇది.  ఇది అప్పటి ఎప్పుడో సంగతి కాదు.  ఈ రోజు జరుగుతున్న దానికి నిలువెత్తు నిదర్శనం.  ఇంకేంటి, నేను పదవి లోకి వచ్చేసాను, నాకింక ఎదురు లేదు అని కొందరు  అనుకున్నారు. కోట్లు సంపాదించారు. ఆ క్రమం లో రైతన్నని మరిచారు.  ఆ తరువాత ఏమైందో అప్పటి పాటలో ఈ వాక్యాలు, ప్రతీ పదము నిజమయ్యింది చదవండి:  “పదవులు తిరమని బ్రమిసే వాళ్లే, కోట్లు గుంజి నిను మొరచే వాళ్లే, నీవే దిక్కని వత్తురు పదవోయ్”.  అవును, అన్ని రోజులు ఒకలా ఉండవు.  మారుతాయి.  మారాయ్.  అయితే, కొద్దిమందికి ఇది తెలుసుకునేటప్పటికి చాలా ఆలస్యం అయిపోయిందేమో?  అందుకే, ఎప్పుడూ దేశానికి వెన్నుముక అయిన రైతన్నని మరవకూడదు.

గ్లోబల్ వార్మింగ్, వాతావరణ కాలుష్యం దానితో పాటు మనుషులు అందులోని మనసుల కాలుష్యం – ఎక్కడ చూసినా ఇదే పరీస్తితి.  మరి ఎం చేయాలి?  చాలా సింపుల్.  అందుకు సమాధానమే ఈ పాట – “పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు, ఈ లోకం లో కన్నీరింక చెల్లు, చిన్ని చిన్ని గూటిలోనే స్వర్గముందిలే, చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదులే
సీతాకోకా చిలుకకు చీరలెందుకు … అరె ప్రేమ ఉంటె చాలునంట డబ్బు గిబ్బు లెందుకంట”.  ఏదో చేయాలన్న తాపత్రయం లో మనిషి విచక్షణా రహితంగా చెట్లు నరికేస్తున్నాడు, అడవులు అంతరించి పోతున్నా పట్టించుకోవట్లేదు, ఇంకా ఇంకా డబ్బు సంపాదించాలి అన్న ధ్యాసే తప్ప ఇంకేమి కనపడని, వినపడని స్టేజి లోకి వెళ్ళిపోయాడు.  అసలు ఇవి ఒక దానితో ఒకటి ముడిపడి ఉన్నాయి అన్న సత్యం గుర్తించ లేక పోతున్నాడు. “అందని మిన్నే ఆనందం, అందే మన్నే ఆనందం, భూమిని చీల్చుకు పుట్టే పచ్చని పసిరిక ఆనందం, మంచుకి ఎండే ఆనందం వాగుకి వానే ఆనందం అరె ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం”.   ఇలా ఒక దానితో ఇంకొకటి, వాటికి ఉన్న అనుబంధం, వాటన్నిటితో పాటు తనకు ఉన్న అనుబంధం తెలుసుకున్న నాడు “బ్రతుకే నూరేళ్ళందం బ్రతుకే బ్రహ్మానందం”.

“యాయిరే యాయిరే వారెవా ఇది ఏం జోరే,  యాయిరే యాయిరే ఈ జోరుకు నా జోహారే” – జోరుగా సాగే పాట.  “కళ్ళల్లో కలలుంటే, గుండెల్లో దమ్ముంటే రోజూ రంగేళి లే” అని చెప్పే పాట.  “జనమందరిలో మనమేవ్వరంటే” వాటోమాటిక్ గా తెలియాలి, ఒక విలువుండాలి, ఘన చరితలు గల ఆ కొందరి లిస్టు లో మన పేరు కూడా ఉండాలి, అనుదినం కొత్తగా, ఒక ఫ్రెష్ రోజులా ఉన్నప్పుడు, బ్రతకడం అప్పుడే పండుగ అంటుంది ఈ పాట.  ఈ లోకం లో ఉంటూ, యాంత్రికంగా చుట్టూ ప్రపంచాన్నీ చూస్తూ, “జీవించడమే” అంటే తెలియని వాళ్ళని చూస్తె జాలి పడుతుంది.  కనిపించని తల రాతని, అర చేతులలో గీతని పట్టుకు వెళ్ళాడి, అవే బ్రతుకును నడిపిస్తాయని నమ్మే వాళ్ళని ఏం చేయాలి?, అహ, అసలు ఎం చేయాలి? అని అడుగుతుంది ఈ పాట.  ఏం చేసినా తప్పు లేదంటారా?  ఊరికే ఊహల్లో తేలుతూ ఉండడం కాకుండా,   నువ్వు అనుకున్నది నిజం చేసుకో, నింగి లో నిలిచిపో తారలా అని క్లియర్ కట్ గా చెప్తుంది చివరలో.

నలుగురిలో మనకి ఒక స్పెషల్ ఆధార్ కార్డ్ ఉండాలి అనే విషయం పూలరంగడు కూడా చెప్తాడు “ఏక్ దో  తీన్ చార్ చార్” పాటలో.  “బ్రతుకంటే వార్ వార్ పోరాడారా” బ్రదర్ అంటూ “కృషి ఉంటె యార్ యార్ ఋషులయ్యి పోతార్” అన్న అన్నగారి మాటని నమ్ముకుని ముందుకెళ్ళే ఈ హీరో,  “నీ లైఫ్ కి నువ్వే బిగ్ బాస్” అని చెప్తాడు.  నమ్మినట్టు ముందుకు వెళ్ళు, నచ్చినట్టు దూసుకువెళ్ళు “కండలు, గుండెలు ఉంటె కొండలైనా అడ్డుకోవురో” అని అంటాడు.  లైఫ్ అన్నది నీడ లాంటిది లైట్ లేకపోతే అది రాదు – ఆ వెలుగు నువ్వు కావాలి – ఎంత మంచి అర్ధం ఉంది ఈ వాక్యంలో.  అలాగే కష్టమన్నది నీకు ఒక తోడు లాంటిది అది నిన్నెప్పుడు వీడిపోదు అని చెప్తాడు.  ఇక్కడ మళ్ళీ లిస్టు గురించి వస్తుంది.  “కష్ట పడ్డ వాళ్ళ లిస్టు లో చేరాలి ఆ లిస్టు లో ఫస్ట్ రాంక్ కొట్టాలి” అంటాడు.  ఈ పాటలో ఇంకొక ముఖ్యమైన కొన్సుప్ట్ ఉంది.  అప్పు చేయడం మంచిది కాదు, నాకు అప్పు చేయడం అంటే ఇష్టం ఉండదు అంటూ ఉంటారు కొంత మంది.  ఇప్పుడు, దేశాలే అప్పు తీసుకుంటున్నాయి.  కేవలం నీ దగ్గర ఉన్న ఎమౌంట్ తో అన్నీ చేయాలి అంటే అవ్వని పని.  అందుకని అప్పు చేసే అవసరం రావొచ్చు.  అయితే, చేసిన ఆ అప్పుని సద్వినియోగ పరుచుకుని, దానితో ఏదైనా పనికొచ్చే పని చేసినప్పుడు, అది ఆ రూపాయి తో పాటు ఇంకొక రూపాయి సంపాదించినప్పుడు, అటువంటి అప్పు చేయడం లో తప్పు లేదు అంటాడు.  “రస్క్ లేనిదే చాయి లో రిస్క్ లేనిదే లైఫ్ కిక్ లేదురో”, అయితే ఆ రిస్క్ తీసుకునే వాళ్ళ లిస్టు లోకి ఎక్కినా, వాళ్ళు నీకు సలాం కొట్టేలా ఎదగాలి అంటూ పాజిటివ్ ఆలోచనలు నింపే పాట ఇది.  “ఆకాశం నీ హద్దురా” అన్న పాటలో “నిలబడి తాగే నీళ్ళు చేదురా, పరుగెతైనా పాలే తాగరా” అని ఎప్పుడో చెప్పారు కదా.

ఇందాక ఒక సందర్భం లో చెప్పాను   – “పేషన్సు లేకపోతే పేషెంటే” అని.  అయితే, ఇది యూత్ కి వర్తించదు.  ఒక మంచి పని చేయాలి అనుకున్న వారు – అది ఎంత తొందరగా పూర్తి అవుతుంది అన్నట్టు ఉండాలి.  చదువుతున్నారు అనుకోండి, అది ఏంత త్వరగా పూర్తి  చేయాలి అన్నట్టు ఉండాలి, రీసెర్చ్ చేస్తున్నారు అనుకోండి ఎంత త్వరగా పూర్తి  చేయాలి అని ఉండాలి కానీ, హాస్టల్ వసతి మెస్సు ఫుడ్డు – ఇదే బావుంది, మెల్లిగా ఎలాగోలా ఒక అయిదు పదేళ్ళు లాగించేద్దాం అని ఉండకూడదు కదా.    ఇలాంటి తొందర ఉండడం “ఆశావహ అసహనం” అంటాను నేను.   పలికే గోరింకకి అదే చెప్తుంది ఒక పాటలో ఒక అమ్మాయి.  తను “ఎదురు చూసే దీపావళి పండుగ ఎప్పుడో కాదు నేడే రావాలి” అంటుంది.  పైగా, రేపటి సత్యాన్ని నేనెట్టా నమ్మేది, నే నాటితే రోజా నేడే పూయునే అంటుంది.  పగలే వెన్నెలా వస్తే పాపమా, రేయిలో హరివిల్లె వస్తే నేరమా – ఇలాంటి ప్రశ్నలు వేసే వాళ్ళని చూస్తె ముచ్చట వేస్తుంది.  కొంచెం ఆశ, కొన్ని కలలు కలియకే జీవితమంటే – నువ్వు అట్లీస్ట్, కనీసం ఓ వంద కలలను కంటే, వాటిలో ఆరు అయినా నిజం అవుతాయి – అంతే కానీ కళ్ళు మూసుకు పడుకుంటే ఒరిగేదేమిటి అని అడుగుతుంది.  రేపు అన్నది దేవునికి, నేడు అన్నది మనషులకు అంటూ “బ్రతుకే బ్రతికేందుకు” అంటుంది.  మనిషి గా పుట్టడం వీజీ కానీ, మనిషి గా బ్రతకడం చాలా కష్టం అని “ఒక అద్భుతః సినిమా” లో డైలాగ్.  అలాగే, “బ్రతుకే బ్రతికేందుకు” – ఇదేమిటి, వేరే చెప్పాలా అంటే, అవును ఈ రోజుల్లో చెప్పాల్సి వస్తోంది.  ఎందుకంటే, ఆ బ్రతకడం మానేసి, ఎంతసేపు తెగ ఆలో”చించేస్తూ” ఉంటాం కదా?   అందుకే అన్నారు – “ఎస్టర్డే ఇస్ హిస్టరీ, టుమారో ఇస్ మిస్టరీ, టుడే ఇస్ ఏ గిఫ్ట్ డట్ ఇస్ వై ఇట్ ఇస్ కాల్డ్ ప్రెసెంట్ – నిన్న అన్నది చరిత్ర, రేపు అన్నది మనకి తెలీనిది, ఇవాళ అనేది మాత్రమె నీకు తెలిసినది, నీ చేతులలో ఉన్నది, అందుకే దాన్ని ఒక బహుమానం అన్నారు.

ఒక బంగారం లాంటి పాటతో ముగిద్దాం.  “ఎవరు ఆహా అన్నా, ఎవరో ఓహో అన్నా, నీవు నీలా ఉంటే మంచి పని చేస్తుంటే ఈ లోకం లోనా నువ్వే అసలు బంగారం” అన్న పాట.  ఒక్క సారి మాట ఇస్తే ఆ మాట తప్పకు అని, ఒకరి నమ్మకాన్ని వమ్ము చేయొద్దని చెప్పే పాట.  ఎవ్వరి జోలికీ పోకుండా నీ పని నువ్వు చేసుకో.  కానీ, అలా చేసుకుంటున్న నీ పనికి ఎవరైనా అడ్డువస్తే మాత్రం, వచ్చిన వాడి “టాపు లేపి మరి చూపారా” అని కూడా చెపుతుంది.  మనం “మంచి మంచి” అని ఉంటాం.  కానీ ఆ మంచిని చేతకానితనంగా కానీ, లేక ఆ మంచిని వారి స్వార్ధం కోసం ఉపయోగించుకుందాం అనుకునే వారిని  కానీ ఉపేక్షించ వద్దు అని చెప్పే సాంగ్ ఇది.  ఇది ఈ రోజుల్లో చాలా అవసరం.

ఇలా, ఎన్నెన్నో పాటలు, అక్షర లక్షలు చేసేవి, జీవిత సత్యాలు తెలిపేవి.  అందులో కొన్ని మనం చూసాం.  వీటి నుంచి స్ఫూర్తిని పొందిన నాడు, అవి మనలో మార్పు కలిగించి, మన మన  లక్ష్యాలను చేరుకునేనుందుకు తప్పక దోహదపడుతాయి అనడం లో నాకు ఎటువంటి సందేహం లేదు.

మీరేమంటారు?

Print Friendly

బంధ కవితలు

 రచన : V.A.N.మూర్తి

శంఖబంధ – ఆటవెలది

ఆ.వె:-         కాల కూట మౌర! చాలక నేలనో

కంటి మాట లలర, కలత గనక

అరయ నూరగహార! హర! హర! తాల్చెరు  ‌‍

గంగ కీర్తి పెంప! ఘనత నింప

భావము :-   ఓ పరమశివా! కాలకూట విషపు బాధ చాలదనియా, కంటి మంటలకు కలవరపాటు మాని, కంఠహారముగా విషనాగమును ధరించి వెందోలకో అని యూహింపగా, జడల యందు నర్తించు గంగమ్మ కీర్తిని పెంచుటకా, ఆమె ఘనతను జగద్విదితముగా  వించుటకని తెలియచున్నది

శంఖ బంధ – కందము

శంక బంధము

కం:-   వరదాభయ – శుభదాయీ

సురతారక కీర్తి ధాత్రి సుందరి మాయీ

నరసాధక శ్రీలోయీ

సిరి పూర్ణత గూర్పరమ్ము ! జీవన  దాయీ!

భావము:- శ్రేష్టమైన అభయమునొసగు శుభదాయి, దేవతలలో తారకమైనది

భూతలపుకీర్తిని నిల్వు సౌందర్యవతీ ! మాయి (లక్ష్మి) నరుని పురుషార్ధములలో

సంపాదింపదగినవి సంపదలు. అట్టి సంపదలను సమకూర్చుటకు జీవన దాయీ లక్ష్మీరమ్ము.

త్రిపుండ్ర బంధ – గీతము

త్రిపుండ్ర బంధము

తే.గీ :         వరలు చుండు ఓంకారాన పరముడమల

చమక వర్తి నమక విశ్వ, శమనిహారి

పుర రిపు నమః సుమాంజలి పుణ్యమలరు

శివయనంగను జీవనసిరువెలయవే !

భావము:-

పరమాత్మ ఓంకారము నందు నొప్పుచుండును, చమకమందుపవాడను

ప్రపంచకీర్తి గడించిన నమకమననెసగి, శమమగు హరించి దనరు

త్రిపురాసుర సంహారియగు నతనికి పుష్పములతో అంజలించుటవలన

పుణ్యముగల్గును. శివాయని యనుట వలన జీవన సంపదవెలయవా !

అనగా సంపదలు తెలియవా! తెలయును సుమా.

షోడశ ద్వార బంధ – సీసము

షోడశ ద్వారబంధము

సీ. ఓం, జగదాబిధ మోద హర్మ్యమునషో, డశద్వార మొహమెడంగ, శుభ, గ

తిర్మయి, నిగమనతిన్, విభవ మతిన్, ప, దాశ్రి తేజశ్విని, ధాత్రిరుణ, సు

దూర భద్రామణి తుల్య నియమయమ, మధుశ్రీధరిని మదిన్ మరువకుమ

హేమంత శుభ, విశ్వహిత కరశూరవ, రదయామయ హరి హరా శివమయి

తే.గీ: మకర సంక్రాంతి రోజున మహిమలెసగు

సర్వద్వారాలు తెరచును పర్వమనగ

పాడి పంటలు సమకూడు భాగ్యమిదియె

పౌష్య లక్ష్మి కివియె నాడు వందనాలు

బంధాంతర్గత పద్మము

ఓం శ్రీం నమః ఓం ఐం నమః

ఓం హ్రీం నమః ఓం శ్రీం, హ్రీం, ఐం నమః ­

ఓం నారాయణాయ నమః

ఓం హరి హర శివమయి నమః

బీజ సమన్వితయై శ్రీమన్మహాలక్ష్మి, పద్మాసనస్ధమై స్వర్గస్సదనాన

పరివేష్టిత నారాయణాయై హరిహరులు శివమయులు

సదా నొక్కటిగా భువనాలను రక్షింతురు.

భావము :-

ముజ్జగములకు మొదమైన మొహన్వితమై 16 ద్వారములుతో నొప్పుచు మోక్షమును ప్రసాదించెడిది, వైభవముతో నెసగెడి మోక్షప్రదాయిని, తేజస్విని, భూజీవరుణమును మాపెడిదిని, చాల దూరమును, భద్రమును ప్రసాదించునది, నియమమును తుల్యత పాటించు యమ (శ్రీ మన్మాహాలక్ష్మి మధుశ్రీని మనస్సునందుంకొనుచు మరువక) హేమంత ఋతు ప్రమోదిత శుభకర, విశ్వహితకర, పరాక్రమశాలి, ధయామయా హరిహరాన్విత (విష్ణు, శివతత్వము) శివమయీ, విశ్వరక్షక, రక్షకి. ఈ దినము మకర సంక్రాంతి, మహిమతో నొప్పుచున్నది. స్వర్గము నందలి సర్వద్వారములు తెరువబడును. (అనగా యీదినమున, ప్రాణాములు పోయిన జీవతతి సర్వము స్వర్గమును ప్రవేశించును. ఈ ఋతువునందు పాడి పంటలు సమస్తమును చేతికి అందివచ్చును . జేష్యలక్ష్మి యివియే నాదగు వందనములు.

 

 

 

Print Friendly

చైతన్య స్రవంతి నవలలు – నవీన్ “అంపశయ్య”

రచన : పి.వి.లక్ష్మణరావు, తెలుగు ఉపన్యాసకులు,

చైతన్యస్రవంతి శిల్పం గురించి మాట్లాడుకొనేటప్పుడు మనో వైజ్ఞానిక నవలల ప్రస్తావన కూడా వస్తుంది. ఇంతకీ మనోవైజ్ఞానిక రచనలు అంటే ఎలా ఉంటాయి? చైతన్యస్రవంతి శిల్పం అని దేన్ని అంటారు?, చైతన్య స్రవంతి శిల్పానికి ప్రముఖులు ఇచ్చిన నిర్వచనాలు, వారు చెప్పిన లక్షణాలను తెలుసుకొని, అటు పిమ్మట ఈ చైతన్య స్రవంతి శిల్పంతో వచ్చిన ప్రముఖమైన నవలల్లో అంపశయ్య ఎలాంటి స్థానాన్ని పొందిందో విశ్లేషించడమే ప్రస్తుతాంశం.

నవల ఏదైనా అందులో కొన్ని పాత్రల మనస్తత్వచిత్రణ తప్పనిసరిగా ఉంటుంది. ఆ నవలలో ఉన్న పాత్రలు ఏం చేస్తాయో .. అదే ఆ నవలని నడిపిస్తుంది. పాత్రలు సహజంగానే కొన్ని సమస్యలను ఎదుర్కోక తప్పదు. ఆ సమస్యల్ని ఆయా పాత్రలు తమ మనస్తత్వం మేరకే ఎదుర్కొంటాయి. సామాజిక, ఆర్థిక సమస్యలు, ఇతర అంశాల మీద ఆధారపడి సాగే నవలలున్నట్టే, పాత్రల మనస్తత్వ చిత్రణకే అత్యంత ప్రాధాన్యం కల్పించి సాగే నవలలూ ఉన్నాయి. అంటే సామాజిక వ్యవస్థ, సమస్యలు, పరిసరాలు, పాత్రల మనస్తత్వం, ఈ మనస్తత్వంలో అసాధారణ మనస్తత్వానికి, అసాధారణ ప్రవర్తన కీ దారితీసే చిత్రణ వంటివి ఉన్న నవలలు మనో వైజ్ఞానిక నవలలవుతాయి.
స్పష్టంగా చెప్పుకోవాలంటే ఈ మనోవైజ్ఞానిక నవలల్లో సామాజిక, ఆర్థిక, తదితర అంశాలకు అంత ప్రాధాన్యం ఉండదు. పాత్రల మనస్తత్వం అసాధారణంగా మారడానికి దోహదం చేసిన రుగ్మతల చిత్రణకే అవకాశం ఉంటుంది. పాత్రల మనస్తత్వాల్ని చిత్రించడం ద్వారా అందుకు కారణమైన సామాజిక పరిసరాల్ని, సమస్యల్ని రచయితలు చిత్రిస్తారన్న మాట. మనోవైజ్ఞానిక నవలల్లో ఇటువంటివి ముందువరుసలో ఉంటాయి. ఈ నవలల్లోనే మరోరకం మనో వైజ్ఞానిక నవలలు కూడా ఉండవచ్చు. ఎలా అంటే మనోవైజ్ఞానిక సిద్ధాంతాలకు అనుగుణంగా పాత్రల్ని సృష్టించి వాటి మనస్తత్వా న్ని చిత్రించేవన్నమాట.ఈ రెండో రకం నవలల్లో కూడా పాత్రల మనస్తత్వ చిత్రణకే ప్రాధాన్యం ఉంటుంది.

పైన తెలిపిన అసాధారణ మనస్తత్వం వంటి విషయాలను ముందుగా తెలిపిన వారిలో ఫ్రాయిడ్,ఆడ్లర్, యాంగ్ వంటి వారున్నారు. వ్యక్తిసమాజంతో సమాధానపడలేనప్పుడే ఇటువంటి మనస్తత్వాలు బయట పడతాయి. సమాజం లో సమాధానపడటం అంటే ఆకాలంనాటి సామాజిక ఆర్ధిక రాజకీయ పరిణామాలతో రాజీ పడడమని అర్ధం. వాటితో సమాధానపడినవారు హాయిగా ఉండగలుగుతారు. సమాధాన పడలేని వారు అసాధారణ వ్యక్తులుగా మారతారు. దాన్నే డా.పి.సంజీవమ్మ వంటి పరిశోధకులు అపసవ్యతకు గురికావడం అంటున్నారు. మానవుల్లోని అపసవ్యత లేదా అసాధారణ ప్రవర్తనని ఆధారంగా చేసుకొని తెలుగు నవలల్లో ఎన్నో పాత్రలొచ్చాయి.

చైతన్యస్రవంతి శిల్పం:

పాత్రల అసాధారణ లేదా అపసామాన్య మనస్తత్వాన్ని చిత్రించేందుకు రచయితలు ఓ కొత్త పద్ధతిని ఉప యోగించుకొన్నారు. అదే చైతన్యస్రవంతి శిల్పం. మనోవిజ్ఞానంలోని చేతనాచేతన సిద్ధాంతం (అంటే థియరీ ఆఫ్ అన్కాన్షస్), మనో విశ్లేషణ ప్రభావం ఈ రెండింటి ఆధారంగా చైతన్య స్రవంతి శిల్పం రూపొందింది. దీనికి కారకుడు హెన్రీ బెర్గ్ సన్. ఆయన కాలాన్ని గురించి చెబుతూ దాన్ని భూతభవిష్యత్ వర్తమానాలుగా విభజించి చూడడం కృత్రిమం అన్నారు. ఎందుకంటే కాలం నిరంతరాయంగా సాగే ప్రవాహం. ఆయన ప్రకారం ఒక క్షణంలో ఒక వ్యక్తి అంతరంగంలో సాగే ఆలోచనలు కేవలం ఆ క్షణానికి మాత్రమే సంబంధించినవి కాక భూత భవిష్యత్తుల గురించి కూడా ఉంటాయి. అంటే వర్తమానం అనేది భూతకాలంతో కలిసి భవిష్యత్తులోనికి సాగుతూ ఉంటుందన్నమాట.

చైతన్య స్రవంతి… స్ట్రీం ఆఫ్ కాన్షియస్ … ఆధునికతలో భాగంగా కాల్పనిక నవలా రచనలో ఇదొక ముఖ్య ప్రయోగంగా విమర్శకులు గుర్తించారు. ఈ తరహా సాహిత్యం అంటే .. ఒక పాత్ర మనసులో వచ్చే ఆలోచనా స్రవంతి, అది ఎలా వస్తే అలాగే ఒక ప్రవాహంలా చిత్రించే రచనా పద్ధతి. మనిషి మెదడులో మెదిలే ఆలోచనలు, భావాలు, జ్ఞాపకాల దొంతరలు, అడ్డూ అదుపు లేని అక్షరాల ప్రవాహం. మనసుకు ఏది తోస్తే అది, ఏది గుర్తుకు వస్తే అది. ఇంకా చెప్పాలంటే ఆ మనసుతో, ఆ పాత్రతో, ఆ పాత్ర ఆలోచనలతో, ఆ అక్షర ప్రవాహంలో కొట్టుకొని, ఆ ఝరిలో మనమూ పరుగెడుతూ, అలసి సొలసి ఊపిరి తీసుకోకుండా నవల చివర అక్షరం వద్ద మాత్రమే ఆగుతాం.

సంజీవమ్మ మాటల్లో చెప్పాలంటే “ కొన్ని గంటల కాలంలో వ్యక్తి చేసే వివిధ ఆలోచనలే ఇతివృత్తంగా పాశ్చాత్య భాషల్లో చైతన్యస్రవంతి శిల్పంలో నవలలు వచ్చాయి. ఒక క్షణంలో వ్యక్తి అంతరంగంలో ప్రవహించే ఆలోచనలు ఎన్నో విషయాలకు సంబంధించి ఉండవచ్చు. రచయిత స్వయంగా పాత్ర ఆలోచనల్ని పాఠకునికి వివరించటంలో అంతరాంతరా ల్లోని అనేకానేకాలైన ఆలోచనలన్నీ వ్యక్తం చేయడం సాధ్యం కాదు. ఒక క్రమం లేని, చిత్రమైన, ఊహించ సాధ్యంకాని ఆలోచనలెన్నో అంతరంగంలో చెలరేగుతూ ఉంటాయి. అవన్నీ వ్యక్తం చేయడానికి ఈ శిల్పంలో సాధ్యమవు తుంది. ఇలా చేయడం మూలాన రచయిత వ్యక్తి అంతరంగాన్ని ఏ అరమరికలు దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్లు పాఠకుని ముందుంచినట్లవుతుంది. రచయిత తానుగా పాత్రను గురించి ఏమీ చెప్పనవసరం లేకుండా, వ్యాఖ్యానించకుండా నేరుగా పాత్ర అంతరంగాన్ని విప్పి పాఠకుని ముందుంచడం వల్ల పాత్రను పూర్తిగా అర్ధం చేసుకోడానికి, పాత్రతో పాఠకుడు తాదాత్మ్యం పొందడానికి సాధ్యం అవుతుందని అభిప్రాయం”

చైతన్యస్రవంతి శిల్పంతో వెలువడిన మొట్టమొదటి నవల జేమ్స్ జాయిస్ రచించిన “యులిసిస్”. ఇతడు ఈ నవలను రమారమి రెండు దశాబ్దాల కాలం పాటు శ్రమించి రాయగా తొలుత కొన్ని వందల మందికి కూడా ఈ నవల పూర్తిగా అర్ధం కాలేదు. ఆ తర్వాత ఈ నవలలోని సంవిధాన మాధుర్యం పాఠకులకు తెలిసి వచ్చి జాయిస్ కలంలోని బలానికి ముగ్ధులయ్యారు.

ఆ తర్వాత పేర్కొనదగిన వారుగా వర్జీనియా వుల్ఫ్, దొరాథీరిచర్డ్ సన్ అనే వారిని పేర్కొనవచ్చు. తెలుగులో చైతన్యస్రవంతి శిల్పాన్ని పూర్తిగా కాకపోయినా,అక్కడక్కడా సందర్భోచితంగా ఉపయోగించుకున్న నవలలు ఉన్నాయి. అవి అసమర్థుని జీవయాత్ర, చివరకు మిగిలేది, అల్పజీవి, అంతరంగతరంగాలు, హిమజ్వాల, ఊబిలో దున్న అనే ఈ నవలలు చైతన్యస్రవంతి శిల్పంతో కూడిన శైలిలో సాగుతాయి. నవీన్ అంపశయ్య పూర్తిగా ఈ శిల్పంలోనే  సాగే నవల.

హెన్రీ జేమ్స్ అనే రచయిత “ stream of Consciousness ” అనే మాటను తొలుత వాడాడు. శ్రీశ్రీ దీన్ని చైతన్యస్రవంతి అన్నాడు.          పత్రికా రచయిత అయిన రాంభట్ల కృష్ణమూర్తి గారు దీనిని “ముక్తానుషంగం” అన్నారు. ధారా వాహిక జ్ఞానప్రవాహం అనేది “stream of Consciousness” తో చక్కగా  సంవదిస్తున్నది అని సినారె గారు చెప్పినట్లు వై.రామకృష్ణారావు తన ఎంఫిల్ సిద్ధాంతగ్రంథంలో తెలిపారు.

ఇక ప్రముఖులు చైతన్య స్రవంతి శిల్పానికిచ్చిన నిర్వచనాలను తెలుసుకుందాం. ముందుగా బుచ్చిబాబు గారిచ్చిన నిర్వచనాన్ని తెలుసుకుందాం. “క్షణికమైన ఒక అనుభవాన్ని మొత్తం జీవితానుభవంతో ముడిపెట్టి ఈరెంటి తారతమ్యాలకు విభజన లేకుండా ఉన్నది ఉన్నట్లుగా  చిత్రించడమే చైతన్య స్రవంతి” అని తెలిపారు.

నవీన్ గారిచ్చిన నిర్వచనం ప్రకారం “మనిషి మన: ప్రపంచంలో చెలరేగే విభిన్నమైన, విరుద్ధమైన భావాలను సాధ్య మైనంత యథార్థ రూపంగా అక్షరరూపం ఇవ్వడమే చైతన్యస్రవంతి రచనా విధానమని” తెలుస్తున్నది.

చైతన్య స్రవంతి శిల్పలక్షణాలు :

పాత్రల ముక్తానుషంగాల్ని చిత్రించడానికి చైతన్య స్రవంతి రచయితలు అనేక పద్ధతుల్ని సృష్టించుకొన్నారు. అందులో ముఖ్యమైనవి.

1. ఆంతరిక స్వగతాలు 2.రచయిత సర్వజ్ఞత్వం 3.చలనచిత్రాల్లో వాడే టెక్నిక్ లు 4.యాంత్రికవిధానాలు  5.వాక్సం బంధమైన విధానాలు.

తెలుగులో చైతన్యస్రవంతి శిల్పాన్ని సంపూర్ణంగా ఉపయోగించిన రచయిత నవీనే అయినప్పటికీ ఆయన కంటే ముందు కొందరు రచయితలు ఈ పద్ధతిని పాక్షికంగా తమ రచనల్లో ప్రవేశపెట్టారు. వారిలో రావిశాస్త్రి గారు అగ్రగణ్యులని చాలామంది భావించారు. ఈ శిల్పంతో వచ్చిన నవలల్ని ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం.

అసమర్థుని జీవ యాత్ర: ఈ నవలని చైతన్య స్రవంతి శిల్పా దృష్ట్యా పరిశీలించినప్పుడు బాహ్యజగత్తులోని సంఘటనల కంటే అంతరంగంలో చెలరేగే భావపరంపరకే ప్రాధాన్యమిస్తూ వెలువడిన మొదటి తెలుగు నవలగా కన్పిస్తుంది. కేవలం అంతరంగంలో చెలరేగే భావాలకు ప్రాధాన్యమిస్తూ రచించినంత మాత్రాన ఈ నవలను పూర్తిస్థాయి చైతన్యస్రవంతి నవల అనలేము.

చివరకు మిగిలేది:

ఈ నవల చైతన్య స్రవంతి శిల్పానికి మార్గదర్శకమైనదిగా చెప్పవచ్చును. ఈ నవల ద్వారా చైతన్య స్రవంతి శిల్పానికి బుచ్చిబాబు గారు పూర్వరంగాన్ని స్థిర పరిచారని భావించవచ్చు. పాత్ర అంతరంగంలో చెలరేగే సంఘర్షణను వర్ణిస్తూ సాగిన చివరకు మిగిలేది నవలలో చైతన్యస్రవంతి ఉన్నమాట వాస్తవమే అయినా అది చైతన్యస్రవంతి శిల్పం యొక్క కొన్ని లక్షణాలను పాటించలేదు.

ఈ నవలలోని కథానాయకుడైన దయానిధి ఆలోచనా ప్రవాహం ఒకే భావాన్ని ఆశ్రయించి ఒకే మార్గంలో సాగింది. అంతరంగతరంగాల్లోని సంక్లిష్టత దయానిధి ఆలోచనా స్రవంతిలో కన్పించదు. కాకుంటే కొన్ని చోట్ల చైతన్య స్రవంతి శిల్పానికి చక్కటి ఉదాహరణలుగా కూడా కొన్ని సన్నివేశాలు స్ఫురిస్తాయి.

అల్పజీవి :

చైతన్య స్రవంతి శిల్పాన్ని ఉపయోగించి రచింపబడిన తెలుగునవలల్లో “అల్పజీవి” అనే మనోవైజ్ఞానిక నవల మొదటిదని చెప్పవచ్చును. సుబ్బయ్య వంటి పిరికి వాడినీ, ఆత్మన్యూనతా భ్రాంతుణ్ణి చిత్రించేందుకు చైతన్యస్రవంతి రచనాశిల్పం అనువైనది అని రచయిత ఈ శిల్పాన్ని ఎన్నుకోవడం ఔచితీమంతంగానే ఉంది కానీ నవల ప్రారంభంలో రచయిత “సుబ్బయ్య” గురించి “సుబ్బయ్య సుందరుడు కాడు అది సుబ్బయ్య అభిప్రాయం” అంటూ ఈ విధంగా చెప్పడం అనేది చైతన్యస్రవంతి శిల్పానికి పూర్తిగా విరుద్ధం, పాతపద్ధతి కూడా. అయితే అల్పజీవి నవల చాలాభాగం సంప్రదాయ పద్ధతిలోనే సాగుతుంది. కానీ మానసిక సంఘర్షణ, ఆనందం తీవ్రతరమైన సందర్భాలలో మాత్రం రచయిత ఈ శిల్పాన్ని ఉపయోగించాడు.

ఊబిలో దున్న:

శ్రీ వినుకొండ నాగరాజు రచించిన ఈ నవలలో చైతన్యస్రవంతి ప్రభావం కన్పిస్తుంది గానీ ఇందులోని కథన శిల్పం చైతన్య స్రవంతి ముఖ్య లక్షణాలను పాటించదు. ఇది ఎవరో చేసిన విమర్శ కాదు. ఎందుకంటే నాగరాజు గారు తన నవల చైతన్యస్రవంతి నవల అని ఎక్కడా చెప్పలేదు. కాకపోతే చైతన్యస్రవంతి నవలల్లో మాదిరిగా ఊబిలో దున్న కథాకాలం కూడా కొద్ది గంటలు మాత్రమే.

అంతరంగతరంగాలు: శ్రీ పరిమళా సోమేశ్వర్ రచించిన ఈ నవల చైతన్యస్రవంతి శిల్పంలోనే వెలువడింది. సచివాలయం లో పనిచేసే ఎల్.డీ.సీ. శర్మ  ఒకరోజు ఉదయం నిద్ర లేచినప్పటినుంచి రాత్రి నిద్రపోయేవరకు అనుభవించిన వివిధ అనుభూతులను చిత్రించే ప్రయత్నం ఈ నవలలో జరిగింది.

హిమజ్వాల: వడ్డెర చండీదాస్ రచించిన రసాత్మక నవల ఇది. ఈ నవల పూర్తిగా చైతన్యస్రవంతి శిల్పంతో రాయబడినది కాదు. కానీ అనేక సందర్భాలలో అనేక పర్యాయాలు ప్రధాన పాత్రల చైతన్యస్రవంతి ఆ సందర్భాలలో ఆ పాత్రల మానసిక స్థితికి అనుగుణంగా చిత్రించబడింది.

అంపశయ్య :

‘అంపశయ్య ‘, ఈ పుస్తకం ఎంత ప్రసిద్ధమంటే ఈ నవల పేరే రచయితకి ఇంటి పేరుగా కూడా మారిపోయింది.  ఇది వెయ్యేళ్ల  తెలుగు సాహిత్య చరిత్ర లో (1000 నుంచి 1999 మధ్య కాలంలో) వచ్చిన వంద గొప్ప గ్రంధాల్లో ఒకటని అంటారు. తెలుగు సాహిత్యంలో చైతన్య స్రవంతి అంత విరివిగా వాడుకలోకి రాని కాలంలో అటువంటి చైతన్య స్రవంతిని సమర్థవంతంగా వాడుకున్న నవలల్లో ప్రథమ గణ్యంగా భావించదగిన నవలల్లో ఇదొకటి. మొదటి నుంచి చివరవరకు చైతన్యస్రవంతి శిల్పంతో సాగిన మొట్టమొదటి నవలగా నవీన్ రచించిన అంపశయ్యను చెప్పుకోవచ్చు.

నవీన్ గారిచే చైతన్య స్రవంతి ప్రయోగాత్మక శిల్పంతో తీర్చిదిద్దిన తొలి నవల అది. అప్పటికే ఆంగ్ల సాహిత్యంతో కూడా మంచి పరిచయం ఉండటంతో ఆత్మవిశ్వాసంతో అనితరసాధ్యమైన శైలీ శిల్పాలతో ప్రయోగం చేయటం, నవల కళాత్మక ప్రమాణాలతో తీర్చిదిద్దుకోవటంతో నవీన్ సాహిత్య రంగ ప్రవేశం ఘనంగా జరిగింది. ఆ నవల చదువుతున్న ప్పుడు సిగ్మండ్ ఫాయిడ్, కారల్ మార్క్స్, చార్లెస్ డార్విన్, ఝాపాల్ సార్‌త్రే, బెట్రెండ్ రస్సెల్, బెర్నార్డ్‌ షా వంటి మేధావుల ప్రభావం రచయితపై ఎంత ప్రగాఢంగా పనిచేసిందో మనకు అర్థమవుతుంది. తెలుగు రచయితల్లో చలం, శ్రీశ్రీ, బుచ్చి బాబుల ప్రభావం తనపైన ఉందంటారు నవీన్.

అంపశయ్య ఓ 24గంటల్లో ఓ విద్యార్థి కథ. ఇందులో కథానాయకుడు రవి. అతను పొద్దున్నే కల గంటూ లేచింది మొదలు రాత్రి పడుకొనే వరకూ అతని ఆలోచనలు అన్నీ ఇందులో వుంటాయి. అతను మిత్రుల గుంపులో నడుస్తున్నా మిత్రుల మద్య జరిగే సంభాషణ కంటే అతని మనసులో జరిగే భావాల పరంపర అంతా ఈ రచనలో వుంటుంది. ఒక శిక్షాక స్వప్నంతో ప్రారంభమైన ఈ నవలలో అడుగడుగునా చైతన్యస్రవంతి శిల్పం గోచరిస్తూనే ఉంటుంది. రవి చివరకు అంపశయ్య లాంటి  పక్క మీదకు చేరుకొని నిద్రపోయే సన్నివేశంతో రచయిత అతని చైతన్యస్రవంతి ద్వారా ఆనాటి అతని అనుభవాలను ఆనాడు అతనిలో చెలరేగిన విభిన్న కాలాలకు సంబంధించిన స్మృతి పరంపరలను సింహావలోకనం చేస్తాడు. ఈ సందర్భంలో రచయిత వేగవంతమైన శైలి ద్వారా చైతన్యస్రవంతి శిల్పాన్ని పరాకాష్ట నొందించాడు.

ఈ నవలలో కూడా చైతన్యస్రవంతి నిర్వహణలో లోపం లేకపోలేదు. సాధారణంగా పూర్తిగా చైతన్యస్రవంతి శిల్పం తో రచించబడిన నవలల్లో  పఠనీయతా గుణం ఉండదు. కానీ అంపశయ్యలో చాలా వరకు సామాన్య పాఠకులను కూడా చదివించే సౌకుమార్యం  ఉంది.

లక్షశుద్దిలేని అప్పటి విద్యావిధానం, చిత్తశుద్దిలేని బోధనా పద్దతి, భవిష్యత్తుకి ఏమాత్రం గ్యారెంటీ లేని పాలన, సమస్త జీవన రంగాన్ని కలుషితం చేసిన కృత్రిమ విలువలు ఆనాటి విద్యార్థుల్ని ఏవిధంగా నిర్వీర్యులుగా మార్చి పెడ దారులు పట్టిస్తున్నది మొదలుగా గల విషయాలను సమర్థవంతంగా ప్రదర్శించిన నవల “అంపశయ్య” . అయితే మావో నూ, మార్క్స్ నూ, వియత్నాం పోరాటాన్ని అభిమానిస్తూనే, నెహ్రూ గారి సోషలిజాన్నీ ప్రణాళికల్నీ బలపరచటమే వీటన్నింటికి విరుగుడన్నట్లుగా భావించే అమాయకులే అభ్యుదయవాదులుగా ఇందులో పరిచయమవుతారు, ఇందుకు ఆయా పాత్రలనుగానీ, రచయతను గానీ నిందించనవసరం లేదు. ఈ నవల కథాకాలం నాటి వాతావరణం అలాంటిది.

మనసును కదిలించే ఎన్నో సన్ని వేశాలు ఈ నవలలో ఉన్నాయి. అవన్నీ వాస్తవానికి దగ్గరగా ఉన్నవే..! కథ అంతా ఉస్మానియా కాలేజిలోనూ, హాస్టల్లోనూ ఒక రోజంతా నడిచే కథనమే. ఈ నవల చదువుతుంటే అప్పటికాలం నాటి పరిస్థితులు మనకు కళ్ళకు కట్టినట్లు కనపడుతుంది. ఉదాహరణకు, అప్పట్లో అబిడ్స్ ప్రాంతంలో ఉన్న సినిమా థియేటర్లలో కరెంట్ పోతే  జనరేటర్ ఉండదు మళ్ళీ కరెంట్ వచ్చేంత వరకు ఎదురుచూడడమే ప్రేక్షుకుల పని. హాస్టల్లో జీవనాన్ని చాలా వాస్తవంగా ఉన్నది ఉన్నట్లుగా వ్రాసారు, ఇంకా ఇందులోని హీరో గారి ఫ్లాష్ బ్యాక్ ఒక చిన్న ఉప కథ లాగా ఉంటుంది, నిజంగా అది గుండెలని పిండే కథనం, అలాంటి జీవన విధానం అప్పట్లో గ్రామాల్లో ఉండేది.

నవల మొదట్లోనూ మధ్యలోనూ అక్కడక్కడా  చైతన్య స్రవంతిలో మనకు వినిపించే కొన్ని మాటలు, సన్నివేశాలు అసభ్యంగా అనిపిస్తాయి. వాటిని మినహాయిస్తే ఇది నిజంగా ఒక అద్భుతమైన నవల. ఈ నవల గొప్పదన మంతా ఈ నవల ముగింపులోనే ఉంది. వాస్తవిక నవలల్లో ఇలాంటి విప్లవాత్మకమైన ముగింపు అదీ అత్యంత సహజంగా అనిపించేలా తీసుకు రావడం అనితరసాధ్యమే.

మొదట్లో భయస్థుడు, ప్రతి విషయంలో ఊగిసలాడే మనస్తత్వం గల రవి నవల చివరలో ఇలా అనుకుంటాడు: “తన మీద దెబ్బపడడం, తను కూడా శత్రువు మీద దెబ్బ వేయడం తనలోని ఆత్మ స్థైర్యాన్ని పెంచుతున్నది….తను నమ్మిన భావం కోసం, తను నమ్మిన ఆదర్శం కోసం, తన స్వాతంత్ర్య పరిరక్షణ కోసం తను, ముందు ముందు ఇట్లాంటి దెబ్బలెన్నైనా తినడానికి వెనుకాడడు. ఇవ్వాళ్టి సంఘటన తనను అందుకు పూర్తిగా సిద్ధం చేసింది.”ఈ పరివర్తనను తీసుకురావడానికి రచయిత చైతన్య స్రవంతిని ఎంతో చక్కగా వాడుకున్నారు. ఈ నవల చదివితే పిరికి వాళ్లలో సైతం ఇలాంటి కదలిక ఏర్పడి తీరుతుంది. పాఠకుడు ఈ నవల చదువుతుంటే తనను తనలోకి చూసుకోవాలనే అంతర్దృష్టిని జిజ్ఞాసను జాగృతం చేస్తుంది. ఇన్ని విశిష్ట లక్షణాలు కలిగి ఉన్నది కాబట్టే చైతన్యస్రవంతి శిల్పంతో వెలువడిన నవలల్లో అగ్రస్థానంలో నిలిచింది అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

నేనూ నా రచనలు అనే శీర్షికతో నవీన్ గారు ఆటా 2006 లో చేసిన ప్రసంగం ఆధారంగా “ఈమాట” అనే జాల పత్రికలో వెలువడిన వ్యాసంలోని అంపశయ్య నవల రాయడానికి గల కారణాలను,నేపథ్యాన్ని నవీన్ గారు ఈ కింది విధంగా వివరించారు.

చిన్న కథలే కాదు, నవలలు కూడా రాయాలన్న కోరిక నేను యూనివర్శిటీలో ఎం.ఏ. చదువు తుండగా కలిగింది. ఎం.ఏ. చదువుతున్న రోజుల్లో నాలో ఒక విపరీతమైన మానసిక అశాంతి ప్రారంభమైంది. ఒక రకమైన అభద్రతా, ఒక అపరాధ భావం నన్ను వశపరుచుకునేవి. బుర్రలో ఎప్పుడూ ఎన్నో పరస్పర విరుద్ధమైన భావాలు చెలరేగడం, ఎప్పుడూ నాలో యేదో సంఘర్షణ, ఏదో చెయ్యాలన్న ఆరాటం, ప్రపంచాన్ని మరమ్మత్తు చెయ్యాలన్న తపన, నా చుట్టూ ఉన్న వాళ్ల ప్రవర్తనకు విశ్లేషించి వాళ్లను అర్థం చేసుకోవాలన్న తాపత్రయం, వాళ్లందరిని పాత్రలుగా మార్చి ఓ నవల రాయాలన్న పట్టుదల నాలో ఏర్ప డ్డాయి. వీటితో బాటు ఆ రోజుల్లో నాలో విపరీతమైన లైంగిక అశాంతి, ఆపోజిట్ సెక్స్ పట్ల బలమైన ఆకర్షణ ఉత్పన్నమయ్యాయి. ఎందుకిలా జరుగుతున్నదని అనుక్షణం నాలోకి నేను చూసుకొని, నన్ను నేను విశ్లేషించుకోవడం ప్రారంభమయ్యింది.

సరిగ్గా ఈ రోజుల్లోనే సిగ్మండ్ ఫ్రాయిడ్ ను చదవడం జరిగింది. ఆయన రాసిందంతా నా గురించే రాశాడేమో ననిపించింది. వీటన్నీటి ప్రభావమే నేను 1965-68 మధ్యకాలంలో రచించిన “అంపశయ్య” అన్న నవల. ఈ నవల రాయడం నా జీవితంలో జరిగిన ఒక గొప్ప సంఘటన, గొప్ప సాహసం కూడా. “అంపశయ్య” కు పాఠకుల నుండి, విమర్శకుల నుండి అద్భుతమైన ఆదరణ  లభించింది. ఇలాంటి నవలతెలుగులో ఇంత వరకూ రాలేదన్నారు. తెలుగు నవలా సాహిత్యంలో ఈ నవల ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. చైతన్య స్రవంతి శిల్పంతో వెలువడిన మొట్టమొదటి నవల ఇదే అన్నారు. చాలా త్వరలోనే “అంపశయ్య” ద్వితీయ ముద్రణ వెలువడింది. అట్లా అంపశయ్య ఇప్పటి వరకూ ఏడు ముద్రణలను పొందింది. 1969 లో వెలువడిన ఈ నవలను ఆనాటి పాఠకులెలా ఆదరించారో, ఈనాటి పాఠకులు కూడా అలాగే ఆదరిస్తున్నారు. వేల వేల మంది పాఠకులు అంపశయ్య లోని రవి పాత్రతో తాదాత్మ్యం పొందారు. ఎంతోమంది పాఠకులు ఈ నవల చదువుతోంటే తమ ఆత్మకథను చదువుతున్నట్టుగా అనిపించిందన్నారు.

Print Friendly

విజయ చిత్రములు

రచన : జెజ్జాల కృష్ణ మోహన రావు

 

పరిచయం : ఈమారు చాంద్రమాన ఉగాది ఏప్రిల్ 11, 2013 తారీకు వస్తుంది.  ఉగాది అనే పేరు యుగపు ఆది నుండి పుట్టినది అంటారు.  ఇంటిలో కన్నడము మాట్లాడే మేము ఈ పండుగను యుగాది అనే పిలుస్తాము. ఈ ఉగాది పండుగ తెలుగువారు, కన్నడిగులు, మరాఠీ వాళ్లు, ఉత్తరదేశములో కొన్ని చోటులలో జరుపుకొంటారు. ఈ ఉగాది నాడు విజయ అనే కొత్త సంవత్సరము ఆరంభమవుతుంది.  మన హిందువుల పంచాంగములో అరవై సంవత్సరాలను, అంటే ఐదు పుష్కరాలను ఒక కాలమానముగా భావిస్తారు. పండ్రెండేళ్ల ఒక పుష్కరము గురుగ్రహము సూర్యుని చుట్టు ఒక మారు తిరిగే ఆవర్తన కాలముతో సరిపోతుంది. ఈ అరవై సంవత్సరాల కాలమానము  ప్రభవతో ప్రారంభమై, అక్షయతో అంతమవుతుంది.  ఇందులో ఈ యేడు వచ్చేది విజయనామ సంవత్సరము.  సామాన్యముగా ఉగాది వేడుకలలో కవిసమ్మేళనము కూడ ఉంటుంది.  కొత్త సంవత్సరమును గురించి, వసంతఋతువును గురించి నేను వ్రాసిన కొన్ని చిత్రకవితలను మీకు ఈ వ్యాసములో పరిచయము చేస్తున్నాను.  ఇందులో ఎక్కువగా కందపద్యములే.

తెలుగు సాహిత్యములో కందపద్యానికి ఒక ప్రత్యేక స్థానము ఉన్నది.  ప్రాచీన కవులు వ్రాసిన కావ్యాలలో, పురాణాలలో సుమారు మూడింటికి ఒక వంతు కంద పద్యములే.  అంతే కాకుండా సుమతిశతకమువంటి కొన్ని శతకాలు కూడ కందపద్యములో ఉన్నాయి.  గాథ అనే ప్రాకృత ఛందస్సునుండి సంస్కృతములో నవవిధ ఆర్యలు పుట్టినాయి, అందులో ఆర్యాగీతి అనేది మన కందపద్యపు లక్షణాలతో సరిపోతుంది.  ప్రాకృతములో దీనిని స్ఖందఅ అంటారు. మొట్టమొదట కన్నడములో, తరువాత తెలుగులో ఈ కందపద్యము కావ్యాదరణ పొందినది.

కందపద్య లక్షణములు – ఇప్పుడు కందపద్యపు లక్షణాలను గురించి తెలిసికొందామా?  కందపద్యమునకు నాలుగు పాదాలుంటాయి; మొదటి రెందు పాదములవలె చివరి రెండు పాదములు ఉంటాయి.  బేసి పాదాలు (1, 3) కురుచ పాదములు, సరి పాదాలు (2, 4) నిడుద పాదాలు.  కురుచ పాదములలో మూడు చతుర్మాత్రలు, సరి పాదాలలో ఐదు చతుర్మాత్రలు ఉంటాయి. ఒక మాత్ర అంటే ఒక లఘువు, రెండు మాత్రలు ఒక గురువుకు సమానము.  చతుర్మాత్రలు ఐదు, అవి నల (IIII), భ (UII), జ(IUI), స (IIU), గగ (UU).  రెండు పాదాలలో ఎనిమిది చతుర్మాత్రలు ఉంటాయి, అందులో బేసి గణములలో జ-గణము ఉండదు.  చివరి గణమైన ఎనిమిదవ మాత్రాగణములో గుర్వంతమయ్యే సగణమో లేక గగమో ఉండాలి.  ఆఱవ గణము నలమో లేక జ-గణము మాత్రమే ఉండాలి. మిగిలినవి యే గణాలైనా సరియే. అన్ని పాదాలకు ద్వితీయాక్షర ప్రాస ఉండాలి.  ఈ ప్రాస నియమమువలన మరొక షరతు కలుగుతుంది, అదేమంటే మొదటి అక్షరము లఘువయితే, నాలుగు పాదాలను లఘువుతో ప్రారంభించాలి, గురువయితే నాలుగు పాదాలు గురువుతో ప్రారంభమవుతుంది. మొత్తము పద్యములో 64 మాత్రలు ఉంటాయి, అందులో కనీసము రెండు గురువులైనా ఉండాలి (రెండవ, నాలుగవ పాదాల చివరి అక్షరములు).  కనీసము నాలుగు లఘువులైనా ఉండాలి (ఆఱవ గణములు జ-గణము అయినప్పుడు).

చతుర్విధ కందము – నన్నెచోడుడు అనే ఒక శివకవి కుమారసంభవము అనే ఒక గొప్ప ప్రబంధకావ్యమును వ్రాసినాడు.  కొందరు ఈ నన్నెచోడుడు నన్నయకంటె పూర్వుడు అంటారు, కాని ఎక్కువమంది ఇతడు నన్నయ తిక్కనలకు మధ్యయుగములో జీవించినాడని భావిస్తారు.  నా ఉద్దేశములో ఇతడు నన్నయభట్టు సమకాలికుడు.  మన తెలుగు సాహిత్యములో మొట్టమొదట చిత్రకవిత్వమును వాడినవాడు ఈ కవిరాజశిఖామణియే.  ఇతనిని గురించి ఈమాట అనే అంతర్జాలపత్రికలో నేను కవిరాజశిఖామణి, క్రౌంచపదము అని రెండు వ్యాసములను వ్రాసియున్నాను, వీలయినప్పుడు చదవండి.  ఇతడు సృష్టించిన చిత్రకవితలలో చతుర్విధ కందము ఒకటి. అంటే ఒకే కందపద్యములో గణయతిప్రాసలతో నాలుగు నాలుగు కందపద్యములు ఇమిడి ఉండాలి. అలాటి కందపద్యమును మీకు ఈ ఉగాది సందర్భముగా అందజేస్తున్నాను -

హరుసము గలుగును భవముల

సిరిగా నినబింబకాంతి – చెలువము గనగన్

విరబూయు మనసు కలిమిన్

వరమై ఘన విజయ మిడును – వరముల వనధుల్

కొత్త ఏడు కొత్త సూర్యోదయపుకాంతి చూడగా మన పుట్టుకలకు కలిగిన సంపదయో అనేటట్లు ఆనందముతో మనసు విరబూసిపోతుంది, సిరిసంపదలను గొప్పదైన విజయనామ సంవత్సరము మనకు వరముల సముద్రములుగా ప్రసాదిస్తుంది అని దీనికి అర్థము.

ఇది మొదటి కందము, మిగిలిన మూడు క్రింది విధముగా నుంటాయి -

విరబూయు మనసు కలిమిన్

వరమై ఘన విజయ మిడును – వరముల వనధుల్

హరుసము గలుగును భవముల

సిరిగా నినబింబకాంతి – చెలువము గనగన్

 

ఇనబింబకాంతి చెలువము

గనగన్ విరబూయు మనసు – కలిమిన్ వరమై

ఘన విజయ మిడును వరముల

వనధుల్ హరుసము గలుగును -భవముల సిరిగా

 

ఘన విజయ మిడును వరముల

వనధుల్ హరుసము గలుగును -భవముల సిరిగా

నినబింబకాంతి చెలువము

గనగన్ విరబూయు మనసు – కలిమిన్ వరమై

సర్వగురుకందము – సర్వ గురు కందములో ఆఱవ గణమైన జ-గణము తప్ప మిగిలిన మాత్రాగణములు గగములుగా ఉంటాయి. మొత్తము పద్యములో 30 గురువులు, నాలుగు లఘువులు, మొత్తము 34 అక్షరాలు  ఉంటాయి. క్రింద నా ఉదాహరణ -

ఆనందమ్మై వచ్చెన్

గానంగా నందమైన – కామోత్కర్షన్

సూనాలంకారమ్మై

యీనాడే యీ వసంత – మింపై సొంపై

చూచుటకు అందమైన కోరికల శ్రేష్ఠతతో పుష్పములతో శోభించునదై ఈ రోజు ఆనందముగా ఇంపులతో సొంపులతో వసంతఋతువు వచ్చినది. ఇందులో ‘దమైన’, ‘వసంత’ అనే తప్పనిసరి జగణాలు తప్ప మిగిలిన మాత్రాగణములు గురుమయములే.

సర్వలఘు కందము – సర్వలఘు కందములో రెండవ, నాలుగు పాదములలో చివరి అక్షరములైన గురువులు తప్ప మిగిలిన అన్ని అక్షరాలు లఘువులే.  ఇందులో 60 లఘువులు, రెండు గురువులు, మొత్తము 62 అక్షరాలు ఉంటాయి.  క్రింద నా ఉదాహరణ -

విజయము గలుగును మనకిక

నజయుడు జగతికి విజయుని – నలరగ బనిచెన్

నిజముగ నవమగు వరుసము

ప్రజలకు హరుసము నొసగును – ప్రథమ దినమునన్

మనకిక మీద విజయమే కలుగుతుంది, అజయుడైన ఆ దేవుడు విజయుని (అంటే విజయనామ సంవత్సరమును) మనకు పంపాడు. మొదటి రోజే కొత్త సంవత్సరము ప్రజల కందరికీ సంతోషాన్ని ఇస్తుంది అని ఈ పద్యానికి అర్థము.  రెండవ పాదములోని ‘చెన్’, నాలుగవ పాదములోని ‘నన్’ తప్ప మిగిలిన అన్ని అక్షరాలు ఇందులో లఘువులే.

తలకట్టుల కందము – తెలుగుభాషలో చాల అక్షరములకు తలకట్టులు ఉంటాయి, కాని అచ్చులకు (ఈ తప్ప), జ, ణ, బ, ల అక్షరములకు, ఆ, ఇ, ఈ, ఎ, ఏ, ఐ, ఒ, ఓ, ఔ లతో ఉండే హల్లులకు (కొన్ని ప్రత్యేకతలు మినహాయిస్తే) తలకట్టులు ఉండవు. క్రింది కందపద్యములోని అక్షరములకన్నింటికీ తలకట్టులు ఉన్నాయి.

చూతము తూర్పున సూర్యున్

నూతన వర్షమందు రండు – నూతన ప్రభగన్

నూతన హర్షము తప్పక

పూతముగ నునుచు నవరస -పూర్ణపు మనసున్

కొత్త కాంతితో తూర్పుదిక్కులో ఉదయించే సూర్యభగవానుని కొత్త సంవత్సరములో చూడడానికి అందరూ రండి, కొత్త సంతోషము మన మనస్సును నవరసపూర్ణముగా పరిశుద్ధముగా ఉంచుతుంది  అని ఈ పద్యానికి అర్థము. ఇందులో ఆ, ఇ, ఈ, ఎ, ఏ, ఐ, ఒ, ఓ, ఔ లతో అక్షరాలు లేవన్నది గమనార్హము.

ద్వీపాక్షరములతో కందము – సున్నలతో ఉండే అక్షరాలను నేను ద్వీపాక్షరములు అని పిలుస్తాను.  ఇట్టి అక్షరములతో మాత్రము ఉండే ఒక కందపద్యమును క్రింద చదవండి -

ఆమని యామినిలో హృ-

త్కాముని విరి యమ్ము దూరె – తపితహృదయమున్

ప్రేమోత్సాహము లెందున్

భామాకృష్ణద్వయమయె – ప్రతి స్త్రీపురుషుల్

వసంతరాత్రిలో హృదయములో ఉండే మన్మథుని పూల బాణము తాపముతో మండే హృదయాన్ని గ్రుచ్చుకొనినది, ఎక్కడ చూచినా ప్రేమతో కూడిన ఉత్సహమే, ప్రతి స్త్రీపురుషుల జంట సత్యభామ శ్రీకృష్ణులవలె నుండినది అని దీని అర్థము. ఇందులోని అన్ని అక్షరాలలో సున్నలాటి ఒక ద్వీపాకారము ఉన్న విషయమును గమనించవచ్చును.

జగణ కందము – ఒక కంద పద్యములో ఆఱు జ-గణములకన్న ఎక్కువగా ఉండడానికి వీలు లేదు, ఎందుకంటే మొత్తము కంద పద్యములో ఎనిమిది సరి గణములు ఉంటాయి, అందులో రెండవ నాలుగవ పాదపు చివరి గణములు గగమో లేక స-గణమో అయి తీరాలి.  క్రింద ఆఱు జ-గణములతో ఒక కంద పద్యము -

స్వనములను నింపె పికములు

సునాద రవళుల వినంగ – శ్రుతులకు విందౌ

మన యింటి రంగవల్లుల

గనంగ గన్నులకు విందు – గాదె యుగాదిన్

కోకిలలు కూతలను నింపాయి, ఆ మంచి ధ్వనులను వింటూ ఉంటే అది చెవులకు ఒక విందువంటిదే, అదే విధముగా మన వాకిళ్లముందటి ముగ్గులను చూసే కన్నులకు కూడ అది ఈ ఉగాది సమయములో విందువంటిదే.  ఈ పద్యములోని జ-గణములు -  నునింపె, సునాద, వినంగ, టిరంగ, గనంగ, కువిందు.

గుణిత కందములు – మనము తెలుగు నేర్చుకొనేటప్పుడు, గుణితమును గురించి చదివియున్నాము, ఉదా. క, కా, కి, కీ, మున్నగునవి.  పద్యము వ్రాసేటప్పుడు ఒక హల్లుయొక్క గుణితములు వచ్చేటట్లు వ్రాయవచ్చును.  ఉత్పలమాలవంటి వృత్తాలకు నాలుగు పాదముల ఒక వృత్తము చాలును ఇలా వ్రాయడానికి.  కందము చిన్న పద్యము గనుక, రెండు కందపద్యములలో మ- అక్షరపు గుణితములను పొందుపరచినాను.  క్రింద ఆ పద్యములు -

మఱలన్ మా యిలు నింపును

సిరులన్ గడు మిసిమి మీఱ, – చెన్నుగ మనసుల్

మురియన్ విరులన్ మూటగ

గురియున్ మృదువుగ మెలమెల – కోమలతరమై,

స్వరముల్ మేలుగ మై కం-

పరమొంద మొరయు, విజయయు – వర మిచ్చును సం-

బరముగ నతి మోహనమై,

సరిగమలను మౌరి మ్రోయ – జన మంగళమై

ఈ విజయనామ సంవత్సరము మళ్లీ మా ఇంటిలో సిరులను కాంతివంతమై నింపుతుంది, మెల్లమెల్లగా అతి మృదువుగా మనసులు మురిసేటట్లు గంపలతో పూలను కురిపిస్తుంది, సుస్వరములను మై గగుర్పాటు చెందేటట్లు మ్రోగిస్తుంది, చాల మోహనకరముగా సంబరముతో వరములను ఇస్తుంది, లోకశ్రేయస్సుకై నాదస్వరము సరిగమలను మ్రోగిస్తుంది. ఈ రెండు కంద పద్యాలలో మ, మా, మి, మీ, ము, మూ, మృ, మె, మే,మై, మొ, మో, మౌ, మం అక్షరాలు ఉన్నాయి, మౄ అక్షరముతో ప్రారంభమయ్యే పదము లేదు. ఈ అక్షరాలను ముందు ఉంచి వ్రాస్తే పద్యాలు క్రింది విధముగ నుంటుంది -

మఱలన్

మా యిలు నింపును సిరులన్ గడు

మిసిమి

మీఱ, చెన్నుగ మనసుల్

మురియన్ విరులన్

మూటగ గురియున్

మృదువుగ

మెలమెల కోమలతరమై, స్వరముల్

మేలుగ

మై కంపరమొంద

మొరయు, విజయయు వర మిచ్చును సంబరముగ నతి

మోహనమై, సరిగమలను

మౌరి మ్రోయ జన

మంగళమై

నిరనునాసిక కందపద్యము – ఙ, ఞ, ణ, న, మ అక్షరలను అనునాసికములు అంటారు, అంటే వీటిని పలికేటప్పుడు నాసిక అంటే ముక్కును ఉపయోగిస్తాము.  ఈ శబ్దములు లేకుండ వ్రాసిన పద్యమును నిరనునాసికము అంటారు. ముక్కును కోసివేస్తే కూడ ఇట్టి పద్యములను ముక్కు ఉపయోగము లేకుండ గట్టిగా చదువవచ్చును!  తెలుగులో సామాన్యముగా నామవాచకములు ము-కారముతో అంతమవుతుంది, కొన్ని విభక్తి ప్రత్యయాలలో న-కారము ఉంటుంది.  అనుస్వారము ముందున్న అక్షరములను కూడ ముక్కుతోనే ఉచ్చరిస్తాము. కావున అనుస్వారము కూడ ఇందులో నిషిద్ధమే. వీటిని ఉపయోగించకుండా పద్యము వ్రాయడము కొద్దిగా కష్టమే. క్రింద ఒక నిరనునాసిక కందపద్యము -

ఇది గీతి బాడు వేళయె

ఇది విరులు బూయు వలపుల – ఋతువగు జెలియా

ఇది క్రొత్త యేడు సకియా

ఇది సొబగుల సిరి రసఝరి – యిది హితకరియే

ఒక ప్రేమికుడు ప్రియురాలితో చెబుతాడు – చెలీ, ఈ సమయము పాటలు పాదుకొనే వేళ, ఈ సమయము పూలు పూచే వలపుల ఋతువు, ఇది కొత్త సంవత్సరము సఖీ, ఈ సమయము అందాల కాణాచి, నవరసములకు సెలయేరు, ఎంతయో సౌఖ్యాన్ని కలిగిస్తుంది.  ఇందులో మ-కార, ణ-కారములు, సున్నతో అక్షరాలు లేవు.  న-కారము గీతిలో దాగి ఉన్నది, గీతిన్ పాడు, గీతిఁ బాడు అవుతుంది.

ఓష్ఠ్య కందము – మనము మాట్లాడే సమయములో కొన్ని అక్షరాలను పలికేటప్పుడు పెదవులను ఉపయోగిస్తాము, కొన్ని శబ్దాలను ఉచ్చరించేటప్పుడు పెదవులను ఉపయోగించము.  పెదవులను ఉపయోగించి పలికేవాటిని  ఓష్ఠ్యములు అంటారు, పెదవులను ఉపయోగించకున్నప్పుడు అవి నిరోష్ఠ్యములు అవుతాయి.  ప, ఫ, బ, భ, మ, వ అక్షరాలు, ఉ, ఊ, ఒ, ఓ, ఔ అచ్చులతోడి అక్షరాలు ఓష్ఠ్యములు, మిగిలినవి నిరోష్ఠ్యములు. పెదవులను వ్రేళ్లతో గట్టిగ పట్టుకొని పదాలను పలికితే ఈ విషయము బాగుగా అవగతమవుతుంది.  క్రింద ఓష్ఠ్య కందము ఒకటి -

భువిపై పూవులు బ్రోవులు

భువిపై భవ్య